Thursday, September 15, 2011

1948 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ జ్ఞాపకాలు- గాయాలు

సెప్టెంబర్ 17 దగ్గరపడింది. 63 ఏళ్ళ క్రితం నిజాంపాలన అంతమై నైజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు అది. చాలాకాలం దాన్ని 'విమోచన దినం'గా జరుపుకున్నా ఇటీవల కాలంలో దాన్ని 'విద్రోహ దినం'గా పరిగణిస్తున్నవాళ్లూ ఉన్నారు. ఆనాటి పరిస్థితులను తెలియజేసే కొంతమంది కథనాలతో పరవస్తు లోకేశ్వర్ ఇటీవల తీసుకొచ్చిన 'నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవవీరులు, 1948 సెప్టెంబర్ పోలీసు యాక్షన్ జ్ఞాపకాలు - గాయాలు' పుస్తకం నుంచి వెంకటమ్మ అనే సీనియర్ హిందీ పండిట్ కథనాన్ని మీకు అందిస్తున్నాం...

"నా పేరు వెంకటమ్మ. సీనియర్ హిందీ పండిట్ టీచర్‌ను. ఇప్పుడు నా వయస్సు 55 సంవత్సరాలు. తేదీ జ్ఞాపకం లేదు. కాని 1944లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‌లనే. నాకప్పుడు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు. యాఖుత్‌పురా దగ్గర్ల ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ సంబరంగ తియ్యటి జిలేబీలు తిన్న. మా అమ్మమ్మ నన్ను వెంబడి పెట్టుకుని అవతలి బస్తీలకు తీసుకపోయి మూడు రంగుల జండాలను చూపెట్టింది. అంతా హడావుడి పండుగ వాతావరణం. లౌడ్ స్పీకర్లల్ల దేశభక్తి గీతాలు వస్తున్నయి. స్వాతంత్య్రం వచ్చింది అన్న మాటలు నా చెవులల్ల బడ్డయి. అయితే అది రెండవ స్వాతంత్య్రదినం, పోలీస్ యాక్షన్ జర్గిన తర్వాత 15-08-49 అని నాకు చాలా కాలానికి తెల్సింది.

నిజానికి హైద్రాబాద్ స్టేట్ ప్రజలకు అది మొదటి స్వాతంత్య్ర దినం క్రిందనే లెక్క.

సరే ఇప్పుడు నేను నిజాం పరిపాలన చివరి సంవత్సరాలలో జరిగిన రజాకార్‌ల దినాలు, 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీస్ యాక్షన్ సంగతులు, అవి మా కుటుంబంపై, ముఖ్యంగా నా బాల్యంపై వాటి ప్రభావం గురించి వివరిస్త. ఒక పెద్ద తుఫాను వచ్చినపుడు ఆ గాలివానకు ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మా ఎట్లా చలించి చెదిరి పోతయో అట్లనే మామూలు వ్యక్తుల జీవితాలు కూడా రజాకార్ మరియు పోలీస్ యాక్షన్ దినాల తాకిడికి చెల్లాచెదరై కష్టాలకు కన్నీళ్లకు గురయినాయి. అట్ల ఎంత మంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు తల క్రిందులయినాయో? వాళ్లు హిందువులైతేనేం? ముస్లింలైతేనేం?

మా బాపుకు బీదర్ దగ్గరల టీచర్ ఉద్యోగం. నా బాల్యం అక్కడే గడచింది. కాని రాజాకార్ల గడ్‌బడ్‌లు ప్రారంభమయ్యేసరికి మా బాపు అమ్మను పిల్లలందర్ని హైద్రాబాద్‌ల అమ్మమ్మ ఇంట్ల వదిలిపెట్టిండు. నెలకో, రెండు నెలలకో ఒకసారి వచ్చిపోయేది. అవతల రజాకార్ల భయం, ఇంట్ల మా మధ్య ఎడబాటు. మా అందరి జీవితాలు అల్లకల్లోలం అయినాయి. అమ్మ - బాపులకే కాదు, మా చిన్నపిల్లల జీవితాలలో కూడా సుఖశాంతులు దెబ్బతిన్నాయి. అమ్మతోపాటు, మా అక్క, నేను, ఒక తమ్ముడు. పెరట్లో రెండు గదుల రేకుల షెడ్లో ఉండేవాళ్లం.

బాపు కోసం ఏడుస్తూ....

ప్రతిరోజు నేను మా బాపును తలచుకొని ఆయన కోసం బెంగతో ఏడ్చేదాన్ని. మా ఎడబాటుకు, దుఃఖానికి మూలకారణాలు నాకు తెలియవు కదా! రాత్రిళ్లు బాపు కావాలని నేను ఏడుస్త్తుంటే అక్క అమ్మలాగ వోదార్చేది. అప్పుడు అమ్మ ఉస్మానియా దవఖానలో ప్రసవం కోసం ఉంది. నిండు గర్భిణి. నా మోకాళ్లకన్నీ గజ్జిపుండ్లు అయినవి. క్రిందపడినపుడు అవి పగిలి రక్తం, చీము కార్తుంటే ఓదార్చేవారు లేక బాపూ బాపూ అని ఏడ్చిన. అక్క ఇంటికీ దవఖానకు కాలినడకన పొద్దు మాపు చెక్కర్లు కొట్టేది. రిక్షాలెక్కటం పెద్ద విలాసం, పైస గల్లోల్ల పని. ఇక ఇంట్ల మా తమ్మునికి పెద్ద జ్వరం. డాక్టర్లు, మందులు ఏమిలేవు. అవుతల బజార్లల్ల బస్తీలల్ల హిందు - ముస్లింల కొట్లాటలు, రజాకార్ల దౌర్జన్యాలు. నేను తమ్ముని మంచం పక్కనే వాణ్ణి చూస్తూ కూర్చునేదాన్ని. నాల్గురోజుల జ్వరం తర్వాత వాడికి పోలియో ఎఫెక్ట్ అయ్యి ఒక కాలు చచ్చు పడిపోయింది. అమ్మ పొత్తిళ్లల్లో ఆడపిల్లను పెట్టుకుని ఇంట్లకు రాంగనే కొడుకు కాలు కుంటి కాలయ్యిందని తెల్సి గుండెపగిలి పెద్దగ ఏడ్చింది. ఆ కాలం అట్ల ఆటుపోట్లకు, అలల తాకిడికి గురికాకపోతే, మా వ్యక్తిగత జీవితాలల్ల అటువంటి విషాదాలు జరుగక పోయేటివి కాదా?

పోలీస్ యాక్షన్ దినాలు సెప్టెంబర్ నెల కదా! అప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు, చలి. ఆ వర్షం ముసురు చప్పుడుకు మా రేకుల షెడ్డు పెద్దగా శబ్దంచేసేది, ఇల్లంతా కారేది. రాత్రిల్లు నిద్ర కరువు. తమ్ముడు కాలు వేలాడేసుకుని మంచంలోనే ఉండేవాడు, అట్ల మా ఇంట్ల పేదరికంతో పాటు అవిటితనం కూడా తోడయ్యింది. కాలుకు నాటు వైద్యం చేయించింది అమ్మ. రోజుల తరబడి వాడికి చప్పిడి మెతుకులు, కారం పత్యం. వేడి పప్పన్నం కోసం రోజూ ఏడిచేవాడు. అదే నెలల వినాయక చవితి పండగ వచ్చింది. అమ్మమ్మ ఇంట్ల పాశం (పాయసం) సువాసనలు. దానికోసం వాడు సుదీర్ఘంగా ఏడుపు. అమ్మ బాలింత. చెల్లె పాలకోసం ఏడుపు. నేను బాపు కావాలని ఏడుపు. తమ్ముడు అవిటి వానిగనే కుంటుకుంటు రెండు మూడేండ్లు బ్రతికి, చివరికి ట్రాన్సిల్స్ రోగంతో చచ్చిపోయిండు. అప్పుడు వానికి ఆరేండ్లు. నిండ ఏడేండ్లు దాటకుండనే నూరేండ్లు నిండినయ్. ఈ విషాదాల కన్నీటికి మూల కారణాలు ఆనాటి సామాజిక పరిస్థితులే అని నేను బలంగా నమ్ముతున్నాను.

దినదిన గండంగా...

మా మామ కూడా స్కూల్ టీచర్ కనుక అన్ని సంగతులు ఆయనకు తెలుస్తుండేవి. రాత్రిపూట సిగరెట్ తాక్కుంట నిద్రపోకుండ, బెంచిమీదనే కూచోని, ఏదో దీర్ఘాలోచన చేస్తుండేవాడట. అమ్మ రాత్రిపూట నిద్రలేచి "ఏందన్నా అట్ల కూచున్నవ్, నిద్ర పోలేదా? అని అడిగితే "ఏం లేదమ్మా నిద్రపట్టలేదు'' అని దిగులుగ జవాబు ఇచ్చేటోడట. ఆ రోజులల్ల మా ఇండ్ల ముందుకు పొద్దుటిపూట మాదన్నపేట, సయిదాబాద్‌ల నుండి ఎరుకల ఆడవాళ్లు వచ్చి మాంసం అమ్మేటోళ్లు. గంపలల్ల వాట్ని పట్టుకొచ్చేది. వాళ్లు రవికెలు వేసుకోకపోయేది. వాల్ల నల్లటి శరీరాలు ఆ పొద్దుటపూట లేత ఎండలో మెరిసిపోవటం నేను బాగా గమనించేది.

మా మామ వాళ్లతో " రేపట్నించి మీరు రాకండి. పరిస్థితులు బాగలేవు, ఇట్ల తిరగకుండ్రి'' అని హెచ్చరించడం నాకు బాగా జ్ఞాపకముంది. యూనియన్ సైన్యాలు హైద్రాబాద్‌పై దాడి చోయబోతున్నాయని పుకార్లు మొదలయినాయి. నిజాం సర్కార్ ప్రతిరోజు రాత్రిపూట నగరంల బ్లాక్ అవుట్ చేసేది. నగరం అంతా చీకటి. కరెంట్ బంద్. బ్లాక్ అవుట్‌కు ముందు ఆకాశంలో ఎర్రలైట్ కాంతి వెలిగి పెద్దగా సైరన్ మోగేది, ఆ సిగ్నల్స్‌తో ఇండ్లల కూడా దీపాలు ఆర్పటం, కరెంట్ తీసేయటం చేయాలి. మా ఇంట్లో అందరు కూడా ఇంటి డాబా మీదికెక్కి విమానాలు వస్తున్నయా అని వాటి లైట్ల కాంతుల కోసం వెదికేవాళ్లం. విమానాలు వచ్చి మమ్మల్ని రక్షిస్తాయని ఎదురు చూసెటోళ్లం.

సరే పరిస్థితులన్నీ అట్ల ఉద్రిక్తంగ ఆందోళనగ ఉన్నప్పుడే బక్రీదు పండుగ సమీపించింది. ఆ పండుగకు కొన్ని రోజుల ముందు రజాకార్ల సమావేశంల దాని నాయకుడు కాసిం రజ్వీ ప్రసంగిస్తూ "ఈసారి బక్రీద్‌కు ఖుర్బానీగ గొర్రెల్ని కాదు, హిందువుల తలల్ని ఇవ్వాలని'' రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చిండు. కాని హిందువుల అదృష్టం కొద్దీ ఆ బక్రీద్ పండుగకన్న ముందే పోలీస్ యాక్షన్ జరిగి, హిందువులు రక్షింపబడ్డరు.

