Wednesday, December 15, 2010

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' * ఆ మత్తు వద్దు మన పిల్ల్లలకు .....

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' 'డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్లు....' 'డ్రగ్స్ వలలో యువత....' 'డ్రగ్స్ సేవనంలో సినీతారలు....' ఇవన్నీ దాదాపు ప్రతిరోజూ వార్తాపత్రికల్లో కనిపిస్తున్న హెడ్డింగులు. పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఈ శీర్షికలు కళ్లపడగానే గుండెల్లో గుబులు, భయం. ఒక్క క్షణం మన పిల్లలూ కళ్లముందు మెదులుతారు. ఆ...మన పిల్లలకెందుకు అలవాటవుతాయి ఇవి అన్న భరోసాతో పేపర్‌ని మడచి టీపాయ్ మీద పడేస్తాం. కాని వేగంగా దూసుకెళ్తున్న డ్రగ్స్ రాకెట్ మన పిల్లల్ని ఢీ కొట్టదన్న గ్యారెంటీ ఏంటి? అప్పుడేం చేయగలం? ఆలోచనల్లో పడ్డారు కదూ....ఇలాంటి ముందు జాగ్రత్త కలిగించడానికే మొదలైంది 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్‌సొసైటీ'. దాని గురించే ఇది...

సంవత్సరం కిందట...ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్.... ఇంట్లో మరిచిపోయిన ఆఫీస్ కాగితాలను తీసుకెళ్లడానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన ఫ్లాట్‌కు వచ్చింది కనూప్రియా సింగ్. ఫైల్ తీసుకుని తాళం వేస్తూ హడావుడిగా లిఫ్ట్ వైపు పరిగెడుతుంటే...ఎదురు ఫ్లాట్‌లో నుంచి పదహారేళ్ల అబ్బాయి అరుపులు వినిపించాయి గట్టి గట్టిగా...ఓ నలుగురు మనుషులు ఆ పిల్లాడిని పట్టుకుని బలవంతంగా ఈడ్చుకొస్తున్నారు బయటకు.

'భయ్యా....ఆహిస్తా...( అన్నా...మెల్లగా...) అంటున్నాడు గాభరాగా ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి ఆ నలుగురితో. బహుశా ఆ అబ్బాయి తండ్రేమో. తల్లి అనుకుంటా....నోట్లో పమిట చెంగు అదిమి పెట్టుకుని తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గుమ్మం దగ్గర కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల ఆడవాళ్లంతా పోగై ఆవిడను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయసాగారు. తండ్రేమో ఆ పిల్లాడితో కలిసి లిఫ్ట్‌లో కిందకి వెళ్లిపోయాడు. మౌనంగా వాళ్లనే అనుసరించింది కనూప్రియా సింగ్. కింద అంబులెన్స్‌లోకి ఎక్కించారు ఆ పిల్లాడిని బలవంతంగా. ఇంకా అరుస్తూ గింజుకుంటూనే ఉన్నాడు ఆ పిల్లాడు. కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.. తండ్రీ అంబులెన్స్ ఎక్కగానే అక్కడ్నుంచి కదిలింది అది.

'క్యా హువా భయ్యా...' పక్కనే ఉన్న వాచ్‌మన్‌ను అడిగింది కనూప్రియ.
'క్యాబోలూ మేడం...అంటూ చెప్పసాగాడు...' 304 వాళ్ల అబ్బాయండి....టెన్త్ చదువుతున్నాడు. ఎప్పుడు అలవాటైందో తెలియదు కాని డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. ఆరునెలల నుంచైతే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇంట్లో డబ్బులు పోతుంటే....ఎందుకో అనుమానం వచ్చి వాళ్ల నాన్న ఆరా తీస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి. స్కూల్‌కని ఇంట్లోంచి వెళ్తున్నాడు కాని అటెండెన్స్ లేదట.

సెకండ్ టర్మ్ ఫీజు కట్టమని డబ్బులిచ్చి పంపితే...ఆ డబ్బుతో డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసింది. కానీ అప్పటికే శృతిమించిపోయింది. ఇప్పుడు డీ ఎడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారు మేడం...చాకులాగా ఉండేటోడు పిల్లోడు... ఎట్ల అయిపోయిండు. ఫుట్‌బాల్ బాగా ఆడేవాడు. చాంపియన్ అయితడని కలలు కన్నడు వాళ్ల నాన్న...ప్చ్,...పిల్లల్ని కంటం కాని వాళ్ల తలరాతలను కంటమా..?' అంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు వాచ్‌మన్.

హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్
అంతా విన్న కనూప్రియాసింగ్ దిగాలు పడింది. ఆఫీస్‌కు వెళ్లిందే కాని మనసు మనసులో లేదు. డ్రగ్స్ దుష్ప్రభావాలను, వాటి బారిన పడుతున్న యువతకు సంబంధించిన సమాచారాన్ని చూసింది నెట్‌లో. ఇంకా దిగ్భ్రమ చెందింది తెలిసిన వివరాలను చూసి. లాభం లేదు...జాతి భవిష్యత్తు ఇలా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకున్న కనూప్రియాసింగ్ ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో ఉన్న స్నేహితులందరికీ ఫోన్ చేసి అంతకుముందు రోజు తమ అపార్ట్‌మెంట్లో జరిగిన విషయాన్నంతా చెప్పింది పూసగుచ్చినట్టు.

తర్వాత తనకు వచ్చిన ఆలోచనలూ పంచుకుంది. 'నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని...ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిన పనులు. మనకెక్కడ వీలవుతుంది' ఒక స్నేహితుడి కామెంట్. 'బాగా చెప్పావు. స్వంత పనులకే టైమ్ దొరక్క ఛస్తుంటే...ఇంకా ఈ సమాజసేవను ఎక్కడ నెత్తినెట్టుకునేది?' ఇంకో స్నేహితురాలి విరుపు. దాదాపు అందరూ కుదరదనే తేల్చారు.

'ఒక్కసారి ఆలోచించండి...రేప్పొద్దున ఈ జాబితాలో మన పిల్లలూ ఉండొచ్చు' హెచ్చరించింది కనూప్రియ.
'మన పిల్లలా..?' ఉలిక్కిపడ్డారు అంతా.
'అవును. మనమేమీ ఈ సమాజానికి దూరంగా తీసుకెళ్లి వాళ్లను పెంచలేం కదా. పరిస్థితుల నుంచి పారిపోయే కంటే. నెమ్మదిగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్..మనకు సెలవు దొరికిన సమయాల్లో స్కూళ్లకు వెళదాం. డ్రగ్స్, వాటి దుష్ప్రభావాలు గురించి పిల్లలకు అవగాహన కల్పిద్దాం ' అని ఒప్పించే ప్రయత్నం చేసింది.

అందరూ ఆలోచించి కనూప్రియాసింగ్ ప్రతిపాదనకు ఓటేశారు. అట్లా రూపుదిద్దుకుంది డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పనిచేసే 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ సొసైటీ' అనే సంస్థ.
వెబ్‌సైట్‌లో
ముందుగా పాఠశాల యాజమాన్యాల అనుమతి తీసుకుంటూ...వారాంతపు సెలవుల్లో హైస్కూలు పిల్లలకు డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రారంభించారు ఈ స్నేహితుల బృందం. ఆ బృందంలో ఒకరైన ఎల్లిగారం నాగరాజు హైదరాబాదులో ప్రాపర్టీమేనేజ్‌మెంట్ కన్సల్టన్సీని స్థాపించి ఓ వైపు వ్యాపారం చేసుకుంటూనే మరోవైపు హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ పనులనూ కొనసాగిస్తున్నారు. బోయిన్‌పల్లిలో నివాసముంటున్న నాగరాజు ఆ దగ్గర్లోని స్కూళ్లకు వెళ్లి డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంస్థ తాము చేసిన, చేస్తున్న కార్యక్రమాల వివరాలతో 'హ్యాపీలైఫ్‌వెల్‌ఫేర్. ఒఆర్‌జి (జ్చిఞఞడజూజీజ్ఛఠ్ఛీజూజ్చట్ఛ.ౌటజ) అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది.

విశేష స్పందన
తమ వెబ్‌సైట్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని చెప్తూ ఇ. నాగరాజు 'మా ఈ కృషిని కేవలం స్కూలు యాజమాన్యాలే కాదు...తల్లిదండ్రులూ గుర్తించడం మొదలుపెట్టారు. ఎంతోమంది పేరెంట్స్ మా సంస్థలో సభ్యులమవుతామని ముందుకు వస్తున్నారు. చాలామంది సభ్యులయ్యారు కూడా. మా సేవలు ముంబై, బెంగుళూరు వంటి అన్ని ప్రధాన నగరాలకూ విస్తరించాయి. ఎవరికి ఎక్కడ వీలుంటే అక్కడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నాం.

హైదరాబాదులో రోజూ పేపర్లలో వస్తున్న డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు చూస్తుంటే...మా కార్యక్రమాలను ఇక్కడ ఇంకా విస్తృతం చేయాలని నిర్ణయించాం. జనవరిలో మా ఢిల్లీ బృందం కూడా ఇక్కడికి రానుంది. ఇక్కడ తల్లితండ్రులకూ అవగాహనా క్యాంపులు నిర్వహించాలనుకుంటున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ మాది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి చేరొచ్చు. ఒక్క స్కూలు పిల్లలకే కాదు కాలేజీ విద్యార్థులకూ అవగాహనా కార్యక్రమాలున్నాయి.
డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులను కాపాడేందుకు కౌన్సిలింగ్, డీ ఎడిక్షన్ లాంటి సేవలనూ అందిస్తున్నాం. జంటనగరాల తల్లితండ్రులను మేము కోరేది ఒక్కటే...మా సేవలను తీసుకోవడమే కాక మా సంస్థలో చేరి మీరూ మీకు తెలిసిన వాళ్లను చైతన్యపర్చండి. జాతి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి' అని విన్నవించారు.
సరస్వతి రమ 
ఫోటోలు: రాజ్‌కుమార్

అష్టావక్రులు అనే రింగు లీడర్లు 'రాజ'మార్గంలో దారి దోపిడీ

పేదలను కొట్టి పెద్దలకు పంచి..
రూ.35వేల కోట్లు వెనకేసుకున్న అక్రమార్కులు
భూ సేకరణలో భారీ గోల్‌మాల్
అస్మదీయులకు అభయ హస్తం
మాటిమాటికీ మారిన రూటు
ప్రతిసారీ బక్కరైతులే బలి
విపక్షాలపైనా ప్రలోభాల వల
సీబీఐ విచారణకు సహాయ నిరాకరణ
50... 70... 80... 90... 100.... 120.... స్పీడో మీటర్ గిర్రున తిరుగుతుంది. విలాసాల వాహనం సర్రున దూసుకుపోతుంది. వారెవ్వా... ఔటర్ సూపర్! కానీ... ఔటర్ రింగ్ రోడ్డు కింద వేల బతుకులు నలిగిపోయాయని, అక్రమార్కులకు ఇది రాచబాట వేసిందని, కుంభకోణాలకు 'రాజా' వంటిదని కొంచెం లోతుల్లోకి వెళితేనే తెలుస్తుంది. రాజా వారు, ఆయన అనుచర వర్గం కోసం అనేకసార్లు రింగులు తిరిగిన ఔటర్ భూతం పేద రైతులను బలి చేసింది.

అసలు ప్రయోజనాల కంటే పెద్దలకు కాసుల వర్షం కురిపించే ప్రాజెక్టుగా ఇప్పటికే విజయం సాధించింది. తన లేఖలో జలయజ్ఞంలో అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించిన కొండా సురేఖ ఊహకు కూడా అందనన్ని మలుపులు తిరిగింది. అన్ని వ్యవస్థలను నిర్యీర్యం చేస్తూ అక్రమాల మధ్యనే సాగిన ఔటర్ రోడ్డు నిర్మాణం రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం. అప్పటి సీఎం వైఎస్, ఆయన ఆంతరంగికుడు కేవీపీ కలిసి నడిపించిన మంత్రాంగం! అప్పటి హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి, సెక్రటరీ వెంకట్రామ రెడ్డి కనుసన్నల్లో జరిగిన మాయాజాలం!

రంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 15 : ఔటర్‌తో హైదరాబాద్ దశ, దిశ మారుతుందని అప్పట్లో ఊదరగొట్టారు. ఆ మాటలో నిజమెంతోగానీ... దీనివల్ల చాలామంది దశ, దిశలు మారిపోయాయి. కొందరు కోట్లకు పడగలెత్తారు. మరికొందరు తిరిగి లేవలేనంతగా పడిపోయారు. దీనివల్ల లబ్ధిపొందిన వారిలో మన రాష్ట్ర నేతలే కాదు... ఒకరిద్దరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

ప్రతిపక్షానికి చెందిన నాయకులూ 'రింగ్' అయ్యారు. పార్టీలకు అతీతంగా పెద్దలంతా, ఔటర్ పాపాన్ని తలా తట్టెడు పంచుకున్నారు. రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న పెద్దల భూములకు నష్టం వాటిల్లకుండా... నోరులేని బక్క రైతుల భూముల మీదే రింగు రోడ్డు వేశారు. దీనికోసం కొన్నిచోట్ల మూడుసార్లు మ్యాప్‌లో మార్పు చేర్పులు చేశారు. ఔటర్ గోల్‌మాల్‌కు పాల్పడిన వారిలో 20 మంది ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు. వీరి విజయానికి ఔటర్‌లో కొట్టేసిన డబ్బులే పెట్టుబడి అయ్యాయి.

భూసేకరణ అస్త్రం
ఔటర్ రింగ్‌రోడ్డు దోపిడీలో కనిపించినంత వైవిధ్యం మరెక్కడా కనిపించదేమో! ఈ దోపిడీలో తొలి అంకం... భూసేకరణ. ఈ చట్టాన్నే బూచిగా చూపి 'ఇస్తావా? చస్తావా?' అంటూ పేదరైతుల మెడపై కత్తి పెట్టారు. వారి భూములు లాక్కున్నారు. అదే సమయంలో... కొందరు పెద్దలు ముందుగానే రంగంలోకి దిగి రైతులపై వల వేశారు. "మీ భూమి ఔటర్‌లో పోతుంది.

ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇస్తాం. మాకే విక్రయించండి'' అంటూ ముందే భూములు కొన్నారు. ఆ తర్వాత తమ పలుకుబడి ఉపయోగించి ఔటర్ మార్గాన్ని మార్పించి, తాము కొన్న భూముల ధరలు అమాంతంగా పెంచుకున్నారు. ఔటర్ ఆలోచన, అది వెళ్లే మార్గం ముందే తెలిసిన ముఖ్య నేతలు, వారి బంధువులు, అనుచరులు ముందే రంగంలోకి దిగి... సమీప ప్రాంతాల్లో భారీగా భూములను కొనేశారు.

ఎకరా రూ.లక్షల్లో కొనుగోలు చేసిన భూములను రూ.10 నుంచి 15 కోట్ల చొప్పున విక్రయించుకున్నారు. అలాగే... 'మా భూములు పోకుండా చూడండి' అని ఆశ్రయించిన వాళ్లకు పాలకులు అభయ హస్తం ఇచ్చారు. వారి దగ్గర ముడుపులు పుచ్చుకుని... అలైన్‌మెంట్ మార్చేశారు. జంక్షన్లు, ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌ల పేరుతో అలైన్‌మెంట్లు మార్చారు. ఈ మొత్తం ప్రక్రియలో బలైపోయింది అమాయకులైన రైతులే.

వేసిందే రోడ్డు..
ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్రియలో అప్పటి అధికారులు గీసిందే మ్యాపు... వేసిందే రోడ్డుగా మారింది. ప్రమాణాల ప్రకారం 250 గజాల వెడల్పు ఉండాల్సిన రహదారి... ఒక్కోచోట సగానికి పడిపోయింది. అటూ ఇటూ ఉన్న వారి ఆస్తులను టచ్ చేయకుండా... రోడ్డే కుచించుకుపోయింది. గండిపేట చెరువు వద్ద పర్యావరణ కారణాలు చూపుతూ అలైన్‌మెంట్ మార్చేశారు.

అదేసమయంలో... కండ్లకోయి వద్ద చెరువులోంచే రోడ్డును వేశారు. ఏం జరిగినా, ఎందుకు మార్చినా కారణం ఒక్కటే! అస్మదీయుల భూములను కాపాడటం! గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల పెద్దల భూములను సేకరించినా... వారికి పుష్కలంగా పరిహారం అందించారు. ప్రత్యేక ప్యాకేజీలు తయారు చేశారు. పేదలపై మాత్రం వివక్ష ప్రదర్శించారు.

