Showing posts with label hydarbadi. Show all posts
Showing posts with label hydarbadi. Show all posts

Thursday, September 15, 2011

1948 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ జ్ఞాపకాలు- గాయాలు

సెప్టెంబర్ 17 దగ్గరపడింది. 63 ఏళ్ళ క్రితం నిజాంపాలన అంతమై నైజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు అది. చాలాకాలం దాన్ని 'విమోచన దినం'గా జరుపుకున్నా ఇటీవల కాలంలో దాన్ని 'విద్రోహ దినం'గా పరిగణిస్తున్నవాళ్లూ ఉన్నారు. ఆనాటి పరిస్థితులను తెలియజేసే కొంతమంది కథనాలతో పరవస్తు లోకేశ్వర్ ఇటీవల తీసుకొచ్చిన 'నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవవీరులు, 1948 సెప్టెంబర్ పోలీసు యాక్షన్ జ్ఞాపకాలు - గాయాలు' పుస్తకం నుంచి వెంకటమ్మ అనే సీనియర్ హిందీ పండిట్ కథనాన్ని మీకు అందిస్తున్నాం...

"నా పేరు వెంకటమ్మ. సీనియర్ హిందీ పండిట్ టీచర్‌ను. ఇప్పుడు నా వయస్సు 55 సంవత్సరాలు. తేదీ జ్ఞాపకం లేదు. కాని 1944లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‌లనే. నాకప్పుడు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు. యాఖుత్‌పురా దగ్గర్ల ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ సంబరంగ తియ్యటి జిలేబీలు తిన్న. మా అమ్మమ్మ నన్ను వెంబడి పెట్టుకుని అవతలి బస్తీలకు తీసుకపోయి మూడు రంగుల జండాలను చూపెట్టింది. అంతా హడావుడి పండుగ వాతావరణం. లౌడ్ స్పీకర్లల్ల దేశభక్తి గీతాలు వస్తున్నయి. స్వాతంత్య్రం వచ్చింది అన్న మాటలు నా చెవులల్ల బడ్డయి. అయితే అది రెండవ స్వాతంత్య్రదినం, పోలీస్ యాక్షన్ జర్గిన తర్వాత 15-08-49 అని నాకు చాలా కాలానికి తెల్సింది.

నిజానికి హైద్రాబాద్ స్టేట్ ప్రజలకు అది మొదటి స్వాతంత్య్ర దినం క్రిందనే లెక్క.

సరే ఇప్పుడు నేను నిజాం పరిపాలన చివరి సంవత్సరాలలో జరిగిన రజాకార్‌ల దినాలు, 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీస్ యాక్షన్ సంగతులు, అవి మా కుటుంబంపై, ముఖ్యంగా నా బాల్యంపై వాటి ప్రభావం గురించి వివరిస్త. ఒక పెద్ద తుఫాను వచ్చినపుడు ఆ గాలివానకు ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మా ఎట్లా చలించి చెదిరి పోతయో అట్లనే మామూలు వ్యక్తుల జీవితాలు కూడా రజాకార్ మరియు పోలీస్ యాక్షన్ దినాల తాకిడికి చెల్లాచెదరై కష్టాలకు కన్నీళ్లకు గురయినాయి. అట్ల ఎంత మంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు తల క్రిందులయినాయో? వాళ్లు హిందువులైతేనేం? ముస్లింలైతేనేం?

మా బాపుకు బీదర్ దగ్గరల టీచర్ ఉద్యోగం. నా బాల్యం అక్కడే గడచింది. కాని రాజాకార్ల గడ్‌బడ్‌లు ప్రారంభమయ్యేసరికి మా బాపు అమ్మను పిల్లలందర్ని హైద్రాబాద్‌ల అమ్మమ్మ ఇంట్ల వదిలిపెట్టిండు. నెలకో, రెండు నెలలకో ఒకసారి వచ్చిపోయేది. అవతల రజాకార్ల భయం, ఇంట్ల మా మధ్య ఎడబాటు. మా అందరి జీవితాలు అల్లకల్లోలం అయినాయి. అమ్మ - బాపులకే కాదు, మా చిన్నపిల్లల జీవితాలలో కూడా సుఖశాంతులు దెబ్బతిన్నాయి. అమ్మతోపాటు, మా అక్క, నేను, ఒక తమ్ముడు. పెరట్లో రెండు గదుల రేకుల షెడ్లో ఉండేవాళ్లం.

బాపు కోసం ఏడుస్తూ....

ప్రతిరోజు నేను మా బాపును తలచుకొని ఆయన కోసం బెంగతో ఏడ్చేదాన్ని. మా ఎడబాటుకు, దుఃఖానికి మూలకారణాలు నాకు తెలియవు కదా! రాత్రిళ్లు బాపు కావాలని నేను ఏడుస్త్తుంటే అక్క అమ్మలాగ వోదార్చేది. అప్పుడు అమ్మ ఉస్మానియా దవఖానలో ప్రసవం కోసం ఉంది. నిండు గర్భిణి. నా మోకాళ్లకన్నీ గజ్జిపుండ్లు అయినవి. క్రిందపడినపుడు అవి పగిలి రక్తం, చీము కార్తుంటే ఓదార్చేవారు లేక బాపూ బాపూ అని ఏడ్చిన. అక్క ఇంటికీ దవఖానకు కాలినడకన పొద్దు మాపు చెక్కర్లు కొట్టేది. రిక్షాలెక్కటం పెద్ద విలాసం, పైస గల్లోల్ల పని. ఇక ఇంట్ల మా తమ్మునికి పెద్ద జ్వరం. డాక్టర్లు, మందులు ఏమిలేవు. అవుతల బజార్లల్ల బస్తీలల్ల హిందు - ముస్లింల కొట్లాటలు, రజాకార్ల దౌర్జన్యాలు. నేను తమ్ముని మంచం పక్కనే వాణ్ణి చూస్తూ కూర్చునేదాన్ని. నాల్గురోజుల జ్వరం తర్వాత వాడికి పోలియో ఎఫెక్ట్ అయ్యి ఒక కాలు చచ్చు పడిపోయింది. అమ్మ పొత్తిళ్లల్లో ఆడపిల్లను పెట్టుకుని ఇంట్లకు రాంగనే కొడుకు కాలు కుంటి కాలయ్యిందని తెల్సి గుండెపగిలి పెద్దగ ఏడ్చింది. ఆ కాలం అట్ల ఆటుపోట్లకు, అలల తాకిడికి గురికాకపోతే, మా వ్యక్తిగత జీవితాలల్ల అటువంటి విషాదాలు జరుగక పోయేటివి కాదా?

పోలీస్ యాక్షన్ దినాలు సెప్టెంబర్ నెల కదా! అప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు, చలి. ఆ వర్షం ముసురు చప్పుడుకు మా రేకుల షెడ్డు పెద్దగా శబ్దంచేసేది, ఇల్లంతా కారేది. రాత్రిల్లు నిద్ర కరువు. తమ్ముడు కాలు వేలాడేసుకుని మంచంలోనే ఉండేవాడు, అట్ల మా ఇంట్ల పేదరికంతో పాటు అవిటితనం కూడా తోడయ్యింది. కాలుకు నాటు వైద్యం చేయించింది అమ్మ. రోజుల తరబడి వాడికి చప్పిడి మెతుకులు, కారం పత్యం. వేడి పప్పన్నం కోసం రోజూ ఏడిచేవాడు. అదే నెలల వినాయక చవితి పండగ వచ్చింది. అమ్మమ్మ ఇంట్ల పాశం (పాయసం) సువాసనలు. దానికోసం వాడు సుదీర్ఘంగా ఏడుపు. అమ్మ బాలింత. చెల్లె పాలకోసం ఏడుపు. నేను బాపు కావాలని ఏడుపు. తమ్ముడు అవిటి వానిగనే కుంటుకుంటు రెండు మూడేండ్లు బ్రతికి, చివరికి ట్రాన్సిల్స్ రోగంతో చచ్చిపోయిండు. అప్పుడు వానికి ఆరేండ్లు. నిండ ఏడేండ్లు దాటకుండనే నూరేండ్లు నిండినయ్. ఈ విషాదాల కన్నీటికి మూల కారణాలు ఆనాటి సామాజిక పరిస్థితులే అని నేను బలంగా నమ్ముతున్నాను.

దినదిన గండంగా...

మా మామ కూడా స్కూల్ టీచర్ కనుక అన్ని సంగతులు ఆయనకు తెలుస్తుండేవి. రాత్రిపూట సిగరెట్ తాక్కుంట నిద్రపోకుండ, బెంచిమీదనే కూచోని, ఏదో దీర్ఘాలోచన చేస్తుండేవాడట. అమ్మ రాత్రిపూట నిద్రలేచి "ఏందన్నా అట్ల కూచున్నవ్, నిద్ర పోలేదా? అని అడిగితే "ఏం లేదమ్మా నిద్రపట్టలేదు'' అని దిగులుగ జవాబు ఇచ్చేటోడట. ఆ రోజులల్ల మా ఇండ్ల ముందుకు పొద్దుటిపూట మాదన్నపేట, సయిదాబాద్‌ల నుండి ఎరుకల ఆడవాళ్లు వచ్చి మాంసం అమ్మేటోళ్లు. గంపలల్ల వాట్ని పట్టుకొచ్చేది. వాళ్లు రవికెలు వేసుకోకపోయేది. వాల్ల నల్లటి శరీరాలు ఆ పొద్దుటపూట లేత ఎండలో మెరిసిపోవటం నేను బాగా గమనించేది.

మా మామ వాళ్లతో " రేపట్నించి మీరు రాకండి. పరిస్థితులు బాగలేవు, ఇట్ల తిరగకుండ్రి'' అని హెచ్చరించడం నాకు బాగా జ్ఞాపకముంది. యూనియన్ సైన్యాలు హైద్రాబాద్‌పై దాడి చోయబోతున్నాయని పుకార్లు మొదలయినాయి. నిజాం సర్కార్ ప్రతిరోజు రాత్రిపూట నగరంల బ్లాక్ అవుట్ చేసేది. నగరం అంతా చీకటి. కరెంట్ బంద్. బ్లాక్ అవుట్‌కు ముందు ఆకాశంలో ఎర్రలైట్ కాంతి వెలిగి పెద్దగా సైరన్ మోగేది, ఆ సిగ్నల్స్‌తో ఇండ్లల కూడా దీపాలు ఆర్పటం, కరెంట్ తీసేయటం చేయాలి. మా ఇంట్లో అందరు కూడా ఇంటి డాబా మీదికెక్కి విమానాలు వస్తున్నయా అని వాటి లైట్ల కాంతుల కోసం వెదికేవాళ్లం. విమానాలు వచ్చి మమ్మల్ని రక్షిస్తాయని ఎదురు చూసెటోళ్లం.

సరే పరిస్థితులన్నీ అట్ల ఉద్రిక్తంగ ఆందోళనగ ఉన్నప్పుడే బక్రీదు పండుగ సమీపించింది. ఆ పండుగకు కొన్ని రోజుల ముందు రజాకార్ల సమావేశంల దాని నాయకుడు కాసిం రజ్వీ ప్రసంగిస్తూ "ఈసారి బక్రీద్‌కు ఖుర్బానీగ గొర్రెల్ని కాదు, హిందువుల తలల్ని ఇవ్వాలని'' రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చిండు. కాని హిందువుల అదృష్టం కొద్దీ ఆ బక్రీద్ పండుగకన్న ముందే పోలీస్ యాక్షన్ జరిగి, హిందువులు రక్షింపబడ్డరు.

అయితే అతని ప్రకటన వినగానే హిందువుల గుండెలల్ల రైళ్లు పరిగెత్తినవి. ముఖ్యంగ హైద్రాబాద్ పట్నంల ఇక ఎట్లనన్న చావుతప్పదని, హిందువులు తాగటం, తినటం, విందులు చేసుకోవడం మొదలు పెట్టిండ్రు. మా మామ కూడా అన్ని కోపాలు తాపాలు మరచిపోయి ఇంట్ల పెద్ద దావతు ఏర్పాటు చేసిండు. పూరీలు, గారెలు, కోడిమాంసం, కల్లు, సారా అన్ని ఏర్పాట్లు చేసిండు. అందరికి దగ్గరుండి తృప్తిగ తినిపించిండు. అయితే ఆడోళ్లకు, పిల్లలకు ఈ అనుకోని సంబరాలేమిటో అర్థం కాలే. ఇప్పుడు పండుగలు ఏమీ లేవుకదా అని అడిగితే "మీకెందుకు తినరాదుండ్రి'' అని మెత్తగ కోపడ్డడు. కాని అసలు సంగతి చెప్పలే. మేము బెదురతమని, భయపడతమని. పోలీసు యాక్షన్ అయినంక తెల్లారి అసలు సంగతి చెప్పి"మనం బ్రతికి పోయినం. ఈ మిలిట్రీ రాకపోతే బక్రీద్ పండుగకు గొర్రెల్ని కోసినట్లు మనందర్నీ కోసేది'' అని సంతోషం ఆపుకోలేక అందర్ని కావలించుకుని ఏడ్చిండు.

జైహింద్..పలకరింపులు

సైన్యం వచ్చినంక ఇక ఆ సంబరాలు ఏమని వర్ణించను. పట్నంలనే కాదు, పల్లెపల్లెనా హిందువులు సైన్యానికి స్వాగతాలు పలికిండ్రు. హారతులు ఇచ్చిండ్రు. ఎక్కడ చూసిన గాంధీకీ జై, నెహ్రూకీ జై, భారత్ మాతాకీ జై నినాదాలు. ప్రతి గల్లీ మలుపులు, చౌరస్తాలల్ల, ఇండ్లమీద మూడు రంగుల జండాలు రెపరెపలాడినయ్. ఏ ఇద్దరు కల్సుకున్నా జై హింద్ అని పలకరింపులు.

పోలీస్ యాక్షన్ అయినంక తెల్లారి సాయంత్రం మేం ఆడపిల్లలం చాలా స్వేచ్చగా, సంతోషంగా గొబ్బెమ్మల పూజ చేసుకున్నం. ఆ సంతోష సందర్భంల నాకు మా ఇంటి ముందు రోడ్డు మీద ఆశ్చర్యం కల్గించే దృశ్యం కానవచ్చింది. ముందు మిలట్రీవాళ్లు మార్చ్‌పాస్ట్ చేస్తుంటే, వెనక మిలిటరీ ట్రక్కులు నెమ్మదిగ నడుస్తున్నయ్. ప్రతి ట్రక్కుకు పూల దండలు, గాంధీ నెహ్రు బొమ్మలు. ఆ మిలిట్రీ డ్రెస్సులు, టక్క టక్క బూట్ల చప్పుడు, వారి నెత్తుల మీద చిప్పటోపీలు చూడటం నాకు జీవితంల మొదటిసారి. ఆ దృశ్యాలు నా మనస్సుల నాటుకపోయినయి. "లిబరేషన్ ఆర్మీ'' అన్న పదం నాకు అప్పుడు తెలువదు కదా!

ఇక ఆ తెల్లవారి ఉదయం పది పదకొండు గంటలకు నేను ఇంటి ముంగిట అరుగు మీద ఆడుకుంటున్న. ఎందుకో తల ఎత్తి చూసేసరికి గల్లీ ప్రారంభంల, మసీదు పక్కనుండి వస్తున్న బాపు కనబడ్డడు. బాగా మాసి దుమ్ము పట్టిన దోవతి, కోటు మీద కండువా, చేతిల బట్టల సంచీ, చెదిరిన జుట్టూ... ఇదీ ఆయన రూపం. ఉత్త చేతులతోటి మా ముందుకు రావొద్దని ఆ సంచీల ఒక సేరు పుట్నాల పప్పు తీసుకొని వొచ్చిండు. నేను సంతోషం పట్టలేక బాపూ బాపూ అని అరుచుకుంట ఎదురుంగ ఉరికి ఆయన కాళ్లని గట్టిగా కావలించుకున్న. బాపు నవ్వుకుంట నన్ను ఎత్తుకొని ఇంట్ల కాలు బెట్టిండో లేదో పెంకలు ఎగిరిపోయేటట్లు "అమ్మా బాపు వొచ్చిండు'' అని గట్టిగ ఒర్లిన. అందరు పరిగెత్తుకొచ్చిండ్రు. బాపును కావలించుకుని అందరు ఏడ్చిండ్రు. బాపు కూడా ఏడ్చిండు.

స్కూల్లో చేరాను...

ఆ తర్వాత పోలీస్ యాక్షన్ కంప్లీట్ అయ్యి గడ్‌బడ్‌లన్నీ సద్దుమణిగినంక బాపు మమ్మలందర్నీ తీసుకుని తను పనిచేసే ఊరు కవేలీకి తీసుకపోయిండు. నాంపల్లి స్టేషన్ల రైలెక్కినం. మా స్వంత ఇంటికి మేం పోతున్నం అన్న సంతోషం మా అందరి ముఖాలల్ల వెలిగిపోయింది. నాకు ఆ ఊరు బాగా తెల్సిన ఊరే కదా! రైలుల కిటికీ పక్కన కూర్చుని బాపుతో విడవకుండ ముచ్చట్లు చెప్పిన. నీతోటి నేను కూడా రేపట్నించి బడికొస్త అని చెప్పిన. ఆ బడిల నా దోస్తులు నరేందర్‌రెడ్డి, శివారెడ్డిలు బాగున్నారా? వాళ్లు కలుస్తరా? అని అడిగిన. బుచ్చిరెడ్డి తాత ఎట్టున్నడు, మన చప్రాసి మామూ ఎట్లున్నడు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మా బాపు కసురుకోకుండ, విసుక్కోకుండా ఓపికగ అరటిపండు వొలిచి నోట్లె పెట్టినట్టు జవాబులు చెప్పెటోడు. ఆయన నన్ను ముందే సైకలాజికల్‌గ ప్రిపేర్ చేయించాలనుకున్నట్టుంది. చాలా నెమ్మదిగ నాకు సమ్‌జాయించిండు. చప్రాసీ మామూ లేడమ్మా, ఆయన వేరే స్కూలుకు తబాదలా అయ్యిండు. అది చాలా దూరం మనకు ఇక కనబడడు. మన బడి కూడా మునుపటిలాగ ఉండదు. దాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా కొత్త స్థలంల కొత్త బడి పెట్టుకుందాం అన్నడు.

ఆ తెల్లారి సాపాటు చేసి బాపు చిటికెన వేలు పట్టుకుని బడికి పొయ్యేసరికి నా గుండె గబిల్లుమంది. ఇంకెక్కడి స్కూలు అంతా కాలిపోయింది. కూలిపోయింది. మసిబారిన మొండిగోడలు నిలబడి ఉన్నయ్. నా నోట్లె మాట కరువయ్యింది. దుఃఖం పొంగుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న బాపు నన్ను దగ్గరికి తీసుకుని ఈపు నిమిరిండు. ఒక సంవత్సరం అక్కడున్నమో లేదో బాపుకు హైద్రాబాద్‌కు తబాదలా అయ్యింది. అలియాబాద్ స్కూల్‌కు మారిండు. నేను శంశీర్‌గంజ్‌లోని శారదా గర్ల్స్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్న''
 
వెంకటమ్మ
ఇంటర్య్వూ తేదీ: 15-06-99
సీనియర్ హిందీ పండిట్
మహాబూబియా గర్ల్స్ హైస్కూల్, హైదరాబాద్

Monday, April 18, 2011

చారిత్రాత్మక సంపాదకు చెర

శతృదుర్భేధ్యం గోల్కొండ కోట


కుతుబ్‌షాహిలు శతృదుర్భేధ్యంగా నిర్మించిన కోట లోని పలు నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా దక్కన్ సంస్కృతీ - సంప్రదాయాలు, రాజులు, రాణులు, వారి జీవన శైలి నాటి ప్రజల ఆచార వ్యవహారాలు ముఖ్యంగా యుద్ధ తంత్ర కళా నైపుణ్యానికి గోల్కొండ కోట సాక్షీభూతంగా నిలిచింది. సుమారు 500 ఎకరాలకు పైగా విస్తరించిన గోల్కొండ కుతుబ్‌షాహిల కాలంలో వజ్ర-వైఢూర్యాలు, మంచి ముత్యాలకు అరుదైన వర్తక వాణిజ్యంకు కేంద్రం.