అయితే అతని ప్రకటన వినగానే హిందువుల గుండెలల్ల రైళ్లు పరిగెత్తినవి. ముఖ్యంగ హైద్రాబాద్ పట్నంల ఇక ఎట్లనన్న చావుతప్పదని, హిందువులు తాగటం, తినటం, విందులు చేసుకోవడం మొదలు పెట్టిండ్రు. మా మామ కూడా అన్ని కోపాలు తాపాలు మరచిపోయి ఇంట్ల పెద్ద దావతు ఏర్పాటు చేసిండు. పూరీలు, గారెలు, కోడిమాంసం, కల్లు, సారా అన్ని ఏర్పాట్లు చేసిండు. అందరికి దగ్గరుండి తృప్తిగ తినిపించిండు. అయితే ఆడోళ్లకు, పిల్లలకు ఈ అనుకోని సంబరాలేమిటో అర్థం కాలే. ఇప్పుడు పండుగలు ఏమీ లేవుకదా అని అడిగితే "మీకెందుకు తినరాదుండ్రి'' అని మెత్తగ కోపడ్డడు. కాని అసలు సంగతి చెప్పలే. మేము బెదురతమని, భయపడతమని. పోలీసు యాక్షన్ అయినంక తెల్లారి అసలు సంగతి చెప్పి"మనం బ్రతికి పోయినం. ఈ మిలిట్రీ రాకపోతే బక్రీద్ పండుగకు గొర్రెల్ని కోసినట్లు మనందర్నీ కోసేది'' అని సంతోషం ఆపుకోలేక అందర్ని కావలించుకుని ఏడ్చిండు.

జైహింద్..పలకరింపులు

సైన్యం వచ్చినంక ఇక ఆ సంబరాలు ఏమని వర్ణించను. పట్నంలనే కాదు, పల్లెపల్లెనా హిందువులు సైన్యానికి స్వాగతాలు పలికిండ్రు. హారతులు ఇచ్చిండ్రు. ఎక్కడ చూసిన గాంధీకీ జై, నెహ్రూకీ జై, భారత్ మాతాకీ జై నినాదాలు. ప్రతి గల్లీ మలుపులు, చౌరస్తాలల్ల, ఇండ్లమీద మూడు రంగుల జండాలు రెపరెపలాడినయ్. ఏ ఇద్దరు కల్సుకున్నా జై హింద్ అని పలకరింపులు.

పోలీస్ యాక్షన్ అయినంక తెల్లారి సాయంత్రం మేం ఆడపిల్లలం చాలా స్వేచ్చగా, సంతోషంగా గొబ్బెమ్మల పూజ చేసుకున్నం. ఆ సంతోష సందర్భంల నాకు మా ఇంటి ముందు రోడ్డు మీద ఆశ్చర్యం కల్గించే దృశ్యం కానవచ్చింది. ముందు మిలట్రీవాళ్లు మార్చ్‌పాస్ట్ చేస్తుంటే, వెనక మిలిటరీ ట్రక్కులు నెమ్మదిగ నడుస్తున్నయ్. ప్రతి ట్రక్కుకు పూల దండలు, గాంధీ నెహ్రు బొమ్మలు. ఆ మిలిట్రీ డ్రెస్సులు, టక్క టక్క బూట్ల చప్పుడు, వారి నెత్తుల మీద చిప్పటోపీలు చూడటం నాకు జీవితంల మొదటిసారి. ఆ దృశ్యాలు నా మనస్సుల నాటుకపోయినయి. "లిబరేషన్ ఆర్మీ'' అన్న పదం నాకు అప్పుడు తెలువదు కదా!

ఇక ఆ తెల్లవారి ఉదయం పది పదకొండు గంటలకు నేను ఇంటి ముంగిట అరుగు మీద ఆడుకుంటున్న. ఎందుకో తల ఎత్తి చూసేసరికి గల్లీ ప్రారంభంల, మసీదు పక్కనుండి వస్తున్న బాపు కనబడ్డడు. బాగా మాసి దుమ్ము పట్టిన దోవతి, కోటు మీద కండువా, చేతిల బట్టల సంచీ, చెదిరిన జుట్టూ... ఇదీ ఆయన రూపం. ఉత్త చేతులతోటి మా ముందుకు రావొద్దని ఆ సంచీల ఒక సేరు పుట్నాల పప్పు తీసుకొని వొచ్చిండు. నేను సంతోషం పట్టలేక బాపూ బాపూ అని అరుచుకుంట ఎదురుంగ ఉరికి ఆయన కాళ్లని గట్టిగా కావలించుకున్న. బాపు నవ్వుకుంట నన్ను ఎత్తుకొని ఇంట్ల కాలు బెట్టిండో లేదో పెంకలు ఎగిరిపోయేటట్లు "అమ్మా బాపు వొచ్చిండు'' అని గట్టిగ ఒర్లిన. అందరు పరిగెత్తుకొచ్చిండ్రు. బాపును కావలించుకుని అందరు ఏడ్చిండ్రు. బాపు కూడా ఏడ్చిండు.

స్కూల్లో చేరాను...

ఆ తర్వాత పోలీస్ యాక్షన్ కంప్లీట్ అయ్యి గడ్‌బడ్‌లన్నీ సద్దుమణిగినంక బాపు మమ్మలందర్నీ తీసుకుని తను పనిచేసే ఊరు కవేలీకి తీసుకపోయిండు. నాంపల్లి స్టేషన్ల రైలెక్కినం. మా స్వంత ఇంటికి మేం పోతున్నం అన్న సంతోషం మా అందరి ముఖాలల్ల వెలిగిపోయింది. నాకు ఆ ఊరు బాగా తెల్సిన ఊరే కదా! రైలుల కిటికీ పక్కన కూర్చుని బాపుతో విడవకుండ ముచ్చట్లు చెప్పిన. నీతోటి నేను కూడా రేపట్నించి బడికొస్త అని చెప్పిన. ఆ బడిల నా దోస్తులు నరేందర్‌రెడ్డి, శివారెడ్డిలు బాగున్నారా? వాళ్లు కలుస్తరా? అని అడిగిన. బుచ్చిరెడ్డి తాత ఎట్టున్నడు, మన చప్రాసి మామూ ఎట్లున్నడు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మా బాపు కసురుకోకుండ, విసుక్కోకుండా ఓపికగ అరటిపండు వొలిచి నోట్లె పెట్టినట్టు జవాబులు చెప్పెటోడు. ఆయన నన్ను ముందే సైకలాజికల్‌గ ప్రిపేర్ చేయించాలనుకున్నట్టుంది. చాలా నెమ్మదిగ నాకు సమ్‌జాయించిండు. చప్రాసీ మామూ లేడమ్మా, ఆయన వేరే స్కూలుకు తబాదలా అయ్యిండు. అది చాలా దూరం మనకు ఇక కనబడడు. మన బడి కూడా మునుపటిలాగ ఉండదు. దాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా కొత్త స్థలంల కొత్త బడి పెట్టుకుందాం అన్నడు.

ఆ తెల్లారి సాపాటు చేసి బాపు చిటికెన వేలు పట్టుకుని బడికి పొయ్యేసరికి నా గుండె గబిల్లుమంది. ఇంకెక్కడి స్కూలు అంతా కాలిపోయింది. కూలిపోయింది. మసిబారిన మొండిగోడలు నిలబడి ఉన్నయ్. నా నోట్లె మాట కరువయ్యింది. దుఃఖం పొంగుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న బాపు నన్ను దగ్గరికి తీసుకుని ఈపు నిమిరిండు. ఒక సంవత్సరం అక్కడున్నమో లేదో బాపుకు హైద్రాబాద్‌కు తబాదలా అయ్యింది. అలియాబాద్ స్కూల్‌కు మారిండు. నేను శంశీర్‌గంజ్‌లోని శారదా గర్ల్స్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్న''
 
వెంకటమ్మ
ఇంటర్య్వూ తేదీ: 15-06-99
సీనియర్ హిందీ పండిట్
మహాబూబియా గర్ల్స్ హైస్కూల్, హైదరాబాద్

Monday, April 18, 2011

చారిత్రాత్మక సంపాదకు చెర

శతృదుర్భేధ్యం గోల్కొండ కోట


కుతుబ్‌షాహిలు శతృదుర్భేధ్యంగా నిర్మించిన కోట లోని పలు నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా దక్కన్ సంస్కృతీ - సంప్రదాయాలు, రాజులు, రాణులు, వారి జీవన శైలి నాటి ప్రజల ఆచార వ్యవహారాలు ముఖ్యంగా యుద్ధ తంత్ర కళా నైపుణ్యానికి గోల్కొండ కోట సాక్షీభూతంగా నిలిచింది. సుమారు 500 ఎకరాలకు పైగా విస్తరించిన గోల్కొండ కుతుబ్‌షాహిల కాలంలో వజ్ర-వైఢూర్యాలు, మంచి ముత్యాలకు అరుదైన వర్తక వాణిజ్యంకు కేంద్రం.

సుమారు నాలుగు వందల అడుగుల ఎత్తైన పర్వతంపై కోటగోడలురాతితో నిర్మించారు. కోటలోపల మందుగుండు సామగ్రి నిల్వ చేసే మందిరాలు, సైనిక స్థావరాలు, మంత్రుల కార్యాలయాలు, రాణిమహల్‌లు, ఉద్యానవనాలున్నాయి. అంతే కాకుండా ఫతే దర్వాజా- మూసా బురుజులకు మధ్య వాయవ్యదిశలో దివాన్ మహల్ ఉంది. అప్పట్లో దీన్ని తానీషా కొలువులో పని చేసిన అక్కన్న- మాదన్నలు కార్యాలయంగా వినియోగించారు. అలాగే బాలాహిస్సార్ దర్వాజాకు ఎదురుగా రెండు కమాన్‌లు హబ్సికమాన్‌లున్నాయి. రాజభవనాలకు కిందిభాగంలో జీలుఖానా ఇలీ మైదానం వుంది. దీనికి సమీపంలోనే శిధిలమైన మసీదు ఉండేది. సైనిక వందనం కోసం ఈ మైదానాన్ని వినియోగించేవారు. అలాగే కోట పై భాగంలో కొండపై కన్పించే సుందర నిర్మాణం బాలాహిస్సార్. కుతుబ్‌షాహి మందిరాలు, విధాన సభ హాల్, మూడు అంతస్థులో బరాదరినిర్మాణం ఉంది.