నష్ట పరిహారం ప్యాకేజీ నిర్ణయించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గనుల శాఖమంత్రి సబితారెడ్డితో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏ ఒక్కరితోనూ చర్చించకుండానే ప్యాకేజీ రూపొందించడం విశేషం.

అందరూ... ష్ గప్‌చుప్!
ముంజేతి కంకణం చూడటానికి అద్దం అవసరంలేదు. అలాగే... ఔటర్ రింగ్ రోడ్డులో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని చెప్పేందుకు ఎలాంటి విచారణలూ అక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ చిక్కిపోయిన రోడ్డు, ముమ్మార్లు మారిన ప్లాన్, ఆ సమయంలో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే... నాటి పాలకులు నిస్సిగ్గుగా, నిర్భయంగా అక్రమాలకు పాల్పడినట్లు ఇట్టే తెలిసిపోతుంది.

అయినప్పటికీ... దీనిపై విపక్షాలు పెద్దగా ఆందోళనలు చేయలేదు. సర్కారును నిలదీయలేదు. కారణం... నాటి పెద్దలు నయానో భయానో వారందరి నోళ్లను మూయించారు. 'మీ భూములకు భంగం వాటిల్లకుండా చూస్తాం' అని ప్రలోభపెట్టో... 'మీ భూములనూ మింగేస్తాం జాగ్రత్త!' అని భయపెట్టో వాళ్లను దారికి తెచ్చారు.

రకరకాలుగా వారికి ఎర వేశారు. అప్పట్లో సీపీఐ, బీజేపీ మాత్రమే అంతో ఇంతో ఔటర్ అక్రమాలపై గళమెత్తాయి. మిగిలిన పార్టీలన్నీ గప్‌చుప్! 'ఔటర్ అక్రమాలపై ఆందోళన చేద్దాం రండి' అని చంద్రబాబు పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరూ ముందుకురాని పరిస్థితి!

ఒక ప్రాజెక్టు చేపట్టినప్పడు కొందరు భూములు కోల్పోవడం సహజమే! కానీ... ఒకరి భూములు కాపాడేందుకు మరొకరిని బలి చేయడమే ఔటర్‌లో జరిగిన పాపం. ఈ రహదారి కోసం జరిపిన భూసేకరణలో సుమారు పది వేల కుటుంబాలు నష్టపోయాయి. ఇందులో నాలుగు వేల మంది రైతులుకాగా... మరో ఆరువేల మంది ప్లాట్లు, ఇళ్లు కోల్పోయారు.

వ్యవస్థలపై దాడి
ఔటర్ రింగు రోడ్డులో అక్రమాలపై 'ఆంధ్రజ్యోతి' అనేక కథనాలు ప్రచురించింది. అయినా... పాలకుల్లో చలనం లేదు. ప్రశ్నించిన వ్యవస్థలపై ఎదురుదాడికి దిగారు. పత్రికల యాజమాన్యాలపై దాడులకు పురిగొల్పారు. ప్రతిపక్షాలను చీల్చారు. పత్రికల్లో కథనాలకు 'కౌంటర్'గా జనం సొమ్ముతో అనుకూలమైన ప్రకటనలు ఇచ్చారు.

అప్పట్లో విపక్షాలు డిమాండ్ చేయడమే ఆలస్యమన్నట్లుగా అనేక అంశాలపై వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ధీరోదాత్తుడిగా మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత సీబీఐ విచారణను తనదైన శైలిలో మడత పెట్టేసేవారు. రింగ్ రోడ్డు విషయంలోనూ అదే జరిగింది. సీబీఐ విచారణను ఆయన నీరుగార్చారు. వాస్తవాలు బయటకు రాకుండా అధికారులను కట్టడి చేశారు.

సర్కారు సహాయ నిరాకరణ చేస్తోందంటూ సీబీఐ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు మొరబెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు... అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు ఇప్పుడు ప్రమోషన్లు పొంది ఎంచక్కా మంచి పోస్టుల్లో వెలిగిపోతున్నారు. పేద రైతులు మాత్రం పెద్దలు చేసిన పాపాలకు బలైపోయి కుమిలిపోతున్నారు. వీరికి సమాధానం చెప్పేదెవరు? వీరి ఆవేదనలు తీరేదెన్నడు?

హైకోర్టు తీర్పే నిదర్శనం
ఔటర్ రింగురోడ్డులో భాగంగా కండ్లకోయిలో జరిగిన భూసేకరణపై ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. మొత్తం భూసేకరణ తీరుపైనే అనుమానాలను వ్యక్తం చేసింది. కండ్లకోయిలో పెద్దల కోసం మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చారు.

ఇతరుల భూములు, పక్కనే చెరువు మీదుగా రోడ్డు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బాధితులు హైకోర్టుకెక్కారు. 55 ఎకరాల్లో అక్రమంగా భూసేకరణ జరిగినట్లు కోర్టు తేల్చి చెప్పింది. ఒక్కచోట జరిగిన భూసేకరణలోనే ఇంత గోల్‌మాల్! మరి... 162 కిలోమీటర్ల పొడవునా ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉండాలి?

* ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.5500 కోట్లు. కానీ.. ఈ భూసేకరణను అడ్డుపెట్టుకుని రాజుగారి మందీ మార్బలం రూ. 35 వేలకోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టుకుంది.
* ఇందులో సాధారణ ప్రజలు రూ.10వేల కోట్లు నష్టపోగా పెద్దలు అంతకు ఎన్నో రెట్లు అధికంగా లబ్ధిపొందారు.
* నష్ట పరిహారం పంపిణీలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో తప్పుడు రికార్డులు సృష్టించి 16 ఎకరాల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం పొందారు.
* హయత్‌నగర్ మండలం బాచారంలో సుమారు 25 లక్షల రూపాయలను అక్రమంగా చెల్లించారు.

అంతా ఇష్టానుసారం...
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రింగురోడ్డును ఇష్టానుసారంగా నిర్మిస్తోంది. పెద్దల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా... ఒక్కో చోట ఒక్కో విధంగా వెడల్పు తగ్గించారు. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ జంక్షన్ వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. నార్సింగ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు 125 మీటర్లు, శంషాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు 150 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు.
click here

Tuesday, December 14, 2010

ఔరౌర... నాగవల్లి నగలు

లక లక లక.. అంటూ భయపెట్టిన చంద్రముఖి ఇప్పుడు ఔర.. ఔర.. అంటూ నాగవల్లిగా వస్తోంది. ఆమె ఆంగికం, అభినయమే కాదు.. ఆమె ఆభరణాలు కూడా ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికల నగలు ఒక ఎత్తయితే హీరో వెంకటేష్ నగలు మరో ఎత్తు. సినిమా విడుదలవ్వకముందే క్రేజ్ సంపాదించుకున్న ఈ నగలను రూపొందించింది ఎవరో తెలుసా? క్రిసాలా జ్యువలరీ అధినేత్రి బంటి బజాజ్. ఆమె గురించి.. ఆమె రూపొందించిన నగల గురించే ఈ కథనం.
బాలీవుడ్‌లో జోధాఅక్బర్, దేవదాసు చిత్రాల్లో నటీనటులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ఆ సినిమాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా మొదలయ్యింది. సినిమా పేర్లు పడుతున్నప్పుడు కనిపించే కాస్ట్యూమ్స్ టైటిల్‌తోపాటు ఈ మధ్య స్టయిలింగ్ అని మరో కొత్త టైటిల్‌ను కూడా వేస్తున్నారు తెలుగువాళ్లు. చాలామంది తారలకిప్పుడు పర్సనల్ స్టయిలిస్ట్‌లున్నారు. అయితే కొందరు ఇంకో ముందడుగు వేసి ప్రత్యేక జ్యువలరీ డిజైనర్లను నియమించుకుంటున్నారు.

అరుంధతి సినిమాలో అనుష్క, సింహ సినిమాలో నయనతారలు ధరించిన నగలు అలా రూపొందించినవే. అయితే తెలుగు సినిమాల్లో హీరోతో సహా దాదాపు అన్ని ముఖ్య పాత్రలకోసం ప్రత్యేక జ్యువలరీని తయారుచేసిన క్రెడిట్ మాత్రం నాగవల్లి సినిమాకే దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాల్లో ఎక్కువగా గిల్టీనగలనే వాడతారు. కానీ నాగవల్లి సినిమాలో తారలందరూ మేలిమి బంగారు ఆభరణాలనే ధరించారు. పైగా అవి ఆయా పాత్రల స్వభావాలకు అద్దం పట్టేలా ప్రత్యేకంగా రూపొందించారు బంటి బజాజ్.

ఏవరీ బజాజ్?

బంటి బజాజ్ పక్కా హైదరాబాదీ. కాకపోతే ఎక్కువకాలం ముంబయిలోనే ఉన్నారు. ఆమె 1993లో హైదరాబాద్‌కి వచ్చి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తుండేవారు. ఎన్నో ఫ్యాషన్ షోలను నిర్వహించారు. ఆమెకి చిన్నప్పటి నుంచీ జ్యువలరీ డిజైన్ చేయడంలో ఆసక్తి ఉండేది. ముంబయికి వెళ్లాక చిన్న చిన్న నగలను డిజైన్ చేయడం మొదలెట్టారు. చాలామంది బాలీవుడ్ తారలతో పరిచయాలు ఉండడంతో మొదట్లో ఆమె రూపొందించిన నగలను వారికి కానుకగా ఇస్తుండేవారు. అయితే ఆమె దీన్ని వృత్తిగా కాకుండా కేవలం హాబీగానే భావించేవారు.

అయితే ఆమె నగలను ఇష్టపడేవారు తమకోసం నగలు డిజైన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అడిగేవాళ్లు. అలా అడిగిన వారిలో అనిల్ కపూర్ భార్య సునీల్ కపూర్, రాణీముఖర్జీ, టబు, సోనాక్షి, విద్యాబాలన్ ఉన్నారు. బంటి బజాజ్ వారికోసం ఎన్నో నగలను ప్రత్యేకంగా రూపొందించారు. హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చే స్తూనే, ముంబయి ముద్దుగుమ్మలకు ఆభరణాలు రూపొందిస్తున్నప్పుడు త్రిభువన్‌దాస్ శ్రీకాంత్ జవేరీ ప్రోత్సాహంతో 2001లో పుల్‌టైమ్ డిజైనర్‌గా మారిపోయారు.
డిజైనర్‌గా..
బంటి బజాజ్‌కు ఎన్నో ఫ్యాషన్ షోలతో అనుబంధం, ఆమె ఆభరణాల పట్ల బాలీవుడ్ తారలకు సైతం ఆసక్తి ఉండడంతో ఆమె డిజైనర్‌గా గుర్తుంపు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. లాక్మే ఫ్యాషన్ షోలో ఆనంద్ కాబ్రా, నీతూ లుల్లా లాంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దుస్తులకు జ్యువెలరీని రూపొందించారు. సొంత సిగ్నేచర్ జ్యువలరీని రూపొందించాలన్న ఆలోచనతో 2006లో క్రిసాలా జ్యువలరీ పేరుతో హైదరాబాద్‌లో షోరూమ్ ప్రారంభించారు. ఆ తర్వాత ముంబయి, పూణెల్లో కూడా బ్రాంచీలను మొదలుపెట్టారు. ఈ విషయం పక్కన పెడితే బంటి బజాజ్‌కు డి. రామానాయుడు కుటుంబంతో చాలాకాలంగా అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే నిర్మాత సురేష్ బాబు నాగవల్లి సినిమా కోసం ప్రత్యేకంగా జ్యువలరీని రూపొందించాల్సిందిగా కోరారు.

ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో నేను చేసిన రాజు పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకులను ఒక్క క్షణంలో ఆ కాలానికి తీసుకువెళ్లడానికి ఒక కొత్తదనం కావాలి. అందుకు ఆహార్యం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అన్ని పాత్రలకీ ప్రత్యేకంగా కాస్టూమ్స్‌ని, జ్యువలరీని డిజైనింగ్ చేయించారు నిర్మాతలు. అందుకు రమా రాజామౌళి స్టయిలింగ్, బంటి బజాజ్ రూపొందించిన ఆభరణాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సినిమా విడుదలవ్వకముందే ఆ ఆభరణాల పట్ల ఏర్పడ్డ క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
- వెంకటేష్, కథానాయకుడు

నాగవల్లికి అనుగుణంగా..
'అవకాశం వచ్చినంత మాత్రాన అయిపోలేదు.. అసలు కథ అక్కడే మొదలయింది నాకు. ఈ నగల గురించి చెప్పాలంటే ఆ సినిమా కథ సగం చెప్పాల్సి వస్తుంది. అందుకే క్లుప్తంగా చెపా'్తనని మొదలెట్టారు బంటి బజాజ్. 'చంద్రముఖి చూసిన వారికి నాగవల్లి సినిమా పట్ల కొంత అవగాహన ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఉండాలన్నది మా ఉద్దేశ్యం. కథ, పాత్రల గురించి విన్న తర్వాత నా పరిశోధన మొదలుపెట్టాను. సినిమా రెండు భాగాలుగా ఉంటుంది.. ప్రస్తుతం.. గతం.. రెండు ఎపిసోడ్‌లలో కనిపించే జ్యువలరీ విభిన్నంగా ఉండాలి.

మోడ్రన్ జ్యువలరీ రూపొందించడం పెద్ద కష్టమేం కాదు.. ఫ్లాష్‌బ్యాక్ కోసం అప్పటి రాజులు, రాణులు, సామాన్యులు వాడిన దుస్తులు, ఆభరణాల గురించి పుస్తకాలు తిరగేశాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల గురించి, నిజాం నవాబుల గురించి, తంజావూరు గురించి చదివి కొంత నోట్స్ రాసుకున్నాం. తర్వాత సినిమాలో పాత్రలు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నాం. మేళవిస్తూ 200కు పైగా ఆభరణాలని రూపొందించాం. ఇందుకు ఆరునెలల సమయం పట్టింది' అని చెప్పారు బంటి బజాజ్.

నేను నటించిన అరుంధతి సినిమాలో కూడా నా పాత్రకోసం ప్రత్యేకంగా నగలను రూపొందించారు. ఆ ఆభరణాలను నా పాత్రకి ప్లస్ అయ్యాయి. ఆ పాత్రకి నాకు మంచి పేరొచ్చింది. కాకపోతే అవన్నీ గిల్ట్ నగలు. ఒరిజినల్ జ్యువలరీతో నటించడం మాత్రం ఇదే తొలిసారి. ఆనాటి కాలాన్ని డిజైనర్లు తమ ఆభరణాలతో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. అరుంధతి పాత్రలాగే ఈ సినిమాలో నా పాత్ర మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
- అనుష్క శెట్టి, కథానాయిక

ఎవరికి ఏ ఆభరణాలు..
నాగవల్లి సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వెంకటేష్, అనుష్కలతో పాటు కమలినీ ముఖర్జి, రిచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్‌లకు బంటి బజాజ్ ఆభరణాలు రూపొందించారు. ఈ అన్ని పాత్రలకూ రమా రాజమౌళి స్టయిలింగ్ చేశారు. ఒక సీన్ కోసం ఆమె ఎంచుకున్న దుస్తులను ఫోటో తీసి, క థలో ఆ సీన్‌ను బట్టి ముందుగా బొమ్మలు గీసుకున్నారు బంటి బజాజ్. సినిమాలో తమిళనాడులోని తంజావూరు నేపథ్యం కొంత ఉంటుంది. అందుకే కథనాయికల ఆభరణాల కోసం అక్కడ గుళ్లలో కనిపించే బొమ్మలు, పుస్తకాల్లో చదివిన ఆ కాలం నాటి డిజైన్లను ఎంచుకున్నారు.

ఒడ్డాణం, వంకీలు, జడ, కాసులదండ, ఉంగరాలను బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలు ఉపయోగించి రూపొందించారు. వెంకటేష్‌ది విజయనగరానికి చెందిన రాజు పాత్ర. ఈ పాత్ర కోసం ఎక్కువగా నిజాం నగలను, దక్షిణ భారతాన్ని పాలించిన రాజులు వాడిన ఆభరణాలను రూపొందించారు. సర్పెంచ్(రాజులు తలపాగాకు పెట్టుకునేవి), కమర్‌బంద్(షేర్వాణీ మీద మెడలో వేసుకునే ఆభరణం), బాజూబంద్(భుజాలకు కట్టుకునే కంకణాలు), మెడ నుంచి భుజాల వరకు వేలాడే పచ్చల హారాలు రాజు పాత్ర కోసం రూపొందించారు.
- బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫోటోలు: రాజ్‌కుమార్

Thursday, December 9, 2010

పెళ్లకాని ప్రసాదులు * యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ....

