Saturday, November 27, 2010

400 ఏళ్లు..వెనక్కి! - ఆటోచెప్పే భాగ్యనగర కథ

నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్ అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుకున్నాం. కాని నిజంగా మనకు మన భాగ్యనగరం గురించి తెలిసింది ఎంత? అప్పటి వీధులు ఎలా ఉండేవి? మనుషులు ఎలా ఉండేవారు? వేషభాషలు ఎలా ఉండేవి? కళలు, సంస్కృతి ఎలా ఉండేవి? పాత ఫోటోల్లోనో, పీరియడ్ సినిమాల్లోనో తప్ప వాటి గురించి మనకేం తెలుసు? తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత ఉన్నా అన్నిట్నీ ఒకేచోట తెలుసుకునే మార్గం ఇప్పటిదాకా లేదు మనకు. ఇప్పుడు 'హైదరాబాద్ గ్రాఫిక్ నవల' రూపంలో ఆ అవకాశం వచ్చింది.

ఏమిటీ నవల?
నాలుగొందల ఏళ్ల నాటి హైదరాబాద్ చరిత్ర యావత్తూ కాలానుగుణంగా బొమ్మల కథ రూపంలో చూపించడం హైదరాబాద్ గ్రాఫిక్ నవల ఉద్దేశం. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'యుగంతర్' చేపట్టిన 'ఆర్కైవ్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్'లో భాగంగా ఈ మహత్తర కార్యానికి ఇద్దరు కుర్రాళ్లు పునుకున్నారు. వాళ్లు జయదీప్, జస్‌రామన్‌లు. ఇప్పటికే ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తిచేశారు కూడా.

సులువేం కాదు..
గ్రాఫిక్ నవలను తయారుచేయడం అంత సులువేం కాదు. ప్రతి ఎపిసోడ్‌లో ఎన్నో పేజీలు, ప్రతి పేజీలో ఎన్నో ప్యానల్స్ ఉంటాయి. ప్రతి ప్యానల్‌లో కనిపించే మనుషులు, కట్టడాలు, వీధులు, వస్తువుల కోసం కొన్ని వందల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అనుకున్న యాంగిల్‌లోనే ఉండాలి. స్క్రిప్ట్, విజువలైజేషన్ పకడ్బందీగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు.. స్క్రిప్ట్‌కి తగ్గట్లుగా బొమ్మలు గీసే ఆర్టిస్ట్‌కి ప్రతి ప్యానల్ ఎలా ఉండాలన్నది అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. మధ్యలో ఎన్నో చర్చలు, మార్పులు, చేర్పులు. ఇవన్నీ జరిగితే తయారయ్యేది ఒక్క ప్యానల్ మాత్రమే. జయదీప్, జస్‌రామన్‌లు ఇప్పటి వరకు ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీనికంటే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని డాక్యుమెంటరీ తీయడం ఎంతో సులువని వారు పేర్కొంటారు.

'ఆటో'యే హీరో!
మనకు ఎన్నో ఇంగ్లీష్ బొమ్మల కథలు తెలుసు. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. సూపర్‌మాన్, బ్యాట్‌మాన్, స్పైడర్‌మాన్, ఫాంటమ్.. ఏ బొమ్మల కథ తీసుకున్నా సరే అందులోని హీరో.. విలన్లతో సాగించే వీరోచిత పోరాట సన్నివేశాలు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ గ్రాఫిక్ నవలలో కూడా హీరో ఉంటాడు. కాకపోతే అది ఒక ఆటో. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మీకు 'టైం మెషిన్' తెలుసుకదా? హాలీవుడ్‌లో ఈ థీమ్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. టైం మెషిన్‌లో కూర్చుని ఒక మీట నొక్కగానే అది కాలంలో ముందుకో, వెనక్కో తీసుకెళుతుంది. మన తెలుగులో కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఆదిత్య 369' సినిమాలో కూడా ఇదే ఇతివృత్తం. సరిగ్గా ఈ ఆటో కూడా అలాంటి టైం మెషినే. ప్రతి ఎపిసోడ్‌లో ముందుగా ఆటో వస్తుంది.

అందులో ప్రయాణికుడు ఎక్కగానే అది భాగ్యనగర చరిత్రలో కొన్నేళ్ల వెనక్కో, ముందుకో తీసుకెళ్లి వదిలేస్తుంది. ఇక అక్కడ్నించి కథ మొదలవుతుందన్నమాట. ఆ కాలంలో మన భాగ్యనగర వీధులు ఎలా ఉండేవో, మనుషులు ఎలా ఉండేవారో, ఏక్కడ ఏయే కట్టడాలు ఎలా ఉండేవో.. అన్నీ కాలానుగుణంగా కనిపిస్తూ పాఠకులకు కనువిందు చేస్తాయి. ఇలా మొత్తం 400 ఏళ్ల భాగ్యనగర చరిత్ర కాలాన్ని విభజించుకుంటూ ఆయా కాల, మాన పరిస్థితులలో భాగ్యనగర వైభవాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు ఈ గ్రాఫిక్ నవల ద్వారా కృషి చేస్తున్న జయదీప్, జస్‌రామన్‌లు కొత్తరకం చరిత్రకారులుగా అందరి ప్రశంసలు పొందడం ఖాయం. హైదరాబాద్ గ్రాఫిక్ నవల మొదటి ఎపిసోడ్, ఇతరత్రా వివరాల కోసం www.facebook.com/hydgraphicnovelను చూడవచ్చు.
ఈ గ్రాఫిక్ నవల ప్రాజెక్ట్ ఆలోచన మీదేనా? లేకపోతే..
జయదీప్: ఈ ఆలోచన పూర్తిగా మాదే. నిజానికి దీనికంటే ముందు మేం సత్యం ఫౌండేషన్ వాళ్ల కోసం ఒక ఫొటోగ్రఫీ ప్రాజెక్ట్ చేశాం. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. పాత తరం వాళ్లలో అన్ని వర్గాలకు చెందిన 30 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఇంటర్వ్యూ అంటే.. అసలు గతంలో హైదరాబాద్ ఎలా ఉండేదో, ఎక్కడెక్కడ ఏమేం ఉండేవో, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానం, స్థితిగతులు, సంప్రదాయాలు, సంస్కృతి ఎలా ఉండేవో అవన్నీ వాళ్ల నుంచి తెలుసుకున్నాం. అదంతా నేటి హైదరాబాదీలు ఏమాత్రం ఎరగరు.

