Wednesday, December 15, 2010

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' * ఆ మత్తు వద్దు మన పిల్ల్లలకు .....

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' 'డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్లు....' 'డ్రగ్స్ వలలో యువత....' 'డ్రగ్స్ సేవనంలో సినీతారలు....' ఇవన్నీ దాదాపు ప్రతిరోజూ వార్తాపత్రికల్లో కనిపిస్తున్న హెడ్డింగులు. పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఈ శీర్షికలు కళ్లపడగానే గుండెల్లో గుబులు, భయం. ఒక్క క్షణం మన పిల్లలూ కళ్లముందు మెదులుతారు. ఆ...మన పిల్లలకెందుకు అలవాటవుతాయి ఇవి అన్న భరోసాతో పేపర్‌ని మడచి టీపాయ్ మీద పడేస్తాం. కాని వేగంగా దూసుకెళ్తున్న డ్రగ్స్ రాకెట్ మన పిల్లల్ని ఢీ కొట్టదన్న గ్యారెంటీ ఏంటి? అప్పుడేం చేయగలం? ఆలోచనల్లో పడ్డారు కదూ....ఇలాంటి ముందు జాగ్రత్త కలిగించడానికే మొదలైంది 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్‌సొసైటీ'. దాని గురించే ఇది...

సంవత్సరం కిందట...ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్.... ఇంట్లో మరిచిపోయిన ఆఫీస్ కాగితాలను తీసుకెళ్లడానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన ఫ్లాట్‌కు వచ్చింది కనూప్రియా సింగ్. ఫైల్ తీసుకుని తాళం వేస్తూ హడావుడిగా లిఫ్ట్ వైపు పరిగెడుతుంటే...ఎదురు ఫ్లాట్‌లో నుంచి పదహారేళ్ల అబ్బాయి అరుపులు వినిపించాయి గట్టి గట్టిగా...ఓ నలుగురు మనుషులు ఆ పిల్లాడిని పట్టుకుని బలవంతంగా ఈడ్చుకొస్తున్నారు బయటకు.

'భయ్యా....ఆహిస్తా...( అన్నా...మెల్లగా...) అంటున్నాడు గాభరాగా ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి ఆ నలుగురితో. బహుశా ఆ అబ్బాయి తండ్రేమో. తల్లి అనుకుంటా....నోట్లో పమిట చెంగు అదిమి పెట్టుకుని తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గుమ్మం దగ్గర కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల ఆడవాళ్లంతా పోగై ఆవిడను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయసాగారు. తండ్రేమో ఆ పిల్లాడితో కలిసి లిఫ్ట్‌లో కిందకి వెళ్లిపోయాడు. మౌనంగా వాళ్లనే అనుసరించింది కనూప్రియా సింగ్. కింద అంబులెన్స్‌లోకి ఎక్కించారు ఆ పిల్లాడిని బలవంతంగా. ఇంకా అరుస్తూ గింజుకుంటూనే ఉన్నాడు ఆ పిల్లాడు. కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.. తండ్రీ అంబులెన్స్ ఎక్కగానే అక్కడ్నుంచి కదిలింది అది.

'క్యా హువా భయ్యా...' పక్కనే ఉన్న వాచ్‌మన్‌ను అడిగింది కనూప్రియ.
'క్యాబోలూ మేడం...అంటూ చెప్పసాగాడు...' 304 వాళ్ల అబ్బాయండి....టెన్త్ చదువుతున్నాడు. ఎప్పుడు అలవాటైందో తెలియదు కాని డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. ఆరునెలల నుంచైతే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇంట్లో డబ్బులు పోతుంటే....ఎందుకో అనుమానం వచ్చి వాళ్ల నాన్న ఆరా తీస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి. స్కూల్‌కని ఇంట్లోంచి వెళ్తున్నాడు కాని అటెండెన్స్ లేదట.

సెకండ్ టర్మ్ ఫీజు కట్టమని డబ్బులిచ్చి పంపితే...ఆ డబ్బుతో డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసింది. కానీ అప్పటికే శృతిమించిపోయింది. ఇప్పుడు డీ ఎడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారు మేడం...చాకులాగా ఉండేటోడు పిల్లోడు... ఎట్ల అయిపోయిండు. ఫుట్‌బాల్ బాగా ఆడేవాడు. చాంపియన్ అయితడని కలలు కన్నడు వాళ్ల నాన్న...ప్చ్,...పిల్లల్ని కంటం కాని వాళ్ల తలరాతలను కంటమా..?' అంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు వాచ్‌మన్.

హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్
అంతా విన్న కనూప్రియాసింగ్ దిగాలు పడింది. ఆఫీస్‌కు వెళ్లిందే కాని మనసు మనసులో లేదు. డ్రగ్స్ దుష్ప్రభావాలను, వాటి బారిన పడుతున్న యువతకు సంబంధించిన సమాచారాన్ని చూసింది నెట్‌లో. ఇంకా దిగ్భ్రమ చెందింది తెలిసిన వివరాలను చూసి. లాభం లేదు...జాతి భవిష్యత్తు ఇలా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకున్న కనూప్రియాసింగ్ ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో ఉన్న స్నేహితులందరికీ ఫోన్ చేసి అంతకుముందు రోజు తమ అపార్ట్‌మెంట్లో జరిగిన విషయాన్నంతా చెప్పింది పూసగుచ్చినట్టు.

తర్వాత తనకు వచ్చిన ఆలోచనలూ పంచుకుంది. 'నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని...ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిన పనులు. మనకెక్కడ వీలవుతుంది' ఒక స్నేహితుడి కామెంట్. 'బాగా చెప్పావు. స్వంత పనులకే టైమ్ దొరక్క ఛస్తుంటే...ఇంకా ఈ సమాజసేవను ఎక్కడ నెత్తినెట్టుకునేది?' ఇంకో స్నేహితురాలి విరుపు. దాదాపు అందరూ కుదరదనే తేల్చారు.

'ఒక్కసారి ఆలోచించండి...రేప్పొద్దున ఈ జాబితాలో మన పిల్లలూ ఉండొచ్చు' హెచ్చరించింది కనూప్రియ.
'మన పిల్లలా..?' ఉలిక్కిపడ్డారు అంతా.
'అవును. మనమేమీ ఈ సమాజానికి దూరంగా తీసుకెళ్లి వాళ్లను పెంచలేం కదా. పరిస్థితుల నుంచి పారిపోయే కంటే. నెమ్మదిగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్..మనకు సెలవు దొరికిన సమయాల్లో స్కూళ్లకు వెళదాం. డ్రగ్స్, వాటి దుష్ప్రభావాలు గురించి పిల్లలకు అవగాహన కల్పిద్దాం ' అని ఒప్పించే ప్రయత్నం చేసింది.