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెబుతుంటారు. ఆ ముచ్చట్లో పెళ్లి కూడా ఒకటి. అయితే ఈ మధ్య యువకులు వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కళ్యాణపీట మీద కూర్చోవడం ఆలస్య మవుతుండడంతో పెళ్లికాని ప్రసాదులుగా పేరు తెచ్చుకుంటున్నారు. కెరీర్‌కు అధికంగా ప్రాధాన్యతనిస్తూ తమ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమం లో పెళ్లికాని ప్రసాదుల వయస్సు మూడు పదులకు చేరుకోవడం, దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ఉన్నాయి...

marriageప్రతి ఏడాది రెండు, మూడు పెళ్లిళ్ల సీజన్‌లు ఉంటాయి.అనుకూలంగా ఉండే పెళ్లి ముహూర్తాలను పెట్టుకొని వివిధ సమయాల్లో యువతీ యువకులు పెళ్లిచేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్‌ నగరంలోని యువతీ యువకులు తమ కెరీర్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే పెళ్లిచేసుకోవాలని వారు భావిస్తూ తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం కారణం వల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే కాదు, కుదేలయిన అనేక రంగాల వల్ల నగర యువత కొంతమంది పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు.దీంతో వారి వయస్సు 30కు చేరుకోవడంతో పాటు కొన్నిసార్లు ఆ వయస్సు కూడా దాటి పోతోంది.

నగరాల్లోనే...
ప్రధానంగా నగరాల్లోని తల్లిదండ్రులు పిల్లల చదువుపెైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు అనుకున్నవారు పిల్లలకు కళ్యాణం చేస్తున్నారు. తరువాత వారి చదువుని కొనసాగిస్తున్నారు.మరికొంత మంది ఉద్యోగం వచ్చే వరకు ఎదురుచూస్తున్నారు. అలా అబ్బాయిలకు దశాబ్దంన్నర క్రితం 21 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. అప్పుడు అబ్బాయిలకు 25 దాటగానే పెళ్లికాని ప్రసాద్‌లని పిలిచేవారు. అయిదు,ఆరు సంవత్సరాల నుంచి ఆ వయసు క్రమేణా పెరుగుతోంది. ఇప్పుడు 26, 27 ఏళ్లు వచ్చి నా ఏమంత వయసు వచ్చింది అని సమర్ధించుకునేవారు ఎక్కువెై పోతున్నారు.ఉద్యోగం రేపో మాపో వచ్చేస్తోంది. ఉద్యోగం రాగానే తలంబ్రాల కార్యక్రమమే అని సమాధానమిస్తున్నారు.

నౌకరి సంపాదించిన తరువాతనే పెళ్లి చేసుకోవడానికి యువత ఆసిక్తి చూపిస్తున్నారు. అలా ఎదురు చూస్తు 30 ఏళ్లు దాటిపోయినవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పెరిగిన పోటీ, సవాళ్లతో యువత పోరాడుతోం ది. ఉద్యోగం సంపాదించినా కొంతమంది పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వచ్చేది తక్కువ జీతం, అది నా అవసరాలకే సరిపోవడం లేదు. ఇంకా వచ్చే భార్యని ఎలా పోషించను అని అం టున్నారు. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నా తప్పించుకుంటున్నారు.వేతనాలు పెరిగిన వెంటనే ఇంటి వాడినవడానికి సిద్ధమని హామీ ఇస్తున్నారు.

యువకుల అభిప్రాయాలు... :
ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ఈ నాలుగురోజులెైనా బిందాస్‌గా గడపనీ అని చెప్పేవారు ఒకరెైతే, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదని మరొకరు, ఉద్యోగంచేసే అమ్మాయి ఉండాలని కోరుకునే యువకులు నేడు ఎందరినో చూడవచ్చు.

అమ్మాయిలదీ అదే వరుస... :
BRIDGEతమ కాళ్లఫై నిలబడాలని అమ్మాయిల్లో పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. కాబోయే భర్త తెచ్చే జీతం మీద ఆధారపడేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది.అబ్బాయిలకు సరిసమానంగా నేడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి కి అబ్బాయిల కంటే పెళ్లిచేసుకోమని ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.అయినా తల్లిదండ్రులకు నచ్చచెప్పినచ్చి న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులెైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారు.వివాహం ఆలస్యమైనా జీవితంలో స్థిరపడడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు.

పల్లెల్లో... :
ఉద్యోగాలఫై ఆధారపడని, కార్మికులుగా, కూలిపనిగా చేసే గ్రామీణ కుటుంబాల్లో ఇది వరకు అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. దాన్ని పెద్ద తప్పుగా భావించేవారు కాదు. గ్రామాల్లో అబ్బాయి లు ప్రస్తుత సమాజంపెై అవగాహన ఏర్పరుచుకుంటున్నా రు. 25 ఏళ్లు కూడా లేవు నాకింతలోకే పెళ్లి ఎందుకని తల్లిదండ్రులను అడుగుతున్నారు. పెద్దలు ఇతర కుటుం బ సభ్యుల ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తోందని యువకులు వాపోతున్నారు. పల్లెల్లో చెల్లెలికి, అక్కకి పెళ్లి కాలేదని వయసు పెరిగిపోయే వారు ఎక్కువగా కనిపిస్తారు.

పల్లెపడుచులు... :
పల్లెల్లో అబ్బాయిగాని, అమ్మాయి పుట్టగానే వారికి జోడిని కుదుర్చుకోవడం ఆచారం. రక్తసంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు వయసు రాగానే కళ్యాణం కానిచ్చేవారు. ఇలా అనేకచోట్ల జరుగడం తెలిసిందే. క్రమంగా పల్లెటూర్లలో కూడా మా ర్పు వస్తోంది. ఆడపిల్లకి పెళ్లి అయ్యేవరకు చదివిస్తున్నారు.అంటే వీరి ఉద్దేశ్యం పదవ తరగతి వరకు. పదవ క్లాసుకు ముందు కూడా మంచి వరుడు దొరకగానే పెళ్లి చేసేస్తున్నారు. ఎక్కువ ఆస్తి ఉన్నవారు, తక్కువ కట్నం అడిగేవారు వస్తే అమ్మాయిలకు16 ఏళ్లు దాటకపోయినా మూడు ముళ్లు వేయించేస్తున్నారు.

మార్పు సహజం... :
యువతలో కాలనుగుణంగా చైతన్యం  వచ్చింది. సాదాసీదాగా బతికేయాలని అనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఏ రంగమైనా తమకంటూ గుర్తింపు రావాలని యువతీ యువకులు తపిస్తున్నారు. దాంతో పోటీ పెరగడంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి కొంత సమయం పడుతుందని ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలో పడి వయసు గురించి పట్టించుకోకపోతే సంతాన సాఫల్య సమస్యలను ఎదుర్కోవలిసి ఉంటుందని వెైద్యులు తెలియచేస్తున్నారు. లక్ష్యంపెై స్పష్టత, ఆత్మవిశ్వాసం తోడుంటే మూడు పదుల వయసు వరకూ వేచి చూడకుండా విజయాలను సొంతం చేసుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Monday, December 6, 2010

నేనెందకు ప్రవక్తపై పుస్తకం రాశాను?

                                     భిన్న  మతాల చరిత్రలను లోతుగా అధ్యయనం చేసి వాటిని వర్తమానానికి అన్వయించుకొని విశ్లేషించటం చాలా క్లిష్టమైన కళ. దీనిలో నిష్ట్ణాతురాలు క్యారన్ ఆంస్ట్రాంగ్. ఆమె రాసిన 'హిస్టరీ ఆఫ్ గాడ్' పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయింది. 30 భాషాల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆంస్ట్రాంగ్ రాసిన మరో పుస్తకం - 'ముహమ్మద్: ఏ బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్'. దీని అనువాదాన్ని హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం.

సల్మాన్ రష్డీ రచించిన 'సెటానిక్ వెర్సెస్' వివాదం, ఫత్వా సందర్భంగా, పది సంవత్సరాల క్రితం నేను ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను. అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారు కూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనపరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ఇరవయ్యో శతాబ్దంలో జరిగిన దారుణమైన సంఘటనల తరువాత కూడా ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా ఉన్న ఒక మతం పట్ల మనం అస్ఫుటమైన అసత్యమైన అభిప్రాయాలను పెంచి పోషించకూడదనిపించింది. సల్మాన్ రష్డీపై అయెతుల్లా ఖొమైనీ ఫత్వా విధించినపుడు ఈ అహేతుక ద్వేషం అనేక పశ్చిమ దేశాలలో మరింత ప్రత్యక్షంగా కనపడింది.

1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న 45 రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఈ ఫత్వాని ఖండించారు. అది ఇస్లామ్ మత విరుద్ధమన్నారు. అయినా బ్రిటన్‌లో ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సౌదీ అరేబియా షేకులు, కైరోలోని అల్ అజ్‌హర్ మదర్సా కూడా ఈ ఫత్వా ఇస్లామ్ మత వ్యతిరేకమైనదన్నది. కానీ ఇదంతా పశ్చిమ దేశాలవారు వినదలచుకోలేదు. అయెతుల్లాతో విభేదించేవారూ, రష్డీని చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది ఉన్నారు.

అయితే సల్మాన్ రష్డీ తన నవలలో ముహమ్మద్ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వీరిని తీవ్రంగా కలత పెట్టింది. పశ్చిమ మేధావులు మాత్రం , ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ళ జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటిష్ రచయితలు, మేధావులు, తత్వవేత్తలు కూడా ఇస్లాముని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనపరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గది కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్టింల సున్నితమైన మనోభావాలను వారు పట్టించుకోలేదు.

అదంత ముఖ్యమైన విషయం కాదనుకున్నారు. ముహమ్మద్ గురించి రష్డీ చెప్పింది మాత్రమే పశ్చిమ దేశాల పాఠకులు చదవడం విచారకరం అనిపించింది. రష్డీ నిజంగా తన నవలలో ఏం చెప్పదలిచాడో నేను అర్ధం చేసుకోగలిగినప్పటికీ, ఒక గొప్ప వ్యక్తి నిజమైన జీవిత కథ అందరికీ తెలియాలనే నేనీ పుస్తక రచనకి పూనుకున్నాను. నాకు ప్రచురణ కర్త దొరకడం కూడా కష్టమైంది.

ఎందుకంటే నా లాంటి మహిళ, వారి ప్రవక్త గురించి వ్రాస్తే ముస్లిమ్‌లకి కోపం వచ్చి నేను కూడా రష్డీ వలె రహస్య జీవితం గడపవలసిన పరిస్థితి సంభవం కావచ్చు అని చాలామంది భావించారు. కానీ నా పుస్తకానికి ముస్లిముల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించడం నన్నెంతో కదిలించింది. నేనీ పుస్తకం కేవలం సంచలనం సృష్టించడానికే వ్రాయలేదని నమ్మారు. తరువాత పది సంవత్సరాలలో పశ్చిమ దేశాలలో ఉన్న ఈ 'ఇస్లామోఫోబియా' తగ్గుతూ వచ్చింది. ముస్లిములకి వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు.

ఇప్పుడు విద్యుద్ఘాతం వంటి సెప్టెంబర్ పదకొండు సంఘటన - న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రమూ, పెంటగాన్‌లో ఒక భాగమూ ధ్వంసమైన తీరు - ముస్లిమ్ ఉగ్రవాదులు ఈ దారుణ మారణకాండకి తలపడి దాదాపు 5000ల మంది మరణానికి కారంణం కావడం, పశ్చిమ దేశాలలో ముస్లిమ్ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్‌పై ఉండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది. ముస్లిములు హింసనూ తీవ్రవాదాన్నీ సమర్ధించే మత మౌడ్యులనే భావనను ఈ ఘోరమైన చర్య స్థిరపరిచింది.

ఈ విపత్కర సంఘటన తరువాత ఒక నెలకి నేనీ ఉపోద్ఘాతం వ్రాస్తున్నాను. ఇదొక ప్రత్యేక సందర్భం. ఇస్లామ్, హింసను సమర్ధిస్తుందనే భావాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాద వివాదాల్లో చాలామంది కుర్ఆన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. ఇటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్, జ్యూయిష్ మత గ్రం«థాలలో కూడా ఇటువంటి కలహశీలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయని మర్చిపోయారు.

జ్యూయిష్ బైబిల్‌లో అతి పవిత్రమైనదిగా భావించే 'తోరా'లో ఇజ్రాయిల్ వారిని, వారికి ప్రభువు వాగ్దానం చేసిన భూమినించి తరిమికొట్టమని, వారి పవిత్ర చిహ్నాలను ధ్వంసం చెయ్యమనీ ఉంది. వారితో ఎటువంటి ఒడంబడికలూ ఉండకూడదంది. కొంతమంది యూదు మతవాదులు, ఇలాంటి వాటిని పాలస్తీనియన్లపై హింసను సమర్ధించడానికి వాడుకుంటారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపన ప్రక్రియను విమర్శించడానికి కూడా వాడుతుంటారు. కాని జుడాయిజమ్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరూ ఈ వాక్యాలను ప్రామాణికంగా తీసుకోరు. వాటిని ఆ విధంగా వాడుకోవడం న్యాయవిరుద్ధమంటారు.

జీసస్‌ని ఎల్లప్పుడూ శాంతికాముకునిగా భావిస్తాము. కానీ కొన్ని గోస్పెల్స్ ఆయన్ని పోరాటశీలునిగా కూడా చిత్రిస్తాయి. ఒక సందర్భంలో ఆయన, తను శాంతిని కాక ఖడ్గాన్ని తెచ్చానంటాడు. అయితే ఎవరూ కూడా సెబ్రెనీసాలో క్రిష్టియన్ సెర్బులు 8000ల మంది ముస్లిములని చంపినపుడు ఈ వాక్యాన్ని ఉల్లేఖించలేదు. ఎవరూ క్రైస్తవ మతం హింసను ప్రోత్సహిస్తుందనలేదు. అటువంటి ఆరోపణలు చెయ్యడం అనుచితం అని చాలామందికి తెలుసు. పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.

(సెప్టెంబర్ ఘాతుకానికి పాల్పడిన) తీవ్రవాదులు తాము ముహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తున్నామనుకోవడం నన్నెక్కువ బాధ పెట్టింది. ఈ దాడికి కీలకమైన వ్యక్తిగా భావించే ఒసామా బిన్ లాడెన్, ముహమ్మద్ ప్రవక్త జీవిత విధానంలోని సనాతన వాదాన్ని (ఫండమెంటలిజమ్) అనుసరించాడు. సయ్యిద్ ఖుతుబ్ అనే ఈజిప్షియన్ మేధావి మొట్టమొదట చేసిన ఫండమెంటలిస్టు సూత్రీకరణ ప్రకారం ముహమ్మద్ జీవితం ఒక దివ్య సాక్షాత్కారం. భగవంతుడు ముహమ్మద్‌కు చెప్పిన మార్గం ఒక్కటే సత్సమాజ స్థాపనకు మార్గం.

(ఖుతుబ్‌కి 1966లో ప్రెసిడెంట్ జమాల్ అబ్దుల్ నాజర్ మరణశిక్ష విధించాడు.) ముహమ్మద్ ప్రవక్త ముస్లిములు చెప్పే 'జాహిలియా'ని (అంటే చీకటి యుగం) అంతం చేయడానికి పోరాడాడు. ఈ జాహిలియా అనే పదాన్ని ముస్లిమ్‌లు రాక ముందు అరేబియాలో ఉండి అవినీతి, బర్బరత్వం రాజ్యమేలిన కాలానికి ప్రతీకగా వాడతారు. ఖుతుబ్ అభిప్రాయం ప్రకారం ప్రతి యుగంలోనూ ఒక జాహిలియా ఉంటుంది. కనుక ఇరవయ్యో శతాబ్దంలో కూడా ముహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తూ తమ ప్రాంతాల్లోని జాహిలియాని నిర్మూలించాలి. ఇందుకోసం వాళ్లు ముందుగా ప్రధాన స్రవంతిగా ఉన్న 'జాహిలి' సమాజం నుంచి విడివిడి అంకిత భావంతో పని చేసే ఒక అగ్ర నాయకత్వాన్ని తయారు చెయ్యాలి.

జిహాద్ రూపకర్త కాకపోవటమే కాక ముహమ్మద్ (నిజానికి) శాంతి కాముకుడు. శాంతి స్థాపకుడు. శాంతి స్థాపనకు ప్రాణాలను కూడా లెక్కచెయ్యని వ్యక్తి, మక్కాతో రాజీకోసం తన సన్నిహితుల మద్దతును కూడా వదులుకున్న వాడు....మొండిగా చనిపోయేవరకూ యుద్ధం చేసేకన్నా సంప్రదింపులతో రాజీ మార్గం అవలంబించడం మంచిదని భావించాడు. ఈ వినయం, సర్దుబాటులే విజయ సాధన మార్గాలయాయని కుర్ఆన్ కూడా పేర్కొంది. ఈ సంక్లిష్ట సమయంలో మనం ప్రవక్త జీవితాన్ని తెలుసుకోవడం అవసరం.