దీని పై అంతస్థులో రాతి సింహాసనం ఉండేది. బాలాహిస్సార్ మొదటిగేట్ నుంచి బరాదరి వరకు సుమారు 360 మెట్లున్నాయి. బరాదరిలో మొదటిది దర్బార్-ఎ- ఆమ్ (ఇక్కడికి సామాన్య ప్రజలను అనుమతించేవారు) రెండోది దర్బార్-ఎ-ఖాస్ ( ఇక్కడ మంత్రి వర్గ సమావేశాలు నిర్వహఙంచేవారు), మూడో అంతస్థులో కుతుబ్‌షా ఏకాంత మందిరం. ఇక క్రింది వైపు రామదాసు బందిఖానా, అక్కన్న మాదన్నలు నిర్మించిన జగదాంబ మందిరం, మసీదులున్నాయి. గోల్కొండకు సుమారు అయిదు కిమీ దూరంలోని దుర్గం చెరువు నుంచి కోటపైభాగానికి నీటిని పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఆ కాలంలో ఉండేవట. అంతే కాకుండా గోల్కొండ నుంచి చార్మినార్ వరకు రహస్య సొరంగమార్గం ఉండేదని ప్రచారం.
 
 
కుతుబ్‌షాహి పాదుషాల స్మృతి సౌధలకు 'యునెస్కో' గుర్తింపు దక్కేనా..?

గోల్కొండ కోటకు వా యువ్య దిశలో వంద ఎకరాల తోట ఇ బ్రహీంబాగ్‌లో వెలిసిన ఏడుగురు కు తుబ్‌షాహి పాదుషాల స్మృతి సౌధల ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తింపు పొందాల్సి ఉంది. కానీ చుట్టూ వెలిసిన అక్రమ నిర్మాణాలతో అస్తవ్యస్థంగా మారడంతో యునెస్కో గుర్తింపునకు నోచుకోలేదు.కుతుబ్‌షాహి నిర్మాణాల పేరి ట గుర్తించేందుకు అనువుగా అక్రమణలు తొలగించి పర్యాటకులను ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్ది ప్రతిపాదనలు పంపితే గుర్తింపు దక్కే అవకాశం ఉం టుందని ప్రతినిధులు సూచించారు.ఈ మేరకు రాష్ట్ర పురాతత్త్వ శాఖ అధికారులు రెండో సారి గోల్కొండ టూంబ్స్ పై సమగ్ర సమాచారాన్ని సేకరించి యునెస్కోకు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా 525 ఏళ్ల క్రితం నాటి కుతుబ్‌షా సమాధుల నిర్మాణాలు ప్రపంచవారసత్వ సంపదజాబితాలో చేరేఅవకాశం ఉంటుంది.

కుతుబ్‌షాహి వంశంలో తొలి రాజు సుల్తాన్ కులీ కుతుబ్‌షా (1543) నుంచి ఆ వంశంలో ఏడో రాజు అబ్దుల్లా ఖుతుబ్‌షా (1614-1672) వరకు సమాధులు ఈప్రాంతంలోనే ఉన్నా యి.చివరి రాజు సుల్తాన్ అబ్దుల్ హసన్ తానీషా (1672-1687) అధికారంలో ఉండ గా ఔరంగజేబు దండయాత్రతో బందీ గా మారి ఔరంగాబాద్‌లో 12 ఏళ్లు కారాగారవాసం చేసి మరణించాడు.దీంతో ఆయన సమాధి గోల్కొండలో నిర్మించలేదు. తోట ఉత్తర దిశలో మొ దటి సుల్తాన్ కులీ కుతుబ్‌షా సమాధి ఉంది. దానికి సమీపంలోనే ముగ్గురు పాదుషాలు జంషీద్ కుతుబ్‌షా (1543-1550), సుబాన్‌కులీ కుతుబ్‌షా (1550-1551), ఇబ్రహీం కులీ కుతుబ్‌షా (1550-1580) సమాధులున్నాయి. వీటికి దక్షిణ భాగంలో హైదరాబాద్ నగర వ్యవస్థాపకులు మ హ్మద్‌కులీ కుతుబ్‌షా (1580- 1612) సమాధి ఉంది. విశిష్ట వాస్తు నిర్మాణం. దీనికి సమీపంలోనే ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా మసీదు ఉంటుంది.

ఆగ్నేయ భాగంలో ఆరవ సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612-1626) సమాధి, ఏడో రాజు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672) సమాధిని ఇబ్రహీంబాగ్ తోటకు ఆవలి వైపున నిర్మించడం విశేషం. అంతే కాకుండా ఈసముదాయంలో హైదరాబాద్ న గర వ్యవస్థాపకులు మహ్మద్‌కులీ కు తుబ్‌షా కూతురు హయత్‌భక్షీ బేగం సమాధి, ఇబ్రహీం కుతుబ్‌షా ఆరవ కుమారుడు మీర్జా మహ్మద్ అమీన్ సమాధి,అబ్దుల్‌కుతుబ్‌షా పెద్ద అల్లు డు సయ్యద్ అహ్మద్ సమాధి, రాజకుమారికుల్సుంబేగంసమాధులున్నాయి. అప్పట్లో రంగుల పుష్పాలనిచ్చే ఉద్యానవనంలో రాజుల స్మృతి సౌధలను ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. బా హ్యతలంలో సమాధులన్నీ రూపంలో ఒకే రకంగా కన్పించినా పరిమాణంలోనూ, నిర్మాణంలోనూ, కుడ్యవాస్తు నగిషీల్లో వైవిధ్యం కన్పిస్తుంది.

ఇరాన్ వాస్తు శైలికి ప్రతీకగా నిలిచే సమాధుల నిర్మాణంలో ఇండో-ఇస్లామిక్ సమ్మిశ్రిత వాస్తు వైవిధ్యం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. సమాధుల లోపలి భాగాలను ఇరాన్ సెరామిక్ టైల్స్‌తో అలంకరించి ఉండడం విశేషం. అసఫ్‌జాహిలు ఈ నిర్మాణాలను పరిరక్షించేందుకు విశేషంగా కృషి చేశారు. ప్రధానంగా సాలార్‌జంగ్-1 ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో కుతుబ్‌షాహి టోంబ్స్ పరిరక్షణకోసం లక్షలాది నిధులు వ్యయం చేయించారు. అలాగే వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సమాధుల పునాదులు వర్షపు నీటితో బలహీనమైనట్టు గుర్తించిన పురాతత్వ శాఖ అధికారులు సమాధుల భాగాలను పటిష్టపరిచే పనులు చేపట్టారు.
ఆక్రమణలతో అన్యాక్రాంతమైన సుమారు మూ డు ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కుతుబ్‌షాహి సమాధుల ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా తక్షణం గుర్తించాల్సిన అవసరం ఉంది.

పైగా టూంబ్స్ పరిరక్షణపై నిర్లక్ష్యం


ధ్వంసమవుతున్న పాలరాతి నిర్మాణాలు
అన్యాక్రాంతమవుతున్న సమాధుల స్థలాలు


నిజాం నవాబుల వద్ద ప్రధానులుగా ఇతర కీలక బాధ్యతలు నిర్వహించిన పైగా నవాబుల కుటుంబ సభ్యుల సమాధులన్నీ ఒకే చోట ఉన్నాయి. సంతోష్‌నగర్ సమీపం లోని ఈ సమాధులు పాలరాయి, రంగు రాళ్లతో అలంకరించిన ఇవి హైదరాబాద్ తాజ్‌మహల్‌గా సుప్రసిద్ధం. 1786లో మరణించిన నవాబ్ తేజ్ జంగ్ షంషూల్ ఉమ్రా బహదూర్ సమాధి మొట్టమొదటి సమాధి. దాని పక్కనే నవాబ్ సర్ అసమాస్‌జా బహదూర్, నవాబ్ సర్ ఖుర్షీద్‌జా బహదూర్, సర్ వికార్ ఉల్ ఉమ్రా బహదూర్, నవాబ్ సెషర్ జంగ్ బహదూర్‌ల సమాధులు వరుసగా ఉన్నాయి. కాగా మూడో నవాబ్ షంషుల్ ఉమ్రా, బేగం ఖుర్‌షీజా బహదూర్ సమాధులను రంగు రాళ్లతో నిర్మించడం విశేషం. సమాధుల సముదాయానికి ప్రవేశించే ద్వారం రెండంతస్థుల్లో ఉంది. నౌబత్ ఖానాగా వ్యవహరించే ఈ ద్వారం పై భాగంలో నిర్ణీత సందర్భంలో ఢంకా వాయిధ్యాలను వినియోగించేవారు. ఇక సమాధుల ఆవరణకు కప్పి ఉంచినట్టుగా పాలరాతి అల్లికల కమాన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

కాగా పురాతత్వ శాఖ పర్యవేక్షణలోని ఈ నిర్మాణాల పరిరక్షణ పై నిర్లక్ష్యం కారణంగా చోరుల దాడిలో అమూల్యమైన రంగురాళ్ల అలంకరణలు అదృశ్యమవుతున్నాయి. పాలరాతి నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. ఆక్రమణదారుల చేతిలో చిక్కిన సమాధుల స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రపంచ పర్యాటకులకు అమితంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దిన పయిగా నవాబుల స్మృతి సౌధాలు శిథిల కేంద్రాలుగా మారుతున్నాయి. పరిరక్షణ పనులను ఉపేక్షిస్తే చారిత్రాత్మక ఆనవాళ్లు అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. 

ఖరీదైన హోటల్‌గా సోకు చేసుకున్న ఫలక్‌నుమా ప్యాలెస్


నిజాం కాలంనాటి రాజభవనం నేడు సంపన్నుల విడిది కేంద్రంగా రూపుదాల్చింది. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో స్టార్ హోటల్‌గా గుర్తింపు పొందింది. చార్మినార్‌కు సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో చిన్న కొండపై రాజభవన నిర్మాణానికి అప్పటి నిజాం ప్రధాని వికారుల్ ఉమ్రా 1884లో పునాది వేశారు.1892-93లో పనులు పూర్తి చేయించారు. అప్పట్లో ఈ నిర్మా ణం కోసం సుమారు రూ. 40 లక్షలు వ్యయం చేశారు. కాగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ భవనంలోని విశిష్టతను గుర్తించి 1895 లో నిర్మాణ వ్యయాన్ని చెల్లిం చి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1911లో ఈ భవనంలోనే ఆయన కన్నుమూశారు. కాగా, ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణానికి ఇటాలియన్ పాలరాయి, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న కలపను వినియోగించారు. ఇందులోని ప్రతిగది వైవిధ్యంతో కళాత్మకంగా దర్శనమిస్తుంది.

పొద్దుతిరుగుడు పూలు, ఇతర పుష్పాకృతులు సౌందర్య భరింతగా కన్పిస్తాయి. సీలింగ్‌పై పక్షి చిత్రం విశేషమైనది. గదిలో కూర్చుని ఎటువైపు చూస్తే అటువైపునే ఎగిరిపోతున్నట్టు కన్పించే ఈ చిత్రం నాటి కళాకారుల నైపుణ్యతను ప్రదర్శిస్తుంది. ఇందులో 36 షాండిలియర్స్‌తో వెలుగులు విరజిమ్మే సింహాసన గది, సువిశాల గదుల గోడలను నగిషీలతో అద్భుతంగా తీర్చి దిద్దారు. విశాలమైన డైనింగ్ టేబుల్ లో 102 టేబుల్స్ ఉన్నాయి. కార్డ్ రూం, బిలియర్డ్స్ రూం, స్మోకింగ్ సూట్స్ ఒకటేమిటి ఒక్కోహాల్‌కు ఒక్కో విశిష్టత ఉంది. ఈ రాజఠీవిని ప్రదర్శించే ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అద్భుత నిర్మాణంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో సంపన్నుల విడిది కేంద్రంగా మారింది. తాజ్‌గ్రూపు పర్యవేక్షణలోని ప్యాలెస్ హోటల్‌లో ఒక్కో సూట్‌కు రోజుకు రూ.4.5 లక్షలకు పైగా అద్దె రూపంలో ఆదాయం చేకూరుతోంది.

