Showing posts with label Design. Show all posts
Showing posts with label Design. Show all posts

Thursday, February 10, 2011

మ్యాచింగ్ మెహందీ

మాఘమాసం వచ్చిందంటే పార్లలో బ్యూటీషియన్స్ లేటెస్ట్ మెహందీ డిజైన్స్ ఎంచుకునే పనిలో పడిపోతారు. పెళ్లికూతురికి మెహందీ పెట్టడం అంటే చాలా పెద్ద పని. అరచేతి నిండా పెడితే సరిపోవడం లేదు. మోచేతి నుంచి మొదలుపెట్టాలి. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం. మార్వాడి బ్రైడల్ మెహందీలో పెళ్లికూతురు చేతులు, కాళ్లు అన్నీ ఎర్రగా మెరిసిపోవాలి.

ఎన్ని రకాలు...

పూర్వం డిజైన్ గురించి కంటే ఆకుమీదే ఎక్కువగా దృష్టిపెట్టేవారు. ఎవరి చెట్టు ఆకు ఎక్కువగా పండుతుందో తెలుసుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. కోన్‌లలో కలిపే రకరకాల పదార్థాల వల్ల కలర్ వద్దన్నా వస్తోంది. ఎటొచ్చీ ఆలోచనంతా డిజైన్ గురించే. వీటిలో అరబిక్, అరబిక్ బ్రైడల్, మార్వాడి బ్రైడల్, దేవదాస్ చాలా ప్రముఖమైనవి. పెళ్లికూతురికి మాత్రం ఎక్కువగా మార్వాడి బ్రైడల్ వేస్తారు. చిన్న చిన్న డిజైన్లతో మొత్తం చేయంతా నిండుగా కనిపిస్తుంది. ఎక్కడా లింక్‌పోకుండా డిజైన్ వేస్తారు.

చాలా సమయం పడుతుంది. రెండవది అరబిక్. పెద్ద పెద్ద పువ్వులతో ఉంటుంది. గీతలు, చుక్కలు వేయకుండా ఆకులు, పువ్వులు వంటి డిజైన్లు కనిపిస్తాయి. చూడ్డానికి సింపుల్‌గా, అందంగా ఉంటుంది. వేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. ఇందులో బ్రైడల్ డిజైన్ మళ్లీ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక చివరిది దేవదాస్. ప్రస్తుతం దేవదాస్ ట్రెండే నడుస్తోంది. అరచేతిలో సింపుల్‌గా రెండు పువ్వులు, కాలికి ఓ మూడు పువ్వులు విడివిడిగా వేస్తారు. చాలా సింపుల్‌గా ఉండే ఈ డిజైన్ అన్ని తరాలవారిని ఆకట్టుకుంటుంది.

మ్యాచింగ్ మహిమ...

మనకి తెలిసిన గోరింటాకు ఎర్రగానే పండుతుంది. మరీ బాగా పండితే మర్నాటికి నల్లబడుతుంది. కాని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కోన్‌లు ఎర్రగా, నల్లగా, పచ్చగా, తెల్లగా కూడా పండుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకోకండి. ఇదంతా మ్యాచింగ్ కోసం. పెళ్లికూతరు కట్టుకునే చీరకు తగ్గట్టు చేతిలో రంగులు మెరవాలన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దాంతో రకరకాల మిక్సింగ్ ప్రాడెక్ట్స్ మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఇందులో మొదటిది బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. ముందుగా కోన్ పెట్టుకుని చివర్లో మెహందీ బ్లాక్ పౌడర్‌ని నీళ్లలో కలిపి డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు.

రెండవది జర్దోసి. చీరలపైన చేసే జర్దోసి వర్క్‌లాగే చేతులపై కూడా ప్రత్యేకంగా డిజైన్ గీస్తారు. ముందు కోన్‌తో డిజైన్ పెట్టుకుని తరువాత జర్దోసి పొడిని గమ్‌లో కలుపుకుని డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు. ఈ జర్దోసి పొడి గోల్డ్, సిల్వర్, బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది. పెళ్లి చీరపై ఉండే రంగును బట్టి మెహందీ అవుట్‌లైన్ గీసుకోవాలి. మూడోది మిర్రర్ వర్క్ మెహందీ. సన్నగా, చిన్నగా ప్లాస్టిక్ పేపర్ మందంలో ఉండే మెహందీ మిర్రర్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. మెహందీ డిజైన్ వేసిన తర్వాత సందుల్లో ఈ మిర్రర్‌ని అతికిస్తారు. ఆరిన తర్వాత నీళ్లతో కడుగుతారు. పండిన గోరింటాకు మధ్యలో అద్దం ముక్కలు అలాగే ఉంటాయి.