సుమారు నాలుగు వందల అడుగుల ఎత్తైన పర్వతంపై కోటగోడలురాతితో నిర్మించారు. కోటలోపల మందుగుండు సామగ్రి నిల్వ చేసే మందిరాలు, సైనిక స్థావరాలు, మంత్రుల కార్యాలయాలు, రాణిమహల్‌లు, ఉద్యానవనాలున్నాయి. అంతే కాకుండా ఫతే దర్వాజా- మూసా బురుజులకు మధ్య వాయవ్యదిశలో దివాన్ మహల్ ఉంది. అప్పట్లో దీన్ని తానీషా కొలువులో పని చేసిన అక్కన్న- మాదన్నలు కార్యాలయంగా వినియోగించారు. అలాగే బాలాహిస్సార్ దర్వాజాకు ఎదురుగా రెండు కమాన్‌లు హబ్సికమాన్‌లున్నాయి. రాజభవనాలకు కిందిభాగంలో జీలుఖానా ఇలీ మైదానం వుంది. దీనికి సమీపంలోనే శిధిలమైన మసీదు ఉండేది. సైనిక వందనం కోసం ఈ మైదానాన్ని వినియోగించేవారు. అలాగే కోట పై భాగంలో కొండపై కన్పించే సుందర నిర్మాణం బాలాహిస్సార్. కుతుబ్‌షాహి మందిరాలు, విధాన సభ హాల్, మూడు అంతస్థులో బరాదరినిర్మాణం ఉంది.

దీని పై అంతస్థులో రాతి సింహాసనం ఉండేది. బాలాహిస్సార్ మొదటిగేట్ నుంచి బరాదరి వరకు సుమారు 360 మెట్లున్నాయి. బరాదరిలో మొదటిది దర్బార్-ఎ- ఆమ్ (ఇక్కడికి సామాన్య ప్రజలను అనుమతించేవారు) రెండోది దర్బార్-ఎ-ఖాస్ ( ఇక్కడ మంత్రి వర్గ సమావేశాలు నిర్వహఙంచేవారు), మూడో అంతస్థులో కుతుబ్‌షా ఏకాంత మందిరం. ఇక క్రింది వైపు రామదాసు బందిఖానా, అక్కన్న మాదన్నలు నిర్మించిన జగదాంబ మందిరం, మసీదులున్నాయి. గోల్కొండకు సుమారు అయిదు కిమీ దూరంలోని దుర్గం చెరువు నుంచి కోటపైభాగానికి నీటిని పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఆ కాలంలో ఉండేవట. అంతే కాకుండా గోల్కొండ నుంచి చార్మినార్ వరకు రహస్య సొరంగమార్గం ఉండేదని ప్రచారం.
 
 
కుతుబ్‌షాహి పాదుషాల స్మృతి సౌధలకు 'యునెస్కో' గుర్తింపు దక్కేనా..?

గోల్కొండ కోటకు వా యువ్య దిశలో వంద ఎకరాల తోట ఇ బ్రహీంబాగ్‌లో వెలిసిన ఏడుగురు కు తుబ్‌షాహి పాదుషాల స్మృతి సౌధల ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తింపు పొందాల్సి ఉంది. కానీ చుట్టూ వెలిసిన అక్రమ నిర్మాణాలతో అస్తవ్యస్థంగా మారడంతో యునెస్కో గుర్తింపునకు నోచుకోలేదు.కుతుబ్‌షాహి నిర్మాణాల పేరి ట గుర్తించేందుకు అనువుగా అక్రమణలు తొలగించి పర్యాటకులను ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్ది ప్రతిపాదనలు పంపితే గుర్తింపు దక్కే అవకాశం ఉం టుందని ప్రతినిధులు సూచించారు.ఈ మేరకు రాష్ట్ర పురాతత్త్వ శాఖ అధికారులు రెండో సారి గోల్కొండ టూంబ్స్ పై సమగ్ర సమాచారాన్ని సేకరించి యునెస్కోకు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా 525 ఏళ్ల క్రితం నాటి కుతుబ్‌షా సమాధుల నిర్మాణాలు ప్రపంచవారసత్వ సంపదజాబితాలో చేరేఅవకాశం ఉంటుంది.

కుతుబ్‌షాహి వంశంలో తొలి రాజు సుల్తాన్ కులీ కుతుబ్‌షా (1543) నుంచి ఆ వంశంలో ఏడో రాజు అబ్దుల్లా ఖుతుబ్‌షా (1614-1672) వరకు సమాధులు ఈప్రాంతంలోనే ఉన్నా యి.చివరి రాజు సుల్తాన్ అబ్దుల్ హసన్ తానీషా (1672-1687) అధికారంలో ఉండ గా ఔరంగజేబు దండయాత్రతో బందీ గా మారి ఔరంగాబాద్‌లో 12 ఏళ్లు కారాగారవాసం చేసి మరణించాడు.దీంతో ఆయన సమాధి గోల్కొండలో నిర్మించలేదు. తోట ఉత్తర దిశలో మొ దటి సుల్తాన్ కులీ కుతుబ్‌షా సమాధి ఉంది. దానికి సమీపంలోనే ముగ్గురు పాదుషాలు జంషీద్ కుతుబ్‌షా (1543-1550), సుబాన్‌కులీ కుతుబ్‌షా (1550-1551), ఇబ్రహీం కులీ కుతుబ్‌షా (1550-1580) సమాధులున్నాయి. వీటికి దక్షిణ భాగంలో హైదరాబాద్ నగర వ్యవస్థాపకులు మ హ్మద్‌కులీ కుతుబ్‌షా (1580- 1612) సమాధి ఉంది. విశిష్ట వాస్తు నిర్మాణం. దీనికి సమీపంలోనే ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా మసీదు ఉంటుంది.

ఆగ్నేయ భాగంలో ఆరవ సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612-1626) సమాధి, ఏడో రాజు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672) సమాధిని ఇబ్రహీంబాగ్ తోటకు ఆవలి వైపున నిర్మించడం విశేషం. అంతే కాకుండా ఈసముదాయంలో హైదరాబాద్ న గర వ్యవస్థాపకులు మహ్మద్‌కులీ కు తుబ్‌షా కూతురు హయత్‌భక్షీ బేగం సమాధి, ఇబ్రహీం కుతుబ్‌షా ఆరవ కుమారుడు మీర్జా మహ్మద్ అమీన్ సమాధి,అబ్దుల్‌కుతుబ్‌షా పెద్ద అల్లు డు సయ్యద్ అహ్మద్ సమాధి, రాజకుమారికుల్సుంబేగంసమాధులున్నాయి. అప్పట్లో రంగుల పుష్పాలనిచ్చే ఉద్యానవనంలో రాజుల స్మృతి సౌధలను ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. బా హ్యతలంలో సమాధులన్నీ రూపంలో ఒకే రకంగా కన్పించినా పరిమాణంలోనూ, నిర్మాణంలోనూ, కుడ్యవాస్తు నగిషీల్లో వైవిధ్యం కన్పిస్తుంది.

ఇరాన్ వాస్తు శైలికి ప్రతీకగా నిలిచే సమాధుల నిర్మాణంలో ఇండో-ఇస్లామిక్ సమ్మిశ్రిత వాస్తు వైవిధ్యం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. సమాధుల లోపలి భాగాలను ఇరాన్ సెరామిక్ టైల్స్‌తో అలంకరించి ఉండడం విశేషం. అసఫ్‌జాహిలు ఈ నిర్మాణాలను పరిరక్షించేందుకు విశేషంగా కృషి చేశారు. ప్రధానంగా సాలార్‌జంగ్-1 ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో కుతుబ్‌షాహి టోంబ్స్ పరిరక్షణకోసం లక్షలాది నిధులు వ్యయం చేయించారు. అలాగే వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సమాధుల పునాదులు వర్షపు నీటితో బలహీనమైనట్టు గుర్తించిన పురాతత్వ శాఖ అధికారులు సమాధుల భాగాలను పటిష్టపరిచే పనులు చేపట్టారు.
ఆక్రమణలతో అన్యాక్రాంతమైన సుమారు మూ డు ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కుతుబ్‌షాహి సమాధుల ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా తక్షణం గుర్తించాల్సిన అవసరం ఉంది.

పైగా టూంబ్స్ పరిరక్షణపై నిర్లక్ష్యం


ధ్వంసమవుతున్న పాలరాతి నిర్మాణాలు
అన్యాక్రాంతమవుతున్న సమాధుల స్థలాలు


నిజాం నవాబుల వద్ద ప్రధానులుగా ఇతర కీలక బాధ్యతలు నిర్వహించిన పైగా నవాబుల కుటుంబ సభ్యుల సమాధులన్నీ ఒకే చోట ఉన్నాయి. సంతోష్‌నగర్ సమీపం లోని ఈ సమాధులు పాలరాయి, రంగు రాళ్లతో అలంకరించిన ఇవి హైదరాబాద్ తాజ్‌మహల్‌గా సుప్రసిద్ధం. 1786లో మరణించిన నవాబ్ తేజ్ జంగ్ షంషూల్ ఉమ్రా బహదూర్ సమాధి మొట్టమొదటి సమాధి. దాని పక్కనే నవాబ్ సర్ అసమాస్‌జా బహదూర్, నవాబ్ సర్ ఖుర్షీద్‌జా బహదూర్, సర్ వికార్ ఉల్ ఉమ్రా బహదూర్, నవాబ్ సెషర్ జంగ్ బహదూర్‌ల సమాధులు వరుసగా ఉన్నాయి. కాగా మూడో నవాబ్ షంషుల్ ఉమ్రా, బేగం ఖుర్‌షీజా బహదూర్ సమాధులను రంగు రాళ్లతో నిర్మించడం విశేషం. సమాధుల సముదాయానికి ప్రవేశించే ద్వారం రెండంతస్థుల్లో ఉంది. నౌబత్ ఖానాగా వ్యవహరించే ఈ ద్వారం పై భాగంలో నిర్ణీత సందర్భంలో ఢంకా వాయిధ్యాలను వినియోగించేవారు. ఇక సమాధుల ఆవరణకు కప్పి ఉంచినట్టుగా పాలరాతి అల్లికల కమాన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

కాగా పురాతత్వ శాఖ పర్యవేక్షణలోని ఈ నిర్మాణాల పరిరక్షణ పై నిర్లక్ష్యం కారణంగా చోరుల దాడిలో అమూల్యమైన రంగురాళ్ల అలంకరణలు అదృశ్యమవుతున్నాయి. పాలరాతి నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. ఆక్రమణదారుల చేతిలో చిక్కిన సమాధుల స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రపంచ పర్యాటకులకు అమితంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దిన పయిగా నవాబుల స్మృతి సౌధాలు శిథిల కేంద్రాలుగా మారుతున్నాయి. పరిరక్షణ పనులను ఉపేక్షిస్తే చారిత్రాత్మక ఆనవాళ్లు అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. 

ఖరీదైన హోటల్‌గా సోకు చేసుకున్న ఫలక్‌నుమా ప్యాలెస్


నిజాం కాలంనాటి రాజభవనం నేడు సంపన్నుల విడిది కేంద్రంగా రూపుదాల్చింది. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో స్టార్ హోటల్‌గా గుర్తింపు పొందింది. చార్మినార్‌కు సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో చిన్న కొండపై రాజభవన నిర్మాణానికి అప్పటి నిజాం ప్రధాని వికారుల్ ఉమ్రా 1884లో పునాది వేశారు.1892-93లో పనులు పూర్తి చేయించారు. అప్పట్లో ఈ నిర్మా ణం కోసం సుమారు రూ. 40 లక్షలు వ్యయం చేశారు. కాగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ భవనంలోని విశిష్టతను గుర్తించి 1895 లో నిర్మాణ వ్యయాన్ని చెల్లిం చి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1911లో ఈ భవనంలోనే ఆయన కన్నుమూశారు. కాగా, ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణానికి ఇటాలియన్ పాలరాయి, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న కలపను వినియోగించారు. ఇందులోని ప్రతిగది వైవిధ్యంతో కళాత్మకంగా దర్శనమిస్తుంది.

పొద్దుతిరుగుడు పూలు, ఇతర పుష్పాకృతులు సౌందర్య భరింతగా కన్పిస్తాయి. సీలింగ్‌పై పక్షి చిత్రం విశేషమైనది. గదిలో కూర్చుని ఎటువైపు చూస్తే అటువైపునే ఎగిరిపోతున్నట్టు కన్పించే ఈ చిత్రం నాటి కళాకారుల నైపుణ్యతను ప్రదర్శిస్తుంది. ఇందులో 36 షాండిలియర్స్‌తో వెలుగులు విరజిమ్మే సింహాసన గది, సువిశాల గదుల గోడలను నగిషీలతో అద్భుతంగా తీర్చి దిద్దారు. విశాలమైన డైనింగ్ టేబుల్ లో 102 టేబుల్స్ ఉన్నాయి. కార్డ్ రూం, బిలియర్డ్స్ రూం, స్మోకింగ్ సూట్స్ ఒకటేమిటి ఒక్కోహాల్‌కు ఒక్కో విశిష్టత ఉంది. ఈ రాజఠీవిని ప్రదర్శించే ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అద్భుత నిర్మాణంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో సంపన్నుల విడిది కేంద్రంగా మారింది. తాజ్‌గ్రూపు పర్యవేక్షణలోని ప్యాలెస్ హోటల్‌లో ఒక్కో సూట్‌కు రోజుకు రూ.4.5 లక్షలకు పైగా అద్దె రూపంలో ఆదాయం చేకూరుతోంది.

చౌమహల్లా ప్యాలెస్‌కు అరుదైన గౌరవం


యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు జాబితా - 2010 లో స్థానం దక్కించుకున్న చారిత్రక కట్టడం

అసఫ్‌జాహి నవాబుల రాజసానికి, గాంభీర్యానికి మొఘలాయి రీతి శిల్పకళా పాటవానికి అరుదైన గౌరవం దక్కింది. 1857-1869 మధ్య కాలంలో అయిదో నిజాం నవాబు అఫ్జలుద్దౌలా బహదూర్ కాలంలో నిర్మించిన చౌ మహల్లా ప్యాలెస్‌కు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు బాబితా-2010లో చోటు దక్కింది. ఈ ప్యాలెస్‌లోని అప్‌తబ్‌మహల్, మహతబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్‌మహల్‌లు ప్రధాన నిర్మాణాలు. వీటితోనే ఆ ప్యాలెస్‌కు చౌమహల్లా ప్యాలెస్ అని పేరు వచ్చింది.

ఈ ప్యాలెస్ ఉద్యానవనంలోని వాటర్ ఫౌంటేన్‌లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక దర్బార్‌హాల్‌లో రంగురంగుల విద్యుత్ దీపకాంతులను విరజిమ్మే షాండిలియర్స్ ప్రత్యేక ఆకర్షణ. ఈ భవన సుముదాయంలోని చాందినీ బేగం కీ హవేలీ, ఖక్షీబేగంకీ హవేలీ, మంజిలీ బేగంకీ హవేలీ, మోతిబంగ్లా, తోషాఖానా, కుల్‌హి పిరాన్, రసగ్‌మహల్‌ల్‌లో కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలోని ప్యాలెస్ కోసం కోట్లాది నిధులు వెచ్చించి నాలుగేళ్ల పాటు మరమ్మతులు చేయించి పునరుద్ధరించారు. సుమారు అర్ధ దశాబ్దం పాటు నిరాదరణకు గురైన ప్యాలెస్‌కు పూర్వ వైభవం చేకూర్చడంతో గతేడాది యునెస్కో 2010 ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డు ఫర్ కల్చర్ హెరిటేజ్ కన్జర్వేషన్‌ను దక్కించుకుంది.

మృతవీరులకు అశ్రుతర్పణం చేసే... బాద్‌షాహి అషూర్‌ఖానా

మూసీనదితీరానికి సమీపంలో మదీనా భవనానికి ఎదురుగా సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలోని బాద్‌షాహి ఆషూర్‌ఖానా కుతుబ్‌షాహి పాలకుల అద్భుత నిర్మాణం. 1594లోమహ్మద్ కులీ కుతుబ్‌షా ని ర్మించారు. 1611లో సుల్తాన్ మహ్మద్ కాలంలో నీలిరంగు ఖురాన్ సూక్తుల టైల్స్‌తో అలంకరించారు. బాద్‌షాహి అషూర్‌ఖానాలో మొహరంసందర్భం గా షియాలో సంతాపదినాలను పాటిస్తారు.సుమారు 38 అడుగుల ఎత్తు లో రాతి స్థంభాలపై నిర్మించిన అషూర్‌ఖానా ముందుభాగంలోని నిర్మాణాలు శి«థిలావస్థకు చేరుకుని ఇటీవ లే కుప్పకూలాయి.

నగర్ ఖానా గోడ లు శి«థిలమయ్యాయి. కొంత మంది ఆక్రమించి అషూర్‌ఖానా ప్రాశస్త్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించగా హైకోర్టు చొరవతో ఆర్కియాలజీ విభాగం అధికారులు స్పందించి ఆక్రమణ దారులనుతొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఈ శి«థిల నిర్మాణాలను పునరుద్ధ్దరించి హైదరాబాద్ ఇస్లామిక్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికై ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వందలాది ఏళ్ల ఇండో- ఇరాన్ సమ్మిళిత వాస్తు సంస్కృతికి కేంద్రంగా నిలిచిప బాద్‌షాహి అషూర్‌ఖానాను పరిరక్షించి భవిష్యత్ తరానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

కాలుష్యం నుంచి చార్మినార్‌కు విముక్తి

ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని యునెస్కోకు ప్రతిపాదనలు
గోల్కొండ కోటలో జనాభా పెరిగి కిక్కిరిసి పోవడంతో అప్పటి పాదుషా మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీనది తీరంలో చార్మినార్‌తో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేశారు. సుమారు 180 అడుగుల ఎత్తులో నాలుగు వైపులా విస్తరించిన చార్మినార్ దేశ, విదేశీ పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తోంది. 1591 లో చేపట్టిన ఈ నిర్మాణం పనులు 1594లో పూర్తి చేశారు. దీనిపైకి ఎక్కడానికి నాలుగు మినార్‌ల నుంచి సుమారు 149 మెట్లున్నాయి. రెండో అంతస్థులో ప్రార్థనలు జరుపుకునేందుకు అనువుగా మసీదు ఉంది. అలాగే ఒకటో అంతస్థును నగర వాసులకు ప్రభుత్వ ఆదేశాలు తెలియజేసేందుకు అప్పట్లో దండోరాకు వినియోగించేవారని ప్రచారం.