అందరూ ఆలోచించి కనూప్రియాసింగ్ ప్రతిపాదనకు ఓటేశారు. అట్లా రూపుదిద్దుకుంది డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పనిచేసే 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ సొసైటీ' అనే సంస్థ.
వెబ్‌సైట్‌లో
ముందుగా పాఠశాల యాజమాన్యాల అనుమతి తీసుకుంటూ...వారాంతపు సెలవుల్లో హైస్కూలు పిల్లలకు డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రారంభించారు ఈ స్నేహితుల బృందం. ఆ బృందంలో ఒకరైన ఎల్లిగారం నాగరాజు హైదరాబాదులో ప్రాపర్టీమేనేజ్‌మెంట్ కన్సల్టన్సీని స్థాపించి ఓ వైపు వ్యాపారం చేసుకుంటూనే మరోవైపు హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ పనులనూ కొనసాగిస్తున్నారు. బోయిన్‌పల్లిలో నివాసముంటున్న నాగరాజు ఆ దగ్గర్లోని స్కూళ్లకు వెళ్లి డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంస్థ తాము చేసిన, చేస్తున్న కార్యక్రమాల వివరాలతో 'హ్యాపీలైఫ్‌వెల్‌ఫేర్. ఒఆర్‌జి (జ్చిఞఞడజూజీజ్ఛఠ్ఛీజూజ్చట్ఛ.ౌటజ) అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది.

విశేష స్పందన
తమ వెబ్‌సైట్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని చెప్తూ ఇ. నాగరాజు 'మా ఈ కృషిని కేవలం స్కూలు యాజమాన్యాలే కాదు...తల్లిదండ్రులూ గుర్తించడం మొదలుపెట్టారు. ఎంతోమంది పేరెంట్స్ మా సంస్థలో సభ్యులమవుతామని ముందుకు వస్తున్నారు. చాలామంది సభ్యులయ్యారు కూడా. మా సేవలు ముంబై, బెంగుళూరు వంటి అన్ని ప్రధాన నగరాలకూ విస్తరించాయి. ఎవరికి ఎక్కడ వీలుంటే అక్కడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నాం.

హైదరాబాదులో రోజూ పేపర్లలో వస్తున్న డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు చూస్తుంటే...మా కార్యక్రమాలను ఇక్కడ ఇంకా విస్తృతం చేయాలని నిర్ణయించాం. జనవరిలో మా ఢిల్లీ బృందం కూడా ఇక్కడికి రానుంది. ఇక్కడ తల్లితండ్రులకూ అవగాహనా క్యాంపులు నిర్వహించాలనుకుంటున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ మాది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి చేరొచ్చు. ఒక్క స్కూలు పిల్లలకే కాదు కాలేజీ విద్యార్థులకూ అవగాహనా కార్యక్రమాలున్నాయి.
డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులను కాపాడేందుకు కౌన్సిలింగ్, డీ ఎడిక్షన్ లాంటి సేవలనూ అందిస్తున్నాం. జంటనగరాల తల్లితండ్రులను మేము కోరేది ఒక్కటే...మా సేవలను తీసుకోవడమే కాక మా సంస్థలో చేరి మీరూ మీకు తెలిసిన వాళ్లను చైతన్యపర్చండి. జాతి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి' అని విన్నవించారు.
సరస్వతి రమ 
ఫోటోలు: రాజ్‌కుమార్

అష్టావక్రులు అనే రింగు లీడర్లు 'రాజ'మార్గంలో దారి దోపిడీ

పేదలను కొట్టి పెద్దలకు పంచి..
రూ.35వేల కోట్లు వెనకేసుకున్న అక్రమార్కులు
భూ సేకరణలో భారీ గోల్‌మాల్
అస్మదీయులకు అభయ హస్తం
మాటిమాటికీ మారిన రూటు
ప్రతిసారీ బక్కరైతులే బలి
విపక్షాలపైనా ప్రలోభాల వల
సీబీఐ విచారణకు సహాయ నిరాకరణ
50... 70... 80... 90... 100.... 120.... స్పీడో మీటర్ గిర్రున తిరుగుతుంది. విలాసాల వాహనం సర్రున దూసుకుపోతుంది. వారెవ్వా... ఔటర్ సూపర్! కానీ... ఔటర్ రింగ్ రోడ్డు కింద వేల బతుకులు నలిగిపోయాయని, అక్రమార్కులకు ఇది రాచబాట వేసిందని, కుంభకోణాలకు 'రాజా' వంటిదని కొంచెం లోతుల్లోకి వెళితేనే తెలుస్తుంది. రాజా వారు, ఆయన అనుచర వర్గం కోసం అనేకసార్లు రింగులు తిరిగిన ఔటర్ భూతం పేద రైతులను బలి చేసింది.

అసలు ప్రయోజనాల కంటే పెద్దలకు కాసుల వర్షం కురిపించే ప్రాజెక్టుగా ఇప్పటికే విజయం సాధించింది. తన లేఖలో జలయజ్ఞంలో అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించిన కొండా సురేఖ ఊహకు కూడా అందనన్ని మలుపులు తిరిగింది. అన్ని వ్యవస్థలను నిర్యీర్యం చేస్తూ అక్రమాల మధ్యనే సాగిన ఔటర్ రోడ్డు నిర్మాణం రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం. అప్పటి సీఎం వైఎస్, ఆయన ఆంతరంగికుడు కేవీపీ కలిసి నడిపించిన మంత్రాంగం! అప్పటి హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి, సెక్రటరీ వెంకట్రామ రెడ్డి కనుసన్నల్లో జరిగిన మాయాజాలం!

రంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 15 : ఔటర్‌తో హైదరాబాద్ దశ, దిశ మారుతుందని అప్పట్లో ఊదరగొట్టారు. ఆ మాటలో నిజమెంతోగానీ... దీనివల్ల చాలామంది దశ, దిశలు మారిపోయాయి. కొందరు కోట్లకు పడగలెత్తారు. మరికొందరు తిరిగి లేవలేనంతగా పడిపోయారు. దీనివల్ల లబ్ధిపొందిన వారిలో మన రాష్ట్ర నేతలే కాదు... ఒకరిద్దరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

ప్రతిపక్షానికి చెందిన నాయకులూ 'రింగ్' అయ్యారు. పార్టీలకు అతీతంగా పెద్దలంతా, ఔటర్ పాపాన్ని తలా తట్టెడు పంచుకున్నారు. రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న పెద్దల భూములకు నష్టం వాటిల్లకుండా... నోరులేని బక్క రైతుల భూముల మీదే రింగు రోడ్డు వేశారు. దీనికోసం కొన్నిచోట్ల మూడుసార్లు మ్యాప్‌లో మార్పు చేర్పులు చేశారు. ఔటర్ గోల్‌మాల్‌కు పాల్పడిన వారిలో 20 మంది ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు. వీరి విజయానికి ఔటర్‌లో కొట్టేసిన డబ్బులే పెట్టుబడి అయ్యాయి.