ఐదారు రోజులు అలాగే మెరుస్తూ కనిపిస్తాయి. వీటన్నింటికంటే భిన్నమైంది నెయిల్‌పాలిష్ మెహందీ. మనకి కావల్సిన రంగు నెయిల్‌పాలిష్‌ని తీసుకుని పలుచగా చేసి కోన్‌లో కలుపుకోవాలి. ఏ రంగు నెయిల్‌పాలిష్ కలిపితే ఆ రంగు షేడ్ చేతిపై కనిపిస్తుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మెహందీని చేతిపైకి తెస్తున్నారు. ఫలితంగా రకరకాల రంగుల్లో మెహందీని చూడగలుగుతున్నాం.

రెడ్ టాటూలుగా...
మనం గోరింటాకు అని నోటినిండా పిలుచుకునే మెహందీని విదేశీ వనితలు రెడ్‌టాటూ అని పిలుస్తారు. నిజానికి టాటూ అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కాని ఒంటిపైన రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోడానికి అందరూ ఇష్టపడడం లేదు. అలాగని టెంపరరీ టాటూలను వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీని గురించి మనకు మిర్రర్ పార్లర్ డైరెక్టర్ విజయలక్ష్మి బాగా చెబుతారు..."మనకి మెహందీ అంటే ఎంత మక్కువో విదేశీ అమ్మాయిలకు టాటూలంటే అంతే ప్రాణం. కాని అవి వేసుకుంటే ప్రతీ రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోవాలి. ఇలా ఒకే డిజైన్‌ని చూసుకోడానికి ఇష్టపడని అమ్మాయిలు టెంపరరీ టాటూలను వేయించుకుంటున్నారు.

అయితే ఆ టాటూలు వేసే ముందు వాడే లిక్విడ్స్ వల్ల చాలామంది శరీరంపైన దద్దుర్లొస్తున్నాయి. దాంతో ఎందుకొచ్చిన తంటాలనుకుని వాళ్లు టాటూల జోలికి వెళ్లడం లేదు. అలాంటివారి దృష్టి ఇప్పుడు మన మెహందీపై పడింది. చక్కగా వారికిష్టమైన చోట నచ్చిన డిజైన్ వేయించుకుని మురిసిపోతున్నారు. మెడపైనా, నడుంపైనా, కాళ్లపైనా...ఇలా వారికి నచ్చినచోట మెహందీ టాటూలను వేయించుకుంటున్నారు. వాటికి 'రెడ్ టాటూ' అని పేరు పెట్టారు. కెమికల్స్‌తో కూడిన ఆ టాటూల కంటే ఈ మెహందీ పెట్టుకోవడం ఎంతో ఉత్తమమని ఇతరులకు సలహా కూడా ఇస్తున్నారు'' అని చెప్పారామె.

మెహందీ పండుగ ...

మనకు పెళ్లికూతుర్ని చేయడం అంటే నలుగుపెట్టి స్నానం చేయించడం, పట్టుచీర కట్టి ముస్తాబు చేసి గాజులు తొడగడం, వచ్చిన ముత్తైదువులకి పసుపుకుంకం తాంబూలం ఇవ్వడం. ఇప్పుడు వీటి జాబితాలో మెహందీ కూడా చేరింది. ఉత్తరభారతదేశంలో 'మెహందీ రసం' పేరుతో చేసుకునే ప్రత్యేక వేడుక కొంతకాలం క్రితం మన రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది. ధనవంతుల ఇళ్లలో తన ప్రత్యేకతను చాటుచుంటోంది. మెహందీ వేడుక అంటే పెళ్లికూతుర్ని చూడ్డానికి వచ్చిన ఆడవాళ్లందరికీ గోరింటాకు పెట్టిస్తారు. పదిమంది కానీ వందమంది కానీ అందరికీ పెట్టాల్సిందే. ఏడేళ్లుగా మెహందీ పెడుతున్న ధనలక్ష్మి తన అనుభవం చెబుతోంది.