తమ స్వలాభం కోసం ముస్లిమ్ అతివాదులు ముహమ్మద్ జీవితాన్ని వక్రీకరించడాన్ని మనం ఒప్పుకోకూడదు. అమితంగా మారిపోయిన ఈనాటి ప్రపంచంలో మనం ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోడానికి కూడా మనం ముహమ్మద్ జీవితాన్ని చదవాలి. పశ్చిమ దేశ వాసులమైన మనకి ఎప్పుడూ ఇస్లాంతో సరిపడలేదు. ఆ మతాన్ని గురించి మనకి చాలా అహంకారపూరితమైన, మొరటు అభిప్రాయాలుండేవి. తీసిపారేసే చూపు ఉండేది. మనం ఇంకా అటువంటి అజ్ఞానంతో అపార్ధాలతో కూడిన వైఖరి అవలంబించలేమని ఇప్పుడు తెలియ వచ్చింది. ఈ పుస్తకం చివరన నేను ప్రఖ్యాత కెనెడియన్ పండితుడు విల్ ఫ్రెడ్ క్యాంట్వెల్ స్మిత్ వాక్యాలని ఉల్లేఖించాను.

ఆయన రచనలు నాకు నిరంతర స్పూర్తిదాయకాలు. ఇరవయ్యో శతాబ్దపు సవాళ్ళను జయప్రదంగా ఎదుర్కోవాలంటే పశ్చిమదేశాలూ, ఇస్లామిక్ ప్రపంచమూ కూడా గట్టి కృషి చెయ్యాలని ఆయన 1956లోనే హెచ్చరించాడు. ముస్లిములు పశ్చిమ సమాజాన్నీ, పశ్చిమం సాధించిన విజయాలనూ అంగీకరించాలనీ, అట్లాగే పశ్చిమ దేశవాసులు కూడా ముస్లిములను తమకన్నా తక్కువవారుగా కాక సమానులుగా చూడాలనీ అన్నాడు.

పాశ్చాత్య నాగరికతా, క్రైస్తవ మత ధర్మశాస్త్రమూ కూడా తక్కిన వారిని సరైన గౌరవ మర్యాదలతో చూడ్డం నేర్చుకోకపోతే ఆ రెండూ కూడా ఇరవయ్యో శతాబ్దపు వాస్తవాలను ఎదుర్కోలేవని ఆయన అన్నాడు. ఈ క్రమంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ - సెప్టెంబర్ విషాదం, అటు పాశ్చాత్యులూ, ఇటు ముస్లిములూ కూడా ఈ పరీక్షలో నెగ్గలేదని తేల్చింది.

ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లిమ్‌లను అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాట పోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి. అందుకు ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు. ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.

Saturday, November 27, 2010

400 ఏళ్లు..వెనక్కి! - ఆటోచెప్పే భాగ్యనగర కథ

నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్ అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుకున్నాం. కాని నిజంగా మనకు మన భాగ్యనగరం గురించి తెలిసింది ఎంత? అప్పటి వీధులు ఎలా ఉండేవి? మనుషులు ఎలా ఉండేవారు? వేషభాషలు ఎలా ఉండేవి? కళలు, సంస్కృతి ఎలా ఉండేవి? పాత ఫోటోల్లోనో, పీరియడ్ సినిమాల్లోనో తప్ప వాటి గురించి మనకేం తెలుసు? తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత ఉన్నా అన్నిట్నీ ఒకేచోట తెలుసుకునే మార్గం ఇప్పటిదాకా లేదు మనకు. ఇప్పుడు 'హైదరాబాద్ గ్రాఫిక్ నవల' రూపంలో ఆ అవకాశం వచ్చింది.

ఏమిటీ నవల?
నాలుగొందల ఏళ్ల నాటి హైదరాబాద్ చరిత్ర యావత్తూ కాలానుగుణంగా బొమ్మల కథ రూపంలో చూపించడం హైదరాబాద్ గ్రాఫిక్ నవల ఉద్దేశం. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'యుగంతర్' చేపట్టిన 'ఆర్కైవ్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్'లో భాగంగా ఈ మహత్తర కార్యానికి ఇద్దరు కుర్రాళ్లు పునుకున్నారు. వాళ్లు జయదీప్, జస్‌రామన్‌లు. ఇప్పటికే ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తిచేశారు కూడా.

సులువేం కాదు..
గ్రాఫిక్ నవలను తయారుచేయడం అంత సులువేం కాదు. ప్రతి ఎపిసోడ్‌లో ఎన్నో పేజీలు, ప్రతి పేజీలో ఎన్నో ప్యానల్స్ ఉంటాయి. ప్రతి ప్యానల్‌లో కనిపించే మనుషులు, కట్టడాలు, వీధులు, వస్తువుల కోసం కొన్ని వందల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అనుకున్న యాంగిల్‌లోనే ఉండాలి. స్క్రిప్ట్, విజువలైజేషన్ పకడ్బందీగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు.. స్క్రిప్ట్‌కి తగ్గట్లుగా బొమ్మలు గీసే ఆర్టిస్ట్‌కి ప్రతి ప్యానల్ ఎలా ఉండాలన్నది అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. మధ్యలో ఎన్నో చర్చలు, మార్పులు, చేర్పులు. ఇవన్నీ జరిగితే తయారయ్యేది ఒక్క ప్యానల్ మాత్రమే. జయదీప్, జస్‌రామన్‌లు ఇప్పటి వరకు ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీనికంటే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని డాక్యుమెంటరీ తీయడం ఎంతో సులువని వారు పేర్కొంటారు.

'ఆటో'యే హీరో!
మనకు ఎన్నో ఇంగ్లీష్ బొమ్మల కథలు తెలుసు. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. సూపర్‌మాన్, బ్యాట్‌మాన్, స్పైడర్‌మాన్, ఫాంటమ్.. ఏ బొమ్మల కథ తీసుకున్నా సరే అందులోని హీరో.. విలన్లతో సాగించే వీరోచిత పోరాట సన్నివేశాలు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ గ్రాఫిక్ నవలలో కూడా హీరో ఉంటాడు. కాకపోతే అది ఒక ఆటో. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మీకు 'టైం మెషిన్' తెలుసుకదా? హాలీవుడ్‌లో ఈ థీమ్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. టైం మెషిన్‌లో కూర్చుని ఒక మీట నొక్కగానే అది కాలంలో ముందుకో, వెనక్కో తీసుకెళుతుంది. మన తెలుగులో కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఆదిత్య 369' సినిమాలో కూడా ఇదే ఇతివృత్తం. సరిగ్గా ఈ ఆటో కూడా అలాంటి టైం మెషినే. ప్రతి ఎపిసోడ్‌లో ముందుగా ఆటో వస్తుంది.

అందులో ప్రయాణికుడు ఎక్కగానే అది భాగ్యనగర చరిత్రలో కొన్నేళ్ల వెనక్కో, ముందుకో తీసుకెళ్లి వదిలేస్తుంది. ఇక అక్కడ్నించి కథ మొదలవుతుందన్నమాట. ఆ కాలంలో మన భాగ్యనగర వీధులు ఎలా ఉండేవో, మనుషులు ఎలా ఉండేవారో, ఏక్కడ ఏయే కట్టడాలు ఎలా ఉండేవో.. అన్నీ కాలానుగుణంగా కనిపిస్తూ పాఠకులకు కనువిందు చేస్తాయి. ఇలా మొత్తం 400 ఏళ్ల భాగ్యనగర చరిత్ర కాలాన్ని విభజించుకుంటూ ఆయా కాల, మాన పరిస్థితులలో భాగ్యనగర వైభవాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు ఈ గ్రాఫిక్ నవల ద్వారా కృషి చేస్తున్న జయదీప్, జస్‌రామన్‌లు కొత్తరకం చరిత్రకారులుగా అందరి ప్రశంసలు పొందడం ఖాయం. హైదరాబాద్ గ్రాఫిక్ నవల మొదటి ఎపిసోడ్, ఇతరత్రా వివరాల కోసం www.facebook.com/hydgraphicnovelను చూడవచ్చు.
ఈ గ్రాఫిక్ నవల ప్రాజెక్ట్ ఆలోచన మీదేనా? లేకపోతే..
జయదీప్: ఈ ఆలోచన పూర్తిగా మాదే. నిజానికి దీనికంటే ముందు మేం సత్యం ఫౌండేషన్ వాళ్ల కోసం ఒక ఫొటోగ్రఫీ ప్రాజెక్ట్ చేశాం. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. పాత తరం వాళ్లలో అన్ని వర్గాలకు చెందిన 30 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఇంటర్వ్యూ అంటే.. అసలు గతంలో హైదరాబాద్ ఎలా ఉండేదో, ఎక్కడెక్కడ ఏమేం ఉండేవో, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానం, స్థితిగతులు, సంప్రదాయాలు, సంస్కృతి ఎలా ఉండేవో అవన్నీ వాళ్ల నుంచి తెలుసుకున్నాం. అదంతా నేటి హైదరాబాదీలు ఏమాత్రం ఎరగరు.

జస్‌రామన్: అవన్నీ వింటున్నప్పుడు మాకు హైదరాబాద్ గురించి ఏదైనా డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. తీయొచ్చు.. కానీ నాలుగొందల ఏళ్లు వెనక్కి వెళ్లి చూపించడం ఎలా? ఇదే పెద్ద సమస్య అయింది. ఆనాటి వీధులు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద కట్టడాలు, స్మారక చిహ్నాలు కూల్చివేతలకు గురయ్యాయి. అంతెందుకు.. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు తిరిగొచ్చి హైదరాబాద్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరంను చూపించడం ఎలా? పోనీ సెట్టింగ్స్ వేసి తీద్దామా అంటే.. ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

జయదీప్: సెట్టింగ్స్ వేయడం కూడా అంత సులువేం కాదు. ఎందుకంటే ఆనాటి వీధులు, కట్టడాలు, స్మారక చిహ్నాల గురించి తెలిసిన వాళ్లు ఎవరున్నారో, ఎక్కడున్నారో పట్టుకోవడం చాలా కష్టం. సరిగ్గా అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది. ఇతర మార్గాలేవీ వర్కవుట్ అవవని నిర్ణయించుకున్నాక, గ్రాఫిక్స్.. అంటే బొమ్మల రూపంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇందులో మాకెలాంటి ఇబ్బందీ కనిపించలేదు. నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరం ఎలా ఉండేదో, ఎక్కడ ఏమేం ఉండేవో ఇప్పటికే మాకు ఒక అవగాహన ఉంది కదా. ప్రతి సీన్ ఆర్టిస్టుకి అర్థమయ్యేలా చెబుతాం. ఆ ప్రకా రం గ్రాఫిక్ తయారవుతుంది. ఇదీ మా ఆలోచన.

మరి, ఈ 'యుగంతర్' వాళ్లతో పరిచయం ఎలా?
జస్‌రామన్: యుగంతర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇందులోని డైరెక్టర్లలో కె.లలిత ఒకరు. ఆవిడ మాకు ఆంటీ అవుతారు. అప్పటికే వీళ్లు 'ఆర్కైవ్స్ హైదరాబాద్' అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంటరీలు తీసి భద్రపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మా గ్రాఫిక్ నవలా ప్రాజెక్టు వీరికి కూడా నచ్చడంతో అందుకు అవసరమయ్యే నిధులు, ఇతర సహాయ సహకారాలు అందజేసేందుకు యుగంతర్ సంసిద్ధమైంది. అలా ఈ ప్రాజెక్ట్ ప్రాణం పోసుకుంది. గత ఏడాది నవంబర్‌లో గ్రాఫిక్ నవలకు సంబంధించిన పని ప్రారంభించాం. ఇప్పటి వరకు రెండు ఎపిసోడ్లు పూర్తి చేశాం. మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రాలు మా ఫేస్‌బుక్ పేజీలో పెట్టాం. మంచి స్పందన వచ్చింది.

కథ ఎక్కడ్నించి, ఎలా మొదలవుతుంది?
జయదీప్: దాదాపు అరవై ఐదేళ్ల క్రితం.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కథ మొదలవుతుంది. ప్రముఖ వేటగాడు సర్ పెర్సీ పంజాగుట్ట అటవీప్రాంతంలో రాక్షస బల్లుల కోసం తిరుగాడుతూ సమీపంలో ప్రవహిస్తున్న నది నీటి ప్రవాహంలో ఏదో కొట్టుకొస్తుండడం గమనిస్తాడు. తీరా దగ్గరికి వచ్చేసరికి అదొక అతి పెద్ద రాక్షస బల్లి. దాని బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెడుతుండగా 'టైం మెషిన్ ఆటో' ఎదురవుతుంది.

"త్వరగా పోనీ.. ఇరవై ఒకటో శతాబ్దానికి..'' అంటూ ఆటో ఎక్కేస్తాడు. అయితే ఆ హైదరాబాదీ ఆటో డ్రైవర్ తాపీగా.. "ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా..?'' అంటూ బేరం మొదలెడతాడు. ఒక వైపున తరుముకొస్తున్న రాక్షసబల్లి.. మరో వైపున ఆటోవాలా బేరసారాలు.. దీంతో సర్ పెర్సీకి తిక్కరేగిపోతుంది. "జల్దీ.. జల్దీ..'' అని తొందరపెట్టి ఎట్టకేలకు రాక్షస బల్లి నుంచి తప్పించుకుని, బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నగరంలోకి వచ్చిపడతాడు. ఇలా మొదలవుతుంది మొదటి ఎపిసోడ్ కథ. ఈ నవల మొత్తం పూర్తి అవడానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ఏడాది పాటు ఎంతో కష్టపడితే ఇప్పటికి రెండు ఎపిసోడ్లు అంటే.. దాదాపు 35 పేజీలే పూర్తిచేయగలిగాం.

ఎందుకింత సమయం?
జస్‌రామన్: అంటే.. మేం ఇక్కడుంటే మా ఆర్టిస్ట్ ఎక్కడో ఉంటాడు. ఉదాహ రణకు మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన బొమ్మలన్నీ హర్షో మోహన్ చత్తోరాజ్ గీశారు. ఈయన కోల్‌కతాలో ఉంటారు. మేం ఈమెయిల్ ద్వారా ప్రతి సీన్ ఆయనకి వివరించి, ఆ సీన్ ఎలా ఉండాలో కూడా రఫ్‌గా మేం గీసి, దానికి సంబంధించిన ఫొటోలన్నీ ఆయనకు పంపితే వాటిని ఆధారంగా చేసుకుని, సీన్ అర్థం చేసుకుని ఆయన బొమ్మలు గీస్తారు. ఈ ప్రక్రియలో ఈ-మెయిల్స్, ఫోన్‌కాల్స్ ద్వారా మేం పరస్పరం సంప్రదించుకుని, సందేహాలు తీర్చుకోడానికి, సూచనలు ఇచ్చుకోవడానికే అధిక సమయం ఖర్చయిపోతోంది.

ఇంత ఇబ్బంది పడేకంటే ఇక్కడే ఆర్టిస్ట్‌ని చూసుకోవచ్చు కదా?
జయదీప్: చూసుకోవచ్చు.. కానీ ఇక్కడి ఆర్టిస్టులందరూ చాలా బిజీ. వీళ్లంతా ఇక్కడ ఉంటూ విదేశాల నుంచి గ్రాఫిక్స్,యానిమేషన్లకు సంబంధించి వచ్చే పనులు చేస్తున్నారు. ఇక్కడి ఆర్టిస్టులను తప్పు పట్టాలన్నది కాదు మా ఉద్దేశం. కమర్షియల్ వర్క్స్ చేస్తే వాళ్లకు రూపాయలు కాదు, డాలర్స్ వస్తాయి. అలాంటి సమయంలో మేం ఇచ్చే రూపాయలు పుచ్చుకుని మా వర్క్ చేయమని మేం అడగలేం కదా! అందుకని మా ప్రాజెక్ట్ కోసం మేం ఇతర ప్రాంతాల ఆర్టిస్ట్‌లపై ఆధారపడ్డాం. మా గ్రాఫిక్ నవలకు సంబంధించి ఒకో ఎపిసోడ్ బొమ్మలు ఒకో ఆర్టిస్ట్ చేత వేయిస్తున్నాం. మొదటి ఎపిసోడ్‌కు హర్షో మోహన్ చత్తోరా బొమ్మలు గీస్తే, రెండో ఎపిసోడ్‌కు అర్జెంటీనా ఆర్టిస్ట్ ఫెదరికో జూమెన్ గీశారు. అలా ప్రతి ఎపిసోడ్‌కు ఆర్టిస్ట్ మారిపోతారు.