భూసేకరణ అస్త్రం
ఔటర్ రింగ్‌రోడ్డు దోపిడీలో కనిపించినంత వైవిధ్యం మరెక్కడా కనిపించదేమో! ఈ దోపిడీలో తొలి అంకం... భూసేకరణ. ఈ చట్టాన్నే బూచిగా చూపి 'ఇస్తావా? చస్తావా?' అంటూ పేదరైతుల మెడపై కత్తి పెట్టారు. వారి భూములు లాక్కున్నారు. అదే సమయంలో... కొందరు పెద్దలు ముందుగానే రంగంలోకి దిగి రైతులపై వల వేశారు. "మీ భూమి ఔటర్‌లో పోతుంది.

ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇస్తాం. మాకే విక్రయించండి'' అంటూ ముందే భూములు కొన్నారు. ఆ తర్వాత తమ పలుకుబడి ఉపయోగించి ఔటర్ మార్గాన్ని మార్పించి, తాము కొన్న భూముల ధరలు అమాంతంగా పెంచుకున్నారు. ఔటర్ ఆలోచన, అది వెళ్లే మార్గం ముందే తెలిసిన ముఖ్య నేతలు, వారి బంధువులు, అనుచరులు ముందే రంగంలోకి దిగి... సమీప ప్రాంతాల్లో భారీగా భూములను కొనేశారు.

ఎకరా రూ.లక్షల్లో కొనుగోలు చేసిన భూములను రూ.10 నుంచి 15 కోట్ల చొప్పున విక్రయించుకున్నారు. అలాగే... 'మా భూములు పోకుండా చూడండి' అని ఆశ్రయించిన వాళ్లకు పాలకులు అభయ హస్తం ఇచ్చారు. వారి దగ్గర ముడుపులు పుచ్చుకుని... అలైన్‌మెంట్ మార్చేశారు. జంక్షన్లు, ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌ల పేరుతో అలైన్‌మెంట్లు మార్చారు. ఈ మొత్తం ప్రక్రియలో బలైపోయింది అమాయకులైన రైతులే.

వేసిందే రోడ్డు..
ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్రియలో అప్పటి అధికారులు గీసిందే మ్యాపు... వేసిందే రోడ్డుగా మారింది. ప్రమాణాల ప్రకారం 250 గజాల వెడల్పు ఉండాల్సిన రహదారి... ఒక్కోచోట సగానికి పడిపోయింది. అటూ ఇటూ ఉన్న వారి ఆస్తులను టచ్ చేయకుండా... రోడ్డే కుచించుకుపోయింది. గండిపేట చెరువు వద్ద పర్యావరణ కారణాలు చూపుతూ అలైన్‌మెంట్ మార్చేశారు.

అదేసమయంలో... కండ్లకోయి వద్ద చెరువులోంచే రోడ్డును వేశారు. ఏం జరిగినా, ఎందుకు మార్చినా కారణం ఒక్కటే! అస్మదీయుల భూములను కాపాడటం! గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల పెద్దల భూములను సేకరించినా... వారికి పుష్కలంగా పరిహారం అందించారు. ప్రత్యేక ప్యాకేజీలు తయారు చేశారు. పేదలపై మాత్రం వివక్ష ప్రదర్శించారు.

నష్ట పరిహారం ప్యాకేజీ నిర్ణయించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గనుల శాఖమంత్రి సబితారెడ్డితో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏ ఒక్కరితోనూ చర్చించకుండానే ప్యాకేజీ రూపొందించడం విశేషం.

అందరూ... ష్ గప్‌చుప్!
ముంజేతి కంకణం చూడటానికి అద్దం అవసరంలేదు. అలాగే... ఔటర్ రింగ్ రోడ్డులో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని చెప్పేందుకు ఎలాంటి విచారణలూ అక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ చిక్కిపోయిన రోడ్డు, ముమ్మార్లు మారిన ప్లాన్, ఆ సమయంలో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే... నాటి పాలకులు నిస్సిగ్గుగా, నిర్భయంగా అక్రమాలకు పాల్పడినట్లు ఇట్టే తెలిసిపోతుంది.

అయినప్పటికీ... దీనిపై విపక్షాలు పెద్దగా ఆందోళనలు చేయలేదు. సర్కారును నిలదీయలేదు. కారణం... నాటి పెద్దలు నయానో భయానో వారందరి నోళ్లను మూయించారు. 'మీ భూములకు భంగం వాటిల్లకుండా చూస్తాం' అని ప్రలోభపెట్టో... 'మీ భూములనూ మింగేస్తాం జాగ్రత్త!' అని భయపెట్టో వాళ్లను దారికి తెచ్చారు.

రకరకాలుగా వారికి ఎర వేశారు. అప్పట్లో సీపీఐ, బీజేపీ మాత్రమే అంతో ఇంతో ఔటర్ అక్రమాలపై గళమెత్తాయి. మిగిలిన పార్టీలన్నీ గప్‌చుప్! 'ఔటర్ అక్రమాలపై ఆందోళన చేద్దాం రండి' అని చంద్రబాబు పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరూ ముందుకురాని పరిస్థితి!

ఒక ప్రాజెక్టు చేపట్టినప్పడు కొందరు భూములు కోల్పోవడం సహజమే! కానీ... ఒకరి భూములు కాపాడేందుకు మరొకరిని బలి చేయడమే ఔటర్‌లో జరిగిన పాపం. ఈ రహదారి కోసం జరిపిన భూసేకరణలో సుమారు పది వేల కుటుంబాలు నష్టపోయాయి. ఇందులో నాలుగు వేల మంది రైతులుకాగా... మరో ఆరువేల మంది ప్లాట్లు, ఇళ్లు కోల్పోయారు.

వ్యవస్థలపై దాడి
ఔటర్ రింగు రోడ్డులో అక్రమాలపై 'ఆంధ్రజ్యోతి' అనేక కథనాలు ప్రచురించింది. అయినా... పాలకుల్లో చలనం లేదు. ప్రశ్నించిన వ్యవస్థలపై ఎదురుదాడికి దిగారు. పత్రికల యాజమాన్యాలపై దాడులకు పురిగొల్పారు. ప్రతిపక్షాలను చీల్చారు. పత్రికల్లో కథనాలకు 'కౌంటర్'గా జనం సొమ్ముతో అనుకూలమైన ప్రకటనలు ఇచ్చారు.