జస్‌రామన్: అవన్నీ వింటున్నప్పుడు మాకు హైదరాబాద్ గురించి ఏదైనా డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. తీయొచ్చు.. కానీ నాలుగొందల ఏళ్లు వెనక్కి వెళ్లి చూపించడం ఎలా? ఇదే పెద్ద సమస్య అయింది. ఆనాటి వీధులు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద కట్టడాలు, స్మారక చిహ్నాలు కూల్చివేతలకు గురయ్యాయి. అంతెందుకు.. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు తిరిగొచ్చి హైదరాబాద్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరంను చూపించడం ఎలా? పోనీ సెట్టింగ్స్ వేసి తీద్దామా అంటే.. ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

జయదీప్: సెట్టింగ్స్ వేయడం కూడా అంత సులువేం కాదు. ఎందుకంటే ఆనాటి వీధులు, కట్టడాలు, స్మారక చిహ్నాల గురించి తెలిసిన వాళ్లు ఎవరున్నారో, ఎక్కడున్నారో పట్టుకోవడం చాలా కష్టం. సరిగ్గా అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది. ఇతర మార్గాలేవీ వర్కవుట్ అవవని నిర్ణయించుకున్నాక, గ్రాఫిక్స్.. అంటే బొమ్మల రూపంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇందులో మాకెలాంటి ఇబ్బందీ కనిపించలేదు. నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరం ఎలా ఉండేదో, ఎక్కడ ఏమేం ఉండేవో ఇప్పటికే మాకు ఒక అవగాహన ఉంది కదా. ప్రతి సీన్ ఆర్టిస్టుకి అర్థమయ్యేలా చెబుతాం. ఆ ప్రకా రం గ్రాఫిక్ తయారవుతుంది. ఇదీ మా ఆలోచన.

మరి, ఈ 'యుగంతర్' వాళ్లతో పరిచయం ఎలా?
జస్‌రామన్: యుగంతర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇందులోని డైరెక్టర్లలో కె.లలిత ఒకరు. ఆవిడ మాకు ఆంటీ అవుతారు. అప్పటికే వీళ్లు 'ఆర్కైవ్స్ హైదరాబాద్' అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంటరీలు తీసి భద్రపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మా గ్రాఫిక్ నవలా ప్రాజెక్టు వీరికి కూడా నచ్చడంతో అందుకు అవసరమయ్యే నిధులు, ఇతర సహాయ సహకారాలు అందజేసేందుకు యుగంతర్ సంసిద్ధమైంది. అలా ఈ ప్రాజెక్ట్ ప్రాణం పోసుకుంది. గత ఏడాది నవంబర్‌లో గ్రాఫిక్ నవలకు సంబంధించిన పని ప్రారంభించాం. ఇప్పటి వరకు రెండు ఎపిసోడ్లు పూర్తి చేశాం. మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రాలు మా ఫేస్‌బుక్ పేజీలో పెట్టాం. మంచి స్పందన వచ్చింది.

కథ ఎక్కడ్నించి, ఎలా మొదలవుతుంది?
జయదీప్: దాదాపు అరవై ఐదేళ్ల క్రితం.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కథ మొదలవుతుంది. ప్రముఖ వేటగాడు సర్ పెర్సీ పంజాగుట్ట అటవీప్రాంతంలో రాక్షస బల్లుల కోసం తిరుగాడుతూ సమీపంలో ప్రవహిస్తున్న నది నీటి ప్రవాహంలో ఏదో కొట్టుకొస్తుండడం గమనిస్తాడు. తీరా దగ్గరికి వచ్చేసరికి అదొక అతి పెద్ద రాక్షస బల్లి. దాని బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెడుతుండగా 'టైం మెషిన్ ఆటో' ఎదురవుతుంది.

"త్వరగా పోనీ.. ఇరవై ఒకటో శతాబ్దానికి..'' అంటూ ఆటో ఎక్కేస్తాడు. అయితే ఆ హైదరాబాదీ ఆటో డ్రైవర్ తాపీగా.. "ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా..?'' అంటూ బేరం మొదలెడతాడు. ఒక వైపున తరుముకొస్తున్న రాక్షసబల్లి.. మరో వైపున ఆటోవాలా బేరసారాలు.. దీంతో సర్ పెర్సీకి తిక్కరేగిపోతుంది. "జల్దీ.. జల్దీ..'' అని తొందరపెట్టి ఎట్టకేలకు రాక్షస బల్లి నుంచి తప్పించుకుని, బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నగరంలోకి వచ్చిపడతాడు. ఇలా మొదలవుతుంది మొదటి ఎపిసోడ్ కథ. ఈ నవల మొత్తం పూర్తి అవడానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ఏడాది పాటు ఎంతో కష్టపడితే ఇప్పటికి రెండు ఎపిసోడ్లు అంటే.. దాదాపు 35 పేజీలే పూర్తిచేయగలిగాం.

ఎందుకింత సమయం?
జస్‌రామన్: అంటే.. మేం ఇక్కడుంటే మా ఆర్టిస్ట్ ఎక్కడో ఉంటాడు. ఉదాహ రణకు మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన బొమ్మలన్నీ హర్షో మోహన్ చత్తోరాజ్ గీశారు. ఈయన కోల్‌కతాలో ఉంటారు. మేం ఈమెయిల్ ద్వారా ప్రతి సీన్ ఆయనకి వివరించి, ఆ సీన్ ఎలా ఉండాలో కూడా రఫ్‌గా మేం గీసి, దానికి సంబంధించిన ఫొటోలన్నీ ఆయనకు పంపితే వాటిని ఆధారంగా చేసుకుని, సీన్ అర్థం చేసుకుని ఆయన బొమ్మలు గీస్తారు. ఈ ప్రక్రియలో ఈ-మెయిల్స్, ఫోన్‌కాల్స్ ద్వారా మేం పరస్పరం సంప్రదించుకుని, సందేహాలు తీర్చుకోడానికి, సూచనలు ఇచ్చుకోవడానికే అధిక సమయం ఖర్చయిపోతోంది.