చౌమహల్లా ప్యాలెస్‌కు అరుదైన గౌరవం


యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు జాబితా - 2010 లో స్థానం దక్కించుకున్న చారిత్రక కట్టడం

అసఫ్‌జాహి నవాబుల రాజసానికి, గాంభీర్యానికి మొఘలాయి రీతి శిల్పకళా పాటవానికి అరుదైన గౌరవం దక్కింది. 1857-1869 మధ్య కాలంలో అయిదో నిజాం నవాబు అఫ్జలుద్దౌలా బహదూర్ కాలంలో నిర్మించిన చౌ మహల్లా ప్యాలెస్‌కు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు బాబితా-2010లో చోటు దక్కింది. ఈ ప్యాలెస్‌లోని అప్‌తబ్‌మహల్, మహతబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్‌మహల్‌లు ప్రధాన నిర్మాణాలు. వీటితోనే ఆ ప్యాలెస్‌కు చౌమహల్లా ప్యాలెస్ అని పేరు వచ్చింది.

ఈ ప్యాలెస్ ఉద్యానవనంలోని వాటర్ ఫౌంటేన్‌లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక దర్బార్‌హాల్‌లో రంగురంగుల విద్యుత్ దీపకాంతులను విరజిమ్మే షాండిలియర్స్ ప్రత్యేక ఆకర్షణ. ఈ భవన సుముదాయంలోని చాందినీ బేగం కీ హవేలీ, ఖక్షీబేగంకీ హవేలీ, మంజిలీ బేగంకీ హవేలీ, మోతిబంగ్లా, తోషాఖానా, కుల్‌హి పిరాన్, రసగ్‌మహల్‌ల్‌లో కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలోని ప్యాలెస్ కోసం కోట్లాది నిధులు వెచ్చించి నాలుగేళ్ల పాటు మరమ్మతులు చేయించి పునరుద్ధరించారు. సుమారు అర్ధ దశాబ్దం పాటు నిరాదరణకు గురైన ప్యాలెస్‌కు పూర్వ వైభవం చేకూర్చడంతో గతేడాది యునెస్కో 2010 ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డు ఫర్ కల్చర్ హెరిటేజ్ కన్జర్వేషన్‌ను దక్కించుకుంది.

మృతవీరులకు అశ్రుతర్పణం చేసే... బాద్‌షాహి అషూర్‌ఖానా

మూసీనదితీరానికి సమీపంలో మదీనా భవనానికి ఎదురుగా సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలోని బాద్‌షాహి ఆషూర్‌ఖానా కుతుబ్‌షాహి పాలకుల అద్భుత నిర్మాణం. 1594లోమహ్మద్ కులీ కుతుబ్‌షా ని ర్మించారు. 1611లో సుల్తాన్ మహ్మద్ కాలంలో నీలిరంగు ఖురాన్ సూక్తుల టైల్స్‌తో అలంకరించారు. బాద్‌షాహి అషూర్‌ఖానాలో మొహరంసందర్భం గా షియాలో సంతాపదినాలను పాటిస్తారు.సుమారు 38 అడుగుల ఎత్తు లో రాతి స్థంభాలపై నిర్మించిన అషూర్‌ఖానా ముందుభాగంలోని నిర్మాణాలు శి«థిలావస్థకు చేరుకుని ఇటీవ లే కుప్పకూలాయి.

నగర్ ఖానా గోడ లు శి«థిలమయ్యాయి. కొంత మంది ఆక్రమించి అషూర్‌ఖానా ప్రాశస్త్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించగా హైకోర్టు చొరవతో ఆర్కియాలజీ విభాగం అధికారులు స్పందించి ఆక్రమణ దారులనుతొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఈ శి«థిల నిర్మాణాలను పునరుద్ధ్దరించి హైదరాబాద్ ఇస్లామిక్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికై ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వందలాది ఏళ్ల ఇండో- ఇరాన్ సమ్మిళిత వాస్తు సంస్కృతికి కేంద్రంగా నిలిచిప బాద్‌షాహి అషూర్‌ఖానాను పరిరక్షించి భవిష్యత్ తరానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

కాలుష్యం నుంచి చార్మినార్‌కు విముక్తి

ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని యునెస్కోకు ప్రతిపాదనలు
గోల్కొండ కోటలో జనాభా పెరిగి కిక్కిరిసి పోవడంతో అప్పటి పాదుషా మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీనది తీరంలో చార్మినార్‌తో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేశారు. సుమారు 180 అడుగుల ఎత్తులో నాలుగు వైపులా విస్తరించిన చార్మినార్ దేశ, విదేశీ పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తోంది. 1591 లో చేపట్టిన ఈ నిర్మాణం పనులు 1594లో పూర్తి చేశారు. దీనిపైకి ఎక్కడానికి నాలుగు మినార్‌ల నుంచి సుమారు 149 మెట్లున్నాయి. రెండో అంతస్థులో ప్రార్థనలు జరుపుకునేందుకు అనువుగా మసీదు ఉంది. అలాగే ఒకటో అంతస్థును నగర వాసులకు ప్రభుత్వ ఆదేశాలు తెలియజేసేందుకు అప్పట్లో దండోరాకు వినియోగించేవారని ప్రచారం.

ఇస్లామిక్ వాస్తు శైలిలో కింది నుంచి చార్మినార్‌ను పరిశీలిస్తే ఆకాశం మబ్బుల నుంచి తేలిపోతున్నట్టుగా కన్పించే చార్మినార్ నిర్మాణం ధ్వని, వాయు కాలుష్యాలతో శిథిలావస్థకు చేరుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని కేవలం పాదచారులకే పరిమితం చేస్తూ గ్రేటర్ పాలక సంస్థ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. గత ఆగస్టులో కురిసిన వర్షాలతో చార్మినార్ ఆగ్నేయ మూల రెండో అంతస్థులోని పై కప్పు పెళ్లలూడిపోయాయి. నగిషీల భాగం కూలిపోయింది. అంతకు ముందు చార్మినార్ పిడుగు తాకిడికి గురికావడంతో కొంత భాగం ధ్వంసమైంది.

దీంతో భవిష్యత్‌లో పిడుగు పాటు సమస్య లేకుండా పంచలోహాల తీగను అమర్చారు. అలాగే ఈ ప్రాంతంలో వాయు కాలుష్యానికి ఆస్కారం లేకుండా వాహనాల రాకపోకలు నిషేధించేందుకు పాదచారుల ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. చార్మినార్‌కు నాలుగు వైపులా గుల్జార్‌హౌస్, లాడ్‌బజార్, ఆర్టీసీ బస్ స్టేషన్, సర్దార్‌మహల్ వరకు రోడ్లపై గ్రానైట్‌ను నిర్మిస్తున్నారు. పాదాచారులు మాత్రమే వెళ్లి వచ్చేందుకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర పురాతత్వ శాఖ పర్యవేక్షణలోని చార్మినార్‌ను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని కోరుతూ అధికారులు యునెస్కోకు ప్రతిపాదనలు పంపారు. 

స్టేట్ మ్యూజియంలో అపురూప సంపద

ఏడో నిజాం కూతురు బొమ్మల కొలువు కోసం నిర్మించిన భవనంలో ప్రస్తుతం రాష్ట్ర పురావస్తు మ్యూజియం కొనసాగుతోంది. పబ్లిక్‌గార్డెన్స్‌లో ఇండో-పర్షిన్ పద్దతిలో 1914లో నిర్మించిన అపురూప వాస్తు శైలిలోని భవనం ద్వారాలు, కమాన్‌లపై నిజాం టోపీ గుర్తులు దర్శనమిస్తాయి. అప్పట్లో ఈ భవనంలో సైతాన్‌లున్నాయనే ప్రచారం జరుగడంతో నిజాం కూతురు బొమ్మల కొలువు రద్దయింది. 1928 లో దీన్ని పారిశ్రామిక ప్రదర్శనకు వినియోగించారు. 1930లో గులాం యజ్దానీ చొరవతో దీన్ని పురావస్తు సంపదను భద్రపరిచే నిలయంగా మార్చారు. ఇందులో గోల్కొండ కుతుబ్‌షాహీల ఆ యుధాలు, దుస్తు లు, నిజాంలు సేకరించిన ఇతర ఆయుధ సంపత్తి, నాణేలు, తదితర వస్తు సంపదను ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభ్యమైన అపురూప పురావస్తు సంపద, బుద్దుని అవశేషాలు, శిల్పాలు, శిలలు, చిత్రకళాఖండాలు, శాసనాలను ప్రదర్శిస్తున్నారు.

అంతే కాకుండా 2500 ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ రాజకుమారి శవం (మమ్మీ) సందర్శకుల ప్రధాన ఆకర్షణ. శిల్పాలు, లోహవిగ్రహాలు, శిలా శాసనాల ప్రదర్శనల కోసం వేర్వేరు గ్యాలరీలను అభివృద్ధి చేశారు.

హెరిటేజ్ భవనాలకు నిధులు సమకూర్చాలి 

- ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ అనురాధారెడ్డి

రాష్ట్ర ఆర్కియాలజీ పరిధిలోని పురాతన నిర్మాణాల పరిరక్షణపై కేంద్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది. కాని ఇనిస్టిట్యూషనల్ నిర్మాణాలపై శ్రద్ధ తీసుకునేవారు కరవయ్యారు. దీంతో అరుదైన వాస్తు శైలిలో ఉన్న నిర్మాణాల పరరక్షణ డోలాయమానంలో పడిపోయింది. ప్రభు త్వం ఇతోధికంగా నిధులు సమకూర్చాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ స్వాధీనంలోని కోఠి ఉమెన్స్ కళాశాల భవనం (కోఠి రెసిడెన్సీ) పరరక్షణ కు నిధుల కొరత తీవ్రంగా ఉంది. సిటీ కళాశాల సైతం అదే విధంగా మారింది. ఇన్‌టాక్ ప్రతినిధులు సమీక్షించి పునరుద్దరణకు నిధులు మంజూరు చేయాలని రెండు మూడు పర్యాయాలు అభ్యర్థలను పంపాం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక గోల్కొండ టోంబ్స్, చార్మినార్ తదితర నిర్మాణాలు బాగానే ఉన్నాయి. 

యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం 

- ఆర్కియాలజీ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి

  ఏళ్ల తరబడి నుంచి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గోల్కొండ కుతుబ్‌షాహి సమాధులకు మరమ్మతులు చేపట్టి యునెస్కో గుర్తింపు కోసం మొదటి సారిగా ప్రతిపాదనలు పంపాం. యునెస్కో ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. గుర్తింపు నకు అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. ప్రతిపాదనల రూపకల్పనలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. గోల్కొండ కోట, చారిత్రాత్మక చార్మినార్ నిర్మాణాలను కలిపి కుతుబ్‌షా వారసత్వం పేరుతో మళ్లీ సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో సహా పంపాం. యునెస్కో ప్రతినిధుల పరిశీలనలో ఉన్నాయి. ఈ యేడు కచ్చితంగా కుతుబ్‌షాహి టూంబ్స్, కోట, చార్మినార్ నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు లభిస్తుందని విశ్వసిస్తున్నాను.