అప్పట్లో విపక్షాలు డిమాండ్ చేయడమే ఆలస్యమన్నట్లుగా అనేక అంశాలపై వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ధీరోదాత్తుడిగా మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత సీబీఐ విచారణను తనదైన శైలిలో మడత పెట్టేసేవారు. రింగ్ రోడ్డు విషయంలోనూ అదే జరిగింది. సీబీఐ విచారణను ఆయన నీరుగార్చారు. వాస్తవాలు బయటకు రాకుండా అధికారులను కట్టడి చేశారు.

సర్కారు సహాయ నిరాకరణ చేస్తోందంటూ సీబీఐ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు మొరబెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు... అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు ఇప్పుడు ప్రమోషన్లు పొంది ఎంచక్కా మంచి పోస్టుల్లో వెలిగిపోతున్నారు. పేద రైతులు మాత్రం పెద్దలు చేసిన పాపాలకు బలైపోయి కుమిలిపోతున్నారు. వీరికి సమాధానం చెప్పేదెవరు? వీరి ఆవేదనలు తీరేదెన్నడు?

హైకోర్టు తీర్పే నిదర్శనం
ఔటర్ రింగురోడ్డులో భాగంగా కండ్లకోయిలో జరిగిన భూసేకరణపై ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. మొత్తం భూసేకరణ తీరుపైనే అనుమానాలను వ్యక్తం చేసింది. కండ్లకోయిలో పెద్దల కోసం మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చారు.

ఇతరుల భూములు, పక్కనే చెరువు మీదుగా రోడ్డు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బాధితులు హైకోర్టుకెక్కారు. 55 ఎకరాల్లో అక్రమంగా భూసేకరణ జరిగినట్లు కోర్టు తేల్చి చెప్పింది. ఒక్కచోట జరిగిన భూసేకరణలోనే ఇంత గోల్‌మాల్! మరి... 162 కిలోమీటర్ల పొడవునా ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉండాలి?

* ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.5500 కోట్లు. కానీ.. ఈ భూసేకరణను అడ్డుపెట్టుకుని రాజుగారి మందీ మార్బలం రూ. 35 వేలకోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టుకుంది.
* ఇందులో సాధారణ ప్రజలు రూ.10వేల కోట్లు నష్టపోగా పెద్దలు అంతకు ఎన్నో రెట్లు అధికంగా లబ్ధిపొందారు.
* నష్ట పరిహారం పంపిణీలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో తప్పుడు రికార్డులు సృష్టించి 16 ఎకరాల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం పొందారు.
* హయత్‌నగర్ మండలం బాచారంలో సుమారు 25 లక్షల రూపాయలను అక్రమంగా చెల్లించారు.

అంతా ఇష్టానుసారం...
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రింగురోడ్డును ఇష్టానుసారంగా నిర్మిస్తోంది. పెద్దల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా... ఒక్కో చోట ఒక్కో విధంగా వెడల్పు తగ్గించారు. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ జంక్షన్ వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. నార్సింగ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు 125 మీటర్లు, శంషాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు 150 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు.
click here

Tuesday, December 14, 2010

ఔరౌర... నాగవల్లి నగలు

లక లక లక.. అంటూ భయపెట్టిన చంద్రముఖి ఇప్పుడు ఔర.. ఔర.. అంటూ నాగవల్లిగా వస్తోంది. ఆమె ఆంగికం, అభినయమే కాదు.. ఆమె ఆభరణాలు కూడా ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికల నగలు ఒక ఎత్తయితే హీరో వెంకటేష్ నగలు మరో ఎత్తు. సినిమా విడుదలవ్వకముందే క్రేజ్ సంపాదించుకున్న ఈ నగలను రూపొందించింది ఎవరో తెలుసా? క్రిసాలా జ్యువలరీ అధినేత్రి బంటి బజాజ్. ఆమె గురించి.. ఆమె రూపొందించిన నగల గురించే ఈ కథనం.
బాలీవుడ్‌లో జోధాఅక్బర్, దేవదాసు చిత్రాల్లో నటీనటులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ఆ సినిమాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా మొదలయ్యింది. సినిమా పేర్లు పడుతున్నప్పుడు కనిపించే కాస్ట్యూమ్స్ టైటిల్‌తోపాటు ఈ మధ్య స్టయిలింగ్ అని మరో కొత్త టైటిల్‌ను కూడా వేస్తున్నారు తెలుగువాళ్లు. చాలామంది తారలకిప్పుడు పర్సనల్ స్టయిలిస్ట్‌లున్నారు. అయితే కొందరు ఇంకో ముందడుగు వేసి ప్రత్యేక జ్యువలరీ డిజైనర్లను నియమించుకుంటున్నారు.

అరుంధతి సినిమాలో అనుష్క, సింహ సినిమాలో నయనతారలు ధరించిన నగలు అలా రూపొందించినవే. అయితే తెలుగు సినిమాల్లో హీరోతో సహా దాదాపు అన్ని ముఖ్య పాత్రలకోసం ప్రత్యేక జ్యువలరీని తయారుచేసిన క్రెడిట్ మాత్రం నాగవల్లి సినిమాకే దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాల్లో ఎక్కువగా గిల్టీనగలనే వాడతారు. కానీ నాగవల్లి సినిమాలో తారలందరూ మేలిమి బంగారు ఆభరణాలనే ధరించారు. పైగా అవి ఆయా పాత్రల స్వభావాలకు అద్దం పట్టేలా ప్రత్యేకంగా రూపొందించారు బంటి బజాజ్.

ఏవరీ బజాజ్?

బంటి బజాజ్ పక్కా హైదరాబాదీ. కాకపోతే ఎక్కువకాలం ముంబయిలోనే ఉన్నారు. ఆమె 1993లో హైదరాబాద్‌కి వచ్చి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తుండేవారు. ఎన్నో ఫ్యాషన్ షోలను నిర్వహించారు. ఆమెకి చిన్నప్పటి నుంచీ జ్యువలరీ డిజైన్ చేయడంలో ఆసక్తి ఉండేది. ముంబయికి వెళ్లాక చిన్న చిన్న నగలను డిజైన్ చేయడం మొదలెట్టారు. చాలామంది బాలీవుడ్ తారలతో పరిచయాలు ఉండడంతో మొదట్లో ఆమె రూపొందించిన నగలను వారికి కానుకగా ఇస్తుండేవారు. అయితే ఆమె దీన్ని వృత్తిగా కాకుండా కేవలం హాబీగానే భావించేవారు.