ఇంత ఇబ్బంది పడేకంటే ఇక్కడే ఆర్టిస్ట్‌ని చూసుకోవచ్చు కదా?
జయదీప్: చూసుకోవచ్చు.. కానీ ఇక్కడి ఆర్టిస్టులందరూ చాలా బిజీ. వీళ్లంతా ఇక్కడ ఉంటూ విదేశాల నుంచి గ్రాఫిక్స్,యానిమేషన్లకు సంబంధించి వచ్చే పనులు చేస్తున్నారు. ఇక్కడి ఆర్టిస్టులను తప్పు పట్టాలన్నది కాదు మా ఉద్దేశం. కమర్షియల్ వర్క్స్ చేస్తే వాళ్లకు రూపాయలు కాదు, డాలర్స్ వస్తాయి. అలాంటి సమయంలో మేం ఇచ్చే రూపాయలు పుచ్చుకుని మా వర్క్ చేయమని మేం అడగలేం కదా! అందుకని మా ప్రాజెక్ట్ కోసం మేం ఇతర ప్రాంతాల ఆర్టిస్ట్‌లపై ఆధారపడ్డాం. మా గ్రాఫిక్ నవలకు సంబంధించి ఒకో ఎపిసోడ్ బొమ్మలు ఒకో ఆర్టిస్ట్ చేత వేయిస్తున్నాం. మొదటి ఎపిసోడ్‌కు హర్షో మోహన్ చత్తోరా బొమ్మలు గీస్తే, రెండో ఎపిసోడ్‌కు అర్జెంటీనా ఆర్టిస్ట్ ఫెదరికో జూమెన్ గీశారు. అలా ప్రతి ఎపిసోడ్‌కు ఆర్టిస్ట్ మారిపోతారు.

మరి ఆర్టిస్ట్ మారినప్పుడు బొమ్మల శైలి కూడా మారుతుంది కదా?
జయదీప్: మారుతుంది. అయితే కాలం కూడా మారిపోతుందిగా. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు చార్మినార్, దాని పరిసర ప్రాంతాలు ఉన్నాయనుకోండి. నాలుగొందల ఏళ్ల క్రితం ఉన్నట్లే మూడొందల ఏళ్ల క్రితం ఉండదు కదా. కాలంతోపాటే ఆ ప్రాంతం కూడా మారుతుంది. మరో వంద సంవత్సరాలు గడిచాక ఇంకా మారిపోతుంది. కాబట్టి బొమ్మలు కచ్చితంగా మారాలి. స్క్రిప్ట్ మాత్రం మారిపోకూడదు, అదీ అసలు విషయం.
ఓకే, చిన్న వయసులోనే పెద్ద బాధ్యత భుజాన వేసుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్!
- వై.రమేష్‌బాబు,

Friday, November 19, 2010

బ్యాడ్‌ హ్యాబిట్‌

కాలేజీ ఫ్రెషర్స్‌ డే పార్టీ జరుగుతోంది. అందులో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ లోపుగా ఒక విద్యార్థి మైకంతో కళ్లు తిరిగి పడిపోయాడు. అతను మద్యం ఎక్కువగా సేవించడం వల్ల తూలి పడ్డాడని తెలుసుకోవడానిి మిగతా వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే ఆ పార్టీలో దాదాపు అందరూ డ్రింక్‌ తాగుతున్నవారే. చివరకు ఆ అబ్బా యిని తమ ఫ్రెండ్స్‌ ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఆ అబ్బాయి విపరీతమైన హ్యాంగోవర్‌తో బాధపడడంతో పాటు తన మొహాన్ని తన తల్లిదండ్రులకు చూపించడానికి సిగ్గుపడ్డాడు. ఈ విధమైన పరిస్థితులు నేడు చాలా మంది యంగ్‌ స్టర్స్‌కు ఎదురవుతూనే ఉన్నాయి.

పార్టీలలో, పబ్‌లలో మిత్ర బృందమంతా కలుసుకున్నప్పుడు బీర్‌, ఆల్క హాల్‌ తీసుకోవడం నేడు ఫ్యాషన్‌గా భావిస్తున్నారు కొంతమంది కుర్ర కారు. అబ్బాయిలే కాకుండా నేడు కొంతమంది అమ్మాయిలు కూడా మద్యం సేవించడం నేర్చుకుంటున్నారు. ఇలా సరదా కోసం అలవాటు చేసుకున్నవే చివరకు వ్యసనాలుగా మారుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీ లైనంత వరకు వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.

మద్యంతో హాని...
badhabit1మద్యం తాగడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో చదువుకున్నవారికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ పబ్బులు, పార్టీలలో డ్రింకింగ్‌ తప్పని సరి అంటున్నారు నేటి యంగ్‌స్టర్స్‌. యంగ్‌ జనరేషన్‌ కలిసినప్పుడు ఫన్‌ ఉండాలంటే ఈ మాత్రం రిస్క్‌ తీసుకోవాల్సిందేనని అంటున్నారు. అదీకా కుండా ఇంతకు ముందు పార్టీలకు యువకులు మాత్రమే హాజరయ్యేవారు. ఇందులో వారు మద్యం సేవించేవారు. నేడు ఆడా, మగా తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లడం అలవాటయిపోయింది. అందువల్ల ప్రస్తుతం తమ స్నేహితులతో (బాయ్‌ ఫ్రెండ్స్‌) కలిసి కొందరు అమ్మాయిలు కూడా డ్రింక్‌ చేయడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అయింది. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్‌ అందరం కలిసినప్పుడు సరదాగా కొంచెం తాగడంలో పెద్ద తప్పులేదు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్‌ అని చెప్పుకొంటున్నారు నేటి యువతీ యువకులు. మన దేశ చట్టం ప్రకారం 21 సంవత్సరాలు నిండని వారికి మద్యం అమ్మ రాదని రూలు ఉంది. షాపుకు వచ్చిన విద్యార్థుల ఐడెంటీ కార్డును పరిశీలించిన తరువాతే అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా చాలా మంది తమకు కావలసిన డ్రింక్స్‌ను కొనుగోలు చేస్తున్నారని పెద్దలు వాపోతున్నారు.

తక్కువ మోతాదులో...
badhabitస్నేహితులందరం ఎప్పుడైనా కలిసినప్పుడు, క్లబ్‌లకు వెళ్లినప్పుడు తప్పకుం డా బీర్‌కానీ, ఆల్కహాల్‌కానీ తీసుకుంటాం. అది కూడా తక్కువ మోతాదు లోనే పుచ్చుకుంటాం. దీనివల్ల హాని సంగతి కాసేపు పక్కన పెడితే అమ్మాయి లను ఆకట్టుకోవడానికి ఇది షార్ట్‌ రూట్‌ అని నేననుకుంటున్నాను. అమ్మా యిల ముందు అటెన్ష్‌గా, స్టైల్‌గా మాట్లాడేందుకు సహకరిస్తుంది. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు అది చాలా చక్కగా పనిచేసి నాలోని మరో కొత్త వ్యక్తి బయటకు వచ్చి పార్టీలో ఆనందంగా గడపగల్గుతున్నాను’ అని 18 సంవత్స రాల స్టూడెంట్‌ విష్ణు అంటున్నాడు.