మరి ఆర్టిస్ట్ మారినప్పుడు బొమ్మల శైలి కూడా మారుతుంది కదా?
జయదీప్: మారుతుంది. అయితే కాలం కూడా మారిపోతుందిగా. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు చార్మినార్, దాని పరిసర ప్రాంతాలు ఉన్నాయనుకోండి. నాలుగొందల ఏళ్ల క్రితం ఉన్నట్లే మూడొందల ఏళ్ల క్రితం ఉండదు కదా. కాలంతోపాటే ఆ ప్రాంతం కూడా మారుతుంది. మరో వంద సంవత్సరాలు గడిచాక ఇంకా మారిపోతుంది. కాబట్టి బొమ్మలు కచ్చితంగా మారాలి. స్క్రిప్ట్ మాత్రం మారిపోకూడదు, అదీ అసలు విషయం.
ఓకే, చిన్న వయసులోనే పెద్ద బాధ్యత భుజాన వేసుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్!
- వై.రమేష్‌బాబు,

Friday, November 19, 2010

బ్యాడ్‌ హ్యాబిట్‌

కాలేజీ ఫ్రెషర్స్‌ డే పార్టీ జరుగుతోంది. అందులో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ లోపుగా ఒక విద్యార్థి మైకంతో కళ్లు తిరిగి పడిపోయాడు. అతను మద్యం ఎక్కువగా సేవించడం వల్ల తూలి పడ్డాడని తెలుసుకోవడానిి మిగతా వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే ఆ పార్టీలో దాదాపు అందరూ డ్రింక్‌ తాగుతున్నవారే. చివరకు ఆ అబ్బా యిని తమ ఫ్రెండ్స్‌ ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఆ అబ్బాయి విపరీతమైన హ్యాంగోవర్‌తో బాధపడడంతో పాటు తన మొహాన్ని తన తల్లిదండ్రులకు చూపించడానికి సిగ్గుపడ్డాడు. ఈ విధమైన పరిస్థితులు నేడు చాలా మంది యంగ్‌ స్టర్స్‌కు ఎదురవుతూనే ఉన్నాయి.

పార్టీలలో, పబ్‌లలో మిత్ర బృందమంతా కలుసుకున్నప్పుడు బీర్‌, ఆల్క హాల్‌ తీసుకోవడం నేడు ఫ్యాషన్‌గా భావిస్తున్నారు కొంతమంది కుర్ర కారు. అబ్బాయిలే కాకుండా నేడు కొంతమంది అమ్మాయిలు కూడా మద్యం సేవించడం నేర్చుకుంటున్నారు. ఇలా సరదా కోసం అలవాటు చేసుకున్నవే చివరకు వ్యసనాలుగా మారుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీ లైనంత వరకు వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.

మద్యంతో హాని...
badhabit1మద్యం తాగడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో చదువుకున్నవారికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ పబ్బులు, పార్టీలలో డ్రింకింగ్‌ తప్పని సరి అంటున్నారు నేటి యంగ్‌స్టర్స్‌. యంగ్‌ జనరేషన్‌ కలిసినప్పుడు ఫన్‌ ఉండాలంటే ఈ మాత్రం రిస్క్‌ తీసుకోవాల్సిందేనని అంటున్నారు. అదీకా కుండా ఇంతకు ముందు పార్టీలకు యువకులు మాత్రమే హాజరయ్యేవారు. ఇందులో వారు మద్యం సేవించేవారు. నేడు ఆడా, మగా తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లడం అలవాటయిపోయింది. అందువల్ల ప్రస్తుతం తమ స్నేహితులతో (బాయ్‌ ఫ్రెండ్స్‌) కలిసి కొందరు అమ్మాయిలు కూడా డ్రింక్‌ చేయడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అయింది. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్‌ అందరం కలిసినప్పుడు సరదాగా కొంచెం తాగడంలో పెద్ద తప్పులేదు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్‌ అని చెప్పుకొంటున్నారు నేటి యువతీ యువకులు. మన దేశ చట్టం ప్రకారం 21 సంవత్సరాలు నిండని వారికి మద్యం అమ్మ రాదని రూలు ఉంది. షాపుకు వచ్చిన విద్యార్థుల ఐడెంటీ కార్డును పరిశీలించిన తరువాతే అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా చాలా మంది తమకు కావలసిన డ్రింక్స్‌ను కొనుగోలు చేస్తున్నారని పెద్దలు వాపోతున్నారు.

తక్కువ మోతాదులో...
badhabitస్నేహితులందరం ఎప్పుడైనా కలిసినప్పుడు, క్లబ్‌లకు వెళ్లినప్పుడు తప్పకుం డా బీర్‌కానీ, ఆల్కహాల్‌కానీ తీసుకుంటాం. అది కూడా తక్కువ మోతాదు లోనే పుచ్చుకుంటాం. దీనివల్ల హాని సంగతి కాసేపు పక్కన పెడితే అమ్మాయి లను ఆకట్టుకోవడానికి ఇది షార్ట్‌ రూట్‌ అని నేననుకుంటున్నాను. అమ్మా యిల ముందు అటెన్ష్‌గా, స్టైల్‌గా మాట్లాడేందుకు సహకరిస్తుంది. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు అది చాలా చక్కగా పనిచేసి నాలోని మరో కొత్త వ్యక్తి బయటకు వచ్చి పార్టీలో ఆనందంగా గడపగల్గుతున్నాను’ అని 18 సంవత్స రాల స్టూడెంట్‌ విష్ణు అంటున్నాడు.

జాగ్రత్తలు తీసుకుంటున్నారు...
నేటి రోజుల్లో చాలా మంది యూత్‌ లేట్‌నైట్‌ పార్టీలలో, పబ్బులలో డ్రింక్‌ చేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా ఉం డేందుకు మందు తాగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న చిట్కాల ను ఉపయోగించి తల్లిదండ్రుల నుంచి తప్పించుకుంటున్నారు. ‘ఒకసారి మా కాలేజీ మిత్రులతో పార్టీలో పాల్గొన్నాను. అపుడు వారి బలవంతం మీద మొదటిసారిగా మద్యం తీసుకున్నాను. తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు పేరెంట్స్‌ పసిగట్టకుండా ఉండేందుకు మౌత్‌ ఫ్రెషనర్‌ను ఉపయోగించి వారి నుంచి తప్పించుకున్నాను. ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా డ్రిం్‌ చేయాల్సి వచ్చినప్పుడు నా బ్యాగ్‌లో పిప్పర్‌మెంట్లు, మౌత్‌ఫ్రెషనర్‌ను తప్పకుండా తీసుకవెళతాను’ అని స్టూడెంట్‌ ప్రభాకర్‌ అన్నాడు.

గుణపాఠం నేర్చుకున్నాను...
రాత్రి పార్టీలలో డ్రింక్‌ చేసిన తరువాత రోజు ఉదయం హ్యాంగ్‌ఓవర్‌తో, తలనొప్పితో బాధపడాల్సి వస్తుంటుందని కొంత మంది యంగ్‌స్టర్‌ తమ అనుభవాలను చెబుతున్నారు. ‘నాకు మా కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే పార్టీలో ఒక చేదు అనుభవం ఎదురైంది. నాకు ఇంకా గుర్తుంది. ఆ పార్టీ అయిన తరువాత నా స్నేహితులే నన్ను మా ఇంటి వద్దకు చేర్చారు. ఎందుకంటే ఆరోజు రాత్రి దాదాపు ఐదు పెగ్గులకు మించి తాగడంతో నేను కిందపడిపోయాను. లేచే ఓపికలేక పోయింది. ఇది అయిన మరుసటిరోజు విపరీతమైన తలనొప్పి (హ్యాంగోవర్‌)తో బాధపడాల్సి వచ్చింది. అంతేకాకుండా తెల్లారి మా తల్లిదండ్రు లకు నా మొహం చూపించలేకపోయాను. సిగ్గుతో నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఆ సంఘటన వల్ల నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. పార్టీలలో సరదాల కోసం మందుకు బానిసలు కావడం తప్పని తెలుసుకున్నాను. తాగితేనే ఎంజాయ్‌ చేయగలమను కుంటే అసలు పార్టీలకే పోనవసరంలేదు’ అని 22 సంవత్సరాల సతీష్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వ్యసనంగా మారే అవకాశం ఉంది...
యవ్వనంలో తాము చేసే పని చాలా కరెక్ట్‌ అని టీనేజర్స్‌ ఆనుకుంటారు. అది భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలను కలిగిస్తుందని తెలిసినా కూడా వాటివైపే మొగ్గుచూపుతారు. తాత్కాలిక సుఖం కోసం తమ అమూల్యమైన సమయాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. ‘ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలూ అబ్బాయిలూ అనే తేడాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇరువురూ వెళ్లడం పరిపాటయింది. ఇంతకు ముందు విదేశాల్లోనే ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోని నగరాలకు కూడా వ్యాపించింది. పబ్బులకు వెళ్లడం సాధారణ విషయంగా పరిగణించే స్థాయికి నేటి యంగ్‌స్టర్స్‌ వచ్చారు. ఇలా పబ్బుల్లో అబ్బాయితో సమానంగా యువతులు కూడా డ్రింక్‌ (మద్యం) తీసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఇలాంటివి ముందు సరదాల కోసం అలవాటు చేసుకొన్నా చివరకు వ్యసనంగా మారుతుంది. ఎంజాయ్‌ చేయడం తప్పులేదు కానీ అందుకోసం ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కావడం తమ భవిష్యత్తు నాశనానికి దారితీస్తుందని నేటితరం తెలుసుకోవాలి’ అని మాససిక నిపుణులు తెలియజేస్తున్నారు.
-ఎస్‌.అనిల్‌ కుమార్‌

Sunday, November 7, 2010

e - తరం .... ఓన్లీ వన్ కాంటాక్ట్ ప్లీజ్!

డియర్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, కొలీగ్, క్లాస్‌మేట్, రూమ్‌మేట్, ఎక్సెట్రా..,

ఫస్ట్ టైం యాహూ మెయిల్‌లో ఒకరికొకరం ఇ-ఉత్తరాలు రాసుకున్నాం. 'మెయిల్ ఐడి' లేని మనవాళ్లని ఇంటర్నెట్ సెంటర్లకి లాక్కెళ్లి మరీ వాళ్లచేత ఎకౌంట్లు ఓపెన్ చేయించాం. మొత్తమ్మీద అందరం ఆన్‌లైన్లోకి ఎంటరయ్యాం. ఆ తర్వాత పాతవాళ్లమే కొత్తగా జీ మెయిల్లో చూసుకున్నాం, చాటింగ్ చేసుకున్నాం. గ్రీన్ లైట్ చూసి చాటింగ్ మొదలెట్టి... రెడ్ లైట్ కనపడినా అంటిపెట్టుకునే ఉన్నాం. యాక్టివ్, ఇన్-యాక్టివ్ గుర్తులు కూడా మనల్ని సేవ్ చెయ్యలేకపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొందరం, ఆన్‌లైన్లో చేసేదేమీ లేక ఇంకొందరం, ఏం చెయ్యాలో తెలియక మరికొందరం మెయిళ్లు చేసుకున్నాం, గంటలు గంటలు 'చాట్'భారతాలు రాసుకున్నాం. రైటింగ్ ప్రాక్టీస్ చేశాం. ఇష్టం వచ్చినట్టు షార్ట్‌కట్‌లు ఉపయోగించాం. ఆ షార్ట్‌కట్‌లని అర్థం చేసుకోవడానికి మళ్లీ షార్ట్ టర్మ్ రీసర్చ్ ప్రాజెక్టులు చేశాం.

కస్టమ్ మెసేజ్‌లో 'ఫుల్ బిజీ...కెనాట్ చాట్, సారీ' అని రాసుకుంటే మాత్రం ఒదిలిపెట్టామా? పాపం మనవల్ల మనకి ఎదురౌతున్న ఈ ప్రాబ్లమ్స్ గమనించేనేమో చివరికి జి మెయిల్ కరుణించింది. 'ఇన్‌విజిబుల్' ఆప్షన్ ఇచ్చింది. 'దీని చాటున దాక్కోవచ్చు' అంది. ఆన్‌లైన్లో ఉంటూనే లేనట్టు బిల్డప్పిచ్చి ఎలాగో కాంటాక్ట్‌ల నుండి తప్పించుకున్నాం. అదీ ఎంతకాలం... ఆన్‌లైన్‌కి అలవాటైన ప్రాణాలు అంత తేలిగ్గా ఆఫ్‌లైన్ అవుతాయా? అందుకే అందరం 'ఇన్‌విజిబుల్'గా ఉంటున్నామని అందరికీ తెలిసిపోయింది. ఇన్‌విజిబుల్ కాస్త విజిబుల్ అయిపోయింది.

వీటన్నిటి నుండి ఎలా బయట పడాల్రా దేవుడా అనుకుంటూ ఉండగానే అవతరించింది ఆర్కుట్. కథ మళ్లీ మొదటికొచ్చింది... యాహూ మెయిల్లో ఉన్న బ్యాచే జీ మెయిల్లోకి వెళ్లి ఇప్పుడు ఆర్కుట్‌లో చేరమని ఇన్వైట్ చేసుకున్నాం. అప్పటిదాకా మెయిల్లో కాంటాక్టులుగా మాత్రమే ఉన్న మనం ఆర్కుట్‌తో 'సోషల్ నెట్‌వర్క్'గా ఎదిగాం. ఓపక్క ఇ-మెయిళ్లు, చాటింగులు చేసుకుంటూనే ఆర్కుట్‌లో 'శ్క్రాప్'లు... అవును ఆ 'తుక్కే' రాసుకున్నాం. దాంతో మనకి మరో ఎడ్వాంటేజ్ వచ్చింది. ఎవరు ఎవరికి ఏ తుక్కు రాసినా దాన్ని వేరేవాళ్లు చదవొచ్చు. అందుకే తొంగిచూడడం ఎక్కువైపోయింది. మనం రాసేవాటికి కరెక్ట్‌గా సూట్ అవ్వాలనే ఆర్కుట్ వాళ్లు వాటికి 'శ్క్రాప్' అని పేరు పెట్టారట. ఆర్కుట్ బాటలోనే 'ట్యాగ్డ్', 'హై ఫైవ్', 'మై స్పేస్'...ఇలా కొత్తకొత్త నెట్‌వర్క్‌లెన్నో పుట్టుకొస్తే కనపడిన ప్రతి దాన్ని క్లిక్ చేశాం. జాయినయ్యాం. మారింది నెట్‌వర్కే కాని ఆ నెట్‌వర్క్‌లో చేరింది మళ్లీ మన గుంపే. ఇంతలో మొదలైంది ఫేస్‌బుక్ ఫీవర్!

'ఫేస్‌బుక్‌లో లేవా... యూ ఆర్ సో అన్‌కూల్ ఓకే...' అని అంతపెద్ద నోరేసుకుని అని తోటివాళ్లంటుంటే చివరికి దాన్లో కూడా చేరక తప్పలేదు. ఇక్కడ కూడా ఓల్డ్ ఫ్రెండ్సే తగిలారు. సో... వుయ్ మీట్ ఎవ్రివేర్... ఒకరినొకరం పలకరించుకోవడానికి ఇన్ని మార్గాలు అవసరమా? ఏదో పనుండి రెండ్రోజులు ఆన్‌లైన్‌కి రాకపోతే 'యు డిడ్ నాట్ గివ్ ఎనీ రిప్లయ్ టు మై మెయిల్, వాట్ హ్యాపెన్డ్' అని ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ మెసేజ్. అదీ చాలదన్నట్టు సెల్‌ఫోన్లో 'ప్లీజ్ రెస్పాండ్ టు మై మెయిల్' అని ఎస్ఎమ్ఎస్.

అంత అవసరం ఉందా? కాసేపైనా వదల్రా?
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది... నిజమే. అయితే ఇన్ని కనెక్షన్లు అవసరమా? 'టెక్నాలజీస్ ఆర్ ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ అవర్ బాడీ' అని మార్షల్ మెక్‌లూహన్ ఎప్పుడో చెప్పినట్టు సెల్‌ఫోన్ ఇప్పుడు మన శరీర భాగాల్లో ఒకటై ఉండనే ఉంది. కాబట్టి మన మధ్య సో మెనీ కాంటాక్టులు, కనెక్షన్లు, నెట్‌వర్కుల అవసరం లేదేమో. జస్ట్ ఒక్క ఇ-మెయిల్ చాలు. నో మోర్ న్యూ కనెక్షన్స్ ప్లీజ్!
- ఒక నెట్ బాధితుడు

Friday, October 29, 2010

డ్రెస్‌లోనే అసలైన ఫ్యాషన్

సొగసు సౌకర్యం కుర్తా

అందంగా కనబడే సౌకర్యవంతమైన డ్రెస్‌లోనే అసలైన ఫ్యాషన్ ఉందంటారు డిజైనర్లు. అలాంటి దుస్తుల్లో కుర్తా ఒకటి. ఎన్ని రకాల ఫ్యాషన్లు మార్కెట్లోకి వచ్చినా- కుర్తాకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గటం లేదు.