అయితే ఆమె నగలను ఇష్టపడేవారు తమకోసం నగలు డిజైన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అడిగేవాళ్లు. అలా అడిగిన వారిలో అనిల్ కపూర్ భార్య సునీల్ కపూర్, రాణీముఖర్జీ, టబు, సోనాక్షి, విద్యాబాలన్ ఉన్నారు. బంటి బజాజ్ వారికోసం ఎన్నో నగలను ప్రత్యేకంగా రూపొందించారు. హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చే స్తూనే, ముంబయి ముద్దుగుమ్మలకు ఆభరణాలు రూపొందిస్తున్నప్పుడు త్రిభువన్‌దాస్ శ్రీకాంత్ జవేరీ ప్రోత్సాహంతో 2001లో పుల్‌టైమ్ డిజైనర్‌గా మారిపోయారు.
డిజైనర్‌గా..
బంటి బజాజ్‌కు ఎన్నో ఫ్యాషన్ షోలతో అనుబంధం, ఆమె ఆభరణాల పట్ల బాలీవుడ్ తారలకు సైతం ఆసక్తి ఉండడంతో ఆమె డిజైనర్‌గా గుర్తుంపు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. లాక్మే ఫ్యాషన్ షోలో ఆనంద్ కాబ్రా, నీతూ లుల్లా లాంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దుస్తులకు జ్యువెలరీని రూపొందించారు. సొంత సిగ్నేచర్ జ్యువలరీని రూపొందించాలన్న ఆలోచనతో 2006లో క్రిసాలా జ్యువలరీ పేరుతో హైదరాబాద్‌లో షోరూమ్ ప్రారంభించారు. ఆ తర్వాత ముంబయి, పూణెల్లో కూడా బ్రాంచీలను మొదలుపెట్టారు. ఈ విషయం పక్కన పెడితే బంటి బజాజ్‌కు డి. రామానాయుడు కుటుంబంతో చాలాకాలంగా అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే నిర్మాత సురేష్ బాబు నాగవల్లి సినిమా కోసం ప్రత్యేకంగా జ్యువలరీని రూపొందించాల్సిందిగా కోరారు.

ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో నేను చేసిన రాజు పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకులను ఒక్క క్షణంలో ఆ కాలానికి తీసుకువెళ్లడానికి ఒక కొత్తదనం కావాలి. అందుకు ఆహార్యం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అన్ని పాత్రలకీ ప్రత్యేకంగా కాస్టూమ్స్‌ని, జ్యువలరీని డిజైనింగ్ చేయించారు నిర్మాతలు. అందుకు రమా రాజామౌళి స్టయిలింగ్, బంటి బజాజ్ రూపొందించిన ఆభరణాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సినిమా విడుదలవ్వకముందే ఆ ఆభరణాల పట్ల ఏర్పడ్డ క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
- వెంకటేష్, కథానాయకుడు

నాగవల్లికి అనుగుణంగా..
'అవకాశం వచ్చినంత మాత్రాన అయిపోలేదు.. అసలు కథ అక్కడే మొదలయింది నాకు. ఈ నగల గురించి చెప్పాలంటే ఆ సినిమా కథ సగం చెప్పాల్సి వస్తుంది. అందుకే క్లుప్తంగా చెపా'్తనని మొదలెట్టారు బంటి బజాజ్. 'చంద్రముఖి చూసిన వారికి నాగవల్లి సినిమా పట్ల కొంత అవగాహన ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఉండాలన్నది మా ఉద్దేశ్యం. కథ, పాత్రల గురించి విన్న తర్వాత నా పరిశోధన మొదలుపెట్టాను. సినిమా రెండు భాగాలుగా ఉంటుంది.. ప్రస్తుతం.. గతం.. రెండు ఎపిసోడ్‌లలో కనిపించే జ్యువలరీ విభిన్నంగా ఉండాలి.

మోడ్రన్ జ్యువలరీ రూపొందించడం పెద్ద కష్టమేం కాదు.. ఫ్లాష్‌బ్యాక్ కోసం అప్పటి రాజులు, రాణులు, సామాన్యులు వాడిన దుస్తులు, ఆభరణాల గురించి పుస్తకాలు తిరగేశాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల గురించి, నిజాం నవాబుల గురించి, తంజావూరు గురించి చదివి కొంత నోట్స్ రాసుకున్నాం. తర్వాత సినిమాలో పాత్రలు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నాం. మేళవిస్తూ 200కు పైగా ఆభరణాలని రూపొందించాం. ఇందుకు ఆరునెలల సమయం పట్టింది' అని చెప్పారు బంటి బజాజ్.

నేను నటించిన అరుంధతి సినిమాలో కూడా నా పాత్రకోసం ప్రత్యేకంగా నగలను రూపొందించారు. ఆ ఆభరణాలను నా పాత్రకి ప్లస్ అయ్యాయి. ఆ పాత్రకి నాకు మంచి పేరొచ్చింది. కాకపోతే అవన్నీ గిల్ట్ నగలు. ఒరిజినల్ జ్యువలరీతో నటించడం మాత్రం ఇదే తొలిసారి. ఆనాటి కాలాన్ని డిజైనర్లు తమ ఆభరణాలతో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. అరుంధతి పాత్రలాగే ఈ సినిమాలో నా పాత్ర మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
- అనుష్క శెట్టి, కథానాయిక

ఎవరికి ఏ ఆభరణాలు..
నాగవల్లి సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వెంకటేష్, అనుష్కలతో పాటు కమలినీ ముఖర్జి, రిచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్‌లకు బంటి బజాజ్ ఆభరణాలు రూపొందించారు. ఈ అన్ని పాత్రలకూ రమా రాజమౌళి స్టయిలింగ్ చేశారు. ఒక సీన్ కోసం ఆమె ఎంచుకున్న దుస్తులను ఫోటో తీసి, క థలో ఆ సీన్‌ను బట్టి ముందుగా బొమ్మలు గీసుకున్నారు బంటి బజాజ్. సినిమాలో తమిళనాడులోని తంజావూరు నేపథ్యం కొంత ఉంటుంది. అందుకే కథనాయికల ఆభరణాల కోసం అక్కడ గుళ్లలో కనిపించే బొమ్మలు, పుస్తకాల్లో చదివిన ఆ కాలం నాటి డిజైన్లను ఎంచుకున్నారు.

ఒడ్డాణం, వంకీలు, జడ, కాసులదండ, ఉంగరాలను బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలు ఉపయోగించి రూపొందించారు. వెంకటేష్‌ది విజయనగరానికి చెందిన రాజు పాత్ర. ఈ పాత్ర కోసం ఎక్కువగా నిజాం నగలను, దక్షిణ భారతాన్ని పాలించిన రాజులు వాడిన ఆభరణాలను రూపొందించారు. సర్పెంచ్(రాజులు తలపాగాకు పెట్టుకునేవి), కమర్‌బంద్(షేర్వాణీ మీద మెడలో వేసుకునే ఆభరణం), బాజూబంద్(భుజాలకు కట్టుకునే కంకణాలు), మెడ నుంచి భుజాల వరకు వేలాడే పచ్చల హారాలు రాజు పాత్ర కోసం రూపొందించారు.
- బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫోటోలు: రాజ్‌కుమార్

Thursday, December 9, 2010

పెళ్లకాని ప్రసాదులు * యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ....