జాగ్రత్తలు తీసుకుంటున్నారు...
నేటి రోజుల్లో చాలా మంది యూత్‌ లేట్‌నైట్‌ పార్టీలలో, పబ్బులలో డ్రింక్‌ చేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా ఉం డేందుకు మందు తాగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న చిట్కాల ను ఉపయోగించి తల్లిదండ్రుల నుంచి తప్పించుకుంటున్నారు. ‘ఒకసారి మా కాలేజీ మిత్రులతో పార్టీలో పాల్గొన్నాను. అపుడు వారి బలవంతం మీద మొదటిసారిగా మద్యం తీసుకున్నాను. తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు పేరెంట్స్‌ పసిగట్టకుండా ఉండేందుకు మౌత్‌ ఫ్రెషనర్‌ను ఉపయోగించి వారి నుంచి తప్పించుకున్నాను. ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా డ్రిం్‌ చేయాల్సి వచ్చినప్పుడు నా బ్యాగ్‌లో పిప్పర్‌మెంట్లు, మౌత్‌ఫ్రెషనర్‌ను తప్పకుండా తీసుకవెళతాను’ అని స్టూడెంట్‌ ప్రభాకర్‌ అన్నాడు.

గుణపాఠం నేర్చుకున్నాను...
రాత్రి పార్టీలలో డ్రింక్‌ చేసిన తరువాత రోజు ఉదయం హ్యాంగ్‌ఓవర్‌తో, తలనొప్పితో బాధపడాల్సి వస్తుంటుందని కొంత మంది యంగ్‌స్టర్‌ తమ అనుభవాలను చెబుతున్నారు. ‘నాకు మా కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే పార్టీలో ఒక చేదు అనుభవం ఎదురైంది. నాకు ఇంకా గుర్తుంది. ఆ పార్టీ అయిన తరువాత నా స్నేహితులే నన్ను మా ఇంటి వద్దకు చేర్చారు. ఎందుకంటే ఆరోజు రాత్రి దాదాపు ఐదు పెగ్గులకు మించి తాగడంతో నేను కిందపడిపోయాను. లేచే ఓపికలేక పోయింది. ఇది అయిన మరుసటిరోజు విపరీతమైన తలనొప్పి (హ్యాంగోవర్‌)తో బాధపడాల్సి వచ్చింది. అంతేకాకుండా తెల్లారి మా తల్లిదండ్రు లకు నా మొహం చూపించలేకపోయాను. సిగ్గుతో నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఆ సంఘటన వల్ల నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. పార్టీలలో సరదాల కోసం మందుకు బానిసలు కావడం తప్పని తెలుసుకున్నాను. తాగితేనే ఎంజాయ్‌ చేయగలమను కుంటే అసలు పార్టీలకే పోనవసరంలేదు’ అని 22 సంవత్సరాల సతీష్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వ్యసనంగా మారే అవకాశం ఉంది...
యవ్వనంలో తాము చేసే పని చాలా కరెక్ట్‌ అని టీనేజర్స్‌ ఆనుకుంటారు. అది భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలను కలిగిస్తుందని తెలిసినా కూడా వాటివైపే మొగ్గుచూపుతారు. తాత్కాలిక సుఖం కోసం తమ అమూల్యమైన సమయాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. ‘ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలూ అబ్బాయిలూ అనే తేడాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇరువురూ వెళ్లడం పరిపాటయింది. ఇంతకు ముందు విదేశాల్లోనే ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోని నగరాలకు కూడా వ్యాపించింది. పబ్బులకు వెళ్లడం సాధారణ విషయంగా పరిగణించే స్థాయికి నేటి యంగ్‌స్టర్స్‌ వచ్చారు. ఇలా పబ్బుల్లో అబ్బాయితో సమానంగా యువతులు కూడా డ్రింక్‌ (మద్యం) తీసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఇలాంటివి ముందు సరదాల కోసం అలవాటు చేసుకొన్నా చివరకు వ్యసనంగా మారుతుంది. ఎంజాయ్‌ చేయడం తప్పులేదు కానీ అందుకోసం ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కావడం తమ భవిష్యత్తు నాశనానికి దారితీస్తుందని నేటితరం తెలుసుకోవాలి’ అని మాససిక నిపుణులు తెలియజేస్తున్నారు.
-ఎస్‌.అనిల్‌ కుమార్‌

Sunday, November 7, 2010

e - తరం .... ఓన్లీ వన్ కాంటాక్ట్ ప్లీజ్!

డియర్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, కొలీగ్, క్లాస్‌మేట్, రూమ్‌మేట్, ఎక్సెట్రా..,

ఫస్ట్ టైం యాహూ మెయిల్‌లో ఒకరికొకరం ఇ-ఉత్తరాలు రాసుకున్నాం. 'మెయిల్ ఐడి' లేని మనవాళ్లని ఇంటర్నెట్ సెంటర్లకి లాక్కెళ్లి మరీ వాళ్లచేత ఎకౌంట్లు ఓపెన్ చేయించాం. మొత్తమ్మీద అందరం ఆన్‌లైన్లోకి ఎంటరయ్యాం. ఆ తర్వాత పాతవాళ్లమే కొత్తగా జీ మెయిల్లో చూసుకున్నాం, చాటింగ్ చేసుకున్నాం. గ్రీన్ లైట్ చూసి చాటింగ్ మొదలెట్టి... రెడ్ లైట్ కనపడినా అంటిపెట్టుకునే ఉన్నాం. యాక్టివ్, ఇన్-యాక్టివ్ గుర్తులు కూడా మనల్ని సేవ్ చెయ్యలేకపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొందరం, ఆన్‌లైన్లో చేసేదేమీ లేక ఇంకొందరం, ఏం చెయ్యాలో తెలియక మరికొందరం మెయిళ్లు చేసుకున్నాం, గంటలు గంటలు 'చాట్'భారతాలు రాసుకున్నాం. రైటింగ్ ప్రాక్టీస్ చేశాం. ఇష్టం వచ్చినట్టు షార్ట్‌కట్‌లు ఉపయోగించాం. ఆ షార్ట్‌కట్‌లని అర్థం చేసుకోవడానికి మళ్లీ షార్ట్ టర్మ్ రీసర్చ్ ప్రాజెక్టులు చేశాం.