ఏ సందర్భంలో వేసుకున్నా అందంగా కనిపించటం కుర్తాలకున్న ప్రత్యేకత. కాటన్, లినెన్, రెయన్ బ్లెండ్స్ ఇలా వివిధ రకాల మెటీరియల్‌తో కుర్తాలను కుట్టించుకోవచ్చు. 

                                                                             
ఎవరికి ఎలాంటి కుర్తాలు నప్పుతాయో  చూద్దాం..

ఎలాంటి ఫిట్?
'కుర్తా' అంటే వదులుగా ఉండేదని అర్థం. సాధారణంగా కుర్తాలు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా నప్పుతాయి. శరీరాకృతికి తగినట్లుగా కుర్తాను కుట్టించుకోవటం వల్ల అందం రెట్టింపు అవుతుంది. సన్నని నడుము ఉన్నవాళ్లు కుర్తా నడుము భాగం వద్ద బిగుతుగా ఉండేలా కుట్టించుకోవాలి.

నడుము దగ్గర లావుగా, పిరుదులు పెద్దవిగా ఉన్నవారు- పై నుంచి కిందకి ఒకే విధంగా ఉండేలా కుట్టించుకోవాలి. లావుగా, పొట్టిగా ఉండేవాళ్లు- మందంగా ఉన్న గుడ్డతో కుర్తాను కుట్టించుకోవాలి. సన్నగా ఉన్నవారు మీడియం రకం గుడ్డతో కుట్టించుకోవాలి.

ఎంత పొడవు?
పొట్టిగా ఉండేవాళ్లు- మోకాళ్ల వరకూ కుర్తా ఉండేలా కుట్టించుకోవాలి. నిలువు గీతలున్న కుర్తాలు ధరించటం వల్ల పొడవుగా కనిపిస్తారనేది మీకు తెలిసే ఉంటుంది.

పొడవుగా ఉన్నవాళ్లు- నడుము కిందదాకా ఉన్న కుర్తీలను ఉపయోగిస్తే అందంగా ఉంటుంది. బాగా పొడవు ఉన్నవారు అడ్డగీతలు ఉన్న కుర్తాలను వేసుకోవాలి. ముదురు రంగు కుర్తాలను వేసుకున్నప్పుడు..బాటమ్ లేత రంగులో ఉండేలా చూసుకోవాలి.

ఎలాంటి స్లీవ్స్?
కుర్తాల స్లీవ్స్ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం 1960,70ల నాటి రెట్రో ఫ్యాషన్ నడుస్తోంది. లావుగా ఉన్నవారు స్లీవ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోచేతి వరకు లేదా 3/4 లెంగ్త్ లేదా ఫుల్ సీవ్స్ కుర్తాలను కూడా వేసుకోవచ్చు. కాని అవి బిగుతుగా ఉండాలి.

అప్పుడు సన్నగా కనిపిస్తారు. సన్నగా ఉండే అమ్మాయిలు బెల్, బట్టర్‌ఫ్లై, కప్స్, పఫ్స్ వంటి స్టయిల్ స్లీవ్స్‌ను ధరించవచ్చు. పొట్టిగా ఉన్నవారు 3/4 స్లీవ్స్‌ని వేసుకోవటం వల్ల కొంత డిఫరెంట్‌గా కనిపించవచ్చు. కుర్తా చేతులకు ఇటీవల కాలంలో వర్క్ చేయిస్తున్నారు. ఇవి పార్టీ వేర్‌గా బావుంటాయి.

ఎవరికి ఏలాంటి నెక్‌లైన్?
నెక్‌లైన్‌ను- మెడ, భుజాలు, ఛాతి, ముఖంల ఆధారంగా నెక్‌లైన్‌ను ఎంచుకోవాలి. డీప్ నెక్‌లైన్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. భుజాలు చిన్నగా (నారో షోల్డర్స్) ఉన్నవారు సాధారణ నెక్‌లైన్స్‌కు భిన్నంగా ఉన్నవి వేసుకుంటే బావుంటుంది.

పొడవు మెడ, కోల మొహం ఉన్నవారు క్రూ నెక్‌లైన్‌ని ఎంచుకోవటం వల్ల శరీరాకృతిని బ్యాలెన్స్ చేయవచ్చు. ముఖం గుండ్రంగా ఉన్నవారికి క్రూ నెక్ బావుండదు. భుజాలు చిన్నగా ఉన్నవారు వెడల్పు వీ నెక్, భుజాలు పెద్దగా ఉండేవారు డీప్ వీ నెక్ కుర్తాలను ధరించొచ్చు.

వర్క్
ఎంబ్రాయిడరీ, జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్, పల్లు, నిట్టెడ్, నక్షి ఇలా ఎన్నో వర్క్ చేసిన కుర్తాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సంప్రదాయంగా కనిపించాలంటే జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్ వర్క్స్ ఉన్న కుర్తాలను ధరించొచ్చు. కాస్త స్టయిల్ లుక్ రావాలంటే జర్దోసీ, పల్లు, నిట్టెడ్, నక్షి వర్క్ కుర్తాలను వేసుకోవాలి.

మంచి శరీరాకృతి ఉన్నవాళ్లు హెవీ, లైట్ ఎలాంటి వర్క్ ఉన్న కుర్తాలనయినా ధరించొచ్చు. పొడవుగా ఉన్నవాళ్లు పెద్ద పెద్ద ప్రింట్లు, ఓవరాల్ ప్రింటెడ్ వర్క్ ఉన్న వాటిని కూడా ధరించొచ్చు. లావుగా ఉన్న వారికి సింపుల్ వర్క్ ఉన్న కుర్తాలే బావుంటాయి.

కలర్స్
ప్రస్తుతం- ఆరెంజ్, డీప్ పర్పుల్, మెరూన్, గోల్డ్, తెలుపు, గులాబి, ఎరుపు, పసుపు రంగులను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. లావుగా ఉన్నవారు సింగిల్‌కలర్ టోన్ ఉన్న కుర్తాలను వేసుకుంటే సన్నంగా కనిపిస్తారు.
అర్పిత, ఫ్యాషన్ డిజైనర్

Monday, October 25, 2010

తళుకుల తారల చేతిలో కత్తెర్లు ........

వీళ్ల 'కటింగ్'లకు ఖరీదెక్కువ!

దసరా, దీపావళి వచ్చిందంటే చాలు. వాళ్ల కత్తెర్లకు చేతినిండా పని. కత్తెర్లకు పనంటే ఏ హెయిర్‌సెలూన్‌లోనో బిజీ అయిపోయారని కాదండోయ్. ఈ తళుకుల తారల చేతిలో కత్తెర్లు కొత్తరకం హెయిర్‌స్టయిల్స్ కట్ చేసి ఏ యాభయ్యో వందో తీసుకోవు. అలా వయ్యారంగా వచ్చి ఒక చేత్తో 'కటింగ్' ఇచ్చి.. మరో చేత్తో లక్షలు సంపాదించి పెడుతున్నాయి వీళ్ల కత్తెర్లు

అలాగని అన్ని కత్తెర్లకూ ఒకే రేటు కాదు. ఎంత పదునుకు అంత రేటన్నమాట. పదునంటే గ్లామర్. గ్లామర్ అంటే స్టార్‌డమ్. టాలీవుడ్ భామలంతా పండుగలొస్తే కత్తెర్లకు పనిజెప్పే ట్రెండు ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఏటా దసరా, దీపావళి పండుగలకు హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లో షాపింగ్‌మాల్స్ బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీపడుతుంటాయి.

ఈ రోజుల్లో చడీచప్పుడు లేకుండా ఊరికినే ఆకట్టుకోవాలంటే కుదిరేపని కాదు. అందుకే షాపింగ్ యజమానులు గ్లామర్ తారల చేత్తో ఖరీదైన కటింగ్స్ ఇస్తుంటారు. అప్పుడు బోలెడు డిస్కౌంట్లు, బంపర్ బహుమతులు, ప్రారంభోత్సవాలతో అందర్నీ ఆకర్షిస్తారు.

ప్రకటన ఉత్తినే చేస్తే ఎవ్వరి చూపూ షాపింగ్‌ల వైపు పడదని.. ఏ అనుష్కాతోనో, ఇలియానాతోనో సందడి చేయిస్తుంటారు. కస్టమర్లకు పండుగ ఆఫర్లు ఎంత సంతృప్తినిస్తున్నాయో కానీ, కటింగ్‌లు ఇచ్చే తారలకు మాత్రం నిజంగా పండగే పండగ. తెలుగు సినీ పరిశ్రమలో మంచి బూమ్‌లో ఉన్న అనుష్క ఒక కార్యక్రమ ప్రారంభోత్సవానికి గంటకు 20 లక్షలు తీసుకుంటుందట.

'మగధీర'తో అందరినీ ఆకర్షించిన కాజల్ 5 నుంచి 8 లక్షలు తీసుకుంటుందట. ఈ మధ్యనే 'బృందావనం' సూపర్‌హిట్ కొట్టడంతో ప్రారంభోత్సవాల రేటును 10 లక్షలకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియమణి, నికిషాపటేల్ 4 లక్షలు, సమంతా, తాప్సీ, రిచా గంగోపాధ్యాయ, మమతా మోహన్‌దాస్‌లు ఒక్కో ప్రైవేటు కార్యక్రమానికి రెండు నుంచి మూడు లక్షలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

" దుకాణాలకు తారలను ఆహ్వానించడం కొంత ఖర్చుతో కూడుకున్న పనే అయినా, తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రచారం వస్తుంది...'' అంటున్నారు యజమానులు.

ఎవరి కత్తెరకు ఎంత పదును..?
అనుష్క, ఇలియానా, జెనీలియా : రూ.15 నుంచి 20 లక్షలు
కాజల్ : రూ.5 నుంచి 8 లక్షలు
ప్రియమణి, నికిషా పటేల్ : రూ. 4 లక్షలు
సమంతా, తాప్సీ, రిచా, మమతా మోహన్‌దాస్ : రూ.2 నుంచి 3 లక్షలు
ప్రియా ఆనంద్ : రూ.2 లక్షలు
మధురిమ, బిందుమాధవి, పద్మప్రియ : రూ.50 వేల నుంచి లక్ష

Thursday, October 21, 2010

జీనాలజీ

నడుము
నడుము, పిరుదులు, తొడలు- ఈ మూడింటి ఆకృతిని బట్టి జీన్‌ను ఎంచుకోవాలి. జీన్ వేసుకున్నప్పుడు- ఈ మూడు భాగాల్లోను ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కచ్చితంగా అతికినట్లు ఉంటేనే అందంగా కనిపిస్తుంది. కొందరికి నడుము దగ్గర ఎక్కువ కొవ్వు ఉంటుంది. పొట్ట కూడా ఉంటుంది. ఇలాంటి వారు నడుము భాగం ఎక్కువ కనిపించకుండా ఉండే- హై రెయిజ్, మిడ్ రెయిజ్ జీన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. కాళ్లు సన్నగా ఉండి.. నడుము దగ్గర ఎక్కువ కొవ్వు లేనివారు లో రెయిజ్ జీన్స్‌ను ఎంచుకోవాలి.

పిరుదులు
జీన్స్‌ని ఎంచుకునేటప్పుడు వాటి వెనక జేబులు ఎక్కడ ఉన్నాయో చూడాలి. జీన్ వేసుకున్నప్పుడు వెనక జేబులు- మరీ పక్కకు రాకూడదు. పిరుదు మధ్యకు రావాలి. దీనితో పాటుగా ముందు జేబులలో చేతులు పెట్టి ఒక సారి చూసుకోవాలి. వాటిలో పర్సు లేదా సెల్‌ఫోన్ పెట్టుకోవటానికి వీలు ఉండాలి. కొందరికి పిరుదులు పెద్దవిగా ఉంటాయి. అలాంటి వారు వెనక భాగంలో మరీ ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేసిన జీన్స్‌ను ఎంపిక చేసుకోకపోవటం మంచిది. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కాని జేబులకు కవర్లు ఉన్న జీన్స్ కాని ఎంచుకుంటే మంచిది.

ముందు భాగం
జిప్ ఉండే భాగం ఆధారంగా కూడా జీన్స్ షేప్ మారిపోతూ ఉంటుంది. ఈ భాగంలో బాగా బిగుతుగా ఉన్న జీన్స్‌ను ఎంచుకోకూడదు. అక్కడ మాత్రం శరీరాకృతికి కచ్చితంగా పట్టినట్లు కాకుండా- ఒకటి ఒకటిన్నర అంగుళాలు వదులుగా ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే కూర్చునే సమయంలో ముందు భాగంలో ముడతలు పడిపోతుంది.

తొడలు
జీన్స్ తొడ దగ్గర భాగం కొద్దిగా వదులుగా ఉండాలి. అప్పుడే నడవటానికి సౌకర్యంగా ఉంటుంది. కొందరికి తొడలు వెడల్పుగా ఉంటాయి. అలాంటి వారు తొడల వద్ద టైట్‌గా పట్టేసే జీన్స్‌ను ఎంచుకోకూడదు.

పిక్కలు
పిక్కల దగ్గర జీన్స్ బిగుతుగా ఉండాలనుకుంటే జెగ్గింగ్స్‌ను ఎంచుకోవాలి (జీన్స్‌లా ఉండే లెగ్గింగ్స్‌ను జెగ్గింగ్స్ అంటారు). మంచి శరీరాకృతి ఉన్నవారి కోసం మార్కెట్లోకి బూట్‌కట్ ఫిట్, ఫ్లేర్డ్ ఫిట్‌లు వచ్చాయి. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు.

హెమ్
జీన్స్ కింది భాగాన్ని హెమ్ అంటారు. శరీరాకృతిని బట్టి ఇది ఎంత ఉండాలనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. పొట్టిగా ఉండే అమ్మాయిలు- పిక్కల దాకా ఉండే జీన్స్‌ను(3/4 జీన్స్) వేసుకోకూడదు. హై హీల్స్ వేసుకొని పాదం కింది దాకా ఉండే జీన్స్‌ను వేసుకోవాలి. కొందరు ఫ్లాట్ జీన్స్‌ను ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటి వారు చెప్పులు లేదా బూట్లు దాకా ఉండే జీన్స్‌ను వేసుకుంటే బావుంటుంది.

చెక్‌లిస్ట్
మరీ వదులుగా లేదా మరీ టైట్‌గా ఉన్న జీన్స్‌ను ఎప్పుడూ కొనొద్దు. మరీ టైట్ జీన్స్‌ను కొంటే తొడల వద్ద ముడతలు పడిపోతాయి. మరీ లూజ్‌గా ఉన్న జీన్స్‌ను కొంటే బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా సౌకర్యంగా ఉండదు.

మార్కెట్లో ఉన్న ట్రెండ్‌ను ఫాలో కావాలి. సన్నగా ఉన్నవారికి స్కిన్నీ జీన్స్ బాగుంటాయి. తొడల దగ్గర కొద్దిగా లావుగా ఉన్నవారు కూడా స్కిన్నీ జీన్స్‌ను వేసుకోవచ్చు కాని దానిపై పొడవైన టాప్‌ను లేదా కుర్తీని వేసుకోవాలి.

మార్కెట్‌లోకి అనేక రకాల జీన్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఒకే రకం జీన్‌ను పదే పదే కొనటం అనవసరం. వేర్వేరు రకాలు కొనుగోలు చేస్తే బావుంటుంది.

ట్రెండీగా ఉండే జీన్స్‌నైనా సరే ఒకటి రెండుకు మించి కొనొద్దు. ఎంబ్రాయిడరీ, యాసిడ్ వాష్ రకాలు ఏడెనిమిది సంవత్సరాలుగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. అలాంటి వాటికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. వాటిని ఎంచుకుంటే మంచిది.

జీన్స్ కొనేందుకు వెళ్లినప్పుడు స్కర్ట్ వేసుకొని వెళ్లటం ఉత్తమం. దీని వల్ల జీన్‌ను వేసి చూసుకోవటం సులభమవుతుంది.

షాపులో జీన్స్ ట్రయల్ వేసినప్పుడు నడవటంతో పాటుగా వంగి పైకి లేచి చూసుకోవాలి. అప్పుడు జీన్ కచ్చితంగా ఫిట్ అయిందో లేదో తెలుస్తుంది.