Saturday, April 16, 2011

తెలంగాణ గడీలు ఎవరి ఆస్తి?

తెలంగాణలో శతాబ్దాల పాటు కొనసాగిన దొరతనానికి సాక్ష్యాలవి. ఓ వైపు దొరల దర్పానికి నిలువెత్తు దర్పణాలుగా, మరోవైపు గడీ అంటేనే గడగడ వణికిన ప్రజల భయాలకు సజీవ సాక్ష్యాలుగా ఇవి నేటికీ నిలిచి ఉన్నాయి. పాతతరం మనుషుల్లో గడీ పేరు వినగానే ఇప్పటికీ కళ్లల్లో గగుర్పాటు... శరీరమంతా జలదరింపు కన్పిస్తాయి. దొర పిలుపు వచ్చిందంటే పులి బోనులోకి వెళుతున్న మేకపిల్లలా హడలెత్తిపోయేవారు జనం. ప్రాణాలకే కాదు ఆడవాళ్ల మానాలకూ... బయటకు విన్పించని ఆర్తనాదాలకూ ఆలవాలంగా ఉండే గడీలు ఇటీవల మళ్లీ వార్తల్లోకొచ్చాయి.

తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత గ్రామాలు వదిలి పట్టణాలకు పారిపోయిన దొరలు, వారి వారసులు ఇప్పుడు మళ్లీ గ్రామాలకు వెళ్తున్నారు. ఊరు గుర్తుకొచ్చి కాదు. ఊళ్లలో ఉన్న తమ ఆస్తులు గుర్తుకొచ్చి. పల్లెల్లో కూడా భూముల విలువ పెరగడంతో దొరలు మళ్లీ పల్లెకొచ్చి తమ గడీల్ని, పొలాల్ని అమ్మకానికి పెడుతుంటే అవి తమని, తమ శ్రమని దోచుకుని నిర్మించినవి కాబట్టి అవి తమ ఉమ్మడి సొత్తని, వాటిని అమ్మడానికి వీల్లేదని గ్రామాల్లోని ప్రజలు తిరగబడుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్‌గల్ గ్రామంలో అదే జరిగింది...

చల్‌గల్ గడీ

చల్‌గల్‌లో ఉన్న గడి రాజుల కోటని తలపిస్తుంది. సిమెంట్ కన్నా బలమైన డంగు సున్నంతో నిర్మించిన ఆ గడీ గోడలు నేటికీ చెక్కు చెదరలేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్తంభాలతో ఉండే ఆ గడి రెండో అంతస్థుపైకెక్కి చూస్తే చుట్టూ ఐదారు కిలోమీటర్ల మేర ఉన్న పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణభూపాల్‌రావు చాలా ఏళ్ళ క్రితమే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. చల్‌గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలోనే ఉండడంతో భూమి రేట్లు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. దాంతో భూపాల్‌రావు గడీని అమ్మడానికి గతేడాది నవంబర్ 9న గ్రామానికొచ్చాడు. వాళ్ల కోరికను గడీని, గడీ స్థలాన్ని ఊరికి విరాళంగా ఇవ్వాలని చల్‌గల్ గ్రామస్తులు కోరారు. భూపాల్‌రావు పట్టించుకోకుండా గడీని అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన గ్రామస్థులు భూపాల్‌రావుని చుట్టుముట్టి మూడు, నాలుగు గంటల పాటు నిలువరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనని అక్కడి నుంచి పంపించేశారు. ఆ సమయంలో గ్రామస్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి చివరికది లాఠీచార్జి నుంచి కాల్పుల దాకా వెళ్లింది. చాలామంది గ్రామస్తులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎవరినైనా అరెస్టు చేస్తే ఐక్యంగా పోరాడాలని కూడా నిర్ణయించారు గ్రామస్తులు. చల్‌గల్ గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.

ఎన్ని హంగులో..

ఇది మరో గడీ కథ... ఇప్పటి ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ చుట్టుపక్కల ఉన్న జగ్గాసాగర్, అయిలాపూర్, భీమారం తదితర 80 గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్‌రావ్ ఆధీనంలో ఉండేవి. ఆ ఊళ్లో కట్టిన గడీలలో అప్పట్లోనే అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. జర్మనీ నుంచి పాలరాతిని, విలాస వస్తువుల్ని తెప్పించినట్లు చెపుతా రు. అప్పట్లోనే విద్యుద్దీపాలతో (జనరేటర్ సాయంతో) వెలిగిపోతున్న గడీని కిరోసిన్ దీపాలు కూడా లేని ప్రజలు వింతగా, విచిత్రంగా చూసేవారట. గడీలకి పైప్‌లైన్లలో తాగునీటి సౌకర్యం కూడా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ని ఇప్పటికీ గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు.

1982-83 ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం వల్ల రాజా అనంత కిషన్‌రావ్ వారసులైన గజసింహరావ్, నరసింహరావుల కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. నక్సల్స్ ప్రభావం తగ్గుముఖం పట్టాక గ్రామంలో ఉన్న వారి స్థిరాస్తులు కొన్ని అమ్ముకున్నారు. పాత గడీని అమ్మేసి కొత్త గడీని కూల్చేసి విలువైన వస్తువులు, ఫర్నిచర్‌ని తీసికెళ్లిపోయారు. బండలింగాపూర్ సంస్థానం పరిధిలో ఇప్పటికీ వాళ్ల వారసుల స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకుని ఉన్న స్థలాన్ని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసి)కి అప్పగిస్తే అందులో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. కల్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణుగోపాలస్వామి ఆలయానికి ఆండాళ్ దేవికి 4 లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కల్యాణానికి సంస్థాన వారసులు గ్రామానికి వస్తారు. వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికే దొరలు దానం చేస్తున్నారని విమర్శించే వాళ్ళూ లేకపోలేదు.

కొందరు దొరలు దాతలే!

ఆర్థిక సంస్కరణలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలతో ఇప్పుడు పల్లెల్లో కూడా పరిస్థితి మారింది. జనాభా కూడా పెరిగింది. పెరగనిదల్లా భూమి మాత్రమే. నక్సలైట్ల అలికిడి తగ్గిపోవడం, భూముల విలువ పెరగడం వల్ల కొంతమంది దొరలు గడీల్ని, తమ భూముల్ని అమ్మకానికి పెట్టడంతో వివాదాలు మొదలవుతున్నాయి. ఎకరానికి ఇంత రేటని నిర్ణయించి... ఇన్నాళ్ళూ బీళ్లుగా ఉన్న తమ భూముల్ని సాగు చేసుకుని దాని నుంచి వచ్చిన ఆదాయంతో డబ్బు కట్టమని గ్రామస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలా నాలుగైదేళ్లు సాగు చేసుకున్నాక డబ్బు కట్టే విధంగా కౌలుదారుల చేత కాగితాలు రాయించుకుంటున్నారు. నాలుగైదేళ్లకైనా సొంత భూమి కల నెరవేరుతుందనిచాలామంది దొరల బీడుభూముల్ని మళ్లీ సాగుభూములుగా మారుస్తున్నారు. ఇలాంటి సౌలభ్యాలేవీ గడీలకు లేకపోవడంతో నేరుగా అమ్మకానికి పెడుతున్నారు దొరలు. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యే ఒక చిన్న గడీని 8 లక్షలకు అమ్మితే దాన్ని కొన్న వాళ్లు మెరుగులు దిద్ది దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్‌ని ప్రారంభించారు. గడీలను పాఠశాలలకు, కమ్యూనిటీ హాళ్ళకు విరాళాలుగా ఇచ్చిన దొరలు కూడా ఉన్నారు.

కొత్త లీడర్లొచ్చారు..

కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991లో గ్రామస్థులు లూటీ చేస్తే పోలీసులు 120 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆ వివాదం చాలా ఏళ్లు నడిచింది. అయితే ఇటీవల పల్లెల్లో సర్పంచులతో పాటు ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, మండలాధ్యక్షులు, నీటి సంఘాల చైర్మన్లు లాంటి చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. విద్యావంతులూ పెరిగిపోయారు. ప్రజలలో చైతన్యం కూడా పెరిగింది. ఆ చైతన్యమే గడీల్ని తమ ఉమ్మడి ఆస్తిగా భావించేలా, దాని కోసం ఎదురు తిరిగేలా చేస్తోంది. ఏదేమైనా 'ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చపడేది... ఇప్పుడు దాంట్లోనే పోస్తన్నం' అని కవి అన్నవరం దేవేందర్ అన్నట్టు ఇప్పుడు గడీలన్నీ ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగుబాటు చల్‌గల్ గడీతో మొదలైంది.

- కె.వి. నరేందర్, 94404 02871

Sunday, March 13, 2011

విజయం ఓ వరం!

రంగస్థలంపై చాలా మందే యాక్టర్లు తారసపడతారు. వారిలో హీరో కూడా ఒక యాక్టరే అయినప్పటికీ తన హీరోయిజంతో స్టార్ అనిపించుకుంటాడు. తనదైన ముద్రతో నిజజీవితంలో సైతం ఆకర్షిస్తాడు. కాబట్టి కథలో మనం ఉండకూడదు...మనమే కథకులం కావాలి. కథా నాయకులం కావాలి.
జీవితాన్ని క్షణభంగురం అంటుంటాం. నిజానికి జీవితం విలువ క్షణమేనా? కాదు. కొన్ని కోటానుకోట్ల క్షణాల సముదాయమే జీవితం! అంతటి జీవితమూ 'క్షణం'లో చేజారిపోవచ్చు. అలా చేజారిపోవటం క్షణానికే పరిమితమైనప్పటికీ దాని నీడలు కోట్ల క్షణాలపై పరుచుకుని ఉంటాయి. ఆ ఒక్క క్షణం కోసం కోట్ల క్షణాలలో మనం భయభ్రాంతిలో ఉంటాం. నిజానికి ఆ ఒక్క క్షణానికి భయ కంపితులమైతే జీవితమంతా బలహీనంగానే గడిచిపోతుంది. అలాకాక ఆ క్షణాన్ని శక్తిమంతంగా మార్చుకోగలిగితే జీవితమంతా శక్తి సంపన్నం అవుతుంది. ఓటమిని విజయానికి శ్రీకారం అనుకుంటే గెలుపులో హీరోయిజం కనిపిస్తుంది.

జీవితం క్షణభంగురం కాదు
పవర్‌ఫుల్ కావాలి

ఒక ఓటమి అనేక గెలుపులకు దోహదకారి అవుతుంది. రేయింబవళ్లలా జీవితంలో చీకటి వెలుగులు ఉంటాయి. బలాలు బలహీనతలూ ఉంటూనే ఉంటాయి. మెలకువకు నిద్ర ఉపకరించినట్లే బలపడటానికి బలహీనతలూ దోహదపడుతుంటాయి. ఒక సమస్యకు రెండవది పరిష్కారం అవుతుంది. సుఖాన్ని వెన్నంటి కష్టం ఉంటుంది. అలాగే కష్టాన్ని వెన్నంటి సుఖమూ ఉంటుంది. విషాద యోగమూ, ఆనందయోగమూ మానవగీతలో రచింపబడే ఉంటాయి.