కస్టమ్ మెసేజ్‌లో 'ఫుల్ బిజీ...కెనాట్ చాట్, సారీ' అని రాసుకుంటే మాత్రం ఒదిలిపెట్టామా? పాపం మనవల్ల మనకి ఎదురౌతున్న ఈ ప్రాబ్లమ్స్ గమనించేనేమో చివరికి జి మెయిల్ కరుణించింది. 'ఇన్‌విజిబుల్' ఆప్షన్ ఇచ్చింది. 'దీని చాటున దాక్కోవచ్చు' అంది. ఆన్‌లైన్లో ఉంటూనే లేనట్టు బిల్డప్పిచ్చి ఎలాగో కాంటాక్ట్‌ల నుండి తప్పించుకున్నాం. అదీ ఎంతకాలం... ఆన్‌లైన్‌కి అలవాటైన ప్రాణాలు అంత తేలిగ్గా ఆఫ్‌లైన్ అవుతాయా? అందుకే అందరం 'ఇన్‌విజిబుల్'గా ఉంటున్నామని అందరికీ తెలిసిపోయింది. ఇన్‌విజిబుల్ కాస్త విజిబుల్ అయిపోయింది.

వీటన్నిటి నుండి ఎలా బయట పడాల్రా దేవుడా అనుకుంటూ ఉండగానే అవతరించింది ఆర్కుట్. కథ మళ్లీ మొదటికొచ్చింది... యాహూ మెయిల్లో ఉన్న బ్యాచే జీ మెయిల్లోకి వెళ్లి ఇప్పుడు ఆర్కుట్‌లో చేరమని ఇన్వైట్ చేసుకున్నాం. అప్పటిదాకా మెయిల్లో కాంటాక్టులుగా మాత్రమే ఉన్న మనం ఆర్కుట్‌తో 'సోషల్ నెట్‌వర్క్'గా ఎదిగాం. ఓపక్క ఇ-మెయిళ్లు, చాటింగులు చేసుకుంటూనే ఆర్కుట్‌లో 'శ్క్రాప్'లు... అవును ఆ 'తుక్కే' రాసుకున్నాం. దాంతో మనకి మరో ఎడ్వాంటేజ్ వచ్చింది. ఎవరు ఎవరికి ఏ తుక్కు రాసినా దాన్ని వేరేవాళ్లు చదవొచ్చు. అందుకే తొంగిచూడడం ఎక్కువైపోయింది. మనం రాసేవాటికి కరెక్ట్‌గా సూట్ అవ్వాలనే ఆర్కుట్ వాళ్లు వాటికి 'శ్క్రాప్' అని పేరు పెట్టారట. ఆర్కుట్ బాటలోనే 'ట్యాగ్డ్', 'హై ఫైవ్', 'మై స్పేస్'...ఇలా కొత్తకొత్త నెట్‌వర్క్‌లెన్నో పుట్టుకొస్తే కనపడిన ప్రతి దాన్ని క్లిక్ చేశాం. జాయినయ్యాం. మారింది నెట్‌వర్కే కాని ఆ నెట్‌వర్క్‌లో చేరింది మళ్లీ మన గుంపే. ఇంతలో మొదలైంది ఫేస్‌బుక్ ఫీవర్!

'ఫేస్‌బుక్‌లో లేవా... యూ ఆర్ సో అన్‌కూల్ ఓకే...' అని అంతపెద్ద నోరేసుకుని అని తోటివాళ్లంటుంటే చివరికి దాన్లో కూడా చేరక తప్పలేదు. ఇక్కడ కూడా ఓల్డ్ ఫ్రెండ్సే తగిలారు. సో... వుయ్ మీట్ ఎవ్రివేర్... ఒకరినొకరం పలకరించుకోవడానికి ఇన్ని మార్గాలు అవసరమా? ఏదో పనుండి రెండ్రోజులు ఆన్‌లైన్‌కి రాకపోతే 'యు డిడ్ నాట్ గివ్ ఎనీ రిప్లయ్ టు మై మెయిల్, వాట్ హ్యాపెన్డ్' అని ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ మెసేజ్. అదీ చాలదన్నట్టు సెల్‌ఫోన్లో 'ప్లీజ్ రెస్పాండ్ టు మై మెయిల్' అని ఎస్ఎమ్ఎస్.

అంత అవసరం ఉందా? కాసేపైనా వదల్రా?
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది... నిజమే. అయితే ఇన్ని కనెక్షన్లు అవసరమా? 'టెక్నాలజీస్ ఆర్ ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ అవర్ బాడీ' అని మార్షల్ మెక్‌లూహన్ ఎప్పుడో చెప్పినట్టు సెల్‌ఫోన్ ఇప్పుడు మన శరీర భాగాల్లో ఒకటై ఉండనే ఉంది. కాబట్టి మన మధ్య సో మెనీ కాంటాక్టులు, కనెక్షన్లు, నెట్‌వర్కుల అవసరం లేదేమో. జస్ట్ ఒక్క ఇ-మెయిల్ చాలు. నో మోర్ న్యూ కనెక్షన్స్ ప్లీజ్!
- ఒక నెట్ బాధితుడు

Friday, October 29, 2010

డ్రెస్‌లోనే అసలైన ఫ్యాషన్

సొగసు సౌకర్యం కుర్తా

అందంగా కనబడే సౌకర్యవంతమైన డ్రెస్‌లోనే అసలైన ఫ్యాషన్ ఉందంటారు డిజైనర్లు. అలాంటి దుస్తుల్లో కుర్తా ఒకటి. ఎన్ని రకాల ఫ్యాషన్లు మార్కెట్లోకి వచ్చినా- కుర్తాకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గటం లేదు.

ఏ సందర్భంలో వేసుకున్నా అందంగా కనిపించటం కుర్తాలకున్న ప్రత్యేకత. కాటన్, లినెన్, రెయన్ బ్లెండ్స్ ఇలా వివిధ రకాల మెటీరియల్‌తో కుర్తాలను కుట్టించుకోవచ్చు. 

                                                                             
ఎవరికి ఎలాంటి కుర్తాలు నప్పుతాయో  చూద్దాం..

ఎలాంటి ఫిట్?
'కుర్తా' అంటే వదులుగా ఉండేదని అర్థం. సాధారణంగా కుర్తాలు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా నప్పుతాయి. శరీరాకృతికి తగినట్లుగా కుర్తాను కుట్టించుకోవటం వల్ల అందం రెట్టింపు అవుతుంది. సన్నని నడుము ఉన్నవాళ్లు కుర్తా నడుము భాగం వద్ద బిగుతుగా ఉండేలా కుట్టించుకోవాలి.

నడుము దగ్గర లావుగా, పిరుదులు పెద్దవిగా ఉన్నవారు- పై నుంచి కిందకి ఒకే విధంగా ఉండేలా కుట్టించుకోవాలి. లావుగా, పొట్టిగా ఉండేవాళ్లు- మందంగా ఉన్న గుడ్డతో కుర్తాను కుట్టించుకోవాలి. సన్నగా ఉన్నవారు మీడియం రకం గుడ్డతో కుట్టించుకోవాలి.