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెబుతుంటారు. ఆ ముచ్చట్లో పెళ్లి కూడా ఒకటి. అయితే ఈ మధ్య యువకులు వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కళ్యాణపీట మీద కూర్చోవడం ఆలస్య మవుతుండడంతో పెళ్లికాని ప్రసాదులుగా పేరు తెచ్చుకుంటున్నారు. కెరీర్‌కు అధికంగా ప్రాధాన్యతనిస్తూ తమ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమం లో పెళ్లికాని ప్రసాదుల వయస్సు మూడు పదులకు చేరుకోవడం, దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ఉన్నాయి...

marriageప్రతి ఏడాది రెండు, మూడు పెళ్లిళ్ల సీజన్‌లు ఉంటాయి.అనుకూలంగా ఉండే పెళ్లి ముహూర్తాలను పెట్టుకొని వివిధ సమయాల్లో యువతీ యువకులు పెళ్లిచేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్‌ నగరంలోని యువతీ యువకులు తమ కెరీర్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే పెళ్లిచేసుకోవాలని వారు భావిస్తూ తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం కారణం వల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే కాదు, కుదేలయిన అనేక రంగాల వల్ల నగర యువత కొంతమంది పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు.దీంతో వారి వయస్సు 30కు చేరుకోవడంతో పాటు కొన్నిసార్లు ఆ వయస్సు కూడా దాటి పోతోంది.

నగరాల్లోనే...
ప్రధానంగా నగరాల్లోని తల్లిదండ్రులు పిల్లల చదువుపెైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు అనుకున్నవారు పిల్లలకు కళ్యాణం చేస్తున్నారు. తరువాత వారి చదువుని కొనసాగిస్తున్నారు.మరికొంత మంది ఉద్యోగం వచ్చే వరకు ఎదురుచూస్తున్నారు. అలా అబ్బాయిలకు దశాబ్దంన్నర క్రితం 21 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. అప్పుడు అబ్బాయిలకు 25 దాటగానే పెళ్లికాని ప్రసాద్‌లని పిలిచేవారు. అయిదు,ఆరు సంవత్సరాల నుంచి ఆ వయసు క్రమేణా పెరుగుతోంది. ఇప్పుడు 26, 27 ఏళ్లు వచ్చి నా ఏమంత వయసు వచ్చింది అని సమర్ధించుకునేవారు ఎక్కువెై పోతున్నారు.ఉద్యోగం రేపో మాపో వచ్చేస్తోంది. ఉద్యోగం రాగానే తలంబ్రాల కార్యక్రమమే అని సమాధానమిస్తున్నారు.

నౌకరి సంపాదించిన తరువాతనే పెళ్లి చేసుకోవడానికి యువత ఆసిక్తి చూపిస్తున్నారు. అలా ఎదురు చూస్తు 30 ఏళ్లు దాటిపోయినవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పెరిగిన పోటీ, సవాళ్లతో యువత పోరాడుతోం ది. ఉద్యోగం సంపాదించినా కొంతమంది పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వచ్చేది తక్కువ జీతం, అది నా అవసరాలకే సరిపోవడం లేదు. ఇంకా వచ్చే భార్యని ఎలా పోషించను అని అం టున్నారు. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నా తప్పించుకుంటున్నారు.వేతనాలు పెరిగిన వెంటనే ఇంటి వాడినవడానికి సిద్ధమని హామీ ఇస్తున్నారు.

యువకుల అభిప్రాయాలు... :
ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ఈ నాలుగురోజులెైనా బిందాస్‌గా గడపనీ అని చెప్పేవారు ఒకరెైతే, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదని మరొకరు, ఉద్యోగంచేసే అమ్మాయి ఉండాలని కోరుకునే యువకులు నేడు ఎందరినో చూడవచ్చు.

అమ్మాయిలదీ అదే వరుస... :
BRIDGEతమ కాళ్లఫై నిలబడాలని అమ్మాయిల్లో పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. కాబోయే భర్త తెచ్చే జీతం మీద ఆధారపడేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది.అబ్బాయిలకు సరిసమానంగా నేడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి కి అబ్బాయిల కంటే పెళ్లిచేసుకోమని ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.అయినా తల్లిదండ్రులకు నచ్చచెప్పినచ్చి న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులెైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారు.వివాహం ఆలస్యమైనా జీవితంలో స్థిరపడడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు.

పల్లెల్లో... :
ఉద్యోగాలఫై ఆధారపడని, కార్మికులుగా, కూలిపనిగా చేసే గ్రామీణ కుటుంబాల్లో ఇది వరకు అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. దాన్ని పెద్ద తప్పుగా భావించేవారు కాదు. గ్రామాల్లో అబ్బాయి లు ప్రస్తుత సమాజంపెై అవగాహన ఏర్పరుచుకుంటున్నా రు. 25 ఏళ్లు కూడా లేవు నాకింతలోకే పెళ్లి ఎందుకని తల్లిదండ్రులను అడుగుతున్నారు. పెద్దలు ఇతర కుటుం బ సభ్యుల ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తోందని యువకులు వాపోతున్నారు. పల్లెల్లో చెల్లెలికి, అక్కకి పెళ్లి కాలేదని వయసు పెరిగిపోయే వారు ఎక్కువగా కనిపిస్తారు.

పల్లెపడుచులు... :
పల్లెల్లో అబ్బాయిగాని, అమ్మాయి పుట్టగానే వారికి జోడిని కుదుర్చుకోవడం ఆచారం. రక్తసంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు వయసు రాగానే కళ్యాణం కానిచ్చేవారు. ఇలా అనేకచోట్ల జరుగడం తెలిసిందే. క్రమంగా పల్లెటూర్లలో కూడా మా ర్పు వస్తోంది. ఆడపిల్లకి పెళ్లి అయ్యేవరకు చదివిస్తున్నారు.అంటే వీరి ఉద్దేశ్యం పదవ తరగతి వరకు. పదవ క్లాసుకు ముందు కూడా మంచి వరుడు దొరకగానే పెళ్లి చేసేస్తున్నారు. ఎక్కువ ఆస్తి ఉన్నవారు, తక్కువ కట్నం అడిగేవారు వస్తే అమ్మాయిలకు16 ఏళ్లు దాటకపోయినా మూడు ముళ్లు వేయించేస్తున్నారు.