ఇస్లామిక్ వాస్తు శైలిలో కింది నుంచి చార్మినార్‌ను పరిశీలిస్తే ఆకాశం మబ్బుల నుంచి తేలిపోతున్నట్టుగా కన్పించే చార్మినార్ నిర్మాణం ధ్వని, వాయు కాలుష్యాలతో శిథిలావస్థకు చేరుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని కేవలం పాదచారులకే పరిమితం చేస్తూ గ్రేటర్ పాలక సంస్థ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. గత ఆగస్టులో కురిసిన వర్షాలతో చార్మినార్ ఆగ్నేయ మూల రెండో అంతస్థులోని పై కప్పు పెళ్లలూడిపోయాయి. నగిషీల భాగం కూలిపోయింది. అంతకు ముందు చార్మినార్ పిడుగు తాకిడికి గురికావడంతో కొంత భాగం ధ్వంసమైంది.

దీంతో భవిష్యత్‌లో పిడుగు పాటు సమస్య లేకుండా పంచలోహాల తీగను అమర్చారు. అలాగే ఈ ప్రాంతంలో వాయు కాలుష్యానికి ఆస్కారం లేకుండా వాహనాల రాకపోకలు నిషేధించేందుకు పాదచారుల ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. చార్మినార్‌కు నాలుగు వైపులా గుల్జార్‌హౌస్, లాడ్‌బజార్, ఆర్టీసీ బస్ స్టేషన్, సర్దార్‌మహల్ వరకు రోడ్లపై గ్రానైట్‌ను నిర్మిస్తున్నారు. పాదాచారులు మాత్రమే వెళ్లి వచ్చేందుకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర పురాతత్వ శాఖ పర్యవేక్షణలోని చార్మినార్‌ను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని కోరుతూ అధికారులు యునెస్కోకు ప్రతిపాదనలు పంపారు. 

స్టేట్ మ్యూజియంలో అపురూప సంపద

ఏడో నిజాం కూతురు బొమ్మల కొలువు కోసం నిర్మించిన భవనంలో ప్రస్తుతం రాష్ట్ర పురావస్తు మ్యూజియం కొనసాగుతోంది. పబ్లిక్‌గార్డెన్స్‌లో ఇండో-పర్షిన్ పద్దతిలో 1914లో నిర్మించిన అపురూప వాస్తు శైలిలోని భవనం ద్వారాలు, కమాన్‌లపై నిజాం టోపీ గుర్తులు దర్శనమిస్తాయి. అప్పట్లో ఈ భవనంలో సైతాన్‌లున్నాయనే ప్రచారం జరుగడంతో నిజాం కూతురు బొమ్మల కొలువు రద్దయింది. 1928 లో దీన్ని పారిశ్రామిక ప్రదర్శనకు వినియోగించారు. 1930లో గులాం యజ్దానీ చొరవతో దీన్ని పురావస్తు సంపదను భద్రపరిచే నిలయంగా మార్చారు. ఇందులో గోల్కొండ కుతుబ్‌షాహీల ఆ యుధాలు, దుస్తు లు, నిజాంలు సేకరించిన ఇతర ఆయుధ సంపత్తి, నాణేలు, తదితర వస్తు సంపదను ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభ్యమైన అపురూప పురావస్తు సంపద, బుద్దుని అవశేషాలు, శిల్పాలు, శిలలు, చిత్రకళాఖండాలు, శాసనాలను ప్రదర్శిస్తున్నారు.

అంతే కాకుండా 2500 ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ రాజకుమారి శవం (మమ్మీ) సందర్శకుల ప్రధాన ఆకర్షణ. శిల్పాలు, లోహవిగ్రహాలు, శిలా శాసనాల ప్రదర్శనల కోసం వేర్వేరు గ్యాలరీలను అభివృద్ధి చేశారు.

హెరిటేజ్ భవనాలకు నిధులు సమకూర్చాలి 

- ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ అనురాధారెడ్డి

రాష్ట్ర ఆర్కియాలజీ పరిధిలోని పురాతన నిర్మాణాల పరిరక్షణపై కేంద్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది. కాని ఇనిస్టిట్యూషనల్ నిర్మాణాలపై శ్రద్ధ తీసుకునేవారు కరవయ్యారు. దీంతో అరుదైన వాస్తు శైలిలో ఉన్న నిర్మాణాల పరరక్షణ డోలాయమానంలో పడిపోయింది. ప్రభు త్వం ఇతోధికంగా నిధులు సమకూర్చాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ స్వాధీనంలోని కోఠి ఉమెన్స్ కళాశాల భవనం (కోఠి రెసిడెన్సీ) పరరక్షణ కు నిధుల కొరత తీవ్రంగా ఉంది. సిటీ కళాశాల సైతం అదే విధంగా మారింది. ఇన్‌టాక్ ప్రతినిధులు సమీక్షించి పునరుద్దరణకు నిధులు మంజూరు చేయాలని రెండు మూడు పర్యాయాలు అభ్యర్థలను పంపాం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక గోల్కొండ టోంబ్స్, చార్మినార్ తదితర నిర్మాణాలు బాగానే ఉన్నాయి. 

యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం 

- ఆర్కియాలజీ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి

  ఏళ్ల తరబడి నుంచి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గోల్కొండ కుతుబ్‌షాహి సమాధులకు మరమ్మతులు చేపట్టి యునెస్కో గుర్తింపు కోసం మొదటి సారిగా ప్రతిపాదనలు పంపాం. యునెస్కో ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. గుర్తింపు నకు అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. ప్రతిపాదనల రూపకల్పనలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. గోల్కొండ కోట, చారిత్రాత్మక చార్మినార్ నిర్మాణాలను కలిపి కుతుబ్‌షా వారసత్వం పేరుతో మళ్లీ సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో సహా పంపాం. యునెస్కో ప్రతినిధుల పరిశీలనలో ఉన్నాయి. ఈ యేడు కచ్చితంగా కుతుబ్‌షాహి టూంబ్స్, కోట, చార్మినార్ నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు లభిస్తుందని విశ్వసిస్తున్నాను.

Saturday, April 16, 2011

తెలంగాణ గడీలు ఎవరి ఆస్తి?

తెలంగాణలో శతాబ్దాల పాటు కొనసాగిన దొరతనానికి సాక్ష్యాలవి. ఓ వైపు దొరల దర్పానికి నిలువెత్తు దర్పణాలుగా, మరోవైపు గడీ అంటేనే గడగడ వణికిన ప్రజల భయాలకు సజీవ సాక్ష్యాలుగా ఇవి నేటికీ నిలిచి ఉన్నాయి. పాతతరం మనుషుల్లో గడీ పేరు వినగానే ఇప్పటికీ కళ్లల్లో గగుర్పాటు... శరీరమంతా జలదరింపు కన్పిస్తాయి. దొర పిలుపు వచ్చిందంటే పులి బోనులోకి వెళుతున్న మేకపిల్లలా హడలెత్తిపోయేవారు జనం. ప్రాణాలకే కాదు ఆడవాళ్ల మానాలకూ... బయటకు విన్పించని ఆర్తనాదాలకూ ఆలవాలంగా ఉండే గడీలు ఇటీవల మళ్లీ వార్తల్లోకొచ్చాయి.

తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత గ్రామాలు వదిలి పట్టణాలకు పారిపోయిన దొరలు, వారి వారసులు ఇప్పుడు మళ్లీ గ్రామాలకు వెళ్తున్నారు. ఊరు గుర్తుకొచ్చి కాదు. ఊళ్లలో ఉన్న తమ ఆస్తులు గుర్తుకొచ్చి. పల్లెల్లో కూడా భూముల విలువ పెరగడంతో దొరలు మళ్లీ పల్లెకొచ్చి తమ గడీల్ని, పొలాల్ని అమ్మకానికి పెడుతుంటే అవి తమని, తమ శ్రమని దోచుకుని నిర్మించినవి కాబట్టి అవి తమ ఉమ్మడి సొత్తని, వాటిని అమ్మడానికి వీల్లేదని గ్రామాల్లోని ప్రజలు తిరగబడుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్‌గల్ గ్రామంలో అదే జరిగింది...

చల్‌గల్ గడీ

చల్‌గల్‌లో ఉన్న గడి రాజుల కోటని తలపిస్తుంది. సిమెంట్ కన్నా బలమైన డంగు సున్నంతో నిర్మించిన ఆ గడీ గోడలు నేటికీ చెక్కు చెదరలేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్తంభాలతో ఉండే ఆ గడి రెండో అంతస్థుపైకెక్కి చూస్తే చుట్టూ ఐదారు కిలోమీటర్ల మేర ఉన్న పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణభూపాల్‌రావు చాలా ఏళ్ళ క్రితమే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. చల్‌గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలోనే ఉండడంతో భూమి రేట్లు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. దాంతో భూపాల్‌రావు గడీని అమ్మడానికి గతేడాది నవంబర్ 9న గ్రామానికొచ్చాడు. వాళ్ల కోరికను గడీని, గడీ స్థలాన్ని ఊరికి విరాళంగా ఇవ్వాలని చల్‌గల్ గ్రామస్తులు కోరారు. భూపాల్‌రావు పట్టించుకోకుండా గడీని అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన గ్రామస్థులు భూపాల్‌రావుని చుట్టుముట్టి మూడు, నాలుగు గంటల పాటు నిలువరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనని అక్కడి నుంచి పంపించేశారు. ఆ సమయంలో గ్రామస్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి చివరికది లాఠీచార్జి నుంచి కాల్పుల దాకా వెళ్లింది. చాలామంది గ్రామస్తులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎవరినైనా అరెస్టు చేస్తే ఐక్యంగా పోరాడాలని కూడా నిర్ణయించారు గ్రామస్తులు. చల్‌గల్ గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.

ఎన్ని హంగులో..

ఇది మరో గడీ కథ... ఇప్పటి ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ చుట్టుపక్కల ఉన్న జగ్గాసాగర్, అయిలాపూర్, భీమారం తదితర 80 గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్‌రావ్ ఆధీనంలో ఉండేవి. ఆ ఊళ్లో కట్టిన గడీలలో అప్పట్లోనే అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. జర్మనీ నుంచి పాలరాతిని, విలాస వస్తువుల్ని తెప్పించినట్లు చెపుతా రు. అప్పట్లోనే విద్యుద్దీపాలతో (జనరేటర్ సాయంతో) వెలిగిపోతున్న గడీని కిరోసిన్ దీపాలు కూడా లేని ప్రజలు వింతగా, విచిత్రంగా చూసేవారట. గడీలకి పైప్‌లైన్లలో తాగునీటి సౌకర్యం కూడా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ని ఇప్పటికీ గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు.

1982-83 ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం వల్ల రాజా అనంత కిషన్‌రావ్ వారసులైన గజసింహరావ్, నరసింహరావుల కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. నక్సల్స్ ప్రభావం తగ్గుముఖం పట్టాక గ్రామంలో ఉన్న వారి స్థిరాస్తులు కొన్ని అమ్ముకున్నారు. పాత గడీని అమ్మేసి కొత్త గడీని కూల్చేసి విలువైన వస్తువులు, ఫర్నిచర్‌ని తీసికెళ్లిపోయారు. బండలింగాపూర్ సంస్థానం పరిధిలో ఇప్పటికీ వాళ్ల వారసుల స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకుని ఉన్న స్థలాన్ని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసి)కి అప్పగిస్తే అందులో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. కల్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణుగోపాలస్వామి ఆలయానికి ఆండాళ్ దేవికి 4 లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కల్యాణానికి సంస్థాన వారసులు గ్రామానికి వస్తారు. వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికే దొరలు దానం చేస్తున్నారని విమర్శించే వాళ్ళూ లేకపోలేదు.

కొందరు దొరలు దాతలే!

ఆర్థిక సంస్కరణలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలతో ఇప్పుడు పల్లెల్లో కూడా పరిస్థితి మారింది. జనాభా కూడా పెరిగింది. పెరగనిదల్లా భూమి మాత్రమే. నక్సలైట్ల అలికిడి తగ్గిపోవడం, భూముల విలువ పెరగడం వల్ల కొంతమంది దొరలు గడీల్ని, తమ భూముల్ని అమ్మకానికి పెట్టడంతో వివాదాలు మొదలవుతున్నాయి. ఎకరానికి ఇంత రేటని నిర్ణయించి... ఇన్నాళ్ళూ బీళ్లుగా ఉన్న తమ భూముల్ని సాగు చేసుకుని దాని నుంచి వచ్చిన ఆదాయంతో డబ్బు కట్టమని గ్రామస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలా నాలుగైదేళ్లు సాగు చేసుకున్నాక డబ్బు కట్టే విధంగా కౌలుదారుల చేత కాగితాలు రాయించుకుంటున్నారు. నాలుగైదేళ్లకైనా సొంత భూమి కల నెరవేరుతుందనిచాలామంది దొరల బీడుభూముల్ని మళ్లీ సాగుభూములుగా మారుస్తున్నారు. ఇలాంటి సౌలభ్యాలేవీ గడీలకు లేకపోవడంతో నేరుగా అమ్మకానికి పెడుతున్నారు దొరలు. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యే ఒక చిన్న గడీని 8 లక్షలకు అమ్మితే దాన్ని కొన్న వాళ్లు మెరుగులు దిద్ది దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్‌ని ప్రారంభించారు. గడీలను పాఠశాలలకు, కమ్యూనిటీ హాళ్ళకు విరాళాలుగా ఇచ్చిన దొరలు కూడా ఉన్నారు.

కొత్త లీడర్లొచ్చారు..

కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991లో గ్రామస్థులు లూటీ చేస్తే పోలీసులు 120 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆ వివాదం చాలా ఏళ్లు నడిచింది. అయితే ఇటీవల పల్లెల్లో సర్పంచులతో పాటు ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, మండలాధ్యక్షులు, నీటి సంఘాల చైర్మన్లు లాంటి చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. విద్యావంతులూ పెరిగిపోయారు. ప్రజలలో చైతన్యం కూడా పెరిగింది. ఆ చైతన్యమే గడీల్ని తమ ఉమ్మడి ఆస్తిగా భావించేలా, దాని కోసం ఎదురు తిరిగేలా చేస్తోంది. ఏదేమైనా 'ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చపడేది... ఇప్పుడు దాంట్లోనే పోస్తన్నం' అని కవి అన్నవరం దేవేందర్ అన్నట్టు ఇప్పుడు గడీలన్నీ ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగుబాటు చల్‌గల్ గడీతో మొదలైంది.

- కె.వి. నరేందర్, 94404 02871

Monday, February 21, 2011

కళ్యాణ కాస్ట్యూమ్స్ ...... హిట్ ఫిట్.

పెళ్ళి...
హిట్ ఫార్ములా సినిమాలాంటిది!
వధూవరులు... హీరో హీరోయిన్లు
బామ్మలు, అమ్మమ్మలు, మావయ్యలు... తారాగణం
స్పెషల్ అపియరెన్స్‌లో బంధువులు, మిత్రులు...
బోలెడంత హడావిడి... బాజా బజంత్రీలు...
అలకలు, సముదాయింపులు...!
ఇవన్నీ ఉన్నా... ఈ పెళ్లి హిట్ అవ్వాలంటే
వధూవరులు ఒకరికొకరు ఫిట్ అవ్వాలి.
మనసులే కాదు, వారి కాస్ట్యూమ్స్ కూడా!
అందుకే ఇప్పుడు కళ్యాణం కాస్ట్యూమ్స్‌లో కూడా డిజైనర్ వేర్ వస్తున్నాయి. ఆ డిజైన్‌లలో వధూవరులతో బాటు పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా తళుక్కున మెరిసే తారల్లా ఉంటే... ఆ పెళ్లి హిట్ కాక ఏమవుతుంది..?
మీ ఇంట్లో జరిగే పెళ్లి కూడా అలా హిట్ కావాలని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్‌ పరిచయం ...


ఊరు ఊరంతా కలిస్తే అంబరాన్ని అంటే సంబరాల పెళ్లి. ఇద్దరి హృదయాలను ఏకం చేసే పెళ్లి, పిల్లాపాప చిన్నాపెద్దా హుషారుగా హోరెత్తే పెళ్లి. అందరి సమక్షంలో ఆనందంగా, ఆర్భాటంగా జరుపుకునే ఈ సందర్భాన్ని మించిన శుభకార్యం మన సంప్రదాయంలో మరొకటి లేదేమో! ప్రధాన పాత్రధారులు వధూవరులు అయినా ప్రత్యేక పాత్ర ల్లో బంధు, మిత్రుల హడావిడి, అల్లరి తప్పని సరి.

పెళ్లి పనులన్ని ఒక ఎతైతే పెళ్లిరోజు నాటి అలంకర ణ మరో ఎత్తు. ఆరోజు ప్రధాన ఆకర్షణ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయినా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా ఆ శుభకార్యం రోజున ఏం వేసుకోవాలి? ఎలా తయారవ్వాలి? అనే ఆలోచనలో పడతారు.


ఒకప్పుడు మధుపర్కాలతో వధూవరుల గెటప్ పూర్తయితే, పట్టుచీరలు, ప్యాంటు చొక్కాలతో మిగతావారి అలంకరణ పూర్తి అయ్యేది. రోజులు మారాయి, ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.


దీంతో అన్ని సంబరాలకు సరిపడా దుస్తులని ధరించటానికి కనీసం మూడునాలుగు విభిన్నమైన లుక్స్‌ని రెడీ చేసుకోవలసిన అవసరం వధూవరులతో పాటు బంధు, మిత్రులకు కూడా తప్పని సరి అయిపోయింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్, వాటికి అవసరమయ్యే డ్రెస్సింగ్ గురించి అవగాహన కలిగిస్తూ మీరు ‘ఇన్ ఫ్యాషన్‌‘గా ఉండటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. డిజైనర్లు, వెడ్డింగ్ ప్లానర్స్, బ్యూటీషన్స్ నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన సూచనలు మీ కోసం:

ఏ ఫంక్షన్‌కి ఏం ధరించాలి...