Thursday, September 23, 2010

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదు , శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తాం .... * టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌

ఉద్యమాలను నియంత్రిస్తా !
Kcr-miceడిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తామని హెచ్చరించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హటాత్తుగా మడమ తిప్పారు. ముందు చెప్పినట్లు.. డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదని, శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తామని తెలంగాణేతర పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. తెలంగాణేతర, ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణ వచ్చిన తర్వాత తరిమివేస్తామన్న తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల హెచ్చరికల నేపథ్యంలో.. ఉద్యమకారులను తాము నియంత్రిస్తామని, ఆ విషయంలో తన మాటకు తిరుగులేదని అభయహస్తం ఇచ్చారు. బుధవారం హోటల్‌ తాజ్‌ కృష్ణాలో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ అసెస్‌మెంట్‌ నిర్వహించిన సీఈఓల ఫోరమ్‌ సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించి, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి, పారిశ్రామికవేత్తల వ్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఈ భేటీకి మీడియాను దూరంగా ఉంచడం చర్చనీయాంశమయింది. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేక ప్రశ్నలు వస్తే, అవి మీడియాలో వచ్చిన తర్వాత అసలు సమావేశ లక్ష్యమే దెబ్బతింటుందని భావించి మీడియాను దూరంగా ఉంచారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులను మాత్రం ఆహ్వానించారు. ఇదంతా ఐఎంఏ ఆహ్వానం మేరకు జరుగుతు న్నందున, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ నేతల సూచనల మేరకే ఈ సమావేశం జరిగిందని, అందుకే మీడియాను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న నాస్కామ్‌, ఫిక్కీ, సిఐఐ సభ్యులను మాత్రం ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది.

తెలంగాణ ఉద్యమం వల్ల వ్యాపారం దెబ్బతిందని ఇటీవల ఫిక్కీ కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసినందుకే ఆ సభ్యులను దూరంగా ఉంచినట్లు సమాచారం. ఇలాంటి పారిశ్రామికవేత్తల సమావేశాల్లో కీలకపాత్ర పోషించే శక్తిసాగర్‌ సీఈఓ దూరంగా ఉండటం ప్రస్తావనార్హం. సీఈఓల భేటీకి హాజరయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆ భేటీని తాము అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమ సంస్థలు ముందస్తుగా హెచ్చరించడంతో చాలామంది సీఈఓలు సమావేశానికి వెళ్లలేదు. ఫలితంగా సమావేశం కొందరికే పరిమితమయిందన్న వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల నుంచి వినిపించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఈ సమావేశానికి వెళితే లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మా తెలంగాణ అధ్యక్షుడు వీరారెడ్డి, తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు నర్రా జయలక్ష్మి హోటల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం తాజ్‌ కృష్ణాలో జరిగిన సమావేశ వివరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని, తనతో కేంద్ర ప్రముఖులు రోజూ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణేతర- సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టుకునేది లేదన్నారు. అంతా కలసి తెలంగాణ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెడదామన్నారు. ఈ విషయంలో తాము ఇప్పటిమాదిరిగా ప్రాంతాలపై వివక్ష చూపబోమని, తమకు అభివృద్ధే ప్రధానమని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం, రాయితీల వంటి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మీ మనసులో ఉన్న అపోహలను తొలగించుకుని, పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా.. కేసీఆర్‌ ప్రసంగం తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొనే పరిస్థితులు, తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాలు తమకు వ్యతిరేకంగా ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వాటికి సమాధానాలిచ్చిన కేసీఆర్‌.. తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు ఎవరి వల్ల ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సంస్థలు, నాయకులు, విద్యార్థి సంఘాల గురించి మీరేం భయపడనవసరం లేదు. వారిని నియంత్రించే బాధ్యత మాది. వారికి నచ్చచెబుతాం. పరిస్థితి అంతా సద్దుమణిగేలా చేస్తాం. ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ వద్దనరు. ఈ విషయంలో నా మాటకు తిరుగు ఉండదు. విద్యార్థులకు ఆవేశం సహజం. ముందు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత అంతా సద్దుకుపోతుందని భరోసా ఇచ్చారు.  

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తానని గతంలో తాను చేసిన హెచ్చరికను ఓ పారిశ్రామికవేత్త ప్రస్తావించగా.. అలాంటివేమీ ఉండవని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పటి పరిస్థితిని బట్టి ఒక్కోసారి భావోద్వేగంగా మాట్లాడవలసి ఉంటుంది. భాషను కాకుండా భావాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలను తాను నియంత్రిస్తానని, ఆ విషయంలో ఎవరూ అనుమానించవలసిన పనిలేదన్నారు. జేఏసీలు, విద్యార్థి సంఘాలను తాను నియంత్రిస్తానని, వారి వల్ల మీకు ఎలాంటి భయం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఆందోళన ఉండనందున, తాను వారిని ఒక వేదికపైకి తీసుకువచ్చి మీకు నష్టం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

Saturday, September 18, 2010

ఈ గడ్డ మీద పుడితే తెలంగాణ బిడ్డే * పొట్టకూటికోసం వచ్చిన వారిపై ద్వేషం లేదు * మా పొట్ట కొట్టడానికి వచ్చిన వారిపైనే ఉద్యమం * టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - ఈ దొరయేందిరో !

"ఈ గడ్డ మీద పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే'' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. తెలంగాణలో పుట్టిన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు, ఎమ్మెల్యే పదవులు సహా అన్నింటికీ అర్హులేనని తేల్చి చెప్పారు. హక్కులేదన్నవాడు సన్నాసి.. దద్దమ్మ అని అన్నారు. ఒకవేళ వారికి అన్యాయం జరిగితే.. చేపట్టే ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

ఎవరి వాటా ఎంత?  అనే అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి శనివారం రాత్రి ఆంధ్రజ్యోతి గ్రూపు సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా నిర్వహించిన 'గ్రేట్ డిబేట్'లో కేసీఆర్ ఫోన్ ద్వారా పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఆయన ఏమన్నారంటే.... "సమైక్యవాదం నిజమే అయితే.. ఆంధ్రాలోని న్యాయాధికారుల్లో తెలంగాణ బిడ్డ ఒక్కరున్నారా? తెలంగాణలో గుంటూరు పల్లెలు ఉన్నాయి. కాని, సీమాంధ్రలో ఎక్కడైనా ఒక్క తెలంగాణ పల్లె ఉందా? 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా కరీంనగర్‌లో ఏంచెప్పారు.

ప్రధాని తన తొలి ప్రెస్‌మీట్‌లో ఏంచెప్పారు? సోనియానాకు ఫోన్ చేసి.. డిన్నర్‌కు ఇంటికొచ్చి ఏం చెప్పారు? డిసెంబర్ 9న ప్రధాని తెలంగాణ ఏర్పాటు ప్రకటనచేయించారు. దాని అమలు దశలో పడ్డ బ్రేకులు బద్దలు కొట్టాల్సి ఉంది. ఒకసారి ప్రకటన చేశాక.. వేలాడితే.. పాకులాడితే.. కేసీఆర్‌ను తిడితే తెలంగాణ ఆగుతుందా? పోరాడాలని అడ్వకేట్లకుఎవరు చెప్పారు? రేపు పోలీసులూ ఇలా చేస్తారని అంటున్నారు.తెలంగాణకొచ్చిన సీమాంధ్రులు ఇక్కడి సంస్కృతిలో కలిసిపోలేదు.

'మీ బొంద మీకేం తెలుసు. తెలివి ఉందా ?' అని ప్రతి రోజు ఆంధ్రా వారు ఇక్కడి వారిని తక్కువ చేసి మాట్లాడుతారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా డిసెంబర్ 9న తెలంగాణ వచ్చేది కదా? అప్పుడు సహృద్భావ వాతావరణాన్ని నాశనం చేసింది ఎవరు? రెండు రాష్ట్రాలుగా సహృద్భావ వాతావరణంలో విడిపోవాలన్నదే నా భావన.

తెలంగాణ ఏర్పడ్డాక సీమాంధ్రులు ఇక్కడ అద్భుతంగా ఉండవచ్చు. వారికి రేపు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతాం. తెలంగాణ వచ్చాక ఇక్కడి సినిమా పరిశ్రమను ఏ సన్నాసి వెధవ అయినా వదులుకుంటాడా? విభజన ఇప్పటికే జరిగిపోయింది.. చంద్రబాబుపై నెపం పెట్టటం కాదు. సమైక్యంగా ఉండటంపై రాద్ధాంతం వల్ల నష్టపోతున్నది ప్రజలు.

లగడపాటీ.. ఐ లవ్ యూ సో మచ్ : కేసీఆర్ : తెలంగాణ డైనమేట్ కేసీఆర్.. సమైక్యాంధ్ర సీమటపాకాయ లగడపాటి రాజ్‌గోపాల్. ఒకరంటే మరొకరికి పడదనే ప్రచారం. రాష్ట్ర విభజన ఉద్యమం నేపథ్యంలో వారి మధ్య 'దూరం' పెరిగిందన్నది వాస్తవం. అయితే వారిద్దరినీ తొలిసారిగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఫోన్ ద్వారా కలిపింది. ఇద్దరూ చక్కగా మాట్లాడుకున్నారు.

ఒకరంటే మరొకరికి గౌరవం ఉందని చెప్పుకున్నారు. కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి.. "లగడపాటీ..ఐ లవ్ యూ సో మచ్' అని అంటే.."కేసీఆర్ గారు.. ఈ రాత్రే మీ ఇంటికొస్తా'' అని లగడపాటి అన్నారు. ఇరువురు కూడా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. లగడపాటిపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

తెలంగాణ జనాభా 34 శాతం కాగా, సీమాంధ్ర వారు కలవటం వల్ల తెలంగాణ జనాభా 40.5 శాతం అయ్యిందని, పదవుల్లోనూ సీమాంధ్రులకు తెలంగాణ ఆమేరకు వాటా దక్కాలని లగడపాటి అంటున్నట్లు రాధాకృష్ణ చెబితే.. లగడపాటి చెప్పేది వంద శాతం కరెక్ట్ అని కేసీఆర్ అన్నారు.

ప్రధాని మన్మోహన్ తెలంగాణపై మాట్లాడిన ఆదివారం లగడపాటి ఇంటికి పంపిస్తానని కేసీఆర్ అంటే.. ఈ రాత్రే (శనివారం) మీ ఇంటికొస్తానని లగడపాటి బదులిచ్చారు. దీనికి కేసీఆర్.. "మోస్ట్ వెల్‌కమ్.. మీ ఇల్లు మా ఇల్లు వేరు కాదు'' అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉందామని లగడపాటి ప్రతిపాదిస్తే మాత్రం.. కేసీఆర్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తలాతోకలేని నివేదిక ఇస్తే ఎందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించారు.

సన్నాసి కమిటీ కావచ్చు... దరఖాస్తు అడిగారు కాబట్టి ఇచ్చాం. కమిటీ నివేదిక ఎలా నివేదిక ఇచ్చినా అంగీకరిస్తే.. డిసెంబర్ 9న కేంద్రం బుద్ధి లేకుండా ప్రకటన చేసిందనుకోవాలా? అని ప్రశ్నించారు. ఓ సమయంలో లగడపాటిని 'యూ ఆర్ ఏ హీరో' అని కొనియాడారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుంచే విరమించుకుంటానని చెప్పి.. అదే విధానానికి కట్టుబడి ఉన్న మగబిడ్డ అని ప్రస్తుతించారు.

పొట్టకూటికోసం వచ్చిన వారిపై ద్వేషం లేదు
మా పొట్ట కొట్టడానికి వచ్చిన వారిపైనే ఉద్యమం : కేసీఆర్

  "ఈ గడ్డ మీద పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే'' అన్న వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమర్ధించుకుంటూ, ఆ వ్యాఖ్యల వెనుక విశాల దృక్పథం ఉందని తెలిపారు. పొట్టకూటి కోసం వచ్చిన వారిపై తమకెలాంటి ద్వేషం లేదని, మా పొట్ట కొట్టడానికి వచ్చినవారిపైనే మా ఉద్యమం అని పేర్కొన్నారు.

తెలంగాణలో పుట్టిన వాళ్ళంతా ఇక్కడివాళ్లేనని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు 42 శాతం ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసిన నేపథ్యంలో పై విధంగా సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ వివరణపై స్పందించిన తెలంగాణ న్యాయవాదుల సంఘం కార్యదర్శి రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఒకసారి క్షమాపణ చెబితే సరిపోతుందని అన్నారు. లేని పక్షంలో సోమవారం న్యాయవాదుల సంఘం జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ దొరయేందిరో !
main-cartoతుది దశకు చేరుకున్న తెలంగాణ ఉద్యమాన్ని కులాల వారీగా చీల్చి తన అగ్రకుల దురహంకార మాయోపాయాన్ని తమపై ప్రయోగిస్తున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుల రాజకీయంపై తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. కేసీఆర్‌ తెచ్చే వెలమ-రెడ్ల తెలంగాణ తమకు అవసరం లేదని, అగ్రవర్ణాలు లేని.. బడుగు బలహీన వర్గాలతో కూడిన సామాజిక తెలంగాణ మాత్రమే కావాలంటూ పిడిి లి బిగించనున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని టీఆస్‌ఎస్‌కు తాకట్టు పెట్టి, వారికి తొత్తులుగా మార్చుకునే కేసీఆర్‌ కుల రాజకీయాన్ని తిప్పికొట్టి, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తామే ముందుండి తెలంగాణ సాధించుకోవాలని బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

మరోవైపు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణ సిద్ధమయింది.అగ్రకులాల రాజకీయ ప్రయోగశాలగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడంతో పాటు, కేసీఆర్‌ పడగ నీడ నుంచి రక్షించాలన్న లక్ష్యంతో ఇకపై అడుగులు వేయాలని నిర్ణయించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ సభలో దళిత నేత విశారదన్‌ ప్రసంగాన్ని అక్కడే ఉన్న ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి సూచనలతో అడ్డుకున్న వైనం బడుగు వర్గాల విద్యార్థి లోకంలో ఆగ్రహానికి దారితీసింది. ఈ పరిణామం.. కేసీఆర్‌ చేతిలో ఓయూ విద్యార్థి సంఘాలు చిక్కుకున్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన బడుగు వర్గాలు, తమ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేందుకు రంగంలోకి దిగాయి.

ఆత్మగౌరవ సభలో తమకు జరిగిన అన్యాయానికి కేసీఆరే కారణమంటూ శనివారం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నేతలు ఉస్మానియాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్థం చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది ఓయూలోని బడుగు వర్గాలకు విద్యార్థుల్లో కేసీఆర్‌ చేస్తున్న కుల రాజకీయాలపై ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు వారు శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

బడుగు బలహీన వర్గాల ఆత్మత్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం చివరి అంకానికి చేరిందని, అయితే కేసీఆర్‌ దానిని వెలమ-రెడ్లకు అంకితం చేసేందుకు ఉద్యమంలో పాల్గొంటున్న తమ మధ్య చీలికలు తెచ్చి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే ఎత్తుగడను తిప్పికొట్టి కేసీఆర్‌ నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బడుగు బలహీన వర్గాల విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు.కేసీఆర్‌ తన తొత్తులను తమలో చొప్పించి ఉద్యమాన్ని కులాల వారీగాచీలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అన్ని విధాలుగా ప్రలోభపరుచుకుని, తమ ఉద్యమాన్ని చివరకు టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టే దిశగా తీసుకువెళుతున్నందున, ఇకపై తాము కేసీఆర్‌ ఉచ్చులో చిక్కకూడదని బడుగు జేఏసీ నేతలు తీర్మానించు కున్నారు. తమ వర్గాలకే చెందిన కొందరు నేతలు ఇప్పటికే కేసీఆర్‌ ప్రలోభాలకు చిక్కినందున, అగ్రవర్ణాలతో పాటు వారిని కూడా దూరం పెట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.

తమ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో తుది దశకు చేరిన ఉద్యమం ఫలించాలంటే తమకు అన్ని రాజకీయ పార్టీల అండ కావాలని, అందుకోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు.టీఆర్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న కొన్ని విద్యార్థి సంఘాలు మిగిలిన రాజకీయ పార్టీలను అడ్డుకుని, మొత్తం విద్యార్థులను కేసీఆ ర్‌ మద్దతుదారులుగా మార్చే ప్రయత్నా లను తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నా రు. బడుగు బలహీన వర్గాల ద్వారా ప్రారంభమయిన ఉద్యమాన్ని హైజాక్‌ చేసి, దానిని ఒక్క శాతం కూడా లేని వెలమదొరలకు అంకితం చేసేందుకు కేసీఆర్‌ చేస్తున్న రాజకీయ కుట్రను సమర్థవంతంగా, సమిష్ఠిగా తిప్పికొడతా మని ఓయూ బీసి జేఏసీ కన్వీనర్‌ వి. రామారావు గౌడ్‌ స్పష్టం చేశారు.