మార్పు సహజం... :
యువతలో కాలనుగుణంగా చైతన్యం  వచ్చింది. సాదాసీదాగా బతికేయాలని అనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఏ రంగమైనా తమకంటూ గుర్తింపు రావాలని యువతీ యువకులు తపిస్తున్నారు. దాంతో పోటీ పెరగడంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి కొంత సమయం పడుతుందని ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలో పడి వయసు గురించి పట్టించుకోకపోతే సంతాన సాఫల్య సమస్యలను ఎదుర్కోవలిసి ఉంటుందని వెైద్యులు తెలియచేస్తున్నారు. లక్ష్యంపెై స్పష్టత, ఆత్మవిశ్వాసం తోడుంటే మూడు పదుల వయసు వరకూ వేచి చూడకుండా విజయాలను సొంతం చేసుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Monday, December 6, 2010

నేనెందకు ప్రవక్తపై పుస్తకం రాశాను?

                                     భిన్న  మతాల చరిత్రలను లోతుగా అధ్యయనం చేసి వాటిని వర్తమానానికి అన్వయించుకొని విశ్లేషించటం చాలా క్లిష్టమైన కళ. దీనిలో నిష్ట్ణాతురాలు క్యారన్ ఆంస్ట్రాంగ్. ఆమె రాసిన 'హిస్టరీ ఆఫ్ గాడ్' పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయింది. 30 భాషాల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆంస్ట్రాంగ్ రాసిన మరో పుస్తకం - 'ముహమ్మద్: ఏ బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్'. దీని అనువాదాన్ని హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం.

సల్మాన్ రష్డీ రచించిన 'సెటానిక్ వెర్సెస్' వివాదం, ఫత్వా సందర్భంగా, పది సంవత్సరాల క్రితం నేను ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను. అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారు కూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనపరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ఇరవయ్యో శతాబ్దంలో జరిగిన దారుణమైన సంఘటనల తరువాత కూడా ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా ఉన్న ఒక మతం పట్ల మనం అస్ఫుటమైన అసత్యమైన అభిప్రాయాలను పెంచి పోషించకూడదనిపించింది. సల్మాన్ రష్డీపై అయెతుల్లా ఖొమైనీ ఫత్వా విధించినపుడు ఈ అహేతుక ద్వేషం అనేక పశ్చిమ దేశాలలో మరింత ప్రత్యక్షంగా కనపడింది.

1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న 45 రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఈ ఫత్వాని ఖండించారు. అది ఇస్లామ్ మత విరుద్ధమన్నారు. అయినా బ్రిటన్‌లో ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సౌదీ అరేబియా షేకులు, కైరోలోని అల్ అజ్‌హర్ మదర్సా కూడా ఈ ఫత్వా ఇస్లామ్ మత వ్యతిరేకమైనదన్నది. కానీ ఇదంతా పశ్చిమ దేశాలవారు వినదలచుకోలేదు. అయెతుల్లాతో విభేదించేవారూ, రష్డీని చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది ఉన్నారు.

అయితే సల్మాన్ రష్డీ తన నవలలో ముహమ్మద్ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వీరిని తీవ్రంగా కలత పెట్టింది. పశ్చిమ మేధావులు మాత్రం , ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ళ జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటిష్ రచయితలు, మేధావులు, తత్వవేత్తలు కూడా ఇస్లాముని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనపరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గది కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్టింల సున్నితమైన మనోభావాలను వారు పట్టించుకోలేదు.

అదంత ముఖ్యమైన విషయం కాదనుకున్నారు. ముహమ్మద్ గురించి రష్డీ చెప్పింది మాత్రమే పశ్చిమ దేశాల పాఠకులు చదవడం విచారకరం అనిపించింది. రష్డీ నిజంగా తన నవలలో ఏం చెప్పదలిచాడో నేను అర్ధం చేసుకోగలిగినప్పటికీ, ఒక గొప్ప వ్యక్తి నిజమైన జీవిత కథ అందరికీ తెలియాలనే నేనీ పుస్తక రచనకి పూనుకున్నాను. నాకు ప్రచురణ కర్త దొరకడం కూడా కష్టమైంది.

ఎందుకంటే నా లాంటి మహిళ, వారి ప్రవక్త గురించి వ్రాస్తే ముస్లిమ్‌లకి కోపం వచ్చి నేను కూడా రష్డీ వలె రహస్య జీవితం గడపవలసిన పరిస్థితి సంభవం కావచ్చు అని చాలామంది భావించారు. కానీ నా పుస్తకానికి ముస్లిముల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించడం నన్నెంతో కదిలించింది. నేనీ పుస్తకం కేవలం సంచలనం సృష్టించడానికే వ్రాయలేదని నమ్మారు. తరువాత పది సంవత్సరాలలో పశ్చిమ దేశాలలో ఉన్న ఈ 'ఇస్లామోఫోబియా' తగ్గుతూ వచ్చింది. ముస్లిములకి వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు.

ఇప్పుడు విద్యుద్ఘాతం వంటి సెప్టెంబర్ పదకొండు సంఘటన - న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రమూ, పెంటగాన్‌లో ఒక భాగమూ ధ్వంసమైన తీరు - ముస్లిమ్ ఉగ్రవాదులు ఈ దారుణ మారణకాండకి తలపడి దాదాపు 5000ల మంది మరణానికి కారంణం కావడం, పశ్చిమ దేశాలలో ముస్లిమ్ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్‌పై ఉండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది. ముస్లిములు హింసనూ తీవ్రవాదాన్నీ సమర్ధించే మత మౌడ్యులనే భావనను ఈ ఘోరమైన చర్య స్థిరపరిచింది.

ఈ విపత్కర సంఘటన తరువాత ఒక నెలకి నేనీ ఉపోద్ఘాతం వ్రాస్తున్నాను. ఇదొక ప్రత్యేక సందర్భం. ఇస్లామ్, హింసను సమర్ధిస్తుందనే భావాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాద వివాదాల్లో చాలామంది కుర్ఆన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. ఇటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్, జ్యూయిష్ మత గ్రం«థాలలో కూడా ఇటువంటి కలహశీలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయని మర్చిపోయారు.

జ్యూయిష్ బైబిల్‌లో అతి పవిత్రమైనదిగా భావించే 'తోరా'లో ఇజ్రాయిల్ వారిని, వారికి ప్రభువు వాగ్దానం చేసిన భూమినించి తరిమికొట్టమని, వారి పవిత్ర చిహ్నాలను ధ్వంసం చెయ్యమనీ ఉంది. వారితో ఎటువంటి ఒడంబడికలూ ఉండకూడదంది. కొంతమంది యూదు మతవాదులు, ఇలాంటి వాటిని పాలస్తీనియన్లపై హింసను సమర్ధించడానికి వాడుకుంటారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపన ప్రక్రియను విమర్శించడానికి కూడా వాడుతుంటారు. కాని జుడాయిజమ్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరూ ఈ వాక్యాలను ప్రామాణికంగా తీసుకోరు. వాటిని ఆ విధంగా వాడుకోవడం న్యాయవిరుద్ధమంటారు.