సంగీత్ ఫంక్షన్:
‘‘పెళ్లికి ముందు జరిగే ఈ కార్యక్రమంలో హడావిడంతా స్నేహితులదే. ఆట పాటలతో సాగిపోయే ఈ రోజు కోసం ప్రత్యేకమైన దుస్తులు అవసరం. లేటెస్ట్ స్టయిల్స్‌లో డిజైన్ చేసిన గాగ్రా చోలీలో వధువు మెరిసిపోతే ఆమె స్నేహితులు కూడా గాగ్రా, అనార్కలి చుడిదార్ లేదా షార్ట్ టాప్ పై పటియాలా పైజామాలాంటి లేటెస్ట్‌డిజైన్లను ధరించవచ్చు. పెళ్లికొడుకు సిల్క్ కుర్తా పైజమా లేదా లైట్‌గా వర్క్ చేసిన జోధ్‌పురీ స్టైల్ డ్రెస్‌ని ధరిస్తే రాకుమారుడిలా వెలిగిపోవచ్చు. వరుడి స్నేహితులు కూడా సంప్రదాయంగా కనిపించేలా అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా కుర్తా పైజామాలు ధరించడం నేటి ఫ్యాషన్.. మిగిలిన బంధువులు లేటెస్ట్ డిజైన్స్‌లో వస్తున్న క్రేప్, జార్జెట్, షిఫాన్ చీరలు ధరించటానికి ఇది మంచి సమయం. పురుషులు కుర్తా పైజామాలు ధరిస్తే... సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. అందరూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపే ఈ రోజుని మరింత ఎంజాయ్ చేయటానికి ఈ తరహా డ్రెస్సింగ్ అనువుగా ఉంటుంది’’ అంటున్నారు డిజైనర్ సంగీత. ఈ రోజు ట్రెడిషనల్ లుక్‌తో వెస్ట్రన్ లుక్ కూడా మిక్స్ చేయవచ్చు. డ్రెస్సింగ్ ట్రెడిషనల్‌గా ఉంచి హెయిర్ స్టైల్స్‌లో వేరియేషన్ తీసుకు రావచ్చు. అలాగే జ్యువెలరీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ధరిస్తే లుక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని కూడా ఆమె అంటున్నారు.
మెహందీ ఫంక్షన్: పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి ఆడవాళ్లు మాత్రమే జరుపుకునేది. ‘‘ఈ రోజుల్లో పెళ్లి కూతురికి పెట్టే గోరింటాకుకి పట్టే సమయం కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు. దాని కోసం పెళ్లికూతురుకు సౌకర్యంగా ఉండే గాగ్రా లేదా సల్వార్ సూట్‌ని ధరిస్తే బాగుంటుంది. షార్ట్ స్లీవ్స్ టాప్ అయితే మరీ మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మెహందీ డిజైన్లు మోచేతిని దాటి పైకి దాకా పెట్టటం ఫ్యాషన్’’ అంటున్నారు బ్యుటీషియన్ మిని లింగ్. అలాగే ఫంక్షన్‌కి వచ్చే ఆడవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ కాబట్టి వీరు కూడా చేతులకు సింపుల్ జ్యువెలరీ, సౌకర్యంగా ఉండే లైట్ వెయిట్ చీరలు, ఎక్కువ ఆర్భాటం లేని హెయిర్ స్టయిల్ ఉంటే ఫంక్షన్‌ని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.
వెడ్డింగ్ డే...

కలర్ కోఆర్డినేటెడ్ లుక్: వధూవరులు కలర్ కోఆర్డినేటెడ్ డ్రెస్సులు ధరించటం ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్ శిల్పా రెడ్డి. అంటే వధూవరులు పెళ్లిరోజు తమ దుస్తులు మ్యాచ్ అయ్యేలా తయారవ్వటం.‘‘ఈ ట్రెండ్ పాశ్చాత్యదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తరహా ట్రెండ్ ఊపందుకుంది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా...వివేక్ ఒబెరాయ్, మాల్వికా.. మొదలైన బాలివుడ్ సెలబ్రిటీలు పెళ్లిరోజు ఈ విధంగా ముస్తాబై ఈ ట్రెండ్‌ని మరింత పాప్యులర్ చేస్తున్నారు’’ అంటున్నారు శిల్పా. మరో ట్రెండ్... మండపం డెకరేషన్ కూడా వధూవరుల దుస్తులను కాంప్లిమెంట్ చేస్తూ ఉండేలా డిజైన్ చేయటం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల వివాహ వేడుకల్లో వధువు ధరించిన బంగారు రంగు చీర, వరుడు ధరించిన క్రీం కలర్ జోధ్‌పురీ సూట్‌కి మ్యాచ్ అయ్యేలా మండపాన్ని డెకరేట్ చేశారు. అంతే కాదు వీరి వివాహం సందర్భంగా మరో ట్రెండ్‌ని కూడా చూసాం. అమితాబ్, జయతో పాటు సోదరి శ్వేత తదితర ముఖ్య కుటుంబ సభ్యులంతా అభిషేక్ బచ్చన్ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా అదేరంగు దుస్తులని ధరించారు. ఈ విధంగా చేయటంతో ఎంతో వైవిధ్యంగా కనిపించటమే కాదు ‘మేమంతా ఒకటి‘ అని చాటి చెప్పారు .
ఐషా ట్రెండ్: మరో ట్రెండ్ కూడా ఇటీవల విడుదలై హిట్ సినిమా ‘ఐషా’ పాప్యులర్ చేసింది. విదేశాలలోఉన్న బ్రైడ్స్ మెయిడ్, బెస్ట్ మ్యాన్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో ఎంతో ఫ్యాషనబుల్‌గా చూపించారు. వధూవరులకు సంబంధించిన ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితమైన స్నేహితులకు పెళ్లిలో పెద్ద పీట వేసే ఈ సంప్రదాయాన్ని ‘ఐషా’లో చూపించారు. ఈ ట్రెండ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ముఖ్యులంతా వధూవరులకి మ్యాచింగ్‌గా ఒకే కలర్‌లో వేర్వేరు స్టైల్స్‌లో డ్రెస్సింగ్ చేసుకుంటారు. ‘ఐషా’లో ఎంతో పాప్యులర్ అయినా ‘గల్ మిట్టి మిట్టి బోల్’ పాటలో ఈ తరహా డ్రెస్సింగ్ స్టైయిల్‌ని చూడవచ్చు. చీర కలర్ ఒకటే అయినా డిఫరెంట్ డిజైన్ దానికి తోడు జ్యువెలరీ, హెయిర్‌స్టయిల్ వేరుగా ఉండటంతో పెళ్లి కూతురుకి ఏ మాత్రం పోటీ కాకుండా ఎవరి స్టైయిల్‌లో వాళ్లు కనిపిస్తారు. వరుడి వైపు బంధువులు, స్నేహితులు కూడా వరుడికి మ్యాచింగ్ దుస్తులను ధరిస్తారు ఈ పాటలో. త్వరలో ఈ ట్రెండ్ మరింతగా పాప్యులర్ అవుతుంది అంటున్నారు శిల్ప.

తాటాకు పందిరి కింద మధుపర్కాలలో సిగ్గుపడుతూ పెళ్లిళ్లు చేసుకునే రోజులు దాదాపుగా పోయాయి. ఇప్పుడంతా స్పెషల్‌గా వెడ్డింగ్ ప్లానర్స్ డిజైన్ చేసిన డిజైనర్ వెడ్డింగ్ రోజులు. అంత మాత్రం చేత సంప్రదాయానికి తిలోదకాలిస్తున్నారనుకోవటం పొరపాటే! సంప్రదాయాన్ని, ఆధునికతను కలబోసుకుంటున్న కళాత్మక ట్రెండ్‌లు పెళ్లికి నిండుదనం చేకూరుస్తాయి. వధువరులకు సరికొత్తకళను తెచ్చిపెడతాయి.

పెళ్లి సందడి
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.

రూ. 40 కోట్ల పెళ్లి! పసందైన విందు... వెరైటీ వినోదాలు

మూడే ముళ్లు. ఏడే అడుగులు. మొత్తం కలిపి... రూ. 40 కోట్లు. అవును! రాష్ట్రంలో ఎవరూ పెట్టనంత ఖర్చుతో, భారీ బడ్జెట్ సినిమాను కూడా తలదన్నే రీతిలో పెళ్లి వేడుక జరుగుతోంది. అది కూడా మన రాష్ట్రంలోనే, రాజధాని నగరంలోనే! న్యూజిలాండ్‌లో వ్యాపారం చేసే ఏఆర్ ప్రాపర్టీస్ ఎండీ రవీంద్ర తన ఇద్దరు కొడుకులనూ అతి ఖరీదైన పెళ్లి వేడుక ద్వారా ఒకేసారి ఓ ఇంటివారిని చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు కూడా అక్కాచెల్లెళ్లే కావడం విశేషం. వారిద్దరూ నగరంలోని విల్లామేరీ కాలేజీలో చదువుతున్నారు. 


ఆదివారం హైటెక్స్‌లో మొదలైన ఈ పెళ్లి వేడుకలు ఏకంగా వారం పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆహ్వాన పత్రిక నుంచి పెళ్లి దుస్తుల దాకా ఏర్పాట్లన్నీ ఒక రేంజ్‌లో ఉన్నాయట. పత్రికను హైదరాబాదీ ముత్యాల్లో పెట్టి మరీ ఇవ్వగా, విదేశాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు, నగా నట్రా కోసమే ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేశారట. 
పెళ్లి కోసం మయసభను తలపించే రీతిలో, జోధా అక్బర్ సినిమా తరహాలో సెట్టింగ్ ఇప్పటికే ముస్తాబయింది.
రిసెప్షన్‌కు దాన్ని తలదన్నేలా అండర్‌వాటర్ థీమ్‌తో ముత్యపు చిప్ప ఆకృతిలో సెట్ తయారవుతోంది.


పసందైన విందు... వెరైటీ వినోదాలు

పెళ్లి భోజనాలు మాయాబజార్ వివాహ భోజనాన్ని తలదన్నే రీతిలో ఉంటాయట. ఒకరోజు బెంగాలీ, మరో రోజు నిజాం, ఇంకో రోజు రాజస్థానీ, తర్వాత పంజాబీ... ఇలా దేశంలోని పాపులర్ రకాలన్నీ కనువిందు చేస్తాయట. ఇవిగాక రిసెప్షన్, సంగీత్ కార్యక్రమాలకు స్పెషల్ విందులుంటాయి. ఇక్కడితోనే అయిపోలేదు. అరేబియన్ ఎడారి సెట్టింగ్‌లో వైవిధ్యభరితమైన సంగీతం నడుమ వినోద కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రష్యన్ బెల్లీ డ్యాన్సులు ప్రత్యేకమట. వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.


కొసమెరుపు:  ఇంతా చేస్తే, ఇంత ఖరీదైన ఈ పెళ్లిలో ఎక్కడా బాజాభజంత్రీల చప్పుడే విన్పించదు. అంతేకాదు, మాంగల్యధారణ కూడా ఉండదని పెళ్లి కొడుకులు, వారి తండ్రి చెబుతున్నారు. అదంతా తమకు పెద్దగా ఇష్టముండదని వారు చెప్పుకొచ్చారు.

Thursday, February 10, 2011

మ్యాచింగ్ మెహందీ

మాఘమాసం వచ్చిందంటే పార్లలో బ్యూటీషియన్స్ లేటెస్ట్ మెహందీ డిజైన్స్ ఎంచుకునే పనిలో పడిపోతారు. పెళ్లికూతురికి మెహందీ పెట్టడం అంటే చాలా పెద్ద పని. అరచేతి నిండా పెడితే సరిపోవడం లేదు. మోచేతి నుంచి మొదలుపెట్టాలి. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం. మార్వాడి బ్రైడల్ మెహందీలో పెళ్లికూతురు చేతులు, కాళ్లు అన్నీ ఎర్రగా మెరిసిపోవాలి.

ఎన్ని రకాలు...

పూర్వం డిజైన్ గురించి కంటే ఆకుమీదే ఎక్కువగా దృష్టిపెట్టేవారు. ఎవరి చెట్టు ఆకు ఎక్కువగా పండుతుందో తెలుసుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. కోన్‌లలో కలిపే రకరకాల పదార్థాల వల్ల కలర్ వద్దన్నా వస్తోంది. ఎటొచ్చీ ఆలోచనంతా డిజైన్ గురించే. వీటిలో అరబిక్, అరబిక్ బ్రైడల్, మార్వాడి బ్రైడల్, దేవదాస్ చాలా ప్రముఖమైనవి. పెళ్లికూతురికి మాత్రం ఎక్కువగా మార్వాడి బ్రైడల్ వేస్తారు. చిన్న చిన్న డిజైన్లతో మొత్తం చేయంతా నిండుగా కనిపిస్తుంది. ఎక్కడా లింక్‌పోకుండా డిజైన్ వేస్తారు.

చాలా సమయం పడుతుంది. రెండవది అరబిక్. పెద్ద పెద్ద పువ్వులతో ఉంటుంది. గీతలు, చుక్కలు వేయకుండా ఆకులు, పువ్వులు వంటి డిజైన్లు కనిపిస్తాయి. చూడ్డానికి సింపుల్‌గా, అందంగా ఉంటుంది. వేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. ఇందులో బ్రైడల్ డిజైన్ మళ్లీ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక చివరిది దేవదాస్. ప్రస్తుతం దేవదాస్ ట్రెండే నడుస్తోంది. అరచేతిలో సింపుల్‌గా రెండు పువ్వులు, కాలికి ఓ మూడు పువ్వులు విడివిడిగా వేస్తారు. చాలా సింపుల్‌గా ఉండే ఈ డిజైన్ అన్ని తరాలవారిని ఆకట్టుకుంటుంది.

మ్యాచింగ్ మహిమ...

మనకి తెలిసిన గోరింటాకు ఎర్రగానే పండుతుంది. మరీ బాగా పండితే మర్నాటికి నల్లబడుతుంది. కాని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కోన్‌లు ఎర్రగా, నల్లగా, పచ్చగా, తెల్లగా కూడా పండుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకోకండి. ఇదంతా మ్యాచింగ్ కోసం. పెళ్లికూతరు కట్టుకునే చీరకు తగ్గట్టు చేతిలో రంగులు మెరవాలన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దాంతో రకరకాల మిక్సింగ్ ప్రాడెక్ట్స్ మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఇందులో మొదటిది బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. ముందుగా కోన్ పెట్టుకుని చివర్లో మెహందీ బ్లాక్ పౌడర్‌ని నీళ్లలో కలిపి డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు.

రెండవది జర్దోసి. చీరలపైన చేసే జర్దోసి వర్క్‌లాగే చేతులపై కూడా ప్రత్యేకంగా డిజైన్ గీస్తారు. ముందు కోన్‌తో డిజైన్ పెట్టుకుని తరువాత జర్దోసి పొడిని గమ్‌లో కలుపుకుని డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు. ఈ జర్దోసి పొడి గోల్డ్, సిల్వర్, బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది. పెళ్లి చీరపై ఉండే రంగును బట్టి మెహందీ అవుట్‌లైన్ గీసుకోవాలి. మూడోది మిర్రర్ వర్క్ మెహందీ. సన్నగా, చిన్నగా ప్లాస్టిక్ పేపర్ మందంలో ఉండే మెహందీ మిర్రర్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. మెహందీ డిజైన్ వేసిన తర్వాత సందుల్లో ఈ మిర్రర్‌ని అతికిస్తారు. ఆరిన తర్వాత నీళ్లతో కడుగుతారు. పండిన గోరింటాకు మధ్యలో అద్దం ముక్కలు అలాగే ఉంటాయి.

ఐదారు రోజులు అలాగే మెరుస్తూ కనిపిస్తాయి. వీటన్నింటికంటే భిన్నమైంది నెయిల్‌పాలిష్ మెహందీ. మనకి కావల్సిన రంగు నెయిల్‌పాలిష్‌ని తీసుకుని పలుచగా చేసి కోన్‌లో కలుపుకోవాలి. ఏ రంగు నెయిల్‌పాలిష్ కలిపితే ఆ రంగు షేడ్ చేతిపై కనిపిస్తుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మెహందీని చేతిపైకి తెస్తున్నారు. ఫలితంగా రకరకాల రంగుల్లో మెహందీని చూడగలుగుతున్నాం.

రెడ్ టాటూలుగా...
మనం గోరింటాకు అని నోటినిండా పిలుచుకునే మెహందీని విదేశీ వనితలు రెడ్‌టాటూ అని పిలుస్తారు. నిజానికి టాటూ అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కాని ఒంటిపైన రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోడానికి అందరూ ఇష్టపడడం లేదు. అలాగని టెంపరరీ టాటూలను వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీని గురించి మనకు మిర్రర్ పార్లర్ డైరెక్టర్ విజయలక్ష్మి బాగా చెబుతారు..."మనకి మెహందీ అంటే ఎంత మక్కువో విదేశీ అమ్మాయిలకు టాటూలంటే అంతే ప్రాణం. కాని అవి వేసుకుంటే ప్రతీ రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోవాలి. ఇలా ఒకే డిజైన్‌ని చూసుకోడానికి ఇష్టపడని అమ్మాయిలు టెంపరరీ టాటూలను వేయించుకుంటున్నారు.

అయితే ఆ టాటూలు వేసే ముందు వాడే లిక్విడ్స్ వల్ల చాలామంది శరీరంపైన దద్దుర్లొస్తున్నాయి. దాంతో ఎందుకొచ్చిన తంటాలనుకుని వాళ్లు టాటూల జోలికి వెళ్లడం లేదు. అలాంటివారి దృష్టి ఇప్పుడు మన మెహందీపై పడింది. చక్కగా వారికిష్టమైన చోట నచ్చిన డిజైన్ వేయించుకుని మురిసిపోతున్నారు. మెడపైనా, నడుంపైనా, కాళ్లపైనా...ఇలా వారికి నచ్చినచోట మెహందీ టాటూలను వేయించుకుంటున్నారు. వాటికి 'రెడ్ టాటూ' అని పేరు పెట్టారు. కెమికల్స్‌తో కూడిన ఆ టాటూల కంటే ఈ మెహందీ పెట్టుకోవడం ఎంతో ఉత్తమమని ఇతరులకు సలహా కూడా ఇస్తున్నారు'' అని చెప్పారామె.

మెహందీ పండుగ ...

మనకు పెళ్లికూతుర్ని చేయడం అంటే నలుగుపెట్టి స్నానం చేయించడం, పట్టుచీర కట్టి ముస్తాబు చేసి గాజులు తొడగడం, వచ్చిన ముత్తైదువులకి పసుపుకుంకం తాంబూలం ఇవ్వడం. ఇప్పుడు వీటి జాబితాలో మెహందీ కూడా చేరింది. ఉత్తరభారతదేశంలో 'మెహందీ రసం' పేరుతో చేసుకునే ప్రత్యేక వేడుక కొంతకాలం క్రితం మన రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది. ధనవంతుల ఇళ్లలో తన ప్రత్యేకతను చాటుచుంటోంది. మెహందీ వేడుక అంటే పెళ్లికూతుర్ని చూడ్డానికి వచ్చిన ఆడవాళ్లందరికీ గోరింటాకు పెట్టిస్తారు. పదిమంది కానీ వందమంది కానీ అందరికీ పెట్టాల్సిందే. ఏడేళ్లుగా మెహందీ పెడుతున్న ధనలక్ష్మి తన అనుభవం చెబుతోంది.

"ఒక పెళ్లికి జరిగిన మెహందీరసానికి వెళ్లాను. నేనూ నాతో మరో అమ్మాయి కూడా వచ్చింది. చాలామంది పేరంటాళ్లు వచ్చారు. అందరికీ మెహందీ పెట్టాలి. అంతమందికి పెట్టాలంటే త్వరగా పెట్టే డిజైన్‌లని ఎంచుకోవాలి. అందుకే అందరికీ దేవదాస్ డిజైన్స్ వేసేసాము. ఇద్దరం కలిసి నాలుగు గంటల్లో నలభైమందికి పెట్టేశాం'' అని గుర్తుచేసుకున్నారామె. ఇక ఇందులో ఖరీదుల విషయానికొస్తే...కాళ్లూ చేతులూ ఫుల్‌గా వేయించుకుంటే వెయ్యినుంచి రెండువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. పెళ్లికూతురికైతే చేతులు, కాళ్లకు కలిపి మూడువేల నుంచి ఐదువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. ఐదారొందల రూపాయలకు పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి, పార్లర్స్‌ని బట్టి ఖరీదులు చెబుతున్నారు.