సృష్టిలో ఈ విరుద్ధతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మనకున్న వనరులు ఏమిటి అని చూసుకుని, వాటిల్లో పనికొచ్చేవి ఏమిటి? పనికి రానివి ఏమిటి? అని మనమే నిర్ణయించుకోవాలి. అప్పుడే మన వ్యక్తిత్వం ఒక నిర్ణయాత్మక ప్రణాళిక అవుతుంది. నిర్దేశిత లక్ష్యంతో ఈ నిర్ణయాత్మక ప్రణాళిక సాధ్యమవుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉంటే, ప్రణాళిక పకడ్బందీగా సాగితే ఏ జీవితమూ కేవలం సాదాసీదాగా సాగిపోదు. దేన్నీ అనాలోచితంగా చేయటం జరగదు. దేన్నీ ఆయాచితంగా అందుకోవాలనుకోవటం జరగదు.

నేడు ఒకలా రేపు మరోలా వర్తించటం జరగదు. జీవితంలో, వ్యక్తిత్వంలో, వర్తనంలో, ఆలోచనలో, చేతలో స్పష్టత ఉంటుంది. అపుడ 'కాలం' చేజారిపోతుందేమో నన్న బెంగ, భయం ఉండదు. ఫలితంగా మనం పవర్‌ఫుల్ అవుతాం. ఆ శక్తి సంపన్నత మనదే తప్ప, మనలో నుంచి ఉబికివచ్చిందే తప్ప ఎక్కడి నుంచో వచ్చింది కాదు. సాధన ద్వారా అందివచ్చింది ప్రతిభతో ప్రకాశమయ్యింది. రైట్‌థాట్, రైట్‌స్పీచ్, రైట్ యాక్షన్‌ల సమాహారమే ఈ పవర్.

కాలాన్ని గెలువు

విజయాన్ని వరించాలంటే మనలో త్రికరణ శుద్ధి ఉండాలి. మన ఆలోచన, మన చేతన, మన మాట సన్మార్గంలో ఉండాలి. అప్పుడే జీవితం విజయపథం అవుతుంది. "నా ఆలోచన తప్పుకాదు...నేను మాట్లాడింది తప్పుకాదు...నేను చేసింది తప్పు కాదు'' అని ఘంటాపధంగా చెప్పగలిగిన వారిలో చంచల స్వభావం ఏ కోశానా కనిపించదు. అనుమాన బీజాలు అగుపించవు. పైగా అటువంటి వ్యక్తిత్వం ఒక సస్యశ్యామల క్షేత్రమే అవుతుంది.

వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. ఫలవంతమవుతుంది. ఇటువంటి వ్యక్తిత్వ సంపన్నులు దేనికీ తొందరపడరు. సహనాన్ని కోల్పోరు. విజయం వరించకపోయినా సహనంగా సాధన సాగిస్తారు. ప్రయత్నలోపమూ, సాధనా లోపమూ ఉండుద కాబట్టి గెలుపు తథ్యమే అవుతుంది. వీరి ప్రణాళిక పకడ్బందీగా ఉంటుంది. కాబట్టి కాలం సైతం వీరిని పరీక్షించదు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారు కాబట్టి కాలవ్యవధిని సైతం నిర్దేశించుకునే ఉంటారు. కాబట్టి ఆ కాలానికి లోబడే విజయం వీరిని వరిస్తుంది.

గెలుపు మాత్రమే కాదు కాలంసైతం వీరి గుప్పిటనే ఉంటుంది. వీరు కాలాన్ని జయించగలరు కాబట్టి ప్రపంచాన్నీ జయించగలరు. ఇన్ని తెలుసు కాబట్టి విజయానికి కావలసిన వనరులు ఏమిటో వీరికి స్పష్టంగా తెలిసే ఉంటుంది. అవి తమ వద్ద ఎంత పుష్కలంగా ఉన్నదీ తెలుసు. లేని వాటిని సమీకరించుకోగలరు. ఈ సమీకరణ ద్వారా మార్పు సాధ్యమవుతుంటుంది. ఈ మార్పు స్వభావ వ్యతిరేకి మాత్రం కాదు. అన్న సక్సెస్ సూత్రం తెలిసిన వారు కాబట్టి తమ స్వభావానికి ఎదురీదకుండానే మార్పును ఆహ్వానిస్తారు. ఆ మార్పు గెలుపొందటం కొరకే అని స్పష్టంగా తెలుసు.

గెలుపు అవకాశం కాదు

గెలుపు లక్ష్యమే తప్ప అవకాశం కాదు... అవసరం. అది ఒక పరిణత ప్రతిభ. వాస్తవం, యదార్థం కావాలని పట్టు పడితేనే గెలుపు సాధ్యమవుతుంది. ఎవరికి కానీ శ్రమ, సాధన వృధా పోవు. శ్రమకు, సాధనకు తగ్గ ప్రతిఫలం విజయం రూపంలో వరిస్తుంది. ప్రస్తుతానికి ఆ విజయం విలువ ఎంతటిదయినా అది భవిష్య విజయానికి భూమిక అవుతుంది. అలా భవిష్య విజయ సౌధానికి వర్తమాన విజయాలనే సోపానాలుగా చేసుకుంటూ పోవాలి. ఇంతవరకు విజయపరంపరలతో ఒక్కోమెట్టు ఎక్కుతున్న కొద్దీ మరింత ఎత్తుకు ఎదుగుతూనే ఉంటారు. ఎత్తయిన శిఖరాన్ని అధిరోహిస్తూ కనిపిస్తుంటారు. మనకంటే ఎంతో ఎత్తులో ఉంటారు.

మనం మొదటి మెట్టుపై నిలబడి చూస్తుంటే వారి విజయం వినోదంలా ఉంటుంది. శిఖరం చేరుతున్న వ్యక్తి అద్భుత వ్యక్తి అనిపిస్తుంటాడు. హీరోలా అనిపిస్తుంటాడు. ఆ స్ఫూర్తితో మనమూ మెట్లెక్కడం ప్రారంభిస్తే ఆ అద్భుతం మన నీడలో తలదాచుకుంటుంది. మన వ్యక్తిత్వంలో ప్రకాశిస్తుంది. ఆ హీరో మనకు చేయి అందించిన పరవశం కలుగుతుంది. ఆ పారవశ్యంతో మనమూ అతడి పక్కకు చేరుకోగలుగుతాం. శిఖరాగ్రాన అతడి పక్కన నిలబడగలుగుతాం. మనమూ హీరో అవుతాం...అనిపించుకుంటాం.

మనమూ చేయి అందించి ఇతరులూ హీరోలు అనిపించేలా చేస్తాం. రంగస్థలంపై చాలా మందే యాక్టర్లు తారసపడతారు. వారిలో హీరో కూడా ఒక యాక్టరే అయినప్పటికీ తన హీరోయిజంతో స్టార్ అనిపించుకుంటాడు. తనదైన ముద్రతో నిజజీవితంలో సైతం ఆకర్షిస్తాడు. అందుకే మోర్గాన్ ఫ్రీమన్ అంటాడు. కాబట్టి కథలో మనం ఉండకూడదు...మనమే కథకులం కావాలి. కథా నాయకులం కావాలి.


డా. వాసిలి వసంతకుమార్
యోగాలయ రీసెర్చ్ సెంటర్
ఫోన్ : 9393933946

Monday, February 21, 2011

కళ్యాణ కాస్ట్యూమ్స్ ...... హిట్ ఫిట్.

పెళ్ళి...
హిట్ ఫార్ములా సినిమాలాంటిది!
వధూవరులు... హీరో హీరోయిన్లు
బామ్మలు, అమ్మమ్మలు, మావయ్యలు... తారాగణం
స్పెషల్ అపియరెన్స్‌లో బంధువులు, మిత్రులు...
బోలెడంత హడావిడి... బాజా బజంత్రీలు...
అలకలు, సముదాయింపులు...!
ఇవన్నీ ఉన్నా... ఈ పెళ్లి హిట్ అవ్వాలంటే
వధూవరులు ఒకరికొకరు ఫిట్ అవ్వాలి.
మనసులే కాదు, వారి కాస్ట్యూమ్స్ కూడా!
అందుకే ఇప్పుడు కళ్యాణం కాస్ట్యూమ్స్‌లో కూడా డిజైనర్ వేర్ వస్తున్నాయి. ఆ డిజైన్‌లలో వధూవరులతో బాటు పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా తళుక్కున మెరిసే తారల్లా ఉంటే... ఆ పెళ్లి హిట్ కాక ఏమవుతుంది..?
మీ ఇంట్లో జరిగే పెళ్లి కూడా అలా హిట్ కావాలని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్‌ పరిచయం ...


ఊరు ఊరంతా కలిస్తే అంబరాన్ని అంటే సంబరాల పెళ్లి. ఇద్దరి హృదయాలను ఏకం చేసే పెళ్లి, పిల్లాపాప చిన్నాపెద్దా హుషారుగా హోరెత్తే పెళ్లి. అందరి సమక్షంలో ఆనందంగా, ఆర్భాటంగా జరుపుకునే ఈ సందర్భాన్ని మించిన శుభకార్యం మన సంప్రదాయంలో మరొకటి లేదేమో! ప్రధాన పాత్రధారులు వధూవరులు అయినా ప్రత్యేక పాత్ర ల్లో బంధు, మిత్రుల హడావిడి, అల్లరి తప్పని సరి.

పెళ్లి పనులన్ని ఒక ఎతైతే పెళ్లిరోజు నాటి అలంకర ణ మరో ఎత్తు. ఆరోజు ప్రధాన ఆకర్షణ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయినా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా ఆ శుభకార్యం రోజున ఏం వేసుకోవాలి? ఎలా తయారవ్వాలి? అనే ఆలోచనలో పడతారు.


ఒకప్పుడు మధుపర్కాలతో వధూవరుల గెటప్ పూర్తయితే, పట్టుచీరలు, ప్యాంటు చొక్కాలతో మిగతావారి అలంకరణ పూర్తి అయ్యేది. రోజులు మారాయి, ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.


దీంతో అన్ని సంబరాలకు సరిపడా దుస్తులని ధరించటానికి కనీసం మూడునాలుగు విభిన్నమైన లుక్స్‌ని రెడీ చేసుకోవలసిన అవసరం వధూవరులతో పాటు బంధు, మిత్రులకు కూడా తప్పని సరి అయిపోయింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్, వాటికి అవసరమయ్యే డ్రెస్సింగ్ గురించి అవగాహన కలిగిస్తూ మీరు ‘ఇన్ ఫ్యాషన్‌‘గా ఉండటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. డిజైనర్లు, వెడ్డింగ్ ప్లానర్స్, బ్యూటీషన్స్ నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన సూచనలు మీ కోసం:

ఏ ఫంక్షన్‌కి ఏం ధరించాలి...