"ఒక పెళ్లికి జరిగిన మెహందీరసానికి వెళ్లాను. నేనూ నాతో మరో అమ్మాయి కూడా వచ్చింది. చాలామంది పేరంటాళ్లు వచ్చారు. అందరికీ మెహందీ పెట్టాలి. అంతమందికి పెట్టాలంటే త్వరగా పెట్టే డిజైన్‌లని ఎంచుకోవాలి. అందుకే అందరికీ దేవదాస్ డిజైన్స్ వేసేసాము. ఇద్దరం కలిసి నాలుగు గంటల్లో నలభైమందికి పెట్టేశాం'' అని గుర్తుచేసుకున్నారామె. ఇక ఇందులో ఖరీదుల విషయానికొస్తే...కాళ్లూ చేతులూ ఫుల్‌గా వేయించుకుంటే వెయ్యినుంచి రెండువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. పెళ్లికూతురికైతే చేతులు, కాళ్లకు కలిపి మూడువేల నుంచి ఐదువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. ఐదారొందల రూపాయలకు పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి, పార్లర్స్‌ని బట్టి ఖరీదులు చెబుతున్నారు.

ఫ్లయిట్ ఎక్కేవారికి ప్రత్యేకం..
పెళ్లయిన వెంటనే ఫ్లయిట్ ఎక్కి వెళ్లె పెళ్లికూతుర్లకి మెహందీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు విజయలక్ష్మి. " పెళ్లయిన వెంటనే విదేశాలకి వెళ్లే పెళ్లికూతుళ్లు ఎక్కువవుతున్నారు. భర్త ఉద్యోగనిమిత్తమో, హనీమూన్ ప్రయాణమో...మొత్తానికి పెళ్లయిన వారంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లాల్సివస్తోంది. అక్కడ వేలిముద్రలు తీసుకుంటారు. ఆ సమయంలో వేళ్లకి గోరింటాకు ఉంటే ఒప్పుకోరు.

ఒకసారి దీని వల్లే ఒక పెళ్లికూతురు ప్రయాణం రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దాంతో మా దగ్గరికి వచ్చే పెళ్లికూతుర్లని ముందే అన్ని వివరాలు అడుగుతున్నాం. విదేశీయానం ఉన్నట్లయితే చేతినిండా మెహందీ పెట్టినా వేళ్లకి పెట్టం. పెళ్లిసమయంలో అందంగా కనిపించడం కోసం ఆ ప్రాంతంలో స్కెచ్‌తో రంగు వేస్తున్నాం. తరువాత కడిగేస్తే పోతుంది. విదేశాలకు వెళ్లాక ఆ వేళ్లభాగంలో కోన్ పెట్టుకోమని చెబుతాం. ఈ చిన్న జాగ్రత్త తెలియక చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు.'' అని వివరించారామె.

Tuesday, December 14, 2010

ఔరౌర... నాగవల్లి నగలు

లక లక లక.. అంటూ భయపెట్టిన చంద్రముఖి ఇప్పుడు ఔర.. ఔర.. అంటూ నాగవల్లిగా వస్తోంది. ఆమె ఆంగికం, అభినయమే కాదు.. ఆమె ఆభరణాలు కూడా ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికల నగలు ఒక ఎత్తయితే హీరో వెంకటేష్ నగలు మరో ఎత్తు. సినిమా విడుదలవ్వకముందే క్రేజ్ సంపాదించుకున్న ఈ నగలను రూపొందించింది ఎవరో తెలుసా? క్రిసాలా జ్యువలరీ అధినేత్రి బంటి బజాజ్. ఆమె గురించి.. ఆమె రూపొందించిన నగల గురించే ఈ కథనం.
బాలీవుడ్‌లో జోధాఅక్బర్, దేవదాసు చిత్రాల్లో నటీనటులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ఆ సినిమాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా మొదలయ్యింది. సినిమా పేర్లు పడుతున్నప్పుడు కనిపించే కాస్ట్యూమ్స్ టైటిల్‌తోపాటు ఈ మధ్య స్టయిలింగ్ అని మరో కొత్త టైటిల్‌ను కూడా వేస్తున్నారు తెలుగువాళ్లు. చాలామంది తారలకిప్పుడు పర్సనల్ స్టయిలిస్ట్‌లున్నారు. అయితే కొందరు ఇంకో ముందడుగు వేసి ప్రత్యేక జ్యువలరీ డిజైనర్లను నియమించుకుంటున్నారు.