ఫ్లయిట్ ఎక్కేవారికి ప్రత్యేకం..
పెళ్లయిన వెంటనే ఫ్లయిట్ ఎక్కి వెళ్లె పెళ్లికూతుర్లకి మెహందీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు విజయలక్ష్మి. " పెళ్లయిన వెంటనే విదేశాలకి వెళ్లే పెళ్లికూతుళ్లు ఎక్కువవుతున్నారు. భర్త ఉద్యోగనిమిత్తమో, హనీమూన్ ప్రయాణమో...మొత్తానికి పెళ్లయిన వారంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లాల్సివస్తోంది. అక్కడ వేలిముద్రలు తీసుకుంటారు. ఆ సమయంలో వేళ్లకి గోరింటాకు ఉంటే ఒప్పుకోరు.

ఒకసారి దీని వల్లే ఒక పెళ్లికూతురు ప్రయాణం రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దాంతో మా దగ్గరికి వచ్చే పెళ్లికూతుర్లని ముందే అన్ని వివరాలు అడుగుతున్నాం. విదేశీయానం ఉన్నట్లయితే చేతినిండా మెహందీ పెట్టినా వేళ్లకి పెట్టం. పెళ్లిసమయంలో అందంగా కనిపించడం కోసం ఆ ప్రాంతంలో స్కెచ్‌తో రంగు వేస్తున్నాం. తరువాత కడిగేస్తే పోతుంది. విదేశాలకు వెళ్లాక ఆ వేళ్లభాగంలో కోన్ పెట్టుకోమని చెబుతాం. ఈ చిన్న జాగ్రత్త తెలియక చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు.'' అని వివరించారామె.

Wednesday, December 15, 2010

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' * ఆ మత్తు వద్దు మన పిల్ల్లలకు .....

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' 'డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్లు....' 'డ్రగ్స్ వలలో యువత....' 'డ్రగ్స్ సేవనంలో సినీతారలు....' ఇవన్నీ దాదాపు ప్రతిరోజూ వార్తాపత్రికల్లో కనిపిస్తున్న హెడ్డింగులు. పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఈ శీర్షికలు కళ్లపడగానే గుండెల్లో గుబులు, భయం. ఒక్క క్షణం మన పిల్లలూ కళ్లముందు మెదులుతారు. ఆ...మన పిల్లలకెందుకు అలవాటవుతాయి ఇవి అన్న భరోసాతో పేపర్‌ని మడచి టీపాయ్ మీద పడేస్తాం. కాని వేగంగా దూసుకెళ్తున్న డ్రగ్స్ రాకెట్ మన పిల్లల్ని ఢీ కొట్టదన్న గ్యారెంటీ ఏంటి? అప్పుడేం చేయగలం? ఆలోచనల్లో పడ్డారు కదూ....ఇలాంటి ముందు జాగ్రత్త కలిగించడానికే మొదలైంది 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్‌సొసైటీ'. దాని గురించే ఇది...

సంవత్సరం కిందట...ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్.... ఇంట్లో మరిచిపోయిన ఆఫీస్ కాగితాలను తీసుకెళ్లడానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన ఫ్లాట్‌కు వచ్చింది కనూప్రియా సింగ్. ఫైల్ తీసుకుని తాళం వేస్తూ హడావుడిగా లిఫ్ట్ వైపు పరిగెడుతుంటే...ఎదురు ఫ్లాట్‌లో నుంచి పదహారేళ్ల అబ్బాయి అరుపులు వినిపించాయి గట్టి గట్టిగా...ఓ నలుగురు మనుషులు ఆ పిల్లాడిని పట్టుకుని బలవంతంగా ఈడ్చుకొస్తున్నారు బయటకు.

'భయ్యా....ఆహిస్తా...( అన్నా...మెల్లగా...) అంటున్నాడు గాభరాగా ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి ఆ నలుగురితో. బహుశా ఆ అబ్బాయి తండ్రేమో. తల్లి అనుకుంటా....నోట్లో పమిట చెంగు అదిమి పెట్టుకుని తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గుమ్మం దగ్గర కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల ఆడవాళ్లంతా పోగై ఆవిడను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయసాగారు. తండ్రేమో ఆ పిల్లాడితో కలిసి లిఫ్ట్‌లో కిందకి వెళ్లిపోయాడు. మౌనంగా వాళ్లనే అనుసరించింది కనూప్రియా సింగ్. కింద అంబులెన్స్‌లోకి ఎక్కించారు ఆ పిల్లాడిని బలవంతంగా. ఇంకా అరుస్తూ గింజుకుంటూనే ఉన్నాడు ఆ పిల్లాడు. కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.. తండ్రీ అంబులెన్స్ ఎక్కగానే అక్కడ్నుంచి కదిలింది అది.

'క్యా హువా భయ్యా...' పక్కనే ఉన్న వాచ్‌మన్‌ను అడిగింది కనూప్రియ.
'క్యాబోలూ మేడం...అంటూ చెప్పసాగాడు...' 304 వాళ్ల అబ్బాయండి....టెన్త్ చదువుతున్నాడు. ఎప్పుడు అలవాటైందో తెలియదు కాని డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. ఆరునెలల నుంచైతే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇంట్లో డబ్బులు పోతుంటే....ఎందుకో అనుమానం వచ్చి వాళ్ల నాన్న ఆరా తీస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి. స్కూల్‌కని ఇంట్లోంచి వెళ్తున్నాడు కాని అటెండెన్స్ లేదట.

సెకండ్ టర్మ్ ఫీజు కట్టమని డబ్బులిచ్చి పంపితే...ఆ డబ్బుతో డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసింది. కానీ అప్పటికే శృతిమించిపోయింది. ఇప్పుడు డీ ఎడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారు మేడం...చాకులాగా ఉండేటోడు పిల్లోడు... ఎట్ల అయిపోయిండు. ఫుట్‌బాల్ బాగా ఆడేవాడు. చాంపియన్ అయితడని కలలు కన్నడు వాళ్ల నాన్న...ప్చ్,...పిల్లల్ని కంటం కాని వాళ్ల తలరాతలను కంటమా..?' అంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు వాచ్‌మన్.

హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్
అంతా విన్న కనూప్రియాసింగ్ దిగాలు పడింది. ఆఫీస్‌కు వెళ్లిందే కాని మనసు మనసులో లేదు. డ్రగ్స్ దుష్ప్రభావాలను, వాటి బారిన పడుతున్న యువతకు సంబంధించిన సమాచారాన్ని చూసింది నెట్‌లో. ఇంకా దిగ్భ్రమ చెందింది తెలిసిన వివరాలను చూసి. లాభం లేదు...జాతి భవిష్యత్తు ఇలా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకున్న కనూప్రియాసింగ్ ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో ఉన్న స్నేహితులందరికీ ఫోన్ చేసి అంతకుముందు రోజు తమ అపార్ట్‌మెంట్లో జరిగిన విషయాన్నంతా చెప్పింది పూసగుచ్చినట్టు.

తర్వాత తనకు వచ్చిన ఆలోచనలూ పంచుకుంది. 'నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని...ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిన పనులు. మనకెక్కడ వీలవుతుంది' ఒక స్నేహితుడి కామెంట్. 'బాగా చెప్పావు. స్వంత పనులకే టైమ్ దొరక్క ఛస్తుంటే...ఇంకా ఈ సమాజసేవను ఎక్కడ నెత్తినెట్టుకునేది?' ఇంకో స్నేహితురాలి విరుపు. దాదాపు అందరూ కుదరదనే తేల్చారు.

'ఒక్కసారి ఆలోచించండి...రేప్పొద్దున ఈ జాబితాలో మన పిల్లలూ ఉండొచ్చు' హెచ్చరించింది కనూప్రియ.
'మన పిల్లలా..?' ఉలిక్కిపడ్డారు అంతా.
'అవును. మనమేమీ ఈ సమాజానికి దూరంగా తీసుకెళ్లి వాళ్లను పెంచలేం కదా. పరిస్థితుల నుంచి పారిపోయే కంటే. నెమ్మదిగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్..మనకు సెలవు దొరికిన సమయాల్లో స్కూళ్లకు వెళదాం. డ్రగ్స్, వాటి దుష్ప్రభావాలు గురించి పిల్లలకు అవగాహన కల్పిద్దాం ' అని ఒప్పించే ప్రయత్నం చేసింది.

అందరూ ఆలోచించి కనూప్రియాసింగ్ ప్రతిపాదనకు ఓటేశారు. అట్లా రూపుదిద్దుకుంది డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పనిచేసే 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ సొసైటీ' అనే సంస్థ.
వెబ్‌సైట్‌లో
ముందుగా పాఠశాల యాజమాన్యాల అనుమతి తీసుకుంటూ...వారాంతపు సెలవుల్లో హైస్కూలు పిల్లలకు డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రారంభించారు ఈ స్నేహితుల బృందం. ఆ బృందంలో ఒకరైన ఎల్లిగారం నాగరాజు హైదరాబాదులో ప్రాపర్టీమేనేజ్‌మెంట్ కన్సల్టన్సీని స్థాపించి ఓ వైపు వ్యాపారం చేసుకుంటూనే మరోవైపు హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ పనులనూ కొనసాగిస్తున్నారు. బోయిన్‌పల్లిలో నివాసముంటున్న నాగరాజు ఆ దగ్గర్లోని స్కూళ్లకు వెళ్లి డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంస్థ తాము చేసిన, చేస్తున్న కార్యక్రమాల వివరాలతో 'హ్యాపీలైఫ్‌వెల్‌ఫేర్. ఒఆర్‌జి (జ్చిఞఞడజూజీజ్ఛఠ్ఛీజూజ్చట్ఛ.ౌటజ) అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది.

విశేష స్పందన
తమ వెబ్‌సైట్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని చెప్తూ ఇ. నాగరాజు 'మా ఈ కృషిని కేవలం స్కూలు యాజమాన్యాలే కాదు...తల్లిదండ్రులూ గుర్తించడం మొదలుపెట్టారు. ఎంతోమంది పేరెంట్స్ మా సంస్థలో సభ్యులమవుతామని ముందుకు వస్తున్నారు. చాలామంది సభ్యులయ్యారు కూడా. మా సేవలు ముంబై, బెంగుళూరు వంటి అన్ని ప్రధాన నగరాలకూ విస్తరించాయి. ఎవరికి ఎక్కడ వీలుంటే అక్కడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నాం.

హైదరాబాదులో రోజూ పేపర్లలో వస్తున్న డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు చూస్తుంటే...మా కార్యక్రమాలను ఇక్కడ ఇంకా విస్తృతం చేయాలని నిర్ణయించాం. జనవరిలో మా ఢిల్లీ బృందం కూడా ఇక్కడికి రానుంది. ఇక్కడ తల్లితండ్రులకూ అవగాహనా క్యాంపులు నిర్వహించాలనుకుంటున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ మాది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి చేరొచ్చు. ఒక్క స్కూలు పిల్లలకే కాదు కాలేజీ విద్యార్థులకూ అవగాహనా కార్యక్రమాలున్నాయి.
డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులను కాపాడేందుకు కౌన్సిలింగ్, డీ ఎడిక్షన్ లాంటి సేవలనూ అందిస్తున్నాం. జంటనగరాల తల్లితండ్రులను మేము కోరేది ఒక్కటే...మా సేవలను తీసుకోవడమే కాక మా సంస్థలో చేరి మీరూ మీకు తెలిసిన వాళ్లను చైతన్యపర్చండి. జాతి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి' అని విన్నవించారు.
సరస్వతి రమ 
ఫోటోలు: రాజ్‌కుమార్

అష్టావక్రులు అనే రింగు లీడర్లు 'రాజ'మార్గంలో దారి దోపిడీ

పేదలను కొట్టి పెద్దలకు పంచి..
రూ.35వేల కోట్లు వెనకేసుకున్న అక్రమార్కులు
భూ సేకరణలో భారీ గోల్‌మాల్
అస్మదీయులకు అభయ హస్తం
మాటిమాటికీ మారిన రూటు
ప్రతిసారీ బక్కరైతులే బలి
విపక్షాలపైనా ప్రలోభాల వల
సీబీఐ విచారణకు సహాయ నిరాకరణ
50... 70... 80... 90... 100.... 120.... స్పీడో మీటర్ గిర్రున తిరుగుతుంది. విలాసాల వాహనం సర్రున దూసుకుపోతుంది. వారెవ్వా... ఔటర్ సూపర్! కానీ... ఔటర్ రింగ్ రోడ్డు కింద వేల బతుకులు నలిగిపోయాయని, అక్రమార్కులకు ఇది రాచబాట వేసిందని, కుంభకోణాలకు 'రాజా' వంటిదని కొంచెం లోతుల్లోకి వెళితేనే తెలుస్తుంది. రాజా వారు, ఆయన అనుచర వర్గం కోసం అనేకసార్లు రింగులు తిరిగిన ఔటర్ భూతం పేద రైతులను బలి చేసింది.

అసలు ప్రయోజనాల కంటే పెద్దలకు కాసుల వర్షం కురిపించే ప్రాజెక్టుగా ఇప్పటికే విజయం సాధించింది. తన లేఖలో జలయజ్ఞంలో అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించిన కొండా సురేఖ ఊహకు కూడా అందనన్ని మలుపులు తిరిగింది. అన్ని వ్యవస్థలను నిర్యీర్యం చేస్తూ అక్రమాల మధ్యనే సాగిన ఔటర్ రోడ్డు నిర్మాణం రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం. అప్పటి సీఎం వైఎస్, ఆయన ఆంతరంగికుడు కేవీపీ కలిసి నడిపించిన మంత్రాంగం! అప్పటి హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి, సెక్రటరీ వెంకట్రామ రెడ్డి కనుసన్నల్లో జరిగిన మాయాజాలం!

రంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 15 : ఔటర్‌తో హైదరాబాద్ దశ, దిశ మారుతుందని అప్పట్లో ఊదరగొట్టారు. ఆ మాటలో నిజమెంతోగానీ... దీనివల్ల చాలామంది దశ, దిశలు మారిపోయాయి. కొందరు కోట్లకు పడగలెత్తారు. మరికొందరు తిరిగి లేవలేనంతగా పడిపోయారు. దీనివల్ల లబ్ధిపొందిన వారిలో మన రాష్ట్ర నేతలే కాదు... ఒకరిద్దరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

ప్రతిపక్షానికి చెందిన నాయకులూ 'రింగ్' అయ్యారు. పార్టీలకు అతీతంగా పెద్దలంతా, ఔటర్ పాపాన్ని తలా తట్టెడు పంచుకున్నారు. రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న పెద్దల భూములకు నష్టం వాటిల్లకుండా... నోరులేని బక్క రైతుల భూముల మీదే రింగు రోడ్డు వేశారు. దీనికోసం కొన్నిచోట్ల మూడుసార్లు మ్యాప్‌లో మార్పు చేర్పులు చేశారు. ఔటర్ గోల్‌మాల్‌కు పాల్పడిన వారిలో 20 మంది ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు. వీరి విజయానికి ఔటర్‌లో కొట్టేసిన డబ్బులే పెట్టుబడి అయ్యాయి.

భూసేకరణ అస్త్రం
ఔటర్ రింగ్‌రోడ్డు దోపిడీలో కనిపించినంత వైవిధ్యం మరెక్కడా కనిపించదేమో! ఈ దోపిడీలో తొలి అంకం... భూసేకరణ. ఈ చట్టాన్నే బూచిగా చూపి 'ఇస్తావా? చస్తావా?' అంటూ పేదరైతుల మెడపై కత్తి పెట్టారు. వారి భూములు లాక్కున్నారు. అదే సమయంలో... కొందరు పెద్దలు ముందుగానే రంగంలోకి దిగి రైతులపై వల వేశారు. "మీ భూమి ఔటర్‌లో పోతుంది.

ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇస్తాం. మాకే విక్రయించండి'' అంటూ ముందే భూములు కొన్నారు. ఆ తర్వాత తమ పలుకుబడి ఉపయోగించి ఔటర్ మార్గాన్ని మార్పించి, తాము కొన్న భూముల ధరలు అమాంతంగా పెంచుకున్నారు. ఔటర్ ఆలోచన, అది వెళ్లే మార్గం ముందే తెలిసిన ముఖ్య నేతలు, వారి బంధువులు, అనుచరులు ముందే రంగంలోకి దిగి... సమీప ప్రాంతాల్లో భారీగా భూములను కొనేశారు.

ఎకరా రూ.లక్షల్లో కొనుగోలు చేసిన భూములను రూ.10 నుంచి 15 కోట్ల చొప్పున విక్రయించుకున్నారు. అలాగే... 'మా భూములు పోకుండా చూడండి' అని ఆశ్రయించిన వాళ్లకు పాలకులు అభయ హస్తం ఇచ్చారు. వారి దగ్గర ముడుపులు పుచ్చుకుని... అలైన్‌మెంట్ మార్చేశారు. జంక్షన్లు, ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌ల పేరుతో అలైన్‌మెంట్లు మార్చారు. ఈ మొత్తం ప్రక్రియలో బలైపోయింది అమాయకులైన రైతులే.

వేసిందే రోడ్డు..
ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్రియలో అప్పటి అధికారులు గీసిందే మ్యాపు... వేసిందే రోడ్డుగా మారింది. ప్రమాణాల ప్రకారం 250 గజాల వెడల్పు ఉండాల్సిన రహదారి... ఒక్కోచోట సగానికి పడిపోయింది. అటూ ఇటూ ఉన్న వారి ఆస్తులను టచ్ చేయకుండా... రోడ్డే కుచించుకుపోయింది. గండిపేట చెరువు వద్ద పర్యావరణ కారణాలు చూపుతూ అలైన్‌మెంట్ మార్చేశారు.

అదేసమయంలో... కండ్లకోయి వద్ద చెరువులోంచే రోడ్డును వేశారు. ఏం జరిగినా, ఎందుకు మార్చినా కారణం ఒక్కటే! అస్మదీయుల భూములను కాపాడటం! గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల పెద్దల భూములను సేకరించినా... వారికి పుష్కలంగా పరిహారం అందించారు. ప్రత్యేక ప్యాకేజీలు తయారు చేశారు. పేదలపై మాత్రం వివక్ష ప్రదర్శించారు.

నష్ట పరిహారం ప్యాకేజీ నిర్ణయించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గనుల శాఖమంత్రి సబితారెడ్డితో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏ ఒక్కరితోనూ చర్చించకుండానే ప్యాకేజీ రూపొందించడం విశేషం.

అందరూ... ష్ గప్‌చుప్!
ముంజేతి కంకణం చూడటానికి అద్దం అవసరంలేదు. అలాగే... ఔటర్ రింగ్ రోడ్డులో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని చెప్పేందుకు ఎలాంటి విచారణలూ అక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ చిక్కిపోయిన రోడ్డు, ముమ్మార్లు మారిన ప్లాన్, ఆ సమయంలో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే... నాటి పాలకులు నిస్సిగ్గుగా, నిర్భయంగా అక్రమాలకు పాల్పడినట్లు ఇట్టే తెలిసిపోతుంది.

అయినప్పటికీ... దీనిపై విపక్షాలు పెద్దగా ఆందోళనలు చేయలేదు. సర్కారును నిలదీయలేదు. కారణం... నాటి పెద్దలు నయానో భయానో వారందరి నోళ్లను మూయించారు. 'మీ భూములకు భంగం వాటిల్లకుండా చూస్తాం' అని ప్రలోభపెట్టో... 'మీ భూములనూ మింగేస్తాం జాగ్రత్త!' అని భయపెట్టో వాళ్లను దారికి తెచ్చారు.