జీసస్‌ని ఎల్లప్పుడూ శాంతికాముకునిగా భావిస్తాము. కానీ కొన్ని గోస్పెల్స్ ఆయన్ని పోరాటశీలునిగా కూడా చిత్రిస్తాయి. ఒక సందర్భంలో ఆయన, తను శాంతిని కాక ఖడ్గాన్ని తెచ్చానంటాడు. అయితే ఎవరూ కూడా సెబ్రెనీసాలో క్రిష్టియన్ సెర్బులు 8000ల మంది ముస్లిములని చంపినపుడు ఈ వాక్యాన్ని ఉల్లేఖించలేదు. ఎవరూ క్రైస్తవ మతం హింసను ప్రోత్సహిస్తుందనలేదు. అటువంటి ఆరోపణలు చెయ్యడం అనుచితం అని చాలామందికి తెలుసు. పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.

(సెప్టెంబర్ ఘాతుకానికి పాల్పడిన) తీవ్రవాదులు తాము ముహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తున్నామనుకోవడం నన్నెక్కువ బాధ పెట్టింది. ఈ దాడికి కీలకమైన వ్యక్తిగా భావించే ఒసామా బిన్ లాడెన్, ముహమ్మద్ ప్రవక్త జీవిత విధానంలోని సనాతన వాదాన్ని (ఫండమెంటలిజమ్) అనుసరించాడు. సయ్యిద్ ఖుతుబ్ అనే ఈజిప్షియన్ మేధావి మొట్టమొదట చేసిన ఫండమెంటలిస్టు సూత్రీకరణ ప్రకారం ముహమ్మద్ జీవితం ఒక దివ్య సాక్షాత్కారం. భగవంతుడు ముహమ్మద్‌కు చెప్పిన మార్గం ఒక్కటే సత్సమాజ స్థాపనకు మార్గం.

(ఖుతుబ్‌కి 1966లో ప్రెసిడెంట్ జమాల్ అబ్దుల్ నాజర్ మరణశిక్ష విధించాడు.) ముహమ్మద్ ప్రవక్త ముస్లిములు చెప్పే 'జాహిలియా'ని (అంటే చీకటి యుగం) అంతం చేయడానికి పోరాడాడు. ఈ జాహిలియా అనే పదాన్ని ముస్లిమ్‌లు రాక ముందు అరేబియాలో ఉండి అవినీతి, బర్బరత్వం రాజ్యమేలిన కాలానికి ప్రతీకగా వాడతారు. ఖుతుబ్ అభిప్రాయం ప్రకారం ప్రతి యుగంలోనూ ఒక జాహిలియా ఉంటుంది. కనుక ఇరవయ్యో శతాబ్దంలో కూడా ముహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తూ తమ ప్రాంతాల్లోని జాహిలియాని నిర్మూలించాలి. ఇందుకోసం వాళ్లు ముందుగా ప్రధాన స్రవంతిగా ఉన్న 'జాహిలి' సమాజం నుంచి విడివిడి అంకిత భావంతో పని చేసే ఒక అగ్ర నాయకత్వాన్ని తయారు చెయ్యాలి.

జిహాద్ రూపకర్త కాకపోవటమే కాక ముహమ్మద్ (నిజానికి) శాంతి కాముకుడు. శాంతి స్థాపకుడు. శాంతి స్థాపనకు ప్రాణాలను కూడా లెక్కచెయ్యని వ్యక్తి, మక్కాతో రాజీకోసం తన సన్నిహితుల మద్దతును కూడా వదులుకున్న వాడు....మొండిగా చనిపోయేవరకూ యుద్ధం చేసేకన్నా సంప్రదింపులతో రాజీ మార్గం అవలంబించడం మంచిదని భావించాడు. ఈ వినయం, సర్దుబాటులే విజయ సాధన మార్గాలయాయని కుర్ఆన్ కూడా పేర్కొంది. ఈ సంక్లిష్ట సమయంలో మనం ప్రవక్త జీవితాన్ని తెలుసుకోవడం అవసరం.

తమ స్వలాభం కోసం ముస్లిమ్ అతివాదులు ముహమ్మద్ జీవితాన్ని వక్రీకరించడాన్ని మనం ఒప్పుకోకూడదు. అమితంగా మారిపోయిన ఈనాటి ప్రపంచంలో మనం ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోడానికి కూడా మనం ముహమ్మద్ జీవితాన్ని చదవాలి. పశ్చిమ దేశ వాసులమైన మనకి ఎప్పుడూ ఇస్లాంతో సరిపడలేదు. ఆ మతాన్ని గురించి మనకి చాలా అహంకారపూరితమైన, మొరటు అభిప్రాయాలుండేవి. తీసిపారేసే చూపు ఉండేది. మనం ఇంకా అటువంటి అజ్ఞానంతో అపార్ధాలతో కూడిన వైఖరి అవలంబించలేమని ఇప్పుడు తెలియ వచ్చింది. ఈ పుస్తకం చివరన నేను ప్రఖ్యాత కెనెడియన్ పండితుడు విల్ ఫ్రెడ్ క్యాంట్వెల్ స్మిత్ వాక్యాలని ఉల్లేఖించాను.

ఆయన రచనలు నాకు నిరంతర స్పూర్తిదాయకాలు. ఇరవయ్యో శతాబ్దపు సవాళ్ళను జయప్రదంగా ఎదుర్కోవాలంటే పశ్చిమదేశాలూ, ఇస్లామిక్ ప్రపంచమూ కూడా గట్టి కృషి చెయ్యాలని ఆయన 1956లోనే హెచ్చరించాడు. ముస్లిములు పశ్చిమ సమాజాన్నీ, పశ్చిమం సాధించిన విజయాలనూ అంగీకరించాలనీ, అట్లాగే పశ్చిమ దేశవాసులు కూడా ముస్లిములను తమకన్నా తక్కువవారుగా కాక సమానులుగా చూడాలనీ అన్నాడు.

పాశ్చాత్య నాగరికతా, క్రైస్తవ మత ధర్మశాస్త్రమూ కూడా తక్కిన వారిని సరైన గౌరవ మర్యాదలతో చూడ్డం నేర్చుకోకపోతే ఆ రెండూ కూడా ఇరవయ్యో శతాబ్దపు వాస్తవాలను ఎదుర్కోలేవని ఆయన అన్నాడు. ఈ క్రమంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ - సెప్టెంబర్ విషాదం, అటు పాశ్చాత్యులూ, ఇటు ముస్లిములూ కూడా ఈ పరీక్షలో నెగ్గలేదని తేల్చింది.

ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లిమ్‌లను అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాట పోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి. అందుకు ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు. ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.