అరుంధతి సినిమాలో అనుష్క, సింహ సినిమాలో నయనతారలు ధరించిన నగలు అలా రూపొందించినవే. అయితే తెలుగు సినిమాల్లో హీరోతో సహా దాదాపు అన్ని ముఖ్య పాత్రలకోసం ప్రత్యేక జ్యువలరీని తయారుచేసిన క్రెడిట్ మాత్రం నాగవల్లి సినిమాకే దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాల్లో ఎక్కువగా గిల్టీనగలనే వాడతారు. కానీ నాగవల్లి సినిమాలో తారలందరూ మేలిమి బంగారు ఆభరణాలనే ధరించారు. పైగా అవి ఆయా పాత్రల స్వభావాలకు అద్దం పట్టేలా ప్రత్యేకంగా రూపొందించారు బంటి బజాజ్.

ఏవరీ బజాజ్?

బంటి బజాజ్ పక్కా హైదరాబాదీ. కాకపోతే ఎక్కువకాలం ముంబయిలోనే ఉన్నారు. ఆమె 1993లో హైదరాబాద్‌కి వచ్చి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తుండేవారు. ఎన్నో ఫ్యాషన్ షోలను నిర్వహించారు. ఆమెకి చిన్నప్పటి నుంచీ జ్యువలరీ డిజైన్ చేయడంలో ఆసక్తి ఉండేది. ముంబయికి వెళ్లాక చిన్న చిన్న నగలను డిజైన్ చేయడం మొదలెట్టారు. చాలామంది బాలీవుడ్ తారలతో పరిచయాలు ఉండడంతో మొదట్లో ఆమె రూపొందించిన నగలను వారికి కానుకగా ఇస్తుండేవారు. అయితే ఆమె దీన్ని వృత్తిగా కాకుండా కేవలం హాబీగానే భావించేవారు.

అయితే ఆమె నగలను ఇష్టపడేవారు తమకోసం నగలు డిజైన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అడిగేవాళ్లు. అలా అడిగిన వారిలో అనిల్ కపూర్ భార్య సునీల్ కపూర్, రాణీముఖర్జీ, టబు, సోనాక్షి, విద్యాబాలన్ ఉన్నారు. బంటి బజాజ్ వారికోసం ఎన్నో నగలను ప్రత్యేకంగా రూపొందించారు. హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చే స్తూనే, ముంబయి ముద్దుగుమ్మలకు ఆభరణాలు రూపొందిస్తున్నప్పుడు త్రిభువన్‌దాస్ శ్రీకాంత్ జవేరీ ప్రోత్సాహంతో 2001లో పుల్‌టైమ్ డిజైనర్‌గా మారిపోయారు.
డిజైనర్‌గా..
బంటి బజాజ్‌కు ఎన్నో ఫ్యాషన్ షోలతో అనుబంధం, ఆమె ఆభరణాల పట్ల బాలీవుడ్ తారలకు సైతం ఆసక్తి ఉండడంతో ఆమె డిజైనర్‌గా గుర్తుంపు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. లాక్మే ఫ్యాషన్ షోలో ఆనంద్ కాబ్రా, నీతూ లుల్లా లాంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దుస్తులకు జ్యువెలరీని రూపొందించారు. సొంత సిగ్నేచర్ జ్యువలరీని రూపొందించాలన్న ఆలోచనతో 2006లో క్రిసాలా జ్యువలరీ పేరుతో హైదరాబాద్‌లో షోరూమ్ ప్రారంభించారు. ఆ తర్వాత ముంబయి, పూణెల్లో కూడా బ్రాంచీలను మొదలుపెట్టారు. ఈ విషయం పక్కన పెడితే బంటి బజాజ్‌కు డి. రామానాయుడు కుటుంబంతో చాలాకాలంగా అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే నిర్మాత సురేష్ బాబు నాగవల్లి సినిమా కోసం ప్రత్యేకంగా జ్యువలరీని రూపొందించాల్సిందిగా కోరారు.

ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో నేను చేసిన రాజు పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకులను ఒక్క క్షణంలో ఆ కాలానికి తీసుకువెళ్లడానికి ఒక కొత్తదనం కావాలి. అందుకు ఆహార్యం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అన్ని పాత్రలకీ ప్రత్యేకంగా కాస్టూమ్స్‌ని, జ్యువలరీని డిజైనింగ్ చేయించారు నిర్మాతలు. అందుకు రమా రాజామౌళి స్టయిలింగ్, బంటి బజాజ్ రూపొందించిన ఆభరణాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సినిమా విడుదలవ్వకముందే ఆ ఆభరణాల పట్ల ఏర్పడ్డ క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
- వెంకటేష్, కథానాయకుడు