రకరకాలుగా వారికి ఎర వేశారు. అప్పట్లో సీపీఐ, బీజేపీ మాత్రమే అంతో ఇంతో ఔటర్ అక్రమాలపై గళమెత్తాయి. మిగిలిన పార్టీలన్నీ గప్‌చుప్! 'ఔటర్ అక్రమాలపై ఆందోళన చేద్దాం రండి' అని చంద్రబాబు పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరూ ముందుకురాని పరిస్థితి!

ఒక ప్రాజెక్టు చేపట్టినప్పడు కొందరు భూములు కోల్పోవడం సహజమే! కానీ... ఒకరి భూములు కాపాడేందుకు మరొకరిని బలి చేయడమే ఔటర్‌లో జరిగిన పాపం. ఈ రహదారి కోసం జరిపిన భూసేకరణలో సుమారు పది వేల కుటుంబాలు నష్టపోయాయి. ఇందులో నాలుగు వేల మంది రైతులుకాగా... మరో ఆరువేల మంది ప్లాట్లు, ఇళ్లు కోల్పోయారు.

వ్యవస్థలపై దాడి
ఔటర్ రింగు రోడ్డులో అక్రమాలపై 'ఆంధ్రజ్యోతి' అనేక కథనాలు ప్రచురించింది. అయినా... పాలకుల్లో చలనం లేదు. ప్రశ్నించిన వ్యవస్థలపై ఎదురుదాడికి దిగారు. పత్రికల యాజమాన్యాలపై దాడులకు పురిగొల్పారు. ప్రతిపక్షాలను చీల్చారు. పత్రికల్లో కథనాలకు 'కౌంటర్'గా జనం సొమ్ముతో అనుకూలమైన ప్రకటనలు ఇచ్చారు.

అప్పట్లో విపక్షాలు డిమాండ్ చేయడమే ఆలస్యమన్నట్లుగా అనేక అంశాలపై వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ధీరోదాత్తుడిగా మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత సీబీఐ విచారణను తనదైన శైలిలో మడత పెట్టేసేవారు. రింగ్ రోడ్డు విషయంలోనూ అదే జరిగింది. సీబీఐ విచారణను ఆయన నీరుగార్చారు. వాస్తవాలు బయటకు రాకుండా అధికారులను కట్టడి చేశారు.

సర్కారు సహాయ నిరాకరణ చేస్తోందంటూ సీబీఐ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు మొరబెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు... అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు ఇప్పుడు ప్రమోషన్లు పొంది ఎంచక్కా మంచి పోస్టుల్లో వెలిగిపోతున్నారు. పేద రైతులు మాత్రం పెద్దలు చేసిన పాపాలకు బలైపోయి కుమిలిపోతున్నారు. వీరికి సమాధానం చెప్పేదెవరు? వీరి ఆవేదనలు తీరేదెన్నడు?

హైకోర్టు తీర్పే నిదర్శనం
ఔటర్ రింగురోడ్డులో భాగంగా కండ్లకోయిలో జరిగిన భూసేకరణపై ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. మొత్తం భూసేకరణ తీరుపైనే అనుమానాలను వ్యక్తం చేసింది. కండ్లకోయిలో పెద్దల కోసం మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చారు.

ఇతరుల భూములు, పక్కనే చెరువు మీదుగా రోడ్డు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బాధితులు హైకోర్టుకెక్కారు. 55 ఎకరాల్లో అక్రమంగా భూసేకరణ జరిగినట్లు కోర్టు తేల్చి చెప్పింది. ఒక్కచోట జరిగిన భూసేకరణలోనే ఇంత గోల్‌మాల్! మరి... 162 కిలోమీటర్ల పొడవునా ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉండాలి?

* ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.5500 కోట్లు. కానీ.. ఈ భూసేకరణను అడ్డుపెట్టుకుని రాజుగారి మందీ మార్బలం రూ. 35 వేలకోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టుకుంది.
* ఇందులో సాధారణ ప్రజలు రూ.10వేల కోట్లు నష్టపోగా పెద్దలు అంతకు ఎన్నో రెట్లు అధికంగా లబ్ధిపొందారు.
* నష్ట పరిహారం పంపిణీలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో తప్పుడు రికార్డులు సృష్టించి 16 ఎకరాల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం పొందారు.
* హయత్‌నగర్ మండలం బాచారంలో సుమారు 25 లక్షల రూపాయలను అక్రమంగా చెల్లించారు.

అంతా ఇష్టానుసారం...
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రింగురోడ్డును ఇష్టానుసారంగా నిర్మిస్తోంది. పెద్దల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా... ఒక్కో చోట ఒక్కో విధంగా వెడల్పు తగ్గించారు. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ జంక్షన్ వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. నార్సింగ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు 125 మీటర్లు, శంషాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు 150 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు.
click here

Tuesday, December 14, 2010

ఔరౌర... నాగవల్లి నగలు

లక లక లక.. అంటూ భయపెట్టిన చంద్రముఖి ఇప్పుడు ఔర.. ఔర.. అంటూ నాగవల్లిగా వస్తోంది. ఆమె ఆంగికం, అభినయమే కాదు.. ఆమె ఆభరణాలు కూడా ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికల నగలు ఒక ఎత్తయితే హీరో వెంకటేష్ నగలు మరో ఎత్తు. సినిమా విడుదలవ్వకముందే క్రేజ్ సంపాదించుకున్న ఈ నగలను రూపొందించింది ఎవరో తెలుసా? క్రిసాలా జ్యువలరీ అధినేత్రి బంటి బజాజ్. ఆమె గురించి.. ఆమె రూపొందించిన నగల గురించే ఈ కథనం.
బాలీవుడ్‌లో జోధాఅక్బర్, దేవదాసు చిత్రాల్లో నటీనటులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ఆ సినిమాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా మొదలయ్యింది. సినిమా పేర్లు పడుతున్నప్పుడు కనిపించే కాస్ట్యూమ్స్ టైటిల్‌తోపాటు ఈ మధ్య స్టయిలింగ్ అని మరో కొత్త టైటిల్‌ను కూడా వేస్తున్నారు తెలుగువాళ్లు. చాలామంది తారలకిప్పుడు పర్సనల్ స్టయిలిస్ట్‌లున్నారు. అయితే కొందరు ఇంకో ముందడుగు వేసి ప్రత్యేక జ్యువలరీ డిజైనర్లను నియమించుకుంటున్నారు.

అరుంధతి సినిమాలో అనుష్క, సింహ సినిమాలో నయనతారలు ధరించిన నగలు అలా రూపొందించినవే. అయితే తెలుగు సినిమాల్లో హీరోతో సహా దాదాపు అన్ని ముఖ్య పాత్రలకోసం ప్రత్యేక జ్యువలరీని తయారుచేసిన క్రెడిట్ మాత్రం నాగవల్లి సినిమాకే దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాల్లో ఎక్కువగా గిల్టీనగలనే వాడతారు. కానీ నాగవల్లి సినిమాలో తారలందరూ మేలిమి బంగారు ఆభరణాలనే ధరించారు. పైగా అవి ఆయా పాత్రల స్వభావాలకు అద్దం పట్టేలా ప్రత్యేకంగా రూపొందించారు బంటి బజాజ్.

ఏవరీ బజాజ్?

బంటి బజాజ్ పక్కా హైదరాబాదీ. కాకపోతే ఎక్కువకాలం ముంబయిలోనే ఉన్నారు. ఆమె 1993లో హైదరాబాద్‌కి వచ్చి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తుండేవారు. ఎన్నో ఫ్యాషన్ షోలను నిర్వహించారు. ఆమెకి చిన్నప్పటి నుంచీ జ్యువలరీ డిజైన్ చేయడంలో ఆసక్తి ఉండేది. ముంబయికి వెళ్లాక చిన్న చిన్న నగలను డిజైన్ చేయడం మొదలెట్టారు. చాలామంది బాలీవుడ్ తారలతో పరిచయాలు ఉండడంతో మొదట్లో ఆమె రూపొందించిన నగలను వారికి కానుకగా ఇస్తుండేవారు. అయితే ఆమె దీన్ని వృత్తిగా కాకుండా కేవలం హాబీగానే భావించేవారు.

అయితే ఆమె నగలను ఇష్టపడేవారు తమకోసం నగలు డిజైన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అడిగేవాళ్లు. అలా అడిగిన వారిలో అనిల్ కపూర్ భార్య సునీల్ కపూర్, రాణీముఖర్జీ, టబు, సోనాక్షి, విద్యాబాలన్ ఉన్నారు. బంటి బజాజ్ వారికోసం ఎన్నో నగలను ప్రత్యేకంగా రూపొందించారు. హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చే స్తూనే, ముంబయి ముద్దుగుమ్మలకు ఆభరణాలు రూపొందిస్తున్నప్పుడు త్రిభువన్‌దాస్ శ్రీకాంత్ జవేరీ ప్రోత్సాహంతో 2001లో పుల్‌టైమ్ డిజైనర్‌గా మారిపోయారు.
డిజైనర్‌గా..
బంటి బజాజ్‌కు ఎన్నో ఫ్యాషన్ షోలతో అనుబంధం, ఆమె ఆభరణాల పట్ల బాలీవుడ్ తారలకు సైతం ఆసక్తి ఉండడంతో ఆమె డిజైనర్‌గా గుర్తుంపు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. లాక్మే ఫ్యాషన్ షోలో ఆనంద్ కాబ్రా, నీతూ లుల్లా లాంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దుస్తులకు జ్యువెలరీని రూపొందించారు. సొంత సిగ్నేచర్ జ్యువలరీని రూపొందించాలన్న ఆలోచనతో 2006లో క్రిసాలా జ్యువలరీ పేరుతో హైదరాబాద్‌లో షోరూమ్ ప్రారంభించారు. ఆ తర్వాత ముంబయి, పూణెల్లో కూడా బ్రాంచీలను మొదలుపెట్టారు. ఈ విషయం పక్కన పెడితే బంటి బజాజ్‌కు డి. రామానాయుడు కుటుంబంతో చాలాకాలంగా అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే నిర్మాత సురేష్ బాబు నాగవల్లి సినిమా కోసం ప్రత్యేకంగా జ్యువలరీని రూపొందించాల్సిందిగా కోరారు.

ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో నేను చేసిన రాజు పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకులను ఒక్క క్షణంలో ఆ కాలానికి తీసుకువెళ్లడానికి ఒక కొత్తదనం కావాలి. అందుకు ఆహార్యం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అన్ని పాత్రలకీ ప్రత్యేకంగా కాస్టూమ్స్‌ని, జ్యువలరీని డిజైనింగ్ చేయించారు నిర్మాతలు. అందుకు రమా రాజామౌళి స్టయిలింగ్, బంటి బజాజ్ రూపొందించిన ఆభరణాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సినిమా విడుదలవ్వకముందే ఆ ఆభరణాల పట్ల ఏర్పడ్డ క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
- వెంకటేష్, కథానాయకుడు

నాగవల్లికి అనుగుణంగా..
'అవకాశం వచ్చినంత మాత్రాన అయిపోలేదు.. అసలు కథ అక్కడే మొదలయింది నాకు. ఈ నగల గురించి చెప్పాలంటే ఆ సినిమా కథ సగం చెప్పాల్సి వస్తుంది. అందుకే క్లుప్తంగా చెపా'్తనని మొదలెట్టారు బంటి బజాజ్. 'చంద్రముఖి చూసిన వారికి నాగవల్లి సినిమా పట్ల కొంత అవగాహన ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఉండాలన్నది మా ఉద్దేశ్యం. కథ, పాత్రల గురించి విన్న తర్వాత నా పరిశోధన మొదలుపెట్టాను. సినిమా రెండు భాగాలుగా ఉంటుంది.. ప్రస్తుతం.. గతం.. రెండు ఎపిసోడ్‌లలో కనిపించే జ్యువలరీ విభిన్నంగా ఉండాలి.

మోడ్రన్ జ్యువలరీ రూపొందించడం పెద్ద కష్టమేం కాదు.. ఫ్లాష్‌బ్యాక్ కోసం అప్పటి రాజులు, రాణులు, సామాన్యులు వాడిన దుస్తులు, ఆభరణాల గురించి పుస్తకాలు తిరగేశాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల గురించి, నిజాం నవాబుల గురించి, తంజావూరు గురించి చదివి కొంత నోట్స్ రాసుకున్నాం. తర్వాత సినిమాలో పాత్రలు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నాం. మేళవిస్తూ 200కు పైగా ఆభరణాలని రూపొందించాం. ఇందుకు ఆరునెలల సమయం పట్టింది' అని చెప్పారు బంటి బజాజ్.

నేను నటించిన అరుంధతి సినిమాలో కూడా నా పాత్రకోసం ప్రత్యేకంగా నగలను రూపొందించారు. ఆ ఆభరణాలను నా పాత్రకి ప్లస్ అయ్యాయి. ఆ పాత్రకి నాకు మంచి పేరొచ్చింది. కాకపోతే అవన్నీ గిల్ట్ నగలు. ఒరిజినల్ జ్యువలరీతో నటించడం మాత్రం ఇదే తొలిసారి. ఆనాటి కాలాన్ని డిజైనర్లు తమ ఆభరణాలతో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. అరుంధతి పాత్రలాగే ఈ సినిమాలో నా పాత్ర మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
- అనుష్క శెట్టి, కథానాయిక

ఎవరికి ఏ ఆభరణాలు..
నాగవల్లి సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వెంకటేష్, అనుష్కలతో పాటు కమలినీ ముఖర్జి, రిచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్‌లకు బంటి బజాజ్ ఆభరణాలు రూపొందించారు. ఈ అన్ని పాత్రలకూ రమా రాజమౌళి స్టయిలింగ్ చేశారు. ఒక సీన్ కోసం ఆమె ఎంచుకున్న దుస్తులను ఫోటో తీసి, క థలో ఆ సీన్‌ను బట్టి ముందుగా బొమ్మలు గీసుకున్నారు బంటి బజాజ్. సినిమాలో తమిళనాడులోని తంజావూరు నేపథ్యం కొంత ఉంటుంది. అందుకే కథనాయికల ఆభరణాల కోసం అక్కడ గుళ్లలో కనిపించే బొమ్మలు, పుస్తకాల్లో చదివిన ఆ కాలం నాటి డిజైన్లను ఎంచుకున్నారు.

ఒడ్డాణం, వంకీలు, జడ, కాసులదండ, ఉంగరాలను బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలు ఉపయోగించి రూపొందించారు. వెంకటేష్‌ది విజయనగరానికి చెందిన రాజు పాత్ర. ఈ పాత్ర కోసం ఎక్కువగా నిజాం నగలను, దక్షిణ భారతాన్ని పాలించిన రాజులు వాడిన ఆభరణాలను రూపొందించారు. సర్పెంచ్(రాజులు తలపాగాకు పెట్టుకునేవి), కమర్‌బంద్(షేర్వాణీ మీద మెడలో వేసుకునే ఆభరణం), బాజూబంద్(భుజాలకు కట్టుకునే కంకణాలు), మెడ నుంచి భుజాల వరకు వేలాడే పచ్చల హారాలు రాజు పాత్ర కోసం రూపొందించారు.
- బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫోటోలు: రాజ్‌కుమార్

Monday, December 6, 2010

నేనెందకు ప్రవక్తపై పుస్తకం రాశాను?

                                     భిన్న  మతాల చరిత్రలను లోతుగా అధ్యయనం చేసి వాటిని వర్తమానానికి అన్వయించుకొని విశ్లేషించటం చాలా క్లిష్టమైన కళ. దీనిలో నిష్ట్ణాతురాలు క్యారన్ ఆంస్ట్రాంగ్. ఆమె రాసిన 'హిస్టరీ ఆఫ్ గాడ్' పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయింది. 30 భాషాల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆంస్ట్రాంగ్ రాసిన మరో పుస్తకం - 'ముహమ్మద్: ఏ బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్'. దీని అనువాదాన్ని హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం.

సల్మాన్ రష్డీ రచించిన 'సెటానిక్ వెర్సెస్' వివాదం, ఫత్వా సందర్భంగా, పది సంవత్సరాల క్రితం నేను ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను. అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారు కూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనపరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ఇరవయ్యో శతాబ్దంలో జరిగిన దారుణమైన సంఘటనల తరువాత కూడా ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా ఉన్న ఒక మతం పట్ల మనం అస్ఫుటమైన అసత్యమైన అభిప్రాయాలను పెంచి పోషించకూడదనిపించింది. సల్మాన్ రష్డీపై అయెతుల్లా ఖొమైనీ ఫత్వా విధించినపుడు ఈ అహేతుక ద్వేషం అనేక పశ్చిమ దేశాలలో మరింత ప్రత్యక్షంగా కనపడింది.

1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న 45 రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఈ ఫత్వాని ఖండించారు. అది ఇస్లామ్ మత విరుద్ధమన్నారు. అయినా బ్రిటన్‌లో ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సౌదీ అరేబియా షేకులు, కైరోలోని అల్ అజ్‌హర్ మదర్సా కూడా ఈ ఫత్వా ఇస్లామ్ మత వ్యతిరేకమైనదన్నది. కానీ ఇదంతా పశ్చిమ దేశాలవారు వినదలచుకోలేదు. అయెతుల్లాతో విభేదించేవారూ, రష్డీని చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది ఉన్నారు.

అయితే సల్మాన్ రష్డీ తన నవలలో ముహమ్మద్ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వీరిని తీవ్రంగా కలత పెట్టింది. పశ్చిమ మేధావులు మాత్రం , ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ళ జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటిష్ రచయితలు, మేధావులు, తత్వవేత్తలు కూడా ఇస్లాముని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనపరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గది కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్టింల సున్నితమైన మనోభావాలను వారు పట్టించుకోలేదు.

అదంత ముఖ్యమైన విషయం కాదనుకున్నారు. ముహమ్మద్ గురించి రష్డీ చెప్పింది మాత్రమే పశ్చిమ దేశాల పాఠకులు చదవడం విచారకరం అనిపించింది. రష్డీ నిజంగా తన నవలలో ఏం చెప్పదలిచాడో నేను అర్ధం చేసుకోగలిగినప్పటికీ, ఒక గొప్ప వ్యక్తి నిజమైన జీవిత కథ అందరికీ తెలియాలనే నేనీ పుస్తక రచనకి పూనుకున్నాను. నాకు ప్రచురణ కర్త దొరకడం కూడా కష్టమైంది.

ఎందుకంటే నా లాంటి మహిళ, వారి ప్రవక్త గురించి వ్రాస్తే ముస్లిమ్‌లకి కోపం వచ్చి నేను కూడా రష్డీ వలె రహస్య జీవితం గడపవలసిన పరిస్థితి సంభవం కావచ్చు అని చాలామంది భావించారు. కానీ నా పుస్తకానికి ముస్లిముల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించడం నన్నెంతో కదిలించింది. నేనీ పుస్తకం కేవలం సంచలనం సృష్టించడానికే వ్రాయలేదని నమ్మారు. తరువాత పది సంవత్సరాలలో పశ్చిమ దేశాలలో ఉన్న ఈ 'ఇస్లామోఫోబియా' తగ్గుతూ వచ్చింది. ముస్లిములకి వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు.