సంగీత్ ఫంక్షన్:
‘‘పెళ్లికి ముందు జరిగే ఈ కార్యక్రమంలో హడావిడంతా స్నేహితులదే. ఆట పాటలతో సాగిపోయే ఈ రోజు కోసం ప్రత్యేకమైన దుస్తులు అవసరం. లేటెస్ట్ స్టయిల్స్‌లో డిజైన్ చేసిన గాగ్రా చోలీలో వధువు మెరిసిపోతే ఆమె స్నేహితులు కూడా గాగ్రా, అనార్కలి చుడిదార్ లేదా షార్ట్ టాప్ పై పటియాలా పైజామాలాంటి లేటెస్ట్‌డిజైన్లను ధరించవచ్చు. పెళ్లికొడుకు సిల్క్ కుర్తా పైజమా లేదా లైట్‌గా వర్క్ చేసిన జోధ్‌పురీ స్టైల్ డ్రెస్‌ని ధరిస్తే రాకుమారుడిలా వెలిగిపోవచ్చు. వరుడి స్నేహితులు కూడా సంప్రదాయంగా కనిపించేలా అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా కుర్తా పైజామాలు ధరించడం నేటి ఫ్యాషన్.. మిగిలిన బంధువులు లేటెస్ట్ డిజైన్స్‌లో వస్తున్న క్రేప్, జార్జెట్, షిఫాన్ చీరలు ధరించటానికి ఇది మంచి సమయం. పురుషులు కుర్తా పైజామాలు ధరిస్తే... సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. అందరూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపే ఈ రోజుని మరింత ఎంజాయ్ చేయటానికి ఈ తరహా డ్రెస్సింగ్ అనువుగా ఉంటుంది’’ అంటున్నారు డిజైనర్ సంగీత. ఈ రోజు ట్రెడిషనల్ లుక్‌తో వెస్ట్రన్ లుక్ కూడా మిక్స్ చేయవచ్చు. డ్రెస్సింగ్ ట్రెడిషనల్‌గా ఉంచి హెయిర్ స్టైల్స్‌లో వేరియేషన్ తీసుకు రావచ్చు. అలాగే జ్యువెలరీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ధరిస్తే లుక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని కూడా ఆమె అంటున్నారు.
మెహందీ ఫంక్షన్: పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి ఆడవాళ్లు మాత్రమే జరుపుకునేది. ‘‘ఈ రోజుల్లో పెళ్లి కూతురికి పెట్టే గోరింటాకుకి పట్టే సమయం కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు. దాని కోసం పెళ్లికూతురుకు సౌకర్యంగా ఉండే గాగ్రా లేదా సల్వార్ సూట్‌ని ధరిస్తే బాగుంటుంది. షార్ట్ స్లీవ్స్ టాప్ అయితే మరీ మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మెహందీ డిజైన్లు మోచేతిని దాటి పైకి దాకా పెట్టటం ఫ్యాషన్’’ అంటున్నారు బ్యుటీషియన్ మిని లింగ్. అలాగే ఫంక్షన్‌కి వచ్చే ఆడవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ కాబట్టి వీరు కూడా చేతులకు సింపుల్ జ్యువెలరీ, సౌకర్యంగా ఉండే లైట్ వెయిట్ చీరలు, ఎక్కువ ఆర్భాటం లేని హెయిర్ స్టయిల్ ఉంటే ఫంక్షన్‌ని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.
వెడ్డింగ్ డే...

కలర్ కోఆర్డినేటెడ్ లుక్: వధూవరులు కలర్ కోఆర్డినేటెడ్ డ్రెస్సులు ధరించటం ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్ శిల్పా రెడ్డి. అంటే వధూవరులు పెళ్లిరోజు తమ దుస్తులు మ్యాచ్ అయ్యేలా తయారవ్వటం.‘‘ఈ ట్రెండ్ పాశ్చాత్యదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తరహా ట్రెండ్ ఊపందుకుంది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా...వివేక్ ఒబెరాయ్, మాల్వికా.. మొదలైన బాలివుడ్ సెలబ్రిటీలు పెళ్లిరోజు ఈ విధంగా ముస్తాబై ఈ ట్రెండ్‌ని మరింత పాప్యులర్ చేస్తున్నారు’’ అంటున్నారు శిల్పా. మరో ట్రెండ్... మండపం డెకరేషన్ కూడా వధూవరుల దుస్తులను కాంప్లిమెంట్ చేస్తూ ఉండేలా డిజైన్ చేయటం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల వివాహ వేడుకల్లో వధువు ధరించిన బంగారు రంగు చీర, వరుడు ధరించిన క్రీం కలర్ జోధ్‌పురీ సూట్‌కి మ్యాచ్ అయ్యేలా మండపాన్ని డెకరేట్ చేశారు. అంతే కాదు వీరి వివాహం సందర్భంగా మరో ట్రెండ్‌ని కూడా చూసాం. అమితాబ్, జయతో పాటు సోదరి శ్వేత తదితర ముఖ్య కుటుంబ సభ్యులంతా అభిషేక్ బచ్చన్ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా అదేరంగు దుస్తులని ధరించారు. ఈ విధంగా చేయటంతో ఎంతో వైవిధ్యంగా కనిపించటమే కాదు ‘మేమంతా ఒకటి‘ అని చాటి చెప్పారు .
ఐషా ట్రెండ్: మరో ట్రెండ్ కూడా ఇటీవల విడుదలై హిట్ సినిమా ‘ఐషా’ పాప్యులర్ చేసింది. విదేశాలలోఉన్న బ్రైడ్స్ మెయిడ్, బెస్ట్ మ్యాన్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో ఎంతో ఫ్యాషనబుల్‌గా చూపించారు. వధూవరులకు సంబంధించిన ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితమైన స్నేహితులకు పెళ్లిలో పెద్ద పీట వేసే ఈ సంప్రదాయాన్ని ‘ఐషా’లో చూపించారు. ఈ ట్రెండ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ముఖ్యులంతా వధూవరులకి మ్యాచింగ్‌గా ఒకే కలర్‌లో వేర్వేరు స్టైల్స్‌లో డ్రెస్సింగ్ చేసుకుంటారు. ‘ఐషా’లో ఎంతో పాప్యులర్ అయినా ‘గల్ మిట్టి మిట్టి బోల్’ పాటలో ఈ తరహా డ్రెస్సింగ్ స్టైయిల్‌ని చూడవచ్చు. చీర కలర్ ఒకటే అయినా డిఫరెంట్ డిజైన్ దానికి తోడు జ్యువెలరీ, హెయిర్‌స్టయిల్ వేరుగా ఉండటంతో పెళ్లి కూతురుకి ఏ మాత్రం పోటీ కాకుండా ఎవరి స్టైయిల్‌లో వాళ్లు కనిపిస్తారు. వరుడి వైపు బంధువులు, స్నేహితులు కూడా వరుడికి మ్యాచింగ్ దుస్తులను ధరిస్తారు ఈ పాటలో. త్వరలో ఈ ట్రెండ్ మరింతగా పాప్యులర్ అవుతుంది అంటున్నారు శిల్ప.

తాటాకు పందిరి కింద మధుపర్కాలలో సిగ్గుపడుతూ పెళ్లిళ్లు చేసుకునే రోజులు దాదాపుగా పోయాయి. ఇప్పుడంతా స్పెషల్‌గా వెడ్డింగ్ ప్లానర్స్ డిజైన్ చేసిన డిజైనర్ వెడ్డింగ్ రోజులు. అంత మాత్రం చేత సంప్రదాయానికి తిలోదకాలిస్తున్నారనుకోవటం పొరపాటే! సంప్రదాయాన్ని, ఆధునికతను కలబోసుకుంటున్న కళాత్మక ట్రెండ్‌లు పెళ్లికి నిండుదనం చేకూరుస్తాయి. వధువరులకు సరికొత్తకళను తెచ్చిపెడతాయి.

పెళ్లి సందడి
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.

రూ. 40 కోట్ల పెళ్లి! పసందైన విందు... వెరైటీ వినోదాలు

మూడే ముళ్లు. ఏడే అడుగులు. మొత్తం కలిపి... రూ. 40 కోట్లు. అవును! రాష్ట్రంలో ఎవరూ పెట్టనంత ఖర్చుతో, భారీ బడ్జెట్ సినిమాను కూడా తలదన్నే రీతిలో పెళ్లి వేడుక జరుగుతోంది. అది కూడా మన రాష్ట్రంలోనే, రాజధాని నగరంలోనే! న్యూజిలాండ్‌లో వ్యాపారం చేసే ఏఆర్ ప్రాపర్టీస్ ఎండీ రవీంద్ర తన ఇద్దరు కొడుకులనూ అతి ఖరీదైన పెళ్లి వేడుక ద్వారా ఒకేసారి ఓ ఇంటివారిని చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు కూడా అక్కాచెల్లెళ్లే కావడం విశేషం. వారిద్దరూ నగరంలోని విల్లామేరీ కాలేజీలో చదువుతున్నారు. 


ఆదివారం హైటెక్స్‌లో మొదలైన ఈ పెళ్లి వేడుకలు ఏకంగా వారం పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆహ్వాన పత్రిక నుంచి పెళ్లి దుస్తుల దాకా ఏర్పాట్లన్నీ ఒక రేంజ్‌లో ఉన్నాయట. పత్రికను హైదరాబాదీ ముత్యాల్లో పెట్టి మరీ ఇవ్వగా, విదేశాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు, నగా నట్రా కోసమే ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేశారట. 
పెళ్లి కోసం మయసభను తలపించే రీతిలో, జోధా అక్బర్ సినిమా తరహాలో సెట్టింగ్ ఇప్పటికే ముస్తాబయింది.
రిసెప్షన్‌కు దాన్ని తలదన్నేలా అండర్‌వాటర్ థీమ్‌తో ముత్యపు చిప్ప ఆకృతిలో సెట్ తయారవుతోంది.


పసందైన విందు... వెరైటీ వినోదాలు

పెళ్లి భోజనాలు మాయాబజార్ వివాహ భోజనాన్ని తలదన్నే రీతిలో ఉంటాయట. ఒకరోజు బెంగాలీ, మరో రోజు నిజాం, ఇంకో రోజు రాజస్థానీ, తర్వాత పంజాబీ... ఇలా దేశంలోని పాపులర్ రకాలన్నీ కనువిందు చేస్తాయట. ఇవిగాక రిసెప్షన్, సంగీత్ కార్యక్రమాలకు స్పెషల్ విందులుంటాయి. ఇక్కడితోనే అయిపోలేదు. అరేబియన్ ఎడారి సెట్టింగ్‌లో వైవిధ్యభరితమైన సంగీతం నడుమ వినోద కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రష్యన్ బెల్లీ డ్యాన్సులు ప్రత్యేకమట. వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.


కొసమెరుపు:  ఇంతా చేస్తే, ఇంత ఖరీదైన ఈ పెళ్లిలో ఎక్కడా బాజాభజంత్రీల చప్పుడే విన్పించదు. అంతేకాదు, మాంగల్యధారణ కూడా ఉండదని పెళ్లి కొడుకులు, వారి తండ్రి చెబుతున్నారు. అదంతా తమకు పెద్దగా ఇష్టముండదని వారు చెప్పుకొచ్చారు.