నాగవల్లికి అనుగుణంగా..
'అవకాశం వచ్చినంత మాత్రాన అయిపోలేదు.. అసలు కథ అక్కడే మొదలయింది నాకు. ఈ నగల గురించి చెప్పాలంటే ఆ సినిమా కథ సగం చెప్పాల్సి వస్తుంది. అందుకే క్లుప్తంగా చెపా'్తనని మొదలెట్టారు బంటి బజాజ్. 'చంద్రముఖి చూసిన వారికి నాగవల్లి సినిమా పట్ల కొంత అవగాహన ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఉండాలన్నది మా ఉద్దేశ్యం. కథ, పాత్రల గురించి విన్న తర్వాత నా పరిశోధన మొదలుపెట్టాను. సినిమా రెండు భాగాలుగా ఉంటుంది.. ప్రస్తుతం.. గతం.. రెండు ఎపిసోడ్‌లలో కనిపించే జ్యువలరీ విభిన్నంగా ఉండాలి.

మోడ్రన్ జ్యువలరీ రూపొందించడం పెద్ద కష్టమేం కాదు.. ఫ్లాష్‌బ్యాక్ కోసం అప్పటి రాజులు, రాణులు, సామాన్యులు వాడిన దుస్తులు, ఆభరణాల గురించి పుస్తకాలు తిరగేశాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల గురించి, నిజాం నవాబుల గురించి, తంజావూరు గురించి చదివి కొంత నోట్స్ రాసుకున్నాం. తర్వాత సినిమాలో పాత్రలు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నాం. మేళవిస్తూ 200కు పైగా ఆభరణాలని రూపొందించాం. ఇందుకు ఆరునెలల సమయం పట్టింది' అని చెప్పారు బంటి బజాజ్.

నేను నటించిన అరుంధతి సినిమాలో కూడా నా పాత్రకోసం ప్రత్యేకంగా నగలను రూపొందించారు. ఆ ఆభరణాలను నా పాత్రకి ప్లస్ అయ్యాయి. ఆ పాత్రకి నాకు మంచి పేరొచ్చింది. కాకపోతే అవన్నీ గిల్ట్ నగలు. ఒరిజినల్ జ్యువలరీతో నటించడం మాత్రం ఇదే తొలిసారి. ఆనాటి కాలాన్ని డిజైనర్లు తమ ఆభరణాలతో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. అరుంధతి పాత్రలాగే ఈ సినిమాలో నా పాత్ర మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
- అనుష్క శెట్టి, కథానాయిక

ఎవరికి ఏ ఆభరణాలు..
నాగవల్లి సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వెంకటేష్, అనుష్కలతో పాటు కమలినీ ముఖర్జి, రిచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్‌లకు బంటి బజాజ్ ఆభరణాలు రూపొందించారు. ఈ అన్ని పాత్రలకూ రమా రాజమౌళి స్టయిలింగ్ చేశారు. ఒక సీన్ కోసం ఆమె ఎంచుకున్న దుస్తులను ఫోటో తీసి, క థలో ఆ సీన్‌ను బట్టి ముందుగా బొమ్మలు గీసుకున్నారు బంటి బజాజ్. సినిమాలో తమిళనాడులోని తంజావూరు నేపథ్యం కొంత ఉంటుంది. అందుకే కథనాయికల ఆభరణాల కోసం అక్కడ గుళ్లలో కనిపించే బొమ్మలు, పుస్తకాల్లో చదివిన ఆ కాలం నాటి డిజైన్లను ఎంచుకున్నారు.

ఒడ్డాణం, వంకీలు, జడ, కాసులదండ, ఉంగరాలను బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలు ఉపయోగించి రూపొందించారు. వెంకటేష్‌ది విజయనగరానికి చెందిన రాజు పాత్ర. ఈ పాత్ర కోసం ఎక్కువగా నిజాం నగలను, దక్షిణ భారతాన్ని పాలించిన రాజులు వాడిన ఆభరణాలను రూపొందించారు. సర్పెంచ్(రాజులు తలపాగాకు పెట్టుకునేవి), కమర్‌బంద్(షేర్వాణీ మీద మెడలో వేసుకునే ఆభరణం), బాజూబంద్(భుజాలకు కట్టుకునే కంకణాలు), మెడ నుంచి భుజాల వరకు వేలాడే పచ్చల హారాలు రాజు పాత్ర కోసం రూపొందించారు.
- బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫోటోలు: రాజ్‌కుమార్