ఇప్పుడు విద్యుద్ఘాతం వంటి సెప్టెంబర్ పదకొండు సంఘటన - న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రమూ, పెంటగాన్‌లో ఒక భాగమూ ధ్వంసమైన తీరు - ముస్లిమ్ ఉగ్రవాదులు ఈ దారుణ మారణకాండకి తలపడి దాదాపు 5000ల మంది మరణానికి కారంణం కావడం, పశ్చిమ దేశాలలో ముస్లిమ్ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్‌పై ఉండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది. ముస్లిములు హింసనూ తీవ్రవాదాన్నీ సమర్ధించే మత మౌడ్యులనే భావనను ఈ ఘోరమైన చర్య స్థిరపరిచింది.

ఈ విపత్కర సంఘటన తరువాత ఒక నెలకి నేనీ ఉపోద్ఘాతం వ్రాస్తున్నాను. ఇదొక ప్రత్యేక సందర్భం. ఇస్లామ్, హింసను సమర్ధిస్తుందనే భావాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాద వివాదాల్లో చాలామంది కుర్ఆన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. ఇటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్, జ్యూయిష్ మత గ్రం«థాలలో కూడా ఇటువంటి కలహశీలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయని మర్చిపోయారు.

జ్యూయిష్ బైబిల్‌లో అతి పవిత్రమైనదిగా భావించే 'తోరా'లో ఇజ్రాయిల్ వారిని, వారికి ప్రభువు వాగ్దానం చేసిన భూమినించి తరిమికొట్టమని, వారి పవిత్ర చిహ్నాలను ధ్వంసం చెయ్యమనీ ఉంది. వారితో ఎటువంటి ఒడంబడికలూ ఉండకూడదంది. కొంతమంది యూదు మతవాదులు, ఇలాంటి వాటిని పాలస్తీనియన్లపై హింసను సమర్ధించడానికి వాడుకుంటారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపన ప్రక్రియను విమర్శించడానికి కూడా వాడుతుంటారు. కాని జుడాయిజమ్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరూ ఈ వాక్యాలను ప్రామాణికంగా తీసుకోరు. వాటిని ఆ విధంగా వాడుకోవడం న్యాయవిరుద్ధమంటారు.

జీసస్‌ని ఎల్లప్పుడూ శాంతికాముకునిగా భావిస్తాము. కానీ కొన్ని గోస్పెల్స్ ఆయన్ని పోరాటశీలునిగా కూడా చిత్రిస్తాయి. ఒక సందర్భంలో ఆయన, తను శాంతిని కాక ఖడ్గాన్ని తెచ్చానంటాడు. అయితే ఎవరూ కూడా సెబ్రెనీసాలో క్రిష్టియన్ సెర్బులు 8000ల మంది ముస్లిములని చంపినపుడు ఈ వాక్యాన్ని ఉల్లేఖించలేదు. ఎవరూ క్రైస్తవ మతం హింసను ప్రోత్సహిస్తుందనలేదు. అటువంటి ఆరోపణలు చెయ్యడం అనుచితం అని చాలామందికి తెలుసు. పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.

(సెప్టెంబర్ ఘాతుకానికి పాల్పడిన) తీవ్రవాదులు తాము ముహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తున్నామనుకోవడం నన్నెక్కువ బాధ పెట్టింది. ఈ దాడికి కీలకమైన వ్యక్తిగా భావించే ఒసామా బిన్ లాడెన్, ముహమ్మద్ ప్రవక్త జీవిత విధానంలోని సనాతన వాదాన్ని (ఫండమెంటలిజమ్) అనుసరించాడు. సయ్యిద్ ఖుతుబ్ అనే ఈజిప్షియన్ మేధావి మొట్టమొదట చేసిన ఫండమెంటలిస్టు సూత్రీకరణ ప్రకారం ముహమ్మద్ జీవితం ఒక దివ్య సాక్షాత్కారం. భగవంతుడు ముహమ్మద్‌కు చెప్పిన మార్గం ఒక్కటే సత్సమాజ స్థాపనకు మార్గం.

(ఖుతుబ్‌కి 1966లో ప్రెసిడెంట్ జమాల్ అబ్దుల్ నాజర్ మరణశిక్ష విధించాడు.) ముహమ్మద్ ప్రవక్త ముస్లిములు చెప్పే 'జాహిలియా'ని (అంటే చీకటి యుగం) అంతం చేయడానికి పోరాడాడు. ఈ జాహిలియా అనే పదాన్ని ముస్లిమ్‌లు రాక ముందు అరేబియాలో ఉండి అవినీతి, బర్బరత్వం రాజ్యమేలిన కాలానికి ప్రతీకగా వాడతారు. ఖుతుబ్ అభిప్రాయం ప్రకారం ప్రతి యుగంలోనూ ఒక జాహిలియా ఉంటుంది. కనుక ఇరవయ్యో శతాబ్దంలో కూడా ముహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తూ తమ ప్రాంతాల్లోని జాహిలియాని నిర్మూలించాలి. ఇందుకోసం వాళ్లు ముందుగా ప్రధాన స్రవంతిగా ఉన్న 'జాహిలి' సమాజం నుంచి విడివిడి అంకిత భావంతో పని చేసే ఒక అగ్ర నాయకత్వాన్ని తయారు చెయ్యాలి.

జిహాద్ రూపకర్త కాకపోవటమే కాక ముహమ్మద్ (నిజానికి) శాంతి కాముకుడు. శాంతి స్థాపకుడు. శాంతి స్థాపనకు ప్రాణాలను కూడా లెక్కచెయ్యని వ్యక్తి, మక్కాతో రాజీకోసం తన సన్నిహితుల మద్దతును కూడా వదులుకున్న వాడు....మొండిగా చనిపోయేవరకూ యుద్ధం చేసేకన్నా సంప్రదింపులతో రాజీ మార్గం అవలంబించడం మంచిదని భావించాడు. ఈ వినయం, సర్దుబాటులే విజయ సాధన మార్గాలయాయని కుర్ఆన్ కూడా పేర్కొంది. ఈ సంక్లిష్ట సమయంలో మనం ప్రవక్త జీవితాన్ని తెలుసుకోవడం అవసరం.

తమ స్వలాభం కోసం ముస్లిమ్ అతివాదులు ముహమ్మద్ జీవితాన్ని వక్రీకరించడాన్ని మనం ఒప్పుకోకూడదు. అమితంగా మారిపోయిన ఈనాటి ప్రపంచంలో మనం ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోడానికి కూడా మనం ముహమ్మద్ జీవితాన్ని చదవాలి. పశ్చిమ దేశ వాసులమైన మనకి ఎప్పుడూ ఇస్లాంతో సరిపడలేదు. ఆ మతాన్ని గురించి మనకి చాలా అహంకారపూరితమైన, మొరటు అభిప్రాయాలుండేవి. తీసిపారేసే చూపు ఉండేది. మనం ఇంకా అటువంటి అజ్ఞానంతో అపార్ధాలతో కూడిన వైఖరి అవలంబించలేమని ఇప్పుడు తెలియ వచ్చింది. ఈ పుస్తకం చివరన నేను ప్రఖ్యాత కెనెడియన్ పండితుడు విల్ ఫ్రెడ్ క్యాంట్వెల్ స్మిత్ వాక్యాలని ఉల్లేఖించాను.

ఆయన రచనలు నాకు నిరంతర స్పూర్తిదాయకాలు. ఇరవయ్యో శతాబ్దపు సవాళ్ళను జయప్రదంగా ఎదుర్కోవాలంటే పశ్చిమదేశాలూ, ఇస్లామిక్ ప్రపంచమూ కూడా గట్టి కృషి చెయ్యాలని ఆయన 1956లోనే హెచ్చరించాడు. ముస్లిములు పశ్చిమ సమాజాన్నీ, పశ్చిమం సాధించిన విజయాలనూ అంగీకరించాలనీ, అట్లాగే పశ్చిమ దేశవాసులు కూడా ముస్లిములను తమకన్నా తక్కువవారుగా కాక సమానులుగా చూడాలనీ అన్నాడు.

పాశ్చాత్య నాగరికతా, క్రైస్తవ మత ధర్మశాస్త్రమూ కూడా తక్కిన వారిని సరైన గౌరవ మర్యాదలతో చూడ్డం నేర్చుకోకపోతే ఆ రెండూ కూడా ఇరవయ్యో శతాబ్దపు వాస్తవాలను ఎదుర్కోలేవని ఆయన అన్నాడు. ఈ క్రమంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ - సెప్టెంబర్ విషాదం, అటు పాశ్చాత్యులూ, ఇటు ముస్లిములూ కూడా ఈ పరీక్షలో నెగ్గలేదని తేల్చింది.

ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లిమ్‌లను అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాట పోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి. అందుకు ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు. ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.

Saturday, November 27, 2010

400 ఏళ్లు..వెనక్కి! - ఆటోచెప్పే భాగ్యనగర కథ

నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్ అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుకున్నాం. కాని నిజంగా మనకు మన భాగ్యనగరం గురించి తెలిసింది ఎంత? అప్పటి వీధులు ఎలా ఉండేవి? మనుషులు ఎలా ఉండేవారు? వేషభాషలు ఎలా ఉండేవి? కళలు, సంస్కృతి ఎలా ఉండేవి? పాత ఫోటోల్లోనో, పీరియడ్ సినిమాల్లోనో తప్ప వాటి గురించి మనకేం తెలుసు? తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత ఉన్నా అన్నిట్నీ ఒకేచోట తెలుసుకునే మార్గం ఇప్పటిదాకా లేదు మనకు. ఇప్పుడు 'హైదరాబాద్ గ్రాఫిక్ నవల' రూపంలో ఆ అవకాశం వచ్చింది.

ఏమిటీ నవల?
నాలుగొందల ఏళ్ల నాటి హైదరాబాద్ చరిత్ర యావత్తూ కాలానుగుణంగా బొమ్మల కథ రూపంలో చూపించడం హైదరాబాద్ గ్రాఫిక్ నవల ఉద్దేశం. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'యుగంతర్' చేపట్టిన 'ఆర్కైవ్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్'లో భాగంగా ఈ మహత్తర కార్యానికి ఇద్దరు కుర్రాళ్లు పునుకున్నారు. వాళ్లు జయదీప్, జస్‌రామన్‌లు. ఇప్పటికే ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తిచేశారు కూడా.

సులువేం కాదు..
గ్రాఫిక్ నవలను తయారుచేయడం అంత సులువేం కాదు. ప్రతి ఎపిసోడ్‌లో ఎన్నో పేజీలు, ప్రతి పేజీలో ఎన్నో ప్యానల్స్ ఉంటాయి. ప్రతి ప్యానల్‌లో కనిపించే మనుషులు, కట్టడాలు, వీధులు, వస్తువుల కోసం కొన్ని వందల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అనుకున్న యాంగిల్‌లోనే ఉండాలి. స్క్రిప్ట్, విజువలైజేషన్ పకడ్బందీగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు.. స్క్రిప్ట్‌కి తగ్గట్లుగా బొమ్మలు గీసే ఆర్టిస్ట్‌కి ప్రతి ప్యానల్ ఎలా ఉండాలన్నది అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. మధ్యలో ఎన్నో చర్చలు, మార్పులు, చేర్పులు. ఇవన్నీ జరిగితే తయారయ్యేది ఒక్క ప్యానల్ మాత్రమే. జయదీప్, జస్‌రామన్‌లు ఇప్పటి వరకు ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీనికంటే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని డాక్యుమెంటరీ తీయడం ఎంతో సులువని వారు పేర్కొంటారు.

'ఆటో'యే హీరో!
మనకు ఎన్నో ఇంగ్లీష్ బొమ్మల కథలు తెలుసు. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. సూపర్‌మాన్, బ్యాట్‌మాన్, స్పైడర్‌మాన్, ఫాంటమ్.. ఏ బొమ్మల కథ తీసుకున్నా సరే అందులోని హీరో.. విలన్లతో సాగించే వీరోచిత పోరాట సన్నివేశాలు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ గ్రాఫిక్ నవలలో కూడా హీరో ఉంటాడు. కాకపోతే అది ఒక ఆటో. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మీకు 'టైం మెషిన్' తెలుసుకదా? హాలీవుడ్‌లో ఈ థీమ్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. టైం మెషిన్‌లో కూర్చుని ఒక మీట నొక్కగానే అది కాలంలో ముందుకో, వెనక్కో తీసుకెళుతుంది. మన తెలుగులో కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఆదిత్య 369' సినిమాలో కూడా ఇదే ఇతివృత్తం. సరిగ్గా ఈ ఆటో కూడా అలాంటి టైం మెషినే. ప్రతి ఎపిసోడ్‌లో ముందుగా ఆటో వస్తుంది.

అందులో ప్రయాణికుడు ఎక్కగానే అది భాగ్యనగర చరిత్రలో కొన్నేళ్ల వెనక్కో, ముందుకో తీసుకెళ్లి వదిలేస్తుంది. ఇక అక్కడ్నించి కథ మొదలవుతుందన్నమాట. ఆ కాలంలో మన భాగ్యనగర వీధులు ఎలా ఉండేవో, మనుషులు ఎలా ఉండేవారో, ఏక్కడ ఏయే కట్టడాలు ఎలా ఉండేవో.. అన్నీ కాలానుగుణంగా కనిపిస్తూ పాఠకులకు కనువిందు చేస్తాయి. ఇలా మొత్తం 400 ఏళ్ల భాగ్యనగర చరిత్ర కాలాన్ని విభజించుకుంటూ ఆయా కాల, మాన పరిస్థితులలో భాగ్యనగర వైభవాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు ఈ గ్రాఫిక్ నవల ద్వారా కృషి చేస్తున్న జయదీప్, జస్‌రామన్‌లు కొత్తరకం చరిత్రకారులుగా అందరి ప్రశంసలు పొందడం ఖాయం. హైదరాబాద్ గ్రాఫిక్ నవల మొదటి ఎపిసోడ్, ఇతరత్రా వివరాల కోసం www.facebook.com/hydgraphicnovelను చూడవచ్చు.
ఈ గ్రాఫిక్ నవల ప్రాజెక్ట్ ఆలోచన మీదేనా? లేకపోతే..
జయదీప్: ఈ ఆలోచన పూర్తిగా మాదే. నిజానికి దీనికంటే ముందు మేం సత్యం ఫౌండేషన్ వాళ్ల కోసం ఒక ఫొటోగ్రఫీ ప్రాజెక్ట్ చేశాం. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. పాత తరం వాళ్లలో అన్ని వర్గాలకు చెందిన 30 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఇంటర్వ్యూ అంటే.. అసలు గతంలో హైదరాబాద్ ఎలా ఉండేదో, ఎక్కడెక్కడ ఏమేం ఉండేవో, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానం, స్థితిగతులు, సంప్రదాయాలు, సంస్కృతి ఎలా ఉండేవో అవన్నీ వాళ్ల నుంచి తెలుసుకున్నాం. అదంతా నేటి హైదరాబాదీలు ఏమాత్రం ఎరగరు.

జస్‌రామన్: అవన్నీ వింటున్నప్పుడు మాకు హైదరాబాద్ గురించి ఏదైనా డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. తీయొచ్చు.. కానీ నాలుగొందల ఏళ్లు వెనక్కి వెళ్లి చూపించడం ఎలా? ఇదే పెద్ద సమస్య అయింది. ఆనాటి వీధులు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద కట్టడాలు, స్మారక చిహ్నాలు కూల్చివేతలకు గురయ్యాయి. అంతెందుకు.. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు తిరిగొచ్చి హైదరాబాద్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరంను చూపించడం ఎలా? పోనీ సెట్టింగ్స్ వేసి తీద్దామా అంటే.. ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

జయదీప్: సెట్టింగ్స్ వేయడం కూడా అంత సులువేం కాదు. ఎందుకంటే ఆనాటి వీధులు, కట్టడాలు, స్మారక చిహ్నాల గురించి తెలిసిన వాళ్లు ఎవరున్నారో, ఎక్కడున్నారో పట్టుకోవడం చాలా కష్టం. సరిగ్గా అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది. ఇతర మార్గాలేవీ వర్కవుట్ అవవని నిర్ణయించుకున్నాక, గ్రాఫిక్స్.. అంటే బొమ్మల రూపంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇందులో మాకెలాంటి ఇబ్బందీ కనిపించలేదు. నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరం ఎలా ఉండేదో, ఎక్కడ ఏమేం ఉండేవో ఇప్పటికే మాకు ఒక అవగాహన ఉంది కదా. ప్రతి సీన్ ఆర్టిస్టుకి అర్థమయ్యేలా చెబుతాం. ఆ ప్రకా రం గ్రాఫిక్ తయారవుతుంది. ఇదీ మా ఆలోచన.

మరి, ఈ 'యుగంతర్' వాళ్లతో పరిచయం ఎలా?
జస్‌రామన్: యుగంతర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇందులోని డైరెక్టర్లలో కె.లలిత ఒకరు. ఆవిడ మాకు ఆంటీ అవుతారు. అప్పటికే వీళ్లు 'ఆర్కైవ్స్ హైదరాబాద్' అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంటరీలు తీసి భద్రపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మా గ్రాఫిక్ నవలా ప్రాజెక్టు వీరికి కూడా నచ్చడంతో అందుకు అవసరమయ్యే నిధులు, ఇతర సహాయ సహకారాలు అందజేసేందుకు యుగంతర్ సంసిద్ధమైంది. అలా ఈ ప్రాజెక్ట్ ప్రాణం పోసుకుంది. గత ఏడాది నవంబర్‌లో గ్రాఫిక్ నవలకు సంబంధించిన పని ప్రారంభించాం. ఇప్పటి వరకు రెండు ఎపిసోడ్లు పూర్తి చేశాం. మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రాలు మా ఫేస్‌బుక్ పేజీలో పెట్టాం. మంచి స్పందన వచ్చింది.

కథ ఎక్కడ్నించి, ఎలా మొదలవుతుంది?
జయదీప్: దాదాపు అరవై ఐదేళ్ల క్రితం.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కథ మొదలవుతుంది. ప్రముఖ వేటగాడు సర్ పెర్సీ పంజాగుట్ట అటవీప్రాంతంలో రాక్షస బల్లుల కోసం తిరుగాడుతూ సమీపంలో ప్రవహిస్తున్న నది నీటి ప్రవాహంలో ఏదో కొట్టుకొస్తుండడం గమనిస్తాడు. తీరా దగ్గరికి వచ్చేసరికి అదొక అతి పెద్ద రాక్షస బల్లి. దాని బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెడుతుండగా 'టైం మెషిన్ ఆటో' ఎదురవుతుంది.

"త్వరగా పోనీ.. ఇరవై ఒకటో శతాబ్దానికి..'' అంటూ ఆటో ఎక్కేస్తాడు. అయితే ఆ హైదరాబాదీ ఆటో డ్రైవర్ తాపీగా.. "ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా..?'' అంటూ బేరం మొదలెడతాడు. ఒక వైపున తరుముకొస్తున్న రాక్షసబల్లి.. మరో వైపున ఆటోవాలా బేరసారాలు.. దీంతో సర్ పెర్సీకి తిక్కరేగిపోతుంది. "జల్దీ.. జల్దీ..'' అని తొందరపెట్టి ఎట్టకేలకు రాక్షస బల్లి నుంచి తప్పించుకుని, బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నగరంలోకి వచ్చిపడతాడు. ఇలా మొదలవుతుంది మొదటి ఎపిసోడ్ కథ. ఈ నవల మొత్తం పూర్తి అవడానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ఏడాది పాటు ఎంతో కష్టపడితే ఇప్పటికి రెండు ఎపిసోడ్లు అంటే.. దాదాపు 35 పేజీలే పూర్తిచేయగలిగాం.