విద్యార్థి ఉద్యమంలో చొరబడ్డ టీఆర్‌ఎస్‌ను దూరం చేయకపోతే మిగిలిన పార్టీలు దరికి చేరవని గుర్తించిన బడుగు వర్గాల విద్యార్థి సంఘాలు, మిగిలిన పార్టీల మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నాయి.నాయకులను అడ్డకుంటున్నది ఒక్క టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చే సంఘాలే తప్ప, విద్యార్థులంతా కాదని వారికి స్పష్టం చేయనున్నారు. కేసీఆర్‌ అగ్రకుల రాజకీయం, మీడియా వల్ల పెద్ద నేతలుగా ఎదిగిన తమ వర్గ నేతలు కొందరు కేసీఆర్‌ను తాము విమర్శిస్తుంటే అడ్డుకుంటూ, దొరలకు ఊడిగం చేస్తున్నందున.. అలాంటి వారిని ఇకపై నాయకులుగా గుర్తించ వద్దని పిలుపునిచ్చేందుకు తీర్మానించారు. ‘దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన మైక్రోఫైనాన్స్‌ కేసులో పెద్ద లీడరుగా చెలామణి అవుతున్న ఓ నేత 3 లక్షలు తీసుకున్నాడు. కేసీఆర్‌కు భజన చేయడం, ఆయన నుంచి లబ్థి పొందడమే వారి రోజు వారీ కార్యక్రమం. ఇది ఓయూలో అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వాళ్లు చేసే ఉద్యమాలకు విశ్వసనీయత ఉంటుందా’ అని ఓ బీసీ విద్యార్థి సంఘ నేత ప్రశ్నించారు.

కొందరు నాయకుల తీరు, వ్యవహారశైలి వల్ల మొత్తం ఓయూ విద్యార్థులను దోషులుగా చూస్తున్నారని, అన్నింటికన్నా ప్రధానంగా విద్యార్థులందరినీ టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులుగా, కార్యకర్తలుగా చూపించేందుకు కేసీఆర్‌, ఆయనకు తందానా పలుకుతున్న నేతల ప్రయత్నాలను అడ్డుకోవడం చారిత్రక అవసరంగా గుర్తిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులకు ఆత్మగౌరవం అనేది లేకుండా పోతుందని భావిస్తున్నారు.విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వారితో ఆరున్నర లక్షల సభ్యత్వాలు కేసీఆర్‌ చేయిస్తే, దానికి కారణమయిన విద్యార్థి నేతలు మాత్రం ఇంకా ఆయన చుట్టూ తిరుగుతున్న విషాద పరిస్థితిని తోటి విద్యార్థులకు వివరించేందుకు త్వరలో ఒక సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

కేసీఆర్‌ను దూరం పెట్టాలి
ramaraoతనకు తొత్తులుగా మారని విద్యార్థి సంఘాల నేతలపై కేసీఆర్‌ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఓయూ జేఏసీ కన్వీనర్‌ రామారావు ఆరోపించారు. కొన్ని విద్యార్థి సంఘాలు కేసీఆర్‌ ప్రలోభానికి లోనయ్యాయని, వారిని విద్యార్థులే దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. దళితుడికి సీఎం, మైనారిటీకి డిప్యూటీ సీఎం ఇస్తానన్న కేసీఆర్‌కు తెలంగాణ జనాభాలో 65 శాతం ఉన్న బీసీలు ఆ పదవులకు అర్హులుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణ-దొరల తెలంగా ణకు వ్యతిరేకంగా జరిగే పునరేకీకరణ ఉద్యమంలో తామూ భాగస్వాము లవుతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో మొదలయిన విద్యార్థి ఉద్యమాన్ని కేసీఆర్‌ చీల్చి, వారి మధ్య శత్రుత్వాన్ని రగిలించారని ఆరోపించారు. ఆరోపించారు.

కేసీఆర్‌ అగ్రకుల దురంహంకారి
Arvind-Kumar-Goudకేసీఆర్‌ అగ్రకుల దురహంకారి అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవిందకుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. దళితుడితో చెప్పులు తొడిగించుకున్న కేసీఆర్‌ రేపు తెలంగాణ వస్తే దళితుల ఆత్మగౌరవాన్ని ఇంకెంత దెబ్బతీస్తారో గమనించాలని పిలుపునిచ్చారు. దళిత విద్యార్థి విశారదన్‌ను అవమానించిన టీఆర్‌ఎస్‌ అగ్రకుల వైఖరిని దళితులు, బీసీలు ఇప్పటికయినా గ్రహించాలని కోరారు. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు మాత్రమే తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇచ్చారన్న వాస్తవాన్ని విస్మరిం చకూడదన్నారు. చంద్రబాబునాయుడు దళితులకు లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌, బీసీలకు అసెంబ్లీ స్పీకర్‌, హోం, రెవిన్యూ, ఆర్ధికమంత్రి వంటి శక్తివంతమైన పదవులు ఇస్తే.. కేసీఆర్‌ మాత్రం దళితులతో చెప్పులు తొడిగించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న కేసీఆర్‌.. నిజంగా దళితుడికి ఆ పదవి ఇస్తే అప్పుడు ఇంకెంత దారుణంగా అవమానిస్తారో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని గౌడ్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారుతాం
visharadhan‘ఇప్పటికే ఓయూలో కొన్ని విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారాయన్న అభిప్రాయం, అప్రతిష్ఠ జనంలో బలంగా నాటుకుపోయింది. అందువల్ల మిగిలిన పార్టీలు మాకు కంటితుడుపు మద్దతు తప్ప, మనస్ఫూర్తిగా మద్దతునిచ్చేందుకు ముందుకురావడం లేదని గ్రహించాం. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు తీసుకువస్తాం. విద్యార్థుల ఆత్మగౌరవంతో నడిపే ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు అవసరం. ఆత్మగౌరవమంటే శక్తి. ఆ శక్తిని నిర్వీర్యం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. మా ఉద్యమంలో చీలికలు తెచ్చిన కేసీఆర్‌ను మేం కూడా రాజకీయంగానే ఎదుర్కొంటాం. అంటే మేమే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారతాం. అప్పుడే తెలంగాణ సిద్ధిస్తుంద’ని ఓయూకు చెందిన దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్‌ విశారదన్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్‌ బీసీల వ్యతిరేకి : జయప్రసాద్‌
కేసీఆర్‌ పచ్చి బీసీ వ్యతిరేకి అని, ఆయన ఉద్యమాన్ని నడిపించినంత కాలం తెలంగాణ రావడం అసాధ్యమని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కె.జయప్రసాద్‌ స్పష్టం చేశారు. ఓయూలో దళిత విద్యార్థి నేత విశారదన్‌ను ప్రసంగం మధ్యలోనే అడ్డుకోవడం, దానిని కోదండరామిరెడ్డి దగ్గరుండి మరీ ప్రోత్సహించడం బట్టి.. దొరల తెలంగాణ కోసం కేసీఆర్‌ ఎంత నీచానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోందన్నారు. ఓయూ విద్యార్థులంతా తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటున్నందున.. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కేసీఆర్‌ వలలో చిక్కుకోవద్దన్నారు. కేసీఆర్‌ కేవలం వెలమ-రెడ్ల కోసమే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు.

Friday, September 10, 2010

అందరి ఆనందం..ఈద్

రమజాన్ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. తద్వారా మనం ఆనందంగా ఉండడంతో పాటు సమాజమంతా ఆనందంగా ఉండాలన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండగ సమాజంలో ఈ విధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని సామరస్య వాతావరణాన్నిసృష్టిస్తుంది.
"ఈద్''అనేది ఒక అరబీ పదబంధం. ఒక మహనీయుని, లేక మహా సంఘటనను స్మరించుకుంటూ, ఏటా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రతి శుభ సందర్భాన్ని 'ఈద్'అంటారు. దీన్నే మనం తెలుగు భాషలో 'పండగ' అంటున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్(సం)మక్కా నగరం నుంచి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్దెనిమిది మాసాల తరువాత, అంటే రమజాన్ మాసం మరి రెండు రోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రి శకం రెండవ సంవత్సరంలో సదఖా, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.

"ఎవరైతే పరిశుద్ధతను పొంది, అల్లాహ్(దైవ)నామాన్ని స్మరిస్తూ(ఈద్)నమాజ్ ఆచరించారో వారు సాఫల్యం పొందారు''(పవిత్ర ఖురాన్ 18-14). ఈ వాక్యానికి సంబంధించిన ఒక వ్యాఖ్యానంలో 'ఎవరైతే జకాత్, ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందారు'అని ఉంది. ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా, అబూఖుల్‌దాతో, 'రేపు మీరు ప్రార్థన కోసం ఈద్‌గాహ్‌కు వెళ్ళే ముందు ఒకసారి నా వద్దకు వచ్చి వెళ్ళండి' అన్నారు.

మరునాడు అబూఖుల్‌దా ఆయన వద్దకు వెళ్ళినపుడు 'ఏమైనా భుజించారా?'అని ప్రశ్నించారు. సమాధానంగా అబూఖుల్‌దా 'ఆ.. భుజించాను'అన్నారు. 'గుస్ల్(స్నానం)చేశారా?'అని మళ్ళీ ప్రశ్నించారు. 'ఆ.. చేశాను'అన్నారాయన సమాధానంగా. 'మరి జకాత్, ఫిత్రాలు చెల్లించారా?' 'ఆ.. చెల్లించాను'అని చెప్పాడరు అబూఖుల్‌దా. 'ఇక చాలు ఈ విషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఈ దైవ వాక్యం అర్థం కూడా ఇదే.'అన్నారాయన. హజ్రత్ ఉమర్‌బిన్ అబ్దుల్ అజీజ్ కూడా ప్రజలను ఫిత్రా చెల్లించమని ఆదేశించి, ఈ వాక్యాన్నే చదివి వినిపించేవారు.

ఉత్సాహవేళ...
పవిత్ర ఖురాన్‌లో 'ఈద్'అనే పదం ఓ ప్రత్యేక అర్థంలో మనకు కనిపిస్తుంది. మాయిదా సూరాలో దేవుని ప్రవక్త హజ్రత్ ఈసా అలై హిస్సలాం(క్రీస్తు మహనీయులు)ఆకాశం నుంచి 'మాయిదా'ను(ఆహార పదార్థాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపచేయమని దైవాన్ని వేడుకుంటారు. "మా ప్రభువా!! మా ముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుంచి అవతరింపచేయి.

అది మాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ పండగ(ఈద్) ఈ రోజు అవుతుంది.''(పవిత్ర ఖురాన్ 5-114) అల్లమా ఇచ్నెకసీర్, హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్(రజి) మహనీయుల్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు.

హ!! ఈసా అలై హిస్సాలాం, ఇజ్రాయేలీయులతో, 'మీరు 30రోజుల వరకు ఉపవాసవ్రతం పాటించి, ఆకాశం నుంచి మాయిదాను వర్షింపచేయమని అల్లాహ్‌ను ప్రార్థిస్తే ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికేదాని ప్రతిఫలం దొరుకుతుంది''అన్నారు. అప్పుడు క్రీస్తు మహనీయుల వారి వాక్కు ప్రకారం ఇజ్రేయెలీయులు 30రోజులు ఉపవాసాలు పాటించారు. దీంతో ఆకాశం నుంచి 'మాయిదా' అవతరించింది.

హ.. అమ్మార్ బిన్ యాసిర్(రజి) కథనం ప్రకారం, 'ఈ మాయిదాను ప్రజలు ఎంత తిన్నా తరిగేది కాదు'అందుకే మాయిదా అవతరణను క్రీస్తు మహనీయులు పండగ(ఈద్)తో పోల్చారు. అంటే, దేవుని అనుగ్రహాలను పొంది మనం సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్రఖురాన్‌లో కూడా ఇలా ఉంది. 'ప్రవక్తా! వారికిలా చెప్పండి. ఈ మహా భాగ్యాన్ని దైవం మీ కోసం పంపాడంటే, అది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి'(పవిత్ర ఖురాన్ 10-58).

దైవ కృప అపారం
మరో చోట.. 'మీ ప్రభువు అనుగ్రహాలను గురించి బాగా చర్చించండి, వాటిని దాటుతూ ఉండండి'అని ఉంది(పవిత్ర ఖురాన్ 93-11). నిజానికి రమజాన్ ఉపవాసాలు దైవం మానవులపై కురిపించిన అపార దయానుగ్రహాలు. పండగ ఆ అనుగ్రహాలను స్మరించుకుంటూ దైవానికి కృతాజ్ఞతాంజలులు సమర్పించుకొనే ఓ చక్కని సందర్భం.

అంతేకాకుండా ఈ పవిత్ర రమజాన్‌లోనే దైవం మానవాళికి మరో మహత్తర కానుక కూడా బహుకరించాడు. అదే పవిత్ర ఖురాన్ అవతరణ. ఇది సమస్త మానవాళికి సన్మార్గ ప్రదాయిని. మానవ కల్యాణం కోసం ఇంతటి మహత్తర, మహిమాన్విత గ్రంథ రాజాన్ని అవతరిపంచేసినందుకు, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకొని, ఆయన ఘనతను, కొనియాడండి.

ఆయనకు కృతజ్ఞతలు తెలపండి'(పవిత్ర ఖురాన్ 2-185) ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారం, హద్దుల్ని అతిక్రమించకుండా, దుబారాలకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు తావీయకుండా దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండగ.

ప్రవక్త ఏం చేసేవారు?
పండగ సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త(స)వారి ఆచరణ ఇలా ఉండేది. ఆయన పండగ నమాజును ఈద్‌గాహ్‌లో చేసేవారు. అందుకే ప్రవక్త సంప్రదాయన్ననుసరించి ఈద్ నమాజును ఊరి బయట బహిరంగ ప్రదేశంలో (ఈద్‌గాహ్‌లో)నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచ దేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం.

అయితే అనివార్య పరిస్థితుల్లో మాత్రం ఈద్ నమాజ్‌ను మసీదులోనే చేసుకోవచ్చు. ప్రవక్త వారు కూడా ఒకసారి వర్షం కారణంగా ఈద్ నమాజును మసీదులోనే చేశారు. కాబట్టి ఈద్‌గాహ్‌లో పండగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ప్రవక్త మహనీయులు ఉన్నంతలోనే కొత్త వస్త్రాలు ధరించేవారు.

శుక్రవారం నమాజుకు, పండగ నమాజులకు ధరించేందుకు ఆయనకు ప్రత్యేకంగా ఒక జత దుస్తులు ఉండేవి. పండగపూట మంచి బట్టలు ధరించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు వాడడం కూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్‌గాహ్‌కు వెళ్లే ముందు కొద్దిగా అల్పాహారం (అంటే ఆ రోజుల్లో ఖర్జూరాలు) తీసుకొనే వారు.

బక్రీద్ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్‌గాహ్‌కు వెళ్లేవారు. రమజాన్ నమాజును కాస్త ఆలస్యంగా బక్రీద్ నమాజును కాస్త తొందరగా చేసేవారు. ఈదుల్ ఫిత్ర్‌లో సదఖ, ఫిత్రా, ఈదుల్ అజహాలో ఖుర్బానీ ముఖ్య విధులు. యావత్ ప్రపంచంలో ఈ పండగను అత్యంత భక్తి ప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

పేదసాదలను ఆదుకోవాలి
కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండగ రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ధనవంతులు జకాత్, ఫిత్రాల రూపంలో తమను ఆదుకుంటారని వారు ఆశిస్తారు. కాబట్టి ధనవంతులు నిరుపేదల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. పండగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా, అభాగ్యులకు సాయం చేసి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రయత్నించాలి. ఇస్లామియా ధర్మశాస్త్రం డబ్బు దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా చేసేవారు సైతాన్ సోదరులని చెప్పింది.

అవసరార్థులకు, పేదసాదలకు ధనసాయం చేసేందుకు ఖర్చు చేయడాన్ని ప్రోత్సహించింది. అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. తద్వారా మనం ఆనందంగా ఉండడంతో పాటు సమాజమంతా ఆనందంగా ఉండాలన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండగ సమాజంలో ఈ విధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది.

సేమియా, షీర్‌ఖుర్మాల తీపితో పాటు కులమతాలకు అతీతంగా అందరి మధ్య ఆత్మీయతలు, అనుబంధాలను ప్రోది చేస్తుంది. ఎలాంటి అసమానత, అణచివేత, దోపిడీ, పీడన, దారిద్య్రం లేని ఓ సుందర సమాజ నిర్మాణానికి పండగలు దోహదం చేయాలని, రమజాన్ స్ఫూర్తి అందరి గుండెల్లో నిండుగా వెలగాలని కోరుకుందాం. 
* యం.డి. ఉస్మాన్ ఖాన్

Monday, May 17, 2010