ఎంత పొడవు?
పొట్టిగా ఉండేవాళ్లు- మోకాళ్ల వరకూ కుర్తా ఉండేలా కుట్టించుకోవాలి. నిలువు గీతలున్న కుర్తాలు ధరించటం వల్ల పొడవుగా కనిపిస్తారనేది మీకు తెలిసే ఉంటుంది.

పొడవుగా ఉన్నవాళ్లు- నడుము కిందదాకా ఉన్న కుర్తీలను ఉపయోగిస్తే అందంగా ఉంటుంది. బాగా పొడవు ఉన్నవారు అడ్డగీతలు ఉన్న కుర్తాలను వేసుకోవాలి. ముదురు రంగు కుర్తాలను వేసుకున్నప్పుడు..బాటమ్ లేత రంగులో ఉండేలా చూసుకోవాలి.

ఎలాంటి స్లీవ్స్?
కుర్తాల స్లీవ్స్ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం 1960,70ల నాటి రెట్రో ఫ్యాషన్ నడుస్తోంది. లావుగా ఉన్నవారు స్లీవ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోచేతి వరకు లేదా 3/4 లెంగ్త్ లేదా ఫుల్ సీవ్స్ కుర్తాలను కూడా వేసుకోవచ్చు. కాని అవి బిగుతుగా ఉండాలి.

అప్పుడు సన్నగా కనిపిస్తారు. సన్నగా ఉండే అమ్మాయిలు బెల్, బట్టర్‌ఫ్లై, కప్స్, పఫ్స్ వంటి స్టయిల్ స్లీవ్స్‌ను ధరించవచ్చు. పొట్టిగా ఉన్నవారు 3/4 స్లీవ్స్‌ని వేసుకోవటం వల్ల కొంత డిఫరెంట్‌గా కనిపించవచ్చు. కుర్తా చేతులకు ఇటీవల కాలంలో వర్క్ చేయిస్తున్నారు. ఇవి పార్టీ వేర్‌గా బావుంటాయి.

ఎవరికి ఏలాంటి నెక్‌లైన్?
నెక్‌లైన్‌ను- మెడ, భుజాలు, ఛాతి, ముఖంల ఆధారంగా నెక్‌లైన్‌ను ఎంచుకోవాలి. డీప్ నెక్‌లైన్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. భుజాలు చిన్నగా (నారో షోల్డర్స్) ఉన్నవారు సాధారణ నెక్‌లైన్స్‌కు భిన్నంగా ఉన్నవి వేసుకుంటే బావుంటుంది.

పొడవు మెడ, కోల మొహం ఉన్నవారు క్రూ నెక్‌లైన్‌ని ఎంచుకోవటం వల్ల శరీరాకృతిని బ్యాలెన్స్ చేయవచ్చు. ముఖం గుండ్రంగా ఉన్నవారికి క్రూ నెక్ బావుండదు. భుజాలు చిన్నగా ఉన్నవారు వెడల్పు వీ నెక్, భుజాలు పెద్దగా ఉండేవారు డీప్ వీ నెక్ కుర్తాలను ధరించొచ్చు.

వర్క్
ఎంబ్రాయిడరీ, జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్, పల్లు, నిట్టెడ్, నక్షి ఇలా ఎన్నో వర్క్ చేసిన కుర్తాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సంప్రదాయంగా కనిపించాలంటే జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్ వర్క్స్ ఉన్న కుర్తాలను ధరించొచ్చు. కాస్త స్టయిల్ లుక్ రావాలంటే జర్దోసీ, పల్లు, నిట్టెడ్, నక్షి వర్క్ కుర్తాలను వేసుకోవాలి.

మంచి శరీరాకృతి ఉన్నవాళ్లు హెవీ, లైట్ ఎలాంటి వర్క్ ఉన్న కుర్తాలనయినా ధరించొచ్చు. పొడవుగా ఉన్నవాళ్లు పెద్ద పెద్ద ప్రింట్లు, ఓవరాల్ ప్రింటెడ్ వర్క్ ఉన్న వాటిని కూడా ధరించొచ్చు. లావుగా ఉన్న వారికి సింపుల్ వర్క్ ఉన్న కుర్తాలే బావుంటాయి.

కలర్స్
ప్రస్తుతం- ఆరెంజ్, డీప్ పర్పుల్, మెరూన్, గోల్డ్, తెలుపు, గులాబి, ఎరుపు, పసుపు రంగులను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. లావుగా ఉన్నవారు సింగిల్‌కలర్ టోన్ ఉన్న కుర్తాలను వేసుకుంటే సన్నంగా కనిపిస్తారు.
అర్పిత, ఫ్యాషన్ డిజైనర్

Monday, October 25, 2010

తళుకుల తారల చేతిలో కత్తెర్లు ........

వీళ్ల 'కటింగ్'లకు ఖరీదెక్కువ!

దసరా, దీపావళి వచ్చిందంటే చాలు. వాళ్ల కత్తెర్లకు చేతినిండా పని. కత్తెర్లకు పనంటే ఏ హెయిర్‌సెలూన్‌లోనో బిజీ అయిపోయారని కాదండోయ్. ఈ తళుకుల తారల చేతిలో కత్తెర్లు కొత్తరకం హెయిర్‌స్టయిల్స్ కట్ చేసి ఏ యాభయ్యో వందో తీసుకోవు. అలా వయ్యారంగా వచ్చి ఒక చేత్తో 'కటింగ్' ఇచ్చి.. మరో చేత్తో లక్షలు సంపాదించి పెడుతున్నాయి వీళ్ల కత్తెర్లు

అలాగని అన్ని కత్తెర్లకూ ఒకే రేటు కాదు. ఎంత పదునుకు అంత రేటన్నమాట. పదునంటే గ్లామర్. గ్లామర్ అంటే స్టార్‌డమ్. టాలీవుడ్ భామలంతా పండుగలొస్తే కత్తెర్లకు పనిజెప్పే ట్రెండు ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఏటా దసరా, దీపావళి పండుగలకు హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లో షాపింగ్‌మాల్స్ బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీపడుతుంటాయి.

ఈ రోజుల్లో చడీచప్పుడు లేకుండా ఊరికినే ఆకట్టుకోవాలంటే కుదిరేపని కాదు. అందుకే షాపింగ్ యజమానులు గ్లామర్ తారల చేత్తో ఖరీదైన కటింగ్స్ ఇస్తుంటారు. అప్పుడు బోలెడు డిస్కౌంట్లు, బంపర్ బహుమతులు, ప్రారంభోత్సవాలతో అందర్నీ ఆకర్షిస్తారు.