ఎందుకింత సమయం?
జస్‌రామన్: అంటే.. మేం ఇక్కడుంటే మా ఆర్టిస్ట్ ఎక్కడో ఉంటాడు. ఉదాహ రణకు మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన బొమ్మలన్నీ హర్షో మోహన్ చత్తోరాజ్ గీశారు. ఈయన కోల్‌కతాలో ఉంటారు. మేం ఈమెయిల్ ద్వారా ప్రతి సీన్ ఆయనకి వివరించి, ఆ సీన్ ఎలా ఉండాలో కూడా రఫ్‌గా మేం గీసి, దానికి సంబంధించిన ఫొటోలన్నీ ఆయనకు పంపితే వాటిని ఆధారంగా చేసుకుని, సీన్ అర్థం చేసుకుని ఆయన బొమ్మలు గీస్తారు. ఈ ప్రక్రియలో ఈ-మెయిల్స్, ఫోన్‌కాల్స్ ద్వారా మేం పరస్పరం సంప్రదించుకుని, సందేహాలు తీర్చుకోడానికి, సూచనలు ఇచ్చుకోవడానికే అధిక సమయం ఖర్చయిపోతోంది.

ఇంత ఇబ్బంది పడేకంటే ఇక్కడే ఆర్టిస్ట్‌ని చూసుకోవచ్చు కదా?
జయదీప్: చూసుకోవచ్చు.. కానీ ఇక్కడి ఆర్టిస్టులందరూ చాలా బిజీ. వీళ్లంతా ఇక్కడ ఉంటూ విదేశాల నుంచి గ్రాఫిక్స్,యానిమేషన్లకు సంబంధించి వచ్చే పనులు చేస్తున్నారు. ఇక్కడి ఆర్టిస్టులను తప్పు పట్టాలన్నది కాదు మా ఉద్దేశం. కమర్షియల్ వర్క్స్ చేస్తే వాళ్లకు రూపాయలు కాదు, డాలర్స్ వస్తాయి. అలాంటి సమయంలో మేం ఇచ్చే రూపాయలు పుచ్చుకుని మా వర్క్ చేయమని మేం అడగలేం కదా! అందుకని మా ప్రాజెక్ట్ కోసం మేం ఇతర ప్రాంతాల ఆర్టిస్ట్‌లపై ఆధారపడ్డాం. మా గ్రాఫిక్ నవలకు సంబంధించి ఒకో ఎపిసోడ్ బొమ్మలు ఒకో ఆర్టిస్ట్ చేత వేయిస్తున్నాం. మొదటి ఎపిసోడ్‌కు హర్షో మోహన్ చత్తోరా బొమ్మలు గీస్తే, రెండో ఎపిసోడ్‌కు అర్జెంటీనా ఆర్టిస్ట్ ఫెదరికో జూమెన్ గీశారు. అలా ప్రతి ఎపిసోడ్‌కు ఆర్టిస్ట్ మారిపోతారు.

మరి ఆర్టిస్ట్ మారినప్పుడు బొమ్మల శైలి కూడా మారుతుంది కదా?
జయదీప్: మారుతుంది. అయితే కాలం కూడా మారిపోతుందిగా. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు చార్మినార్, దాని పరిసర ప్రాంతాలు ఉన్నాయనుకోండి. నాలుగొందల ఏళ్ల క్రితం ఉన్నట్లే మూడొందల ఏళ్ల క్రితం ఉండదు కదా. కాలంతోపాటే ఆ ప్రాంతం కూడా మారుతుంది. మరో వంద సంవత్సరాలు గడిచాక ఇంకా మారిపోతుంది. కాబట్టి బొమ్మలు కచ్చితంగా మారాలి. స్క్రిప్ట్ మాత్రం మారిపోకూడదు, అదీ అసలు విషయం.
ఓకే, చిన్న వయసులోనే పెద్ద బాధ్యత భుజాన వేసుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్!
- వై.రమేష్‌బాబు,

Friday, November 19, 2010

బ్యాడ్‌ హ్యాబిట్‌

కాలేజీ ఫ్రెషర్స్‌ డే పార్టీ జరుగుతోంది. అందులో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ లోపుగా ఒక విద్యార్థి మైకంతో కళ్లు తిరిగి పడిపోయాడు. అతను మద్యం ఎక్కువగా సేవించడం వల్ల తూలి పడ్డాడని తెలుసుకోవడానిి మిగతా వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే ఆ పార్టీలో దాదాపు అందరూ డ్రింక్‌ తాగుతున్నవారే. చివరకు ఆ అబ్బా యిని తమ ఫ్రెండ్స్‌ ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఆ అబ్బాయి విపరీతమైన హ్యాంగోవర్‌తో బాధపడడంతో పాటు తన మొహాన్ని తన తల్లిదండ్రులకు చూపించడానికి సిగ్గుపడ్డాడు. ఈ విధమైన పరిస్థితులు నేడు చాలా మంది యంగ్‌ స్టర్స్‌కు ఎదురవుతూనే ఉన్నాయి.

పార్టీలలో, పబ్‌లలో మిత్ర బృందమంతా కలుసుకున్నప్పుడు బీర్‌, ఆల్క హాల్‌ తీసుకోవడం నేడు ఫ్యాషన్‌గా భావిస్తున్నారు కొంతమంది కుర్ర కారు. అబ్బాయిలే కాకుండా నేడు కొంతమంది అమ్మాయిలు కూడా మద్యం సేవించడం నేర్చుకుంటున్నారు. ఇలా సరదా కోసం అలవాటు చేసుకున్నవే చివరకు వ్యసనాలుగా మారుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీ లైనంత వరకు వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.

మద్యంతో హాని...
badhabit1మద్యం తాగడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో చదువుకున్నవారికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ పబ్బులు, పార్టీలలో డ్రింకింగ్‌ తప్పని సరి అంటున్నారు నేటి యంగ్‌స్టర్స్‌. యంగ్‌ జనరేషన్‌ కలిసినప్పుడు ఫన్‌ ఉండాలంటే ఈ మాత్రం రిస్క్‌ తీసుకోవాల్సిందేనని అంటున్నారు. అదీకా కుండా ఇంతకు ముందు పార్టీలకు యువకులు మాత్రమే హాజరయ్యేవారు. ఇందులో వారు మద్యం సేవించేవారు. నేడు ఆడా, మగా తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లడం అలవాటయిపోయింది. అందువల్ల ప్రస్తుతం తమ స్నేహితులతో (బాయ్‌ ఫ్రెండ్స్‌) కలిసి కొందరు అమ్మాయిలు కూడా డ్రింక్‌ చేయడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అయింది. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్‌ అందరం కలిసినప్పుడు సరదాగా కొంచెం తాగడంలో పెద్ద తప్పులేదు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్‌ అని చెప్పుకొంటున్నారు నేటి యువతీ యువకులు. మన దేశ చట్టం ప్రకారం 21 సంవత్సరాలు నిండని వారికి మద్యం అమ్మ రాదని రూలు ఉంది. షాపుకు వచ్చిన విద్యార్థుల ఐడెంటీ కార్డును పరిశీలించిన తరువాతే అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా చాలా మంది తమకు కావలసిన డ్రింక్స్‌ను కొనుగోలు చేస్తున్నారని పెద్దలు వాపోతున్నారు.

తక్కువ మోతాదులో...
badhabitస్నేహితులందరం ఎప్పుడైనా కలిసినప్పుడు, క్లబ్‌లకు వెళ్లినప్పుడు తప్పకుం డా బీర్‌కానీ, ఆల్కహాల్‌కానీ తీసుకుంటాం. అది కూడా తక్కువ మోతాదు లోనే పుచ్చుకుంటాం. దీనివల్ల హాని సంగతి కాసేపు పక్కన పెడితే అమ్మాయి లను ఆకట్టుకోవడానికి ఇది షార్ట్‌ రూట్‌ అని నేననుకుంటున్నాను. అమ్మా యిల ముందు అటెన్ష్‌గా, స్టైల్‌గా మాట్లాడేందుకు సహకరిస్తుంది. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు అది చాలా చక్కగా పనిచేసి నాలోని మరో కొత్త వ్యక్తి బయటకు వచ్చి పార్టీలో ఆనందంగా గడపగల్గుతున్నాను’ అని 18 సంవత్స రాల స్టూడెంట్‌ విష్ణు అంటున్నాడు.

జాగ్రత్తలు తీసుకుంటున్నారు...
నేటి రోజుల్లో చాలా మంది యూత్‌ లేట్‌నైట్‌ పార్టీలలో, పబ్బులలో డ్రింక్‌ చేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా ఉం డేందుకు మందు తాగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న చిట్కాల ను ఉపయోగించి తల్లిదండ్రుల నుంచి తప్పించుకుంటున్నారు. ‘ఒకసారి మా కాలేజీ మిత్రులతో పార్టీలో పాల్గొన్నాను. అపుడు వారి బలవంతం మీద మొదటిసారిగా మద్యం తీసుకున్నాను. తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు పేరెంట్స్‌ పసిగట్టకుండా ఉండేందుకు మౌత్‌ ఫ్రెషనర్‌ను ఉపయోగించి వారి నుంచి తప్పించుకున్నాను. ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా డ్రిం్‌ చేయాల్సి వచ్చినప్పుడు నా బ్యాగ్‌లో పిప్పర్‌మెంట్లు, మౌత్‌ఫ్రెషనర్‌ను తప్పకుండా తీసుకవెళతాను’ అని స్టూడెంట్‌ ప్రభాకర్‌ అన్నాడు.

గుణపాఠం నేర్చుకున్నాను...
రాత్రి పార్టీలలో డ్రింక్‌ చేసిన తరువాత రోజు ఉదయం హ్యాంగ్‌ఓవర్‌తో, తలనొప్పితో బాధపడాల్సి వస్తుంటుందని కొంత మంది యంగ్‌స్టర్‌ తమ అనుభవాలను చెబుతున్నారు. ‘నాకు మా కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే పార్టీలో ఒక చేదు అనుభవం ఎదురైంది. నాకు ఇంకా గుర్తుంది. ఆ పార్టీ అయిన తరువాత నా స్నేహితులే నన్ను మా ఇంటి వద్దకు చేర్చారు. ఎందుకంటే ఆరోజు రాత్రి దాదాపు ఐదు పెగ్గులకు మించి తాగడంతో నేను కిందపడిపోయాను. లేచే ఓపికలేక పోయింది. ఇది అయిన మరుసటిరోజు విపరీతమైన తలనొప్పి (హ్యాంగోవర్‌)తో బాధపడాల్సి వచ్చింది. అంతేకాకుండా తెల్లారి మా తల్లిదండ్రు లకు నా మొహం చూపించలేకపోయాను. సిగ్గుతో నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఆ సంఘటన వల్ల నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. పార్టీలలో సరదాల కోసం మందుకు బానిసలు కావడం తప్పని తెలుసుకున్నాను. తాగితేనే ఎంజాయ్‌ చేయగలమను కుంటే అసలు పార్టీలకే పోనవసరంలేదు’ అని 22 సంవత్సరాల సతీష్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వ్యసనంగా మారే అవకాశం ఉంది...
యవ్వనంలో తాము చేసే పని చాలా కరెక్ట్‌ అని టీనేజర్స్‌ ఆనుకుంటారు. అది భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలను కలిగిస్తుందని తెలిసినా కూడా వాటివైపే మొగ్గుచూపుతారు. తాత్కాలిక సుఖం కోసం తమ అమూల్యమైన సమయాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. ‘ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలూ అబ్బాయిలూ అనే తేడాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇరువురూ వెళ్లడం పరిపాటయింది. ఇంతకు ముందు విదేశాల్లోనే ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోని నగరాలకు కూడా వ్యాపించింది. పబ్బులకు వెళ్లడం సాధారణ విషయంగా పరిగణించే స్థాయికి నేటి యంగ్‌స్టర్స్‌ వచ్చారు. ఇలా పబ్బుల్లో అబ్బాయితో సమానంగా యువతులు కూడా డ్రింక్‌ (మద్యం) తీసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఇలాంటివి ముందు సరదాల కోసం అలవాటు చేసుకొన్నా చివరకు వ్యసనంగా మారుతుంది. ఎంజాయ్‌ చేయడం తప్పులేదు కానీ అందుకోసం ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కావడం తమ భవిష్యత్తు నాశనానికి దారితీస్తుందని నేటితరం తెలుసుకోవాలి’ అని మాససిక నిపుణులు తెలియజేస్తున్నారు.
-ఎస్‌.అనిల్‌ కుమార్‌

Sunday, November 7, 2010

e - తరం .... ఓన్లీ వన్ కాంటాక్ట్ ప్లీజ్!

డియర్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, కొలీగ్, క్లాస్‌మేట్, రూమ్‌మేట్, ఎక్సెట్రా..,

ఫస్ట్ టైం యాహూ మెయిల్‌లో ఒకరికొకరం ఇ-ఉత్తరాలు రాసుకున్నాం. 'మెయిల్ ఐడి' లేని మనవాళ్లని ఇంటర్నెట్ సెంటర్లకి లాక్కెళ్లి మరీ వాళ్లచేత ఎకౌంట్లు ఓపెన్ చేయించాం. మొత్తమ్మీద అందరం ఆన్‌లైన్లోకి ఎంటరయ్యాం. ఆ తర్వాత పాతవాళ్లమే కొత్తగా జీ మెయిల్లో చూసుకున్నాం, చాటింగ్ చేసుకున్నాం. గ్రీన్ లైట్ చూసి చాటింగ్ మొదలెట్టి... రెడ్ లైట్ కనపడినా అంటిపెట్టుకునే ఉన్నాం. యాక్టివ్, ఇన్-యాక్టివ్ గుర్తులు కూడా మనల్ని సేవ్ చెయ్యలేకపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొందరం, ఆన్‌లైన్లో చేసేదేమీ లేక ఇంకొందరం, ఏం చెయ్యాలో తెలియక మరికొందరం మెయిళ్లు చేసుకున్నాం, గంటలు గంటలు 'చాట్'భారతాలు రాసుకున్నాం. రైటింగ్ ప్రాక్టీస్ చేశాం. ఇష్టం వచ్చినట్టు షార్ట్‌కట్‌లు ఉపయోగించాం. ఆ షార్ట్‌కట్‌లని అర్థం చేసుకోవడానికి మళ్లీ షార్ట్ టర్మ్ రీసర్చ్ ప్రాజెక్టులు చేశాం.

కస్టమ్ మెసేజ్‌లో 'ఫుల్ బిజీ...కెనాట్ చాట్, సారీ' అని రాసుకుంటే మాత్రం ఒదిలిపెట్టామా? పాపం మనవల్ల మనకి ఎదురౌతున్న ఈ ప్రాబ్లమ్స్ గమనించేనేమో చివరికి జి మెయిల్ కరుణించింది. 'ఇన్‌విజిబుల్' ఆప్షన్ ఇచ్చింది. 'దీని చాటున దాక్కోవచ్చు' అంది. ఆన్‌లైన్లో ఉంటూనే లేనట్టు బిల్డప్పిచ్చి ఎలాగో కాంటాక్ట్‌ల నుండి తప్పించుకున్నాం. అదీ ఎంతకాలం... ఆన్‌లైన్‌కి అలవాటైన ప్రాణాలు అంత తేలిగ్గా ఆఫ్‌లైన్ అవుతాయా? అందుకే అందరం 'ఇన్‌విజిబుల్'గా ఉంటున్నామని అందరికీ తెలిసిపోయింది. ఇన్‌విజిబుల్ కాస్త విజిబుల్ అయిపోయింది.

వీటన్నిటి నుండి ఎలా బయట పడాల్రా దేవుడా అనుకుంటూ ఉండగానే అవతరించింది ఆర్కుట్. కథ మళ్లీ మొదటికొచ్చింది... యాహూ మెయిల్లో ఉన్న బ్యాచే జీ మెయిల్లోకి వెళ్లి ఇప్పుడు ఆర్కుట్‌లో చేరమని ఇన్వైట్ చేసుకున్నాం. అప్పటిదాకా మెయిల్లో కాంటాక్టులుగా మాత్రమే ఉన్న మనం ఆర్కుట్‌తో 'సోషల్ నెట్‌వర్క్'గా ఎదిగాం. ఓపక్క ఇ-మెయిళ్లు, చాటింగులు చేసుకుంటూనే ఆర్కుట్‌లో 'శ్క్రాప్'లు... అవును ఆ 'తుక్కే' రాసుకున్నాం. దాంతో మనకి మరో ఎడ్వాంటేజ్ వచ్చింది. ఎవరు ఎవరికి ఏ తుక్కు రాసినా దాన్ని వేరేవాళ్లు చదవొచ్చు. అందుకే తొంగిచూడడం ఎక్కువైపోయింది. మనం రాసేవాటికి కరెక్ట్‌గా సూట్ అవ్వాలనే ఆర్కుట్ వాళ్లు వాటికి 'శ్క్రాప్' అని పేరు పెట్టారట. ఆర్కుట్ బాటలోనే 'ట్యాగ్డ్', 'హై ఫైవ్', 'మై స్పేస్'...ఇలా కొత్తకొత్త నెట్‌వర్క్‌లెన్నో పుట్టుకొస్తే కనపడిన ప్రతి దాన్ని క్లిక్ చేశాం. జాయినయ్యాం. మారింది నెట్‌వర్కే కాని ఆ నెట్‌వర్క్‌లో చేరింది మళ్లీ మన గుంపే. ఇంతలో మొదలైంది ఫేస్‌బుక్ ఫీవర్!

'ఫేస్‌బుక్‌లో లేవా... యూ ఆర్ సో అన్‌కూల్ ఓకే...' అని అంతపెద్ద నోరేసుకుని అని తోటివాళ్లంటుంటే చివరికి దాన్లో కూడా చేరక తప్పలేదు. ఇక్కడ కూడా ఓల్డ్ ఫ్రెండ్సే తగిలారు. సో... వుయ్ మీట్ ఎవ్రివేర్... ఒకరినొకరం పలకరించుకోవడానికి ఇన్ని మార్గాలు అవసరమా? ఏదో పనుండి రెండ్రోజులు ఆన్‌లైన్‌కి రాకపోతే 'యు డిడ్ నాట్ గివ్ ఎనీ రిప్లయ్ టు మై మెయిల్, వాట్ హ్యాపెన్డ్' అని ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ మెసేజ్. అదీ చాలదన్నట్టు సెల్‌ఫోన్లో 'ప్లీజ్ రెస్పాండ్ టు మై మెయిల్' అని ఎస్ఎమ్ఎస్.

అంత అవసరం ఉందా? కాసేపైనా వదల్రా?
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది... నిజమే. అయితే ఇన్ని కనెక్షన్లు అవసరమా? 'టెక్నాలజీస్ ఆర్ ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ అవర్ బాడీ' అని మార్షల్ మెక్‌లూహన్ ఎప్పుడో చెప్పినట్టు సెల్‌ఫోన్ ఇప్పుడు మన శరీర భాగాల్లో ఒకటై ఉండనే ఉంది. కాబట్టి మన మధ్య సో మెనీ కాంటాక్టులు, కనెక్షన్లు, నెట్‌వర్కుల అవసరం లేదేమో. జస్ట్ ఒక్క ఇ-మెయిల్ చాలు. నో మోర్ న్యూ కనెక్షన్స్ ప్లీజ్!
- ఒక నెట్ బాధితుడు