Thursday, February 10, 2011

మ్యాచింగ్ మెహందీ

మాఘమాసం వచ్చిందంటే పార్లలో బ్యూటీషియన్స్ లేటెస్ట్ మెహందీ డిజైన్స్ ఎంచుకునే పనిలో పడిపోతారు. పెళ్లికూతురికి మెహందీ పెట్టడం అంటే చాలా పెద్ద పని. అరచేతి నిండా పెడితే సరిపోవడం లేదు. మోచేతి నుంచి మొదలుపెట్టాలి. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం. మార్వాడి బ్రైడల్ మెహందీలో పెళ్లికూతురు చేతులు, కాళ్లు అన్నీ ఎర్రగా మెరిసిపోవాలి.

ఎన్ని రకాలు...

పూర్వం డిజైన్ గురించి కంటే ఆకుమీదే ఎక్కువగా దృష్టిపెట్టేవారు. ఎవరి చెట్టు ఆకు ఎక్కువగా పండుతుందో తెలుసుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. కోన్‌లలో కలిపే రకరకాల పదార్థాల వల్ల కలర్ వద్దన్నా వస్తోంది. ఎటొచ్చీ ఆలోచనంతా డిజైన్ గురించే. వీటిలో అరబిక్, అరబిక్ బ్రైడల్, మార్వాడి బ్రైడల్, దేవదాస్ చాలా ప్రముఖమైనవి. పెళ్లికూతురికి మాత్రం ఎక్కువగా మార్వాడి బ్రైడల్ వేస్తారు. చిన్న చిన్న డిజైన్లతో మొత్తం చేయంతా నిండుగా కనిపిస్తుంది. ఎక్కడా లింక్‌పోకుండా డిజైన్ వేస్తారు.

చాలా సమయం పడుతుంది. రెండవది అరబిక్. పెద్ద పెద్ద పువ్వులతో ఉంటుంది. గీతలు, చుక్కలు వేయకుండా ఆకులు, పువ్వులు వంటి డిజైన్లు కనిపిస్తాయి. చూడ్డానికి సింపుల్‌గా, అందంగా ఉంటుంది. వేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. ఇందులో బ్రైడల్ డిజైన్ మళ్లీ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక చివరిది దేవదాస్. ప్రస్తుతం దేవదాస్ ట్రెండే నడుస్తోంది. అరచేతిలో సింపుల్‌గా రెండు పువ్వులు, కాలికి ఓ మూడు పువ్వులు విడివిడిగా వేస్తారు. చాలా సింపుల్‌గా ఉండే ఈ డిజైన్ అన్ని తరాలవారిని ఆకట్టుకుంటుంది.

మ్యాచింగ్ మహిమ...

మనకి తెలిసిన గోరింటాకు ఎర్రగానే పండుతుంది. మరీ బాగా పండితే మర్నాటికి నల్లబడుతుంది. కాని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కోన్‌లు ఎర్రగా, నల్లగా, పచ్చగా, తెల్లగా కూడా పండుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకోకండి. ఇదంతా మ్యాచింగ్ కోసం. పెళ్లికూతరు కట్టుకునే చీరకు తగ్గట్టు చేతిలో రంగులు మెరవాలన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దాంతో రకరకాల మిక్సింగ్ ప్రాడెక్ట్స్ మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఇందులో మొదటిది బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. ముందుగా కోన్ పెట్టుకుని చివర్లో మెహందీ బ్లాక్ పౌడర్‌ని నీళ్లలో కలిపి డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు.

రెండవది జర్దోసి. చీరలపైన చేసే జర్దోసి వర్క్‌లాగే చేతులపై కూడా ప్రత్యేకంగా డిజైన్ గీస్తారు. ముందు కోన్‌తో డిజైన్ పెట్టుకుని తరువాత జర్దోసి పొడిని గమ్‌లో కలుపుకుని డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు. ఈ జర్దోసి పొడి గోల్డ్, సిల్వర్, బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది. పెళ్లి చీరపై ఉండే రంగును బట్టి మెహందీ అవుట్‌లైన్ గీసుకోవాలి. మూడోది మిర్రర్ వర్క్ మెహందీ. సన్నగా, చిన్నగా ప్లాస్టిక్ పేపర్ మందంలో ఉండే మెహందీ మిర్రర్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. మెహందీ డిజైన్ వేసిన తర్వాత సందుల్లో ఈ మిర్రర్‌ని అతికిస్తారు. ఆరిన తర్వాత నీళ్లతో కడుగుతారు. పండిన గోరింటాకు మధ్యలో అద్దం ముక్కలు అలాగే ఉంటాయి.

ఐదారు రోజులు అలాగే మెరుస్తూ కనిపిస్తాయి. వీటన్నింటికంటే భిన్నమైంది నెయిల్‌పాలిష్ మెహందీ. మనకి కావల్సిన రంగు నెయిల్‌పాలిష్‌ని తీసుకుని పలుచగా చేసి కోన్‌లో కలుపుకోవాలి. ఏ రంగు నెయిల్‌పాలిష్ కలిపితే ఆ రంగు షేడ్ చేతిపై కనిపిస్తుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మెహందీని చేతిపైకి తెస్తున్నారు. ఫలితంగా రకరకాల రంగుల్లో మెహందీని చూడగలుగుతున్నాం.

రెడ్ టాటూలుగా...
మనం గోరింటాకు అని నోటినిండా పిలుచుకునే మెహందీని విదేశీ వనితలు రెడ్‌టాటూ అని పిలుస్తారు. నిజానికి టాటూ అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కాని ఒంటిపైన రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోడానికి అందరూ ఇష్టపడడం లేదు. అలాగని టెంపరరీ టాటూలను వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీని గురించి మనకు మిర్రర్ పార్లర్ డైరెక్టర్ విజయలక్ష్మి బాగా చెబుతారు..."మనకి మెహందీ అంటే ఎంత మక్కువో విదేశీ అమ్మాయిలకు టాటూలంటే అంతే ప్రాణం. కాని అవి వేసుకుంటే ప్రతీ రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోవాలి. ఇలా ఒకే డిజైన్‌ని చూసుకోడానికి ఇష్టపడని అమ్మాయిలు టెంపరరీ టాటూలను వేయించుకుంటున్నారు.

అయితే ఆ టాటూలు వేసే ముందు వాడే లిక్విడ్స్ వల్ల చాలామంది శరీరంపైన దద్దుర్లొస్తున్నాయి. దాంతో ఎందుకొచ్చిన తంటాలనుకుని వాళ్లు టాటూల జోలికి వెళ్లడం లేదు. అలాంటివారి దృష్టి ఇప్పుడు మన మెహందీపై పడింది. చక్కగా వారికిష్టమైన చోట నచ్చిన డిజైన్ వేయించుకుని మురిసిపోతున్నారు. మెడపైనా, నడుంపైనా, కాళ్లపైనా...ఇలా వారికి నచ్చినచోట మెహందీ టాటూలను వేయించుకుంటున్నారు. వాటికి 'రెడ్ టాటూ' అని పేరు పెట్టారు. కెమికల్స్‌తో కూడిన ఆ టాటూల కంటే ఈ మెహందీ పెట్టుకోవడం ఎంతో ఉత్తమమని ఇతరులకు సలహా కూడా ఇస్తున్నారు'' అని చెప్పారామె.

మెహందీ పండుగ ...

మనకు పెళ్లికూతుర్ని చేయడం అంటే నలుగుపెట్టి స్నానం చేయించడం, పట్టుచీర కట్టి ముస్తాబు చేసి గాజులు తొడగడం, వచ్చిన ముత్తైదువులకి పసుపుకుంకం తాంబూలం ఇవ్వడం. ఇప్పుడు వీటి జాబితాలో మెహందీ కూడా చేరింది. ఉత్తరభారతదేశంలో 'మెహందీ రసం' పేరుతో చేసుకునే ప్రత్యేక వేడుక కొంతకాలం క్రితం మన రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది. ధనవంతుల ఇళ్లలో తన ప్రత్యేకతను చాటుచుంటోంది. మెహందీ వేడుక అంటే పెళ్లికూతుర్ని చూడ్డానికి వచ్చిన ఆడవాళ్లందరికీ గోరింటాకు పెట్టిస్తారు. పదిమంది కానీ వందమంది కానీ అందరికీ పెట్టాల్సిందే. ఏడేళ్లుగా మెహందీ పెడుతున్న ధనలక్ష్మి తన అనుభవం చెబుతోంది.

"ఒక పెళ్లికి జరిగిన మెహందీరసానికి వెళ్లాను. నేనూ నాతో మరో అమ్మాయి కూడా వచ్చింది. చాలామంది పేరంటాళ్లు వచ్చారు. అందరికీ మెహందీ పెట్టాలి. అంతమందికి పెట్టాలంటే త్వరగా పెట్టే డిజైన్‌లని ఎంచుకోవాలి. అందుకే అందరికీ దేవదాస్ డిజైన్స్ వేసేసాము. ఇద్దరం కలిసి నాలుగు గంటల్లో నలభైమందికి పెట్టేశాం'' అని గుర్తుచేసుకున్నారామె. ఇక ఇందులో ఖరీదుల విషయానికొస్తే...కాళ్లూ చేతులూ ఫుల్‌గా వేయించుకుంటే వెయ్యినుంచి రెండువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. పెళ్లికూతురికైతే చేతులు, కాళ్లకు కలిపి మూడువేల నుంచి ఐదువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. ఐదారొందల రూపాయలకు పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి, పార్లర్స్‌ని బట్టి ఖరీదులు చెబుతున్నారు.

ఫ్లయిట్ ఎక్కేవారికి ప్రత్యేకం..
పెళ్లయిన వెంటనే ఫ్లయిట్ ఎక్కి వెళ్లె పెళ్లికూతుర్లకి మెహందీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు విజయలక్ష్మి. " పెళ్లయిన వెంటనే విదేశాలకి వెళ్లే పెళ్లికూతుళ్లు ఎక్కువవుతున్నారు. భర్త ఉద్యోగనిమిత్తమో, హనీమూన్ ప్రయాణమో...మొత్తానికి పెళ్లయిన వారంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లాల్సివస్తోంది. అక్కడ వేలిముద్రలు తీసుకుంటారు. ఆ సమయంలో వేళ్లకి గోరింటాకు ఉంటే ఒప్పుకోరు.

ఒకసారి దీని వల్లే ఒక పెళ్లికూతురు ప్రయాణం రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దాంతో మా దగ్గరికి వచ్చే పెళ్లికూతుర్లని ముందే అన్ని వివరాలు అడుగుతున్నాం. విదేశీయానం ఉన్నట్లయితే చేతినిండా మెహందీ పెట్టినా వేళ్లకి పెట్టం. పెళ్లిసమయంలో అందంగా కనిపించడం కోసం ఆ ప్రాంతంలో స్కెచ్‌తో రంగు వేస్తున్నాం. తరువాత కడిగేస్తే పోతుంది. విదేశాలకు వెళ్లాక ఆ వేళ్లభాగంలో కోన్ పెట్టుకోమని చెబుతాం. ఈ చిన్న జాగ్రత్త తెలియక చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు.'' అని వివరించారామె.