ప్రకటన ఉత్తినే చేస్తే ఎవ్వరి చూపూ షాపింగ్‌ల వైపు పడదని.. ఏ అనుష్కాతోనో, ఇలియానాతోనో సందడి చేయిస్తుంటారు. కస్టమర్లకు పండుగ ఆఫర్లు ఎంత సంతృప్తినిస్తున్నాయో కానీ, కటింగ్‌లు ఇచ్చే తారలకు మాత్రం నిజంగా పండగే పండగ. తెలుగు సినీ పరిశ్రమలో మంచి బూమ్‌లో ఉన్న అనుష్క ఒక కార్యక్రమ ప్రారంభోత్సవానికి గంటకు 20 లక్షలు తీసుకుంటుందట.

'మగధీర'తో అందరినీ ఆకర్షించిన కాజల్ 5 నుంచి 8 లక్షలు తీసుకుంటుందట. ఈ మధ్యనే 'బృందావనం' సూపర్‌హిట్ కొట్టడంతో ప్రారంభోత్సవాల రేటును 10 లక్షలకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియమణి, నికిషాపటేల్ 4 లక్షలు, సమంతా, తాప్సీ, రిచా గంగోపాధ్యాయ, మమతా మోహన్‌దాస్‌లు ఒక్కో ప్రైవేటు కార్యక్రమానికి రెండు నుంచి మూడు లక్షలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

" దుకాణాలకు తారలను ఆహ్వానించడం కొంత ఖర్చుతో కూడుకున్న పనే అయినా, తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రచారం వస్తుంది...'' అంటున్నారు యజమానులు.

ఎవరి కత్తెరకు ఎంత పదును..?
అనుష్క, ఇలియానా, జెనీలియా : రూ.15 నుంచి 20 లక్షలు
కాజల్ : రూ.5 నుంచి 8 లక్షలు
ప్రియమణి, నికిషా పటేల్ : రూ. 4 లక్షలు
సమంతా, తాప్సీ, రిచా, మమతా మోహన్‌దాస్ : రూ.2 నుంచి 3 లక్షలు
ప్రియా ఆనంద్ : రూ.2 లక్షలు
మధురిమ, బిందుమాధవి, పద్మప్రియ : రూ.50 వేల నుంచి లక్ష

Thursday, October 21, 2010

జీనాలజీ

నడుము
నడుము, పిరుదులు, తొడలు- ఈ మూడింటి ఆకృతిని బట్టి జీన్‌ను ఎంచుకోవాలి. జీన్ వేసుకున్నప్పుడు- ఈ మూడు భాగాల్లోను ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కచ్చితంగా అతికినట్లు ఉంటేనే అందంగా కనిపిస్తుంది. కొందరికి నడుము దగ్గర ఎక్కువ కొవ్వు ఉంటుంది. పొట్ట కూడా ఉంటుంది. ఇలాంటి వారు నడుము భాగం ఎక్కువ కనిపించకుండా ఉండే- హై రెయిజ్, మిడ్ రెయిజ్ జీన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. కాళ్లు సన్నగా ఉండి.. నడుము దగ్గర ఎక్కువ కొవ్వు లేనివారు లో రెయిజ్ జీన్స్‌ను ఎంచుకోవాలి.

పిరుదులు
జీన్స్‌ని ఎంచుకునేటప్పుడు వాటి వెనక జేబులు ఎక్కడ ఉన్నాయో చూడాలి. జీన్ వేసుకున్నప్పుడు వెనక జేబులు- మరీ పక్కకు రాకూడదు. పిరుదు మధ్యకు రావాలి. దీనితో పాటుగా ముందు జేబులలో చేతులు పెట్టి ఒక సారి చూసుకోవాలి. వాటిలో పర్సు లేదా సెల్‌ఫోన్ పెట్టుకోవటానికి వీలు ఉండాలి. కొందరికి పిరుదులు పెద్దవిగా ఉంటాయి. అలాంటి వారు వెనక భాగంలో మరీ ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేసిన జీన్స్‌ను ఎంపిక చేసుకోకపోవటం మంచిది. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కాని జేబులకు కవర్లు ఉన్న జీన్స్ కాని ఎంచుకుంటే మంచిది.

ముందు భాగం
జిప్ ఉండే భాగం ఆధారంగా కూడా జీన్స్ షేప్ మారిపోతూ ఉంటుంది. ఈ భాగంలో బాగా బిగుతుగా ఉన్న జీన్స్‌ను ఎంచుకోకూడదు. అక్కడ మాత్రం శరీరాకృతికి కచ్చితంగా పట్టినట్లు కాకుండా- ఒకటి ఒకటిన్నర అంగుళాలు వదులుగా ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే కూర్చునే సమయంలో ముందు భాగంలో ముడతలు పడిపోతుంది.

తొడలు
జీన్స్ తొడ దగ్గర భాగం కొద్దిగా వదులుగా ఉండాలి. అప్పుడే నడవటానికి సౌకర్యంగా ఉంటుంది. కొందరికి తొడలు వెడల్పుగా ఉంటాయి. అలాంటి వారు తొడల వద్ద టైట్‌గా పట్టేసే జీన్స్‌ను ఎంచుకోకూడదు.

పిక్కలు
పిక్కల దగ్గర జీన్స్ బిగుతుగా ఉండాలనుకుంటే జెగ్గింగ్స్‌ను ఎంచుకోవాలి (జీన్స్‌లా ఉండే లెగ్గింగ్స్‌ను జెగ్గింగ్స్ అంటారు). మంచి శరీరాకృతి ఉన్నవారి కోసం మార్కెట్లోకి బూట్‌కట్ ఫిట్, ఫ్లేర్డ్ ఫిట్‌లు వచ్చాయి. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు.

హెమ్
జీన్స్ కింది భాగాన్ని హెమ్ అంటారు. శరీరాకృతిని బట్టి ఇది ఎంత ఉండాలనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. పొట్టిగా ఉండే అమ్మాయిలు- పిక్కల దాకా ఉండే జీన్స్‌ను(3/4 జీన్స్) వేసుకోకూడదు. హై హీల్స్ వేసుకొని పాదం కింది దాకా ఉండే జీన్స్‌ను వేసుకోవాలి. కొందరు ఫ్లాట్ జీన్స్‌ను ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటి వారు చెప్పులు లేదా బూట్లు దాకా ఉండే జీన్స్‌ను వేసుకుంటే బావుంటుంది.

చెక్‌లిస్ట్
మరీ వదులుగా లేదా మరీ టైట్‌గా ఉన్న జీన్స్‌ను ఎప్పుడూ కొనొద్దు. మరీ టైట్ జీన్స్‌ను కొంటే తొడల వద్ద ముడతలు పడిపోతాయి. మరీ లూజ్‌గా ఉన్న జీన్స్‌ను కొంటే బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా సౌకర్యంగా ఉండదు.

మార్కెట్లో ఉన్న ట్రెండ్‌ను ఫాలో కావాలి. సన్నగా ఉన్నవారికి స్కిన్నీ జీన్స్ బాగుంటాయి. తొడల దగ్గర కొద్దిగా లావుగా ఉన్నవారు కూడా స్కిన్నీ జీన్స్‌ను వేసుకోవచ్చు కాని దానిపై పొడవైన టాప్‌ను లేదా కుర్తీని వేసుకోవాలి.

మార్కెట్‌లోకి అనేక రకాల జీన్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఒకే రకం జీన్‌ను పదే పదే కొనటం అనవసరం. వేర్వేరు రకాలు కొనుగోలు చేస్తే బావుంటుంది.

ట్రెండీగా ఉండే జీన్స్‌నైనా సరే ఒకటి రెండుకు మించి కొనొద్దు. ఎంబ్రాయిడరీ, యాసిడ్ వాష్ రకాలు ఏడెనిమిది సంవత్సరాలుగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. అలాంటి వాటికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. వాటిని ఎంచుకుంటే మంచిది.

జీన్స్ కొనేందుకు వెళ్లినప్పుడు స్కర్ట్ వేసుకొని వెళ్లటం ఉత్తమం. దీని వల్ల జీన్‌ను వేసి చూసుకోవటం సులభమవుతుంది.

షాపులో జీన్స్ ట్రయల్ వేసినప్పుడు నడవటంతో పాటుగా వంగి పైకి లేచి చూసుకోవాలి. అప్పుడు జీన్ కచ్చితంగా ఫిట్ అయిందో లేదో తెలుస్తుంది.

Thursday, September 23, 2010

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదు , శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తాం .... * టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌

ఉద్యమాలను నియంత్రిస్తా !
Kcr-miceడిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తామని హెచ్చరించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హటాత్తుగా మడమ తిప్పారు. ముందు చెప్పినట్లు.. డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదని, శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తామని తెలంగాణేతర పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. తెలంగాణేతర, ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణ వచ్చిన తర్వాత తరిమివేస్తామన్న తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల హెచ్చరికల నేపథ్యంలో.. ఉద్యమకారులను తాము నియంత్రిస్తామని, ఆ విషయంలో తన మాటకు తిరుగులేదని అభయహస్తం ఇచ్చారు. బుధవారం హోటల్‌ తాజ్‌ కృష్ణాలో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ అసెస్‌మెంట్‌ నిర్వహించిన సీఈఓల ఫోరమ్‌ సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించి, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి, పారిశ్రామికవేత్తల వ్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఈ భేటీకి మీడియాను దూరంగా ఉంచడం చర్చనీయాంశమయింది. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేక ప్రశ్నలు వస్తే, అవి మీడియాలో వచ్చిన తర్వాత అసలు సమావేశ లక్ష్యమే దెబ్బతింటుందని భావించి మీడియాను దూరంగా ఉంచారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులను మాత్రం ఆహ్వానించారు. ఇదంతా ఐఎంఏ ఆహ్వానం మేరకు జరుగుతు న్నందున, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ నేతల సూచనల మేరకే ఈ సమావేశం జరిగిందని, అందుకే మీడియాను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న నాస్కామ్‌, ఫిక్కీ, సిఐఐ సభ్యులను మాత్రం ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది.

తెలంగాణ ఉద్యమం వల్ల వ్యాపారం దెబ్బతిందని ఇటీవల ఫిక్కీ కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసినందుకే ఆ సభ్యులను దూరంగా ఉంచినట్లు సమాచారం. ఇలాంటి పారిశ్రామికవేత్తల సమావేశాల్లో కీలకపాత్ర పోషించే శక్తిసాగర్‌ సీఈఓ దూరంగా ఉండటం ప్రస్తావనార్హం. సీఈఓల భేటీకి హాజరయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆ భేటీని తాము అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమ సంస్థలు ముందస్తుగా హెచ్చరించడంతో చాలామంది సీఈఓలు సమావేశానికి వెళ్లలేదు. ఫలితంగా సమావేశం కొందరికే పరిమితమయిందన్న వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల నుంచి వినిపించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఈ సమావేశానికి వెళితే లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మా తెలంగాణ అధ్యక్షుడు వీరారెడ్డి, తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు నర్రా జయలక్ష్మి హోటల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం తాజ్‌ కృష్ణాలో జరిగిన సమావేశ వివరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని, తనతో కేంద్ర ప్రముఖులు రోజూ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణేతర- సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టుకునేది లేదన్నారు. అంతా కలసి తెలంగాణ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెడదామన్నారు. ఈ విషయంలో తాము ఇప్పటిమాదిరిగా ప్రాంతాలపై వివక్ష చూపబోమని, తమకు అభివృద్ధే ప్రధానమని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం, రాయితీల వంటి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మీ మనసులో ఉన్న అపోహలను తొలగించుకుని, పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా.. కేసీఆర్‌ ప్రసంగం తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొనే పరిస్థితులు, తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాలు తమకు వ్యతిరేకంగా ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వాటికి సమాధానాలిచ్చిన కేసీఆర్‌.. తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు ఎవరి వల్ల ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సంస్థలు, నాయకులు, విద్యార్థి సంఘాల గురించి మీరేం భయపడనవసరం లేదు. వారిని నియంత్రించే బాధ్యత మాది. వారికి నచ్చచెబుతాం. పరిస్థితి అంతా సద్దుమణిగేలా చేస్తాం. ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ వద్దనరు. ఈ విషయంలో నా మాటకు తిరుగు ఉండదు. విద్యార్థులకు ఆవేశం సహజం. ముందు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత అంతా సద్దుకుపోతుందని భరోసా ఇచ్చారు.  

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తానని గతంలో తాను చేసిన హెచ్చరికను ఓ పారిశ్రామికవేత్త ప్రస్తావించగా.. అలాంటివేమీ ఉండవని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పటి పరిస్థితిని బట్టి ఒక్కోసారి భావోద్వేగంగా మాట్లాడవలసి ఉంటుంది. భాషను కాకుండా భావాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలను తాను నియంత్రిస్తానని, ఆ విషయంలో ఎవరూ అనుమానించవలసిన పనిలేదన్నారు. జేఏసీలు, విద్యార్థి సంఘాలను తాను నియంత్రిస్తానని, వారి వల్ల మీకు ఎలాంటి భయం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఆందోళన ఉండనందున, తాను వారిని ఒక వేదికపైకి తీసుకువచ్చి మీకు నష